తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, January 18, 2011

గాలులు ...మత్స్యధ్వజుడు

రాయలు మధురాపురములోని గాలిని కూడా అత్యంత రమణీయంగా వర్ణించాడు. సామాన్యుని కంటికి కనపడని అందాలుకూడా కవికి కనిపిస్తాయేమో. మలయానిలమంటే మలయ పర్వతంనుండి వచ్చే గాలి. ఆ కొండపై గంధపుతోపులు విస్తారంగా ఉంటాయి. ఆ తోపులనుండి వాసనలను గ్రహించి వచ్చిన గాలి నగరంలో నెమ్మదిగా ప్రసరిస్తున్నది.. ఆ వీస్తున్న గాలి ఏమేమి చేస్తోందంటే:

సీ. మదగంధతారతమ్యము యామ్యకరికిఁ ద

త్కరులకుం గనబలెఁ గటము లొరసి,

సురతశ్రమజ మౌటఁ జూపోపకయుబలె?

గామినీ మృదుగండఘర్మ ముడిపి

పరిమళవాహేచ్ఛఁ బ్రాణమీబలెఁ జించు

మృగనాభిచర్మభస్త్రికలు దూఱి

అహితపన్నగభేదు లనబలె గృహవిటం

కపుఁగలాపుల నొయ్యగఱులు నిమిరి.

తే. వీటిసామగ్రిఁ గనుఁగొన వేగపడక

నడవఁ దనదిక్కు పుష్పదంతద్విపంబు

నెక్కెనో యన జడగతి నెపుడుఁ బొలయు

నందుఁ జందనశిఖరిమందానిలుండు.



(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో )

యముని దిక్కునున్న(దక్షిణ దిక్కు) ఏనుగుకు, మధురాపురంలోని గజములకు గల మదవాసనల తేడా తెలుసుకోవడానికో అన్నట్టు ఆ ఏనుగుల గంఢస్థలములను తాకుతూ అందున్న పరిమళాన్ని గ్రహిస్తోంది. మలయపర్వతం ఉండేది దక్షిణం వైపు కాబట్టి దక్షిణపు గాలినే మలయమారుతమంటారు. రతిక్రీడ తర్వాత అలసిన వనిత చెక్కిళ్ల చెమటను ఆర్చునట్టుగా వాటిని తాకి అక్కడి సుగంధమును గ్రహిస్తోంది, చించిన బొడ్డు కలిగి పడి ఉన్న కస్తూరీ మృగములకు ప్రాణము కలిగించునట్టుగా వాటి బొడ్డులోని చర్మపు తిత్తులలోకి జొరబడి ఆ సుగంధమును కూడా గ్రహిస్తోంది. తమకు శత్రువులైన పాములను భేదించేట్టుగా ఉన్న గృహాలలో పెంపుడు నెమళ్లను స్నేహంతో దువ్వినటుల వాటి ఱెక్కలను నిమురుతోంది. గాలిని తినేవి పాములు. ఆ పాములని చంపుతున్నవి నెమళ్ళు. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా! అందుకా గాలికి నెమళ్ళతో స్నేహం!

ఆ పట్టణములోని సకల సమృద్ధిని చూడాలనే కోరికతో తొందరపడకుండా, తనే దిక్కునుండి వచ్చిందో ఆ దిక్కునున్న (దక్షిణపు దిక్కు) పుష్పదంతమనే ఏనుగుపై స్వారీ చేస్తూ మెల్లిగా సంచరిస్తున్నట్టుగా, గంధపుకొండ మీదుగా మలయమారుతం సువాసనాభరితమై మధురాపురములో వీస్తున్నదని భావం.. విలిబుత్తూరులో గాలి భక్తి పారవశ్యం కలదైతే, ఇక్కడి గాలి రాచఠీవి కలిగినది.

ఇప్పుడింక ఆ మధురానగరాన్ని ఏలుతున్న రాజుని వర్ణిస్తున్నాడు.

సీ. ద్విద్వయోపాయ ధీవిద్వద్వతంసంబు,

షాడ్గుణ్యచాతురీ చక్రవర్తి

క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు,

కనకాద్రిముద్రణ గ్రంథకర్త

యందూనిబద్ధాబ్ద

బృంద వేదండాళి,

వననిధి స్తంభ నాధునికరఘువు

తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు,

లంకేశమైత్రీ ప్రియంకరుండు

తే. స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ

మకుటమోటన శతకోటి మంత్రభృత్య

భూతభూతాత్తశాంభవ భూమికుండు

దత్పురం బేలుఁ బాండ్య మత్స్యధ్వజుండు.

( ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో )

మధురానగరానికి మహారాజు మత్స్యధ్వజుడు, అంటే చేప గుర్తున్న జెండా కల రాజు.

ఆయన రెండు రెళ్ళు(ద్విద్వయ) నాలుగు ఉపాయాల (సామ, దాన, భేద, దండ ఉపాయాలు) ప్రావీణ్యంగల పండితులలో శ్రేష్టుడు. షడ్గుణములయందు చతురత కలిగినవాడు.

షడ్గుణాలు: సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావం, సమాశ్రయం.

సంధి: కొన్ని షరతులతో శత్రువుతో చేయి కలపడం.

విగ్రహం: దండెత్తివచ్చిన శత్రువును యుద్ధముచే అడ్డుకోవడం.

యానం: శత్రువు మీదికి దండెట్టి వెళ్ళడం,

ఆసనం: విగ్రహము ప్రారంభించి తన దేశంలోనే ఉండడం.

ద్వైదీభావం: సగం సేన తో దండెత్తి వెళ్ళడం.

సమాశ్రయం: మధ్యస్తుని గా శరణు జొచ్చడం

మలయపర్వతముపై విలాస యాత్రలు చేసేవాడు. బంగారుకొండపై తన బిరుదును ప్రకటించుకున్నవాడు. ఏనుగులను కట్టినట్టు మేఘాలను బంధించినవాడు. సముద్రం మీద వంతెన నిర్మించిన నేటి కాలపు రఘురాముడు. తమిళ సింహళ దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి కనుక అతను కూడా రామునిలా వారధి నిర్మించి ఉండాలి. మేఘాలను బంధించడం అన్నది విచిత్ర విషయం. మంత్రశక్తితో కావలసినప్పుడు వానలు కురిపించే శక్తి ఇతనికి ఉందని అర్థం చేసుకోవాలి. తామ్రపర్ణి నదిలో విహరించే హంస. విభీషణునితో చెలిమి చేసినవాడు. రామాయణంలో ఈ రాజు గురించి వచ్చిన ప్రస్తావనల ఆధారంగా చేసిన వర్ణనలివి.

అగస్త్యముని దక్షిణ దిక్కుకు వచ్చి పాండ్యదేశంలో ఆశ్రమం కట్టుకున్నాడని పురాణోక్తి. కాబట్టి నిత్యమూ అతని ఆశీర్వాదాలు పొందినవాడు పాండ్యరాజు. ఇంద్రుని కిరీటాన్ని మొట్టే బాణసమూహం కలవాడు, అంటే ఇంద్రుకి మించిన పరాక్రమం కలవాడని. మంత్రశక్తితో భూతగణాలను స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆ భూతనాథుడైన శివునిలా ఉన్నాడు.

ఇక్కడీ పాండ్యరాజు వర్ణనని విష్ణుచిత్తుని వర్ణనతో పోల్చుకోవాలి. పోల్చుకోమని కవి చెప్పకనే చెపుతున్నాడు. అక్కడ "ద్వయసద్మం" ఉంటే ఇక్కడ "ద్విద్వయోపాయం" ఉంది. అక్కడున్నది భక్తి, ఇక్కడున్నది రాజనీతి. అలాగే అక్కడ కూడా సంకెలకి "అందూ" అన్న మాటే ప్రయోగించడం గుర్తుందా! ఇక్కడ పాండ్యరాజు మేఘాలనే ఎనుగులని గొలుసులతో కట్టినట్టు బంధిస్తే విష్ణుచిత్తుడు ఏకంగా విష్ణుమూర్తి అనే ఏనుగునే యోగమనే సంకెలతో బంధించాడక్కడ. అంటే పాండ్యరాజుది భౌతికతశక్తి, విష్ణుచిత్తునిది ఆధ్యాత్మికశక్తి. భౌతికశక్తి పరిమితిని చెప్పి, దానికి మించిన ఆధ్యాత్మికశక్తి మనిషికి ఎలా అవసరమో పాండ్యరాజ విష్ణుచిత్తుల కథ ద్వారా నిరూపించబోతున్నాడు. ఆ సూచనగానే వారిరువురి వర్ణనలూ ఔచిత్యంతో శోభిల్లాయి!

ఉ. ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ

ల్కందఁ గొనం; డొరుం డొరుతల న్వినిపించినమాట డెందముం

జెంద ముదంబు దక్కి చెడఁ జేయఁ డొరు; న్వినతాస్యుఁ డౌ నుతిం

పం దనుఁ; బందనుం గొఱత వల్కఁడు శూరతఁ దానుమించియున్.


( పద్యం రాఘవ స్వరంలో.. రాగం . బేగడ )

చంద్రవంశభూషణుడగు మత్స్యధ్వజుడు ఎప్పుడూ నీతి తప్పనివాడు, ధీరుడు, ఉదాత్తుడు, వినయశీలి, ప్రజలు కష్టపడేలా పన్నులు వేయడు, చెప్పుడు మాటలు విని జనులను బాధపెట్టడు, తనను ఎంతగా పొగిడినా పొంగిపోక, పరాక్రమముచేత గర్వముతో ఎవ్వరినీ తక్కువ చేయనివాడు. ఇటువంటి సద్గుణాలుకలిగిన ఆ మహారాజు

జనరంజకముగా రాజ్యమును పాలించేవాడు.

శా. దానత్యాగపతత్త్రమై తొలు పతత్త్రం బంబుధార న్సదా

నానం, దత్సితకీర్తిహంసి చనుమింటం; గ్రొత్త నా నేల,నా

నానీరార్ద్రపతత్త్ర యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే

లా నిల్చుంగతి యన్యపత్రి గతిఁ బత్త్రైక ప్రదేశాఫ్లుతిన్?



( పద్యం రవి స్వరంలో)

ఈ పద్యంలో మత్స్యధ్వజుడి కీర్తిని హంసతో పోల్చాడు రాయలు.

కీర్తి తెల్లగా ఉంటుందని కవి సమయం, అది స్వచ్ఛతకి చిహ్నం. అందుకే తెల్లని వస్తువులతో పోల్చడం ఆనవాయితీ (వెన్నెల, ఐరావతం మొదలైనవి. "నరసింహ కృష్ణరాయని

కరమరుదగు కీర్తి" గురించిన చాటువు బాగా ప్రసిద్ధమైనదే!). ఇక్కడ రాయలవారు పాండ్యరాజు కీర్తిని హంసతో పోలుస్తున్నారు. హంసతో పోల్చడంలో ఉన్న మరొక ఔచిత్యం, అది దశదిశలా ఎగురుతుంది (వ్యాపిస్తుంది). అలాగే హంస శ్రేష్ఠతకి కూడా సూచకం. ఇంతవరకూ చెప్పి ఊరుకుంటే అతను కృష్ణదేవరాయలే అవ్వడు! ఆ కీర్తి అనే హంసకి రెండు రెక్కలూ దానం, త్యాగమునట. అంటే నిరంతర దాన త్యాగల వల్లనే ఆయన కీర్తి హంస ఎగురుతోందన్నమాట. దానమంటే నీరు ధారపోసి అడిగినవారికి ఇచ్చేది. త్యాగమంటే అదేమీ లేకుండా తన దగ్గరున్న వస్తువుని ఇచ్చివేయడం. అంచేత దానమనే ఒక రెక్క ఎప్పుడూ తడుస్తూనే ఉందన్న మాట. మామూలుగా పక్షులు తడి రెక్కలతో ఎగరలేవు. అయితే హంస మాత్రం రెండు రెక్కలూ తడిసినా ఎగరగలదు. ఇక్కడ తడుస్తున్నది ఒక రెక్కనే కదా. అంచేత కీర్తి అనే ఆ హంస ఎగరడంలో ఆశ్చర్యమేమీ లేదు అని సమర్థించాడు. ఒక ఊహని రాయలవారు ఎంత సమగ్రంగా ఆలోచిస్తారో అన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ.

రాజు అనేవాడు ఎలా ఉండాలో రాయలవారు ఒక రాజుగా చెప్పడంలో ఏమీ విశేషము లేదు. ఐతే ఆ వర్ణనామాధురి అధ్బుతం. పై మూడు పద్యాల తర్వాత ఇంకా తెలుసుకోవాలంటే..నీతి సారంలో ప్రతాపరుద్రుడు ఏమంటాడో చూద్దాము.

"జనపతి పర్జన్యుగతిం

దనభూప్రజ బ్రోవవలయు, దగ బ్రోవడయే

దను బాసిపోవు నా ప్రజ

ఘన నీరస సరసి బాయ ఖగముల భంగిన్."

అలాగే క్షేమేంద్రుడు.. తన సకల నీతి సమ్మతంలో..

"రాజ రాజ వంశ భూజన పతులీలి

రకట! మంత్రి తొలగి యలికి నాడు

యేది పసుపుసేయ నిటు నిల్వబోలదు

రాజు లేని కయ్య మోజు పడునె"

అలా రాజు అన్నవాడు ప్రజల మెప్పుగోరి పన్నులకై ప్రజలను బాధించక మంత్రి మాట విని, పొగడినా ఉబ్బక, కన్నబిడ్డల్లా చూడాలని రాయలు చెప్పడం చాలా ఔచిత్యం గా ఉంది.

Tuesday, December 21, 2010

చతుర్వర్ణాల వర్ణన

అష్టాదశ వర్ణనల సంప్రదాయాన్ని పాటిస్తూ రాయలు మధురాపురంలోని చతుర్వర్ణాలవారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, కాపులను గురించి వర్ణించాడు. మనఃప్రవృత్తికి అనుగుణమైన వృత్తులకి చిహ్నంగా ఉండేవి వర్ణాలు. రాజ్య పరిపాలన వర్ణాశ్రమాచారాన్ని పరిరక్షించే విధంగా ఉండేది. ఇది సామాజిక భద్రతను చూచించే పరిపాలనా విషయంగా ఆ నాటి కవులు వర్ణించేవారు.


. చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా

ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,

పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞ శీలు రా

హరి ధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.-



( ఈ పద్యం సనత్ స్వరంలో )


మధురాపురంలోని బ్రాహ్మణులు పరమనిష్ఠా గరిష్టులు. వేద పర్వతాలు. నిత్యాగ్నిహోత్రులు. వారందరూ సోమయాజులగుటచే వారి దక్షిణ హస్తమునందు అగ్ని ఉంటుందని అంటారు. దానోదకముచే (దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు) తేమ తాకి ఆ అగ్ని చల్లారుతుందని దేవేంద్ర, కుబేరాదులు వచ్చి దానమిస్తానన్నా తమ దక్షిణ హస్తమును (కుడిచేతిని) చాపరు. ప్రతినిత్యమూ జపయజ్ఞములు చేసే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరికీ చేయి చాపరు అని భావము.

అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఎంత ముఖ్యమో “నచికేతోపాఖ్యానం” లో దగ్గుపల్లి దుగ్గన ఇలా చెప్తాడు.

"వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు
వేదములును యాగ విధుల నొడవు
యజ్ఞములకు మూలమగ్నిహోత్రముగాన
నగ్ని హోత్ర సేవ యాత్మ సేవ."

అలాగే రాయలు కూడా మధురాపురంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా కొనియాడాడు. ఇతర కావ్యాలలో సాధారణంగా బ్రాహ్మణులని పండితులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాని రాయలవారిక్కడ బ్రాహ్మణుల వైదిక కర్మ నిష్ఠని వర్ణించారు.


. ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు

స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై

పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః

పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.-


(ఈ పద్యం రాఘవ స్వరంలో )

ఇక క్షత్రియకుమారులు మహావీరులు. వజ్ర సమానమైన బాహువులు అనే పరిఘలతో శత్రు రాజులను లొంగదీసుకోగలరు. వీరు ఎంత బలశాలులు, ధైర్యవంతులంటే యుద్ధమునందు కూడా కవచము ధరించరు. కాని వీళ్లు కవచం వాడేది ఒకే సందర్భంలో. అది మంత్రోచ్చారణ సమయంలో. రాకుమారులు నేర్చుకునే ప్రతి అస్త్రము ప్రయోగించడానికి ప్రత్యేకమైన మంత్రము ఉంటుంది. ప్రతి మంత్రానికి మంత్రకవచం ఉంటుంది. అందుకే ఆ అస్త్రప్రయోగ సమయంలోనే కవచం వాడతారు అని శ్లేషగా చెప్పాడు కవి. అంతే కాక గొప్ప భుజశక్తి గల ఈ రాకుమారులు రెండు చేతుల ఐదేసి వేళ్లు కలిపి పదిగా చేసి అంటే చేతులు జోడించి ఆశ్రయించరు. కాని అదే రెండు చేతులు కలిపి దోసిలితో దానం చేయడానికి మాత్రం వెనుకాడరు. సాధారణంగా రాజ్యం కోసం మహారాజు ముందు మట్టిలో పొర్లి దణ్ణాలు పెడతారు. ఈ రాజకుమారులు అలా చేయరు. కాని వీళ్లు కూడా మట్టిలో పొర్లుతారు. ఎక్కడంటే ఖళూరిక అనే సాము గరిడీ చేసే ప్రదేశంలో. దీనివల్ల మధురాపురంలోని రాజకుమారులు సాముగరిడీలో కూడా నిష్ణాతులే అని తెలుస్తుంది. "అయిదు పది చెయ్యడం" అన్నది చక్కని తెలుగు నుడికారం.


శా. దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత

స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్

సంభూతం బగుపైడికోటి కొకడై నానాఁటికిన్ హెచ్చు చ

య్యంభోదావళి గప్ప గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్



( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)


మధురపురంలోని కోమట్లు ధర్మము వీడక నిజాయితీగా వ్యాపారం చేసేవారు. పూర్వం కోటీశ్వరులు తమ సంపదకి గుర్తుగా ఒక్కొక్క కోటికి ఒకో జెండాని ఎగరేసేవారు (కోటికి పడగలెత్తడం అన్న నానుడి ఇలా వచ్చిందే). ఆ నగరంలోని వైశ్య వీథులు అలా ఎగరేసిన జెండాలతో ఎంతగా నిండిపోయిందంటే, అవి ఆ పైనున్న మబ్బులని కూడా కప్పేసాయిట! అంటే ఆ నగరంలోని వైశ్యులు అంత ధనవంతులన్న మాట. ధనవంతులవ్వడమే కాదు. ఎలాంటి గర్వం లేకుండా వారు నిరంతరం దానాలు చేసేవారు. ఆ దానధారలు ఏరులై పారి, ఆ నీటికి వీథులలోని స్తంభాలు కూడా చిగురించాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ పతాకలు.

ప్రాచీన సమాజంలో వైశ్యులు వ్యాపారులు, ధన రక్షకులు. బ్రాహ్మణులు విద్యారక్షకులు, క్షత్రియులు రాజ్య రక్షకులు, శూద్రులు సస్య క్షేత్ర రక్షకులు. అందరూ కాపులే. నిరంతర దానం వైశ్యులకి విధి. బుద్ధునికి విరివిగా విహారాదులు కట్టించినది వైశ్యులే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ పద్యం ప్రాచీన సమాజంలో వైశ్యులంటే ఎలా ఉండేవారన్నది చక్కగా వర్ణిస్తోంది. ఇతర కావ్యాల్లో వైశ్యులు కుబేరులని మాత్రమే వర్ణించబడితే, ఇక్కడ దానధర్ములని చెప్పడం రాయలవారి సామాజిక పరిజ్ఞానాన్ని పట్టిచూపుతోంది. ఈ వైశ్యుల దానం దంభాపేతం. అంటే ఏదో మిషతో చెయ్యడం కాకుండా పవిత్ర దృష్టితో చేస్తున్న దానం అన్నమాట. పద్యం ఇక్కడ ప్రారంభం కావడం కూడా వారి స్వభావానికి గీటురాయి.


తే. నృపులపదహల రేఖల కెల్ల మా భు

జాగ్ర హలరేఖలే మూల మనుచుఁ గోటి

కొండలుగ ధాన్యరాసులు పండువీట

సుజనభజనైక విఖ్యాతి శూద్రజాతి



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )


ఆపురంలోని చెప్పుకోదగిన మరో ముఖ్యమైన జాతి సస్య రక్షకులైన శూద్రజాతి. వారి భుజాలమీది మోసిన నాగలి గుర్తులే మహారాజుల పాదములలోని హలాకార రేఖలు అనుకుంటారు. తాము నాగలి పట్టి వ్యవసాయం చేసి కోట్ల కొండలుగా నానావిధ ధాన్యరాశులను పండిస్తున్నారు. అన్నదాతలై సత్పురుషులకు సేవచేస్తూ సుఖసంతోషాలు పొందుతున్నారు. సాముద్రిక శాస్త్రంలో పాదాలందు హలరేఖ పంచ మహాపురుష లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది. హల రేఖలు మహా వైభవాన్ని సూచిస్తాయి. రాజులకి తద్వారా రాజ్యానికి ఆ వైభవాన్ని ఇస్తున్నది రైతులే అని తాత్పర్యం.

Friday, December 3, 2010

పుష్పలావికలు, గజ, అశ్వ వర్ణన...

అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ఇవి ఏ ప్రబంధంలో అయినా ఉండి తీరాలని ఆర్యోక్తి.

ఇదే విధంగా అష్టాదశవర్ణనలలో భాగంగా రాయలు పురవర్ణన, సౌధవర్ణన తర్వాత మధురాపురంలోని పుష్పలావికల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పుష్పలావికలంటే పువ్వులమ్మే వాళ్ళు.

సీ. ఇంద మన్‌తఱి దంతకుందాభ గూడి ని
చ్చలపుఁజూపులు మున్న సంభ్రమింప,
వెల యొప్ప కవలఁ బో విఱుచు మోవియుఁ గోప
మొదవెడుచూపు మోమోటఁ ద్రిప్పఁ
దిరిగిన సస్మితోక్తియుఁ జూపుటొయ్యార
ములు నగుఁ గాదను పలుకు లుడుప,
నవి గాని కావొ నీకను పరసాపత్న్య
సంపాదనం బుబ్బు నింపుఁ బెనుపఁ

తే. జతురవచనవిలాసాంగసౌష్ఠవములఁ
బసిఁడిఁ దా నిచ్చినట్టి యప్పణఁతి మఱవఁ
బతికిఁ గైదువు లందిచ్చు రతి విధమున
విటుల కిత్తురు మఱి వారు విరులు పురిని



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)







మధురాపురంలో పుష్పలావికలు చాలా చతురులు. ఇదిగో పువ్వులు అనేటప్పటికే వాళ్ళ మల్లెపూలవంటి దంతకాంతులు పువ్వులు కొనే విటులని ముగ్ధులని చేసేస్తాయి. చెప్పిన ధర కుదరక విటులు వేరే పూలమ్మి దగ్గరకి వెళ్ళబోతే వీళ్ళ పెదవివిఱుపు కళ్ళల్లో చూపించే చిరుకోపం మళ్ళీ ఆ విటులని వీళ్ళ దగ్గరకే తీసుకువస్తాయి. ఆపై ఒకింత గర్వముతో, ఒకింత సరసముతో ఆ పువ్వులే కాని మా పువ్వులు నీకు ఇష్టము కావా? అని అలక నటిస్తారు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు భర్తకు ఆయుధములు అందించు రతిదేవి వలే ఈ పుష్పలావికలు తమ ఒయ్యారపు విలాసాలతో, చాతుర్యపు మాటలతో ఆకర్షిస్తూ విటులకు పువ్వులు విక్రయిస్తున్నారు. మన్మథుడి ఆయుధాలు పువ్వులే కదా మరి! యుద్ధానికి వెళ్ళేప్పుడల్లా భర్తకి ఆయుధాలు అందించే ప్రత్యేకత బహుశా ఒక్క రతిదేవికే దక్కుతుంది. మధురాపురంలో పువ్వులమ్మే స్త్రీలు సాక్షాత్తు రతిదేవిలేనట! ఒక పద్యంలో మొత్తం ఒక సజీవ దృశ్యాన్ని సాక్షాత్కరింప చెయ్యడం రాయలవారి ప్రత్యేకత. అది ఈ పద్యంలోనూ కనిపిస్తుంది.

. దలమగు చంద్రఖండములు దారలు, సాంకవ మొప్పు పాణి పా
టలమగు దంతపుంగరవటంబు శశాంకుఁడు , గుంకుమైన చీ
రల జిగి కెంపుగా బయటి రధ్యల నొప్పుదు రిందుకాంతవే
దులపయి సంధ్యయే బహుతఁ దోఁచెననన్ బురి గట్టివాల్సతుల్



(ఈ పద్యం రవి స్వరంలో)
మధురానగరంలో మరొక దృశ్యాన్ని అద్భుతమైన ఉత్ప్రేక్షతో వర్ణిస్తున్నాడు రాయలు. ఆ నగరంలో సుగంధ పరిమళ ద్రవ్యములు అమ్ముతున్న స్త్రీలు వీధిలోని పాలరాతి తిన్నెలపై కూర్చుని వ్యాపారం సాగిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే - వాళ్ళమ్ముతున్న సుగంధద్రవ్యాల్లో మిలమిలా మెరుస్తున్న కర్పూరపు తునకలున్నాయి. అవి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో తెల్లగా మెరుస్తున్న దంతపు భరిణ ఉంది. దానికి నల్లని జవ్వాది అంటుకుని ఉంది. వాళ్ళ చేతుల లేత ఎఱుపు రంగు ఆ దంతపు భరిణలో ప్రతిఫలిస్తోంది. లేత ఎఱుపు రంగు, మధ్యలో మచ్చలా జవ్వాది కలిసి ఆ భరిణ అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబంలా ఉంది. కుంకుమ అంటిన చీరలకాంతి తెల్లని పాలరాతి తిన్నలపై ప్రతిఫలిస్తూ, అవి రాగరంజితమైన సంధ్యాకాశంలా ఉన్నాయి. అలా సంధ్యాకాలం అక్కడంతా అనేక రూపాల్లో దర్శనమిచ్చిందా అన్నట్టుగా ఉందట ఆ దృశ్యం. ఎంత మనోహరమైన వర్ణన!

. పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుత బీజము లుత్క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం. ఆభేరి.. )
ఇక ఆ పట్టణంలోని ఏనుగులు ప్రాణములున్న పర్వతములవలె ఉన్నాయి. అదెలాగంటే ఏనుగులు తమ స్వభావసిద్ధంగా నిత్యం శరీరంపై దుమ్ముధూళి చల్లుకుంటాయి. ఆ మట్టిలో పక్షులు తిని పడేసిన ఫలాల విత్తనాలు, యేనుగులు తొండముతో తమపై చల్లుకొను నీటివల్ల తడిసి మొక్కలు వచ్చి చెట్లుగా మారాయి. అందుకే పురవీధులలో ఊగుతూ తిరుగుతున్న మదపుటేనుగులు ప్రాణమున్న పర్వతాల్లాగా అగుపిస్తున్నాయి. అంత భారీగా ఉన్నాయని కవి భావం.

శా. మౌనిక్రోధ విధూత పత్త్రములమౌ మాతో సపత్త్రల్గదా
కానీ రండని కేకరాక్షిరుచి మొక్క ల్ప్రక్కల న్శార్ఙ్గతూ
ణానల్పాహిపకల్ప కాండతతులం దారం బురిం బొల్చు నా
జానేయంబులు ఫేనహాస మిడి కైజామోర లల్లార్చుచున్.


(ఈ పద్యం సనత్ స్వరంలో )
ఏనుగులే కాక మధురాపురంలోని అశ్వములు కూడా మేలుజాతికి చెందినవే. కళ్లెము పైకెత్తి బిగించికట్టుటవలన సదా పరుగుతీయడానికి సర్వసన్నద్ధమై ఉంటాయి. ఆ గుఱ్ఱాలు కళ్లెము బిగించబడిన ముఖము అల్లార్చుతూ, కడకంటితో అటునిటు వ్రేలాడకట్టబడ్డ ధనుర్బాణాలని చూస్తున్నాయి. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే - "మాకు మునిశాపము వలన ఎగిరిపోవడానికి ఱెక్కలు లేవు. సర్పరాజుల్లాంటి బాణాల్లారా! మీకేమో ఱెక్కలు ఉన్నాయి. ఐనా పర్లేదు పరిగెత్తే వేగంలో మాతో పోటీకి రండి చూద్దాం" అని ఆ బాణములతో సవాలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. వాటి నోటినుండి వస్తున్న నురగ వాటి పరిహాసంలా ఉంది. కడకంటి చూపు, నోటి నురుగు, కైజామోర ఇవన్నీ గుఱ్ఱాలకి సహజ లక్షణాలు. ఈ లక్షణాలని బాణాలతో పోటీ పడ్డట్టుగా చిత్రించడం ఉత్ప్రేక్ష. అంటే ఆ గుఱ్ఱాలు బాణం కన్నా వేగంగా పరిగెత్తగలవన్న మాట!

ఆజానేయం అన్నది ఆఫ్రికా ఖండంలో ఒక దేశమట. అక్కడనుంచి దిగుమతయిన గుఱ్ఱాలు ఆజానేయములు. గజ, తురగ, రథ, కాల్ బలాలు చతురంగబలాలు. రాయల కాలంలో గజ సైన్యం ఎక్కువగల రాజులు గజపతులు. అశ్వసైన్యం ఎక్కువ కలవారు మహమ్మదీయ రాజులు. విజయనగర రాజులు నరపతులు. అంటే కాల్బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. మహమ్మదీయ రాజులని జయించడానికి రాయలు అశ్వసైన్యాన్ని బాగా అభివృద్ధి చేసాడని చరిత్ర చెపుతోంది.
Related Posts Plugin for WordPress, Blogger...