తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, December 13, 2011

తృతీయాశ్వాసాంతము

ఖాండిక్యుని కోరిక మేరకు కేశిధ్వజుడు అతనికి బ్రహ్మవిద్యని బోధిస్తాడు. అతడు బోధించిన ఆ విద్యని స్థాలీపులాక న్యాయంగా ఇప్పుడు చూద్దాం. మొదటగా అవిద్య గురించి చెపుతున్నాడు.

ఆ. ఆత్మకాని మేన నాత్మబుద్ధియును న
స్వంబునందు మిగుల స్వత్వమతియు
నవనివర, యవిద్య యను మహాతరువు ను
త్పత్తి కీద్వయంబు విత్తు మొదలు



( ఈ పద్యం రాఘవ స్వరంలో- రాగం సరస్వతి)


రాజా! అజ్ఞానమనే మహావృక్షము ఉత్పత్తికి ఆధారమైన బీజంలో రెండు దళాలున్నాయి. ఆత్మ కాని శరీరం మీద ఆత్మ అనే భావన ఒక దళం, తనది కాని దానిపై తనది అనే ఆలోచన రెండవ దళం.
ఈ పద్యానికి విష్ణుపురాణంలోని ఈ శ్లోకం మూలం:

అనాత్మన్యాత్మబుద్ధిః య అస్వేస్వమితి యా మతిః
అవిద్యాతరు సంభూతి బీజ మేతద్ద్విధా స్థితిం

ఇంకా అవిద్య గురించి యిలా చెపుతాడు. పంచభూతాలకంటే అతీతమై వెలుగుతున్న ఆత్మ వేరే ఉండగా శరీరమే ఆత్మ అనుకోవడం మూర్ఖత్వం. గృహము కళత్రము మొదలైనవి దేహం చేత అనుభవింపబడేవి. పుత్రపౌత్రాదులు శరీరం నుండి పుట్టేవారు. అంచేత ఇవన్నీ దేహసంబంధమైనవే కాని ఆత్మతో వాటికి సంబంధం లేదు. ఎప్పుడైతే శరీరం కంటే ఆత్మ వేరైనదన్న అనుభవం కలిగిందో అపుడు ఈ భోగాలేవీ ఆత్మకి అంటవు. అలా కాక శరీరమే ఆత్మ అనుకుంటే అంటుకుంటాయి. అని, యింకా యిలా చెపుతున్నాడు.


మ. జని సాహస్రబహుప్రయాణ మగు సంసారంపుఁ ద్రోవన్ సదా
చనుచుండున్ ఘన మోహఖేద మలమన్ సంసారిపాంథుండు, వా
సన లన్ ధూళి ముసుంగు గాఁగ: నెపుడేన్ జ్ఞానంపు టుష్ణోదకం
బునఁ దత్ క్షాళన సేయు వాని కపు డమ్మోహశ్రమంబున్ జనున్



సంసారి అన్న బాటసారి వేల వేల జన్మలెత్తుతూ జనన మరణ రూపమగు సంసార మార్గం వెంట ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో అతనికి మోహం, దుఖం అనే దుమ్ము అంటుకుంటూ ఉంటుంది. పూర్వజన్మ వాసనలు అన్న ధూళి ముసుగులా అతన్ని కప్పివేస్తుంది. అయితే, ఎప్పుడైనా జ్ఞానం అనే వేడినీళ్లతో అతను స్నానం చేస్తే, అప్పుడు అతని మోహం, శ్రమ అన్నీ వదిలిపోతాయి.
వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేస్తే ప్రయాణంలోని శ్రమ తీరడం మనకి అనుభవం లోనిదే. ఈ లోకానుభవాన్ని తెచ్చి జ్ఞానంతో సంసారం క్షాళనం చేసుకోవడమన్న మహావిషయాన్ని చెప్పడం గొప్ప కవితాశక్తి.

తే. అట్టి మోహశ్రమం బాఱ నా శరీరి
స్వస్థుఁ డై తా ననన్యాతిశయ మబాధ
మనఁగ విలసిల్లు నిర్వాణమును భజించు
ననఘ తొల్లియు నిర్వాణ ఖనియ కాన.




( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
అట్టి మోహ క్లేశాలు తీరిపోవడంతో జీవుడు తన స్వస్వరూపం తెలుసుకొని అనన్యమూ, అతిశయమూ, అబాధమూ అయిన నిర్వాణ పథాన్ని అనుసరిస్తాడు. ఎందుకంటే అతను మొదటినుండి మోక్షవిద్యకు గనిలాంటివాడు కాబట్టి.

ఇంకా అవిద్య లక్షణాలని వివరించి, ఈ అవిద్యాక్లేశాలని నాశనం చేయడానికి యోగమే మార్గమని చెపుతాడు కేశిధ్వజుడు. ఆ యోగవిద్యని తనకు చెప్పమని అర్థిస్తాడు ఖాండిక్యుడు. అప్పుడు కేశిధ్వజుడు సావధానంగా వినమని, విష్ణు సాధర్మ్యాన్ని (విష్ణువుతో సమానత్వం కలగడం) పొందే యోగాన్ని వివరిస్తాడు.

ఆ. ప్రాణికోటి కెల్ల బంధంబు మోక్షంబు
చేరుటకును మనసు కారణంబు:
విషయసంగి యైన , విను బంధకారి; ని
ర్విషయ మైన, ముక్తి విభవకారి.



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం శుద్ధసావేరి )

జీవకోటికి అంతటికీ బంధానికైనా, మోక్షానికైనా మనసే కారణం. ఆ మనస్సుకు విషయాసక్తి ఉండడమే బంధం. లేకపోవడం మోక్షం. ఆ మనసు శరీరభోగాల వైపు ఆకర్షితమై ఆసక్తి పెంచుకోంటే బంధాలు కలిగిస్తుంది, బందీని చెస్తుంది. అలా ఆకర్షింపబడక , ఆ ఆసక్తి పెంచుకోకుండా ఉంటే అదే ముక్తి లేదా మోక్షాన్ని కలిగిస్తుంది.

అధ్యాత్మ విజ్ఞానంతో మనస్సు బాహ్యవిషయాలపై ఆకర్షణను లోపలకు కుదించి, పరమాత్మయైన సర్వేశ్వరుని నిత్యమూ ధ్యానించాలి. అలా ధ్యానించినవానికి పరమాత్మ తన స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు. యమనియమాదులవల్ల స్వఛ్చమైన మనసును బ్రహ్మవైపుకు మళ్ళించడమే యోగం. దాన్ని ఆచరించేవాడే యోగి. ఏదైనా ఫలితాలను కోరి యోగాన్ని అభ్యసిస్తే శక్తులు లభిస్తాయి. కోరికలు లేనప్పుడు ముక్తి లభిస్తుంది. ఈ విధంగా చెప్పి కేశిధ్వజుడు, యమము నియమము ఆసనము ధ్యానము ప్రత్యాహారము మొదలైన యోగ పద్ధతులన్నిటినీ వివరిస్తాడు.

క. మనమున కెద్ది శుభాశ్రయ,
మనఘ! యెఱింగింపు, మఱి సమస్తాధారం
బనఁ జను యద్వస్తువు? య
న్మనన మశేషోరుదుఃఖ మండలిఁ జెఱుచున్?



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
కేశిధ్వజుడి బోధలు విన్న తర్వాత ఖాండిక్యుడు కుతూహలంతో, "ఓ పుణ్యాత్ముడా! మనస్సును కేంద్రీకరింపదగిన శుభప్రదమైన ఆశ్రయం ఏది? వాటన్నింటికీ ఆదారమైనదేది? ఎవరి మననం సమస్త దుఃఖాన్ని నిర్మూలిస్తుంది. దయతో సెలవివ్వు", అని అడిగాడు. "యత్" అన్నది సంస్కృత సర్వనామం. "ఏ", "దేని" అని అర్థాలు. యత్+వస్తువు = యద్వస్తువు. యత్+మననము = యన్మననము. ఇలా సంస్కృత సర్వనామాలని తెలుగు వాక్యలలో వాడడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

తే. అనినఁ గేశిధ్వజుఁడు వాని కనియె; 'బ్రహ్మ
మాశ్రయంబు మనంబున; కదియ పరము
నపరము ననంగఁ బొలుచు; నం దపర మనగ
మూర్తము, పరం బనంగ నమూర్త మనఘ.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

అప్పుడు కేశీధ్వజుడు ఇలా అన్నాడు. బ్రహ్మమే మనస్సుకు శుభాశ్రయము. అది రెండు రకాలు. ఒకటి సగుణ (మూర్తమైన) బ్రహ్మము. దీనినే అపరము అని పిలుస్తారు. రెండవది నిర్గుణ (అమూర్తమైన) బ్రహ్మము. అది పరము.. అని చెప్పి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇంకా యిలా వివరిస్తాడు.

పర, అపర బ్రహ్మలలో పరము కేవల సచ్చిదానందమై సృష్టికి దూరంగా ఉన్నందువల్ల అమూర్తమైనందువల్ల ఉపాసనకి అందదు. రెండవదైన అపరబ్రహ్మము ఉపాసనకందుతుంది. కాని అది బ్రహ్మాది దేవతారూపమైన బద్ధజీవులు శరీరంగా కలది. కాబట్టి అది ఉపాసనకి తగదు. విశ్వంగా పరిణమించే బ్రహ్మ మొదలైన వారికంటె వేరైనది పరబ్రహ్మము. అది నిత్యము, సత్యము. జ్ఞానంతో నిరూపించ దగ్గది. ఈ పర అపర శక్తిరూపాలకి అతీతమైనది మరొకటి ఉన్నది, అదే విష్ణుశక్తి. ఈ విష్ణుశక్తే పర, అపర, కర్మ అనే మూడు రూపాలు పొందుతుంది. కర్మచేత కప్పబడిన అపరశక్తి, క్షేత్రజ్ఞశక్తి లేదా ఆత్మశక్తి అనే పేరుతో సంసార తాపాలని అనుభవిస్తూ కర్మలకి తగిన రూపాలను ధరిస్తూ ఉంటుంది. ఇది స్థావరాదులలో కొంచెం ఉంటుంది. దానికంటె జంగమాలైన జీవాలలోను, అంతకన్న ఎక్కువగా పక్షులలోను, అంతకంటె జంతువులలోను, అంతకంటె ఏనుగు, ఆవు మొదలైన పశువులలోను, అంతకంటె మనుష్య, యక్ష, గంధర్వ, నాగులలో ఎక్కువగా ఉంటుంది. అంతకంటె ఎక్కువగా ఈ ఆత్మశక్తి దేవతలలో ఉంటుంది. దేవతలందరిలో ఇంద్రునిలోను, అతనికంటె ప్రజాపతి, అంతకంటె బ్రహ్మలో ఎక్కువగా ఉంటుంది.

ఆ. ఇట్టిరూపకోటు లెల్ల నవ్విష్ణుని
తనుచయంబు సుమ్ము ధరణినాధ
యతఁ డచింత్యశక్తి నఖిలభూతముల నా
కసమువోలె నిండి యెసగుఁ గాన


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆకాశం ఏ విధంగా సకల వస్తువులలో, లోపల బయట కూడా ఆవరించి ఉంటుందో, అలాగే విష్ణుశక్తి సకల రూపాల్లోను నిండి ఉంటుంది. అందుకే ఈ రూపాలన్ని విష్ణువు శరీరము వంటివి.
ఆకాశమంటే మనకి దూరంగా పైన కనిపించే sky కాదు. అంతటా పరుచుకొని ఉన్న space.

ఆ. కర్మభుక్తికొఱకుఁ గా దిట్టి తల్లీల;
యతఁడు సకలజాతులందుఁ బుట్టుఁ;
బుట్టినట్టి యతని భూరిచేష్టితము ల
వ్యాహతములు రావణాదివలన.


(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

అమూర్తమైన పరాశక్తి రూపమైన విష్ణువే ఒక లీలగా విశ్వ రూపాన్ని ధరిస్తోంది. అయితే విష్ణువిలా రూపాలని ధరించడం కర్మని అనుభవించడానికి కాదు. ఎందుకంటే అతనికి కర్మ అంటదు. అతను అన్ని రకాల జాతులలోనూ పుడతాడు. రావణాదులవల్ల కూడా భంగింపబడకుండా ఆ చేష్టలు సాగిపోతూ ఉంటాయి.

ఇలా విష్ణుతత్త్వాన్ని వివరించిన కేశిధ్వజుడు ఆ తర్వాత, యోగికి ధ్యానయోగ్యమైన విష్ణుస్వరూపాన్ని ఇలా వర్ణిస్తున్నాడు.
సీ. శరదిందు చకచకస్మయజి త్ర్పసన్నాస్యు,
దొడ్డకెందమ్మి కన్దోయివాని,
నతికమ్ర గల్లభాగాభోగ ఫాలాఢ్యు,
మకరాంక రత్నకర్ణికలవానిఁ,
గాంబవోద్యచ్చ్రీవిడంబి వృత్త శీరోధి,
సిరిపొల్చుమచ్చ పేరురమువాని
నతనాభియుత వళిత్రితయ శాతోదరు,
జానులంబి చతుర్భుజములవానిఁ.

గరివరకరోరు, రుచిర జంఘా మనోజ్ఞు
సమతబొందిన పదపల్లవములవాని
హైమవసను గిరీట హారాంగదాది
కలితు, శంఖరథాంగాదు లలరువాని



(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం చారుకేశి )

శరత్కాలపు చంద్రుని వెన్నెలని జయించే ప్రసన్నమైన ముఖం, ఎర్ర తామరల్లాంటి వెడల్పయిన కళ్ళు, అందమైన చెక్కిళ్ళు, విశాలమైన నుదురు, మొసలి గుర్తుగల రత్నకుండలాలు, శంఖంలా ప్రకాశించే గుండ్రని మెడ, పెద్ద వక్షస్థలం, అందులో శ్రీవత్సం అన్న మచ్చ, లోతైన పొక్కిలి, మూడు ముడతలతో అందంగా వున్న పల్చని పొట్ట. పొడవుగా మోకాళ్ల దాకా వున్న నాలుగు భుజాలు. మదగజ తుండమువంటి ఊరువులు, కాంతివంతమైన పిక్కలు, సమమైన చిగురుటాకులవంటి పాదాలు, పట్టు పీతాంబరము, కిరీటము, అందమైన హారాలు, శంఖ చక్రాది ఆయుధాలు. ఇది అతని స్వరూపం! ఒక్కముక్కలో చెప్పాలంటే సర్వ సల్లక్షణ సమన్వితమైన స్ఫురత్ సౌందర్య రూపం! ప్రసన్నాస్యు, ఫాలాఢ్యు వంటి సమాసభంధురత ఒకవైపు, కన్దోయివాని, రత్నకర్ణికలవాని మొదలైన శిథిలబంధం మరొకవైపు జోడుగా సాగే రచనాశిల్పం పద్యానికి ఒక చక్కని తూగునిస్తోంది.

ఇటువంటి స్వరూపాన్ని యోగులు నిరంతరం ధ్యానించాలి. వర్ణింపబడిన ఒక్కో అంగాన్ని తాదాత్మ్య భావంతో చింతిస్తే, ఆ అవయవం మనస్సులో ముద్రితమవుతుంది. అలా ఒక్కో అంగాన్నీ చింతిస్తూ అభ్యాసం చేస్తే కొన్నాళ్ళకు మొత్తం ఆ రూపమంతా మనస్సులో నాటుకుంటుంది. అన్ని వేళాలా ఏ పని చేస్తున్నా మనస్సులో ఆ రూపం చెదరకుండా ఉంటే అజ్ఞానం తొలగిపోయి, యోగి భగవంతునితో సారూప్యం, సామ్యం పొందుతాడు.

ఈ విధంగా వివరించి కేశిధ్వజుడు ఇలా అన్నాడు:

క. నరవర! యిటు బంధచ్యుతి
కొఱ కగు నంగాష్టకాఖ్య గురుయోగము వి
స్తరముగఁ జెప్పితి, నింకన్
గరణీయం బెద్ది నాకుఁ గల్పింపు' మనన్.



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )
ఓ నరవరా! ఇలా అజ్ఞానబంధాన్ని తొలగించ గలిగిన అష్టాంగయోగ మార్గాన్ని నీకు వివరంగా చెప్పాను. ఇక నాకు తదుపరి కర్తవ్యమేమిటో అనుగ్రహించు అని అడిగాడు కేశీధ్వజుడు. ఇక్కడ "నరవరా" అంటే "అర్జునుడు" అనే అర్థం స్ఫురిస్తుంది. అర్జునుడికి గీతాచార్యుడు ఏ యోగవిద్యని బోధించాడో, నీకు అదే చెప్పాననే ధ్వని ఉంది!

కేశిధ్వజుడు తనకి యోగవిద్యని బోధించినందుకు ఎంతో సంతోషించిన ఖాండిక్యుడు, ఇంతకన్నా ఇంకేమిటి కావాలని చెప్పి కేశిధ్వజుని పూజించాడు. వద్దంటున్నా కేశిధ్వజుడు తనకి తిరిగిచ్చిన రాజ్యానికి తన కొడుకుని రాజుని చేసి, ఖాండిక్యుడు భక్తియోగ మార్గంలో విష్ణుసాధర్మ్యాన్ని పొందాడు. కేశిధ్వజుడు తన ధర్మాన్ని అనుసరించి తిరిగి రాజ్యాన్ని చేసాడు.

ఇది ఖాండిక్య కేశిధ్వజుల కథ. ఈ కథని చెప్పి, విష్ణుచిత్తుడు పాండ్యరాజునికూడా శ్రీహరినే ఆశ్రయించమని చెప్పి శ్రీవైష్ణవ మత స్థాపన చేస్తాడు. ఈ కథతో ఆముక్తమాల్యదలో తృతీయాశ్వాసం ముగిసింది. ఆశ్వాసాంత పద్యాలు:

క. ఊరీకృతపాండవరథ
సారథ్య! సయూథ్యగోపశాబకసహ కే
లీరత! భక్తప్రహ్లా
దారచితస్తోత్రపులకితాంచితగాత్రా!



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆశ్వాసాంతంలో ఆ దేవదేవుని స్తుతిస్తున్నాడు కవి. అర్జునుని రథానికి సారథి యైనట్టివాడా, గోపబాలురతో ఆటలాడుటయందు ఆసక్తి కలవాడా, భాగవతోతత్తముడైన ప్రహ్లాదుని స్తుతిచే పులకించిన దేహము కలవాడా అని అర్ధం..
స్రగ్విణి:
ఆస్థి తాహీంద్ర శయ్యా, దవీయస్తర
ప్రస్థితాంఘ్రీ, శ్రిత వ్రాత చేతోఘదా
కస్థలప్రస్పృశత్ కాళియ క్ష్వేళ మూ
ర్ధస్థలీ నృత్త మత్తల్లి హల్లీసకా!



(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )

ఆదిశేషువును శయ్యగా చేసుకున్నవాడు, వామనావతారంలో మిక్కిలి పొడవుగా సాగిన పాదములు కలవాడు, భక్తుల మనస్సులలోని పాపములను ఖండించువాడు, సరస్సులోనున్న కాళీయుడనే విషనాగు శిరస్సుపై నాట్యమాడినవాడు ఆ శ్రీహరి. మత్తల్లి, హల్లీసకము అనేవి దేశీయ నృత్యవిశేషాలు. హల్లీసకము కోలాటమువంటి నృత్యము. ఈ పద్యం ఛందస్సు స్రగ్విణి. పాదానికి నాలుగు రగణాలు. ఏడవ అక్షరం యతి.

మ. ఇది పాత్ర ప్రహరేశ్వర ప్రభృతి బంహిష్ఠోత్కలానీక గు
ప్త దివిస్పృక్పటుయంత్ర కొండపలి హృద్బాహాసి కద్రూజ దీ
వ్యదుదారోద్యమ కృష్ణరాయనృప సంజ్ఞాస్మత్కృతాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యము తృతీయంబై మహిం బొల్పగున్..



(ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం.శ్రీ )

ఈ ఆశ్వాసాంత పద్యంలో కృష్ణరాయల కొండపల్లి విజయం ప్రస్తావించబడింది. ప్రహ్రేశ్వరపాత్రుడు మొదలైన ఉత్కల (ఓఢ్ర, ఒరిస్సా) రాజసమూహం చేత రక్షింపబడేది, ఆకాశాన్ని అంటే యంత్రాలు (కోటని రక్షించే యంత్రాలు) కలదీ అయిన కొండపల్లి దుర్గాన్ని జయించే భుజమునందు ఖడ్గమనే గొప్ప సర్పం వెలుగుతున్న కృష్ణరాయలనే పేరుగల నాచేత రచింపబడిన ఆముక్తమాల్యద కావ్యమునందు ఇది తృతీయాశ్వాసమై ఒప్పుతోంది - అని అర్థం.

దీనితో ఆముక్తమాల్యద తృతీయాశ్వాసం సంపూర్ణం

Wednesday, October 19, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 3

ఖాండిక్యుని యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్న కేశీధ్వజుడు, తలపెట్టిన క్రతువులో యజ్ఞదేనువు పులిబారిన పడి చనిపోవడంతో, శత్రువైనా తన సోదరుడు ఖాండిక్యుని పరిష్కారం కోరడానికి అతనుండే అడవికి వెళతాడు. శత్రువు తనంతట తానే వచ్చినపుడు అతనిని సంహరించి రాజ్యాన్ని దక్కించుకొనుమని ఖాండిక్యునికి మంత్రులు సలహా యిస్తారు. ఖాండిక్యుడు అది ధర్మసమ్మతము కాదని వారించి, కేశీధ్వజునికి తగిన ప్రాయశ్చితం చెప్పి పంపిస్తాడు. కేశీధ్వజుడు తిరిగి తన రాజ్యమునకు వెళ్లి తన యజ్ఞాన్ని ఏ లోపమూ లేకుండా సంపూర్ణంగా నిర్వహిస్తాడు. ఇప్పటివరకూ జరిగిన కథ యిది. అలా యాగాన్ని పూర్తిచేసిన కేశిధ్వజుడు అవబృథస్నానం చేసి, ఋత్విక్కులను, వైతాళికులను, సదస్యులను, యాచకులను అందరినీ సత్కరించాడు.

తే.

మఱియుఁ గోరినవారి యక్కఱలు తీర్చి

యును మన:పూర్తి చాల కొయ్యనఁ దలంచి,

'యకట గురుదక్షిణ యొసంగ నయితి' నంచు

మగుడఁ జని, శంక నతఁడు సంభ్రమపడంగ.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

ఇంకా అడిగినవారందరికీ వారు కోరిన అవసరాలు తీర్చాడు. అయినప్పటికీ అతని మన్సులో ఏదో వెలితి మిగిలిపోయింది. ఆలోచించగా అతనికో విషయం గుర్తొచ్చింది. ప్రాయశ్చితాన్ని సూచించిన ఖాండిక్యునికి గురుదక్షిణ ఇవ్వడం మరిచానే అనుకుంటూ మళ్లీ అడవికి వెళ్లాడు. మళ్లీ వచ్చిన కేశీధ్వజుడిని చూసి ఖాండిక్యుడు సందేహంతో తొట్రుపాటుపడ్డాడు. ఇదేమిటబ్బా! మళ్ళీ వచ్చాడు అని.

ఖాండిక్యుని కంగారు అర్థంచేసుకున్న కేశిధ్వజుడు అతడిని వారించి, "రాజా! నీకు గురుదక్షిణ యివ్వడానికి వచ్చాను. నీ కోరికేమిటో చెప్పు" అని అడిగాడు. దానితో మళ్ళీ కేశిధ్వజుడు తన మంత్రులతో సమావేశమయ్యాడు!

క.

'గురుదక్షిణ యిచ్చుట కీ

నరవరుఁ డేతెంచె; మీరు నా కనురక్తుల్;

పరికించి పదింబదిగా

నరయుఁడు మది నెద్ది మేలు ప్రార్ధించుటకున్.'



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

"మీరు నాకు ఆప్తులు, కేశిధ్వజుడు నాకు గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చాడు. బాగా ఆలోచించి ఏమడిగితే బావుంటుందో తెలపండి", అని అడిగాడు.

ఈ పద్యం చివరిపాదంలో యతి గమనార్హం. "అరయుడు"లోని "అ"కి, "ప్రార్థించు"లోని "ప్రా"కి యతి ఎలా కుదురుతుంది? యతి అక్షరాలలో ఒకటి అచ్చు అయినప్పుడు, రెండవది కూడా అచ్చు కాని "య", "హ"లు కాని అయినప్పుడే యతి చెల్లుతుంది. ఇక్కడ ఎలా చెల్లిందంటే, "ప్రార్థించు" అన్న పదం "ప్ర+అర్థించు" అనే పదాల కలయిక కాబట్టి, అర్థించు పదంలో "అ"తో యతిమైత్రి జరిగింది. "ప్రార్థన" వంటి పదాలలో (నిత్యసమాసాలు), సంధి జరిగాక వచ్చిన "ప్రా" అన్న అక్షరంతో కాని, సంధి జరగక ముందున్న "అ" అన్న అక్షరంతో కాని యతిమైత్రి కుదురుతుంది.

ఖాండిక్యుడు అలా అనగానే అతని ఆప్తులందరూ, "మహారాజా! ఇవ్వాళ కదా దైవమున్నదని తెలిసింది! ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ ధరాతలాన్నంతటిని గురుదక్షిణగా గ్రహించి మమ్మల్నందరినీ రక్షించు", అని అన్నారు. మంత్రులింకా యిలా అంటున్నారు:

ఉ.

ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁడగున్ దఱి? యయ్యెనేని పో

రెన్నిక యౌనె? పోరిన జయింపనె చెప్పిరె? నీదు భాగ్యసం

పన్నతఁ జేరెఁ గార్య మిటు; బంధు సుహృత్తతి కొక్కకీడు రా

కున్నటు లుండఁగానె; సిరు లూరక చావక నోవ కబ్బునే?"



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - సునాద వినోదిని )

"మనకు ఎప్పుడు సైన్యబలము చేకూరుతుంది? అనుకూలమైన సమయం ఎప్పుడొస్తుంది? సమయము చిక్కినా యుద్ధం చేయవచ్చునా? ఒకవేళ యుద్ధము చేసినా మనమే జయిస్తామన్న నమ్మకం ఉన్నదా? ఇప్పుడు నీ అదృష్టం కొద్దీ ఇలా కలిసి వచ్చింది. బంధుమిత్రులలో ఏ ఒక్కరికీ ఎలాంటి కష్టమూ కలగకుండా, ఒక్కరూ చావకుండా, బాధ కలగకుండా సిరిసంపదలు నీవున్నచోటికే వెతుక్కుంటూ వచ్చాయి." అన్నారు. ఇందులో ఒక రాజనీతి సూత్రం చెప్పబడింది. బలము, కాలము అనుకూలంగా ఉన్నప్పుడే దండయాత్ర చేయాలి. సంధి, యుద్ధాలలో ఏది అనుకూలమైనదో జాగ్రత్తగా పరిశీలించి అనుసరించాలి.

ఇలా, మరల వాళ్ళకి తోచినది చెప్పారా మంత్రులు. ఈ ఖాండిక్యుడు వాళ్ళ మాటలు వింటాడా!

చ.

అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్ధసా

ధనపరతంత్రకోవిదులు దక్క, మహాసుఖదాయి మోక్షమా

ర్గ నయ విచారకోవిదులు గా, రతిచంచల రాజ్యలక్ష్మి నే

మని చని వేఁడువాఁడఁ బరమార్ధము వేఁడక యమ్మహామతిన్?

మంత్రులు చెప్పిన మాటలు విన్న ఖాండిక్యుడు మందహాసం చేస్తూ యిలా అన్నాడు. "మీరు అర్ధశాస్త్ర కోవిదులే తప్ప మోక్షమార్గ విచారణలో ప్రవీణులు కారు. మహాజ్ఞాని అయిన కేశిధ్వజుడిని పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగకుండా అతి చంచలమైన రాజ్యలక్ష్మిని ఇవ్వమని నేనెలా అడగగలను?".

విష్ణుచిత్తునితో స్వామి మాట్లాడిన సందర్భంలో "నేడు మహామతీ" అంటూ ఆ విష్ణుచిత్తునికి వాడిన మాట "మహామతి".మళ్ళీ యిక్కడ కేశిధ్వజుని గురించి ఖాండిక్యుడు అన్నాడు. అతిలోక సంబంధమైన విచారణ బుద్ధి కలవాడు మహామతి. అలాంటి మహామతి అయిన కేశిధ్వజుడు నీకేమి కావాలో కోరుకోమంటే, అతి చంచలమైన రాజ్యాన్ని ఏ ముఖం పెట్టుకొని అడుగుతాను చెప్పండి! అన్నాడు ఖాండిక్యుడు. మంత్రులు ఎంతసేపూ, "అర్థసాధన పరతంత్రకోవిదులు". అంటే అర్థసాధనకి బానిసలయిపోయారు. కేశిధ్వజుడిని వేడవలసినది ఏమిటి? "పరమార్థం", అంటే ఉత్కృష్టమైన అర్థం! ఆ పరమార్థం ముందు వట్టి అర్థం ఎంతటి హీనమైనది! "అర్థం", "పరమార్థం" అనే యీ మాటలలో ఆ మంత్రులు కోరుకొమ్మన్నదానికీ, అసలు కోరుకోవలసిన దానికీ మధ్య అంతరమెంతుందో అద్భుతంగా ధ్వనింపజేసాడు రాయలు. కవి అన్నవాడు పదాలని ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, ప్రయోగించాలో దీన్ని చూస్తే అర్థమవుతుంది.

ఇంకా ఖాండిక్యుడు తన మంత్రులతో యిలా అంటాడు,"నిమివంశంలో జన్మించిన మాకు లక్ష్యం గావలసినది ఉత్తమమైన జ్ఞానయోగమే కాని రాజ్యం కాదు. పైగా ఆ కేశిధ్వజుడు అలాంటి జ్ఞానం కలిగినవాడు కూడాను. అందువల్ల వాడి చేత పొందదగినది యోగమే కాని రాజ్యం కాదు". అని నిక్కచ్చిగా చెప్పేసి, నన్నింక వదలండని బయటకి వచ్చి కేశిధ్వజునితో, "నిజంగానే నేనడిగిన గురుదక్షిణ చెల్లిస్తావా" అని అడుగుతాడు. అంటే "ఆఁ! తప్పకుండా", అంటాడు కేశిధ్వజుడు. అప్పుడు తనకి భవబంధాలని నశింపజేసే అధ్యాత్మవిద్యని ప్రసాదించమని అడుగుతాడు. అది విని, "ఆహాహా! హాయిగా నా రాజ్యసర్వస్వాన్నీ అడిగి తీసుకోక యిదేమి కోరికకోరావయ్యా! రాజన్నవాడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది రాజ్యమే కదా." అని అంటాడు కేశిధ్వజుడు. దానికి ఖాండిక్యుడీ విధంగా సమాధానం చెపుతాడు:

మ.

'విను కేశిధ్వజ, ధాత్రి వేఁడమికి నా వేదించెదన్ హేతు: వ

జ్ఞునకుంగాక వివేకి కేల జనియించున్ లౌల్య మెందున్? రణం

బునఁ బాడిన్ రిపుఁ గూల్చు వాఁడియుఁ బ్రజాపోషంబు ధర్మంబు రా

జున కౌ; నైన నశక్తుఁ ద్వద్విజితరాజ్యున్ నన్నఘంబంటునే?

" కేశీధ్వజా! నేను రాజ్యాన్ని కోరకపోవడానికి గల కారణం చెబుతాను విను. లోకంలో ఎక్కడైనా లోలత్వం అన్నది అజ్ఞానికి గాని వివేకికి ఎందుకు కలుగుతుంది. యుద్ధంలో శత్రువులను సంహరించడం, లేదా ఓడించి సామ్రాజ్యాన్ని దక్కించుకోవడం, దాన్ని సుస్థిరపరుచుకుని ప్రజలను చక్కగా పాలించడం అన్నవి రాజధర్మాలు. అయితే నేను నీతో యుద్ధంలో ఓడిపోయి నా సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి రాజ్యాన్ని పరిపాలించకపోవడం అన్న పాపం నన్ను అంటదు." అన్నాడు ఖాండిక్యుడు.

ఇక్కడ రెండు అంశాలని ప్రస్తావించాడు ఖాండిక్యుడు. ఒకటి, తాను రాజ్యాన్ని కోరుకోవడం లౌల్యమవుతుంది. అది తప్పు. అజ్ఞులకే తప్ప వివేకవంతులకి అలాంటి లౌల్యం కలగదు. తాను అజ్ఞాని కాదు. రెండు, అసలు రాజ్యం కోరుకోవడం లౌల్యమెలా అవుతుంది? రాజన్నవానికి రాజ్య సంపాదన, పరిపాలన ధర్మాలు కదా అని అన్నట్లయితే దానికి కూడా సమాధానం చెపుతున్నాడు. యుద్ధంలో ధర్మంగా శత్రువులని జయించి రాజ్య పరిపాలన చెయ్యడం రాజధర్మం. తాను యుద్ధంలో కేశిధ్వజుని చేత ఓడిపోయాడు. కాబట్టి తాను అశక్తుడు. అంచేత తాను రాజ్యాన్ని కోరకపోవడం అధర్మం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే, యిక్కడొక విశేషం స్ఫురిస్తుంది. పుట్టుకతో ఖాండిక్యుడు క్షత్రియుడయినా, గుణాన్ని అనుసరించి చూస్తే అతడికి రాజయ్యే అర్హత లేదు. ఆ శక్తి అతడికి లేదు. అలాంటప్పుడు రాజధర్మం అతనికి వర్తించదు అని చెపుతున్నాడు. అంటే ధర్మం అన్నది కేవలం పుట్టుకచేత కాక, గుణాన్ని అనుసరించి కూడా ఉంటుందన్న విషయం స్ఫురించడం లేదూ?

ఖాండిక్యుడింకా యిలా వివరిస్తున్నాడు:

సీ.

నరనాథ, యీ రాజ్యపరిపాలనారాతి

హననాదికృతరూప యగు నవిద్య

యనధికారికి విసర్జనముఁ గావింపంగఁ

గలుషంబు రా; దధికారియైన

వాఁడు విసర్జింప వచ్చు వర్ణాచార

లోపంబుచే నగు పాపలేప;

మైన నేనిత్తుఁ గొమ్మనఁ గొను ధరణి భో

గమునకుఁ గాక ధర్మమున కగునె?

కాన సత్క్షత్రియులకు భైక్ష్యంబు కీడు;

మత్ప్రధానులు వేడు సామ్రాజ్యమనెడు

పలుకు ధర్మచ్ఛలంపు లోభం బయుక్త

మిది యెఱిగి రాజ్య మడుగ నే నిచ్చగింప



( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం .. సురటి)

ఓయి కేశీధ్వజా! ఈ రాజ్యపాలనము, శత్రుసంహారము మొదలైన పేర్లతో కొనసాగుతున్న అవిద్యారూపమైన కర్మని, అధికారి కానివాడు విసర్జించవచ్చు. అందువల్ల అతనికి పాపం అంటదు. కాని అధికారి అయినవాడు విసర్జిస్తే వర్ణాశ్రమ ధర్మానికి లోపం కలుగుతుంది. ఫలితంగా అతనికి పాపం అంటుకుంటుంది. అయినా నేను యుద్ధంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని నువ్వు యిస్తా తీసుకో అంటే నేను తీసుకుంటే ఆ రాజ్యం భోగ ప్రవృత్తికే తప్ప ధర్మనిర్వహణకు పనికిరాదు. కనుక క్షత్రియుడైన రాజుకు ఈ భిక్షాన్నం అనర్థాన్ని కలిగిస్తుంది. నా మంత్రులు నన్ను రాజ్యాన్ని కోరుకోమన్నారు. అది ధర్మం అన్న ముసుగులో ఉన్న లోభగుణం. అది అనుచితం కనుక నాకు ఇష్టం లేదు.అందుకే రాజ్యమడుగక బ్రహ్మవిద్యను కోరుకున్నాను అని వివరించాడు ఖాండిక్యుడు.

రాజ్యపరిపాలన, శత్రువులని చంపడం మొదలయినవన్నీ అవిద్య. అవిద్య అంటే కర్మ. కర్మ చేసినవాడికి పుణ్యపాపాలుంటాయి కదా? మరి కర్మని విడిచిపెట్ట వచ్చా అంటే, ఎవరికయితే కర్మ చేసే అధికారం (చెయ్యగలసిన సామర్థ్యం) ఉన్నదో అతడు కర్మని విసర్జించినట్లయితే అప్పుడు వర్ణధర్మానికి లోపం కలుగుతుంది. అప్పుడతనికి కర్మ చెయ్యకపోయినా, యీ ధర్మాతిక్రమణం వలన పాపం కలుగుతుంది. దీనికి మరి నిష్కృతి ఏమిటంటే, కర్మ చెయ్యడానికి అధికారమూ, సామర్థ్యమూ ఉన్నవాడు కర్మ చేసి తీరాలి. కాని తాను చేస్తున్నది కేవల ధర్మనిర్వహణకే కాని అందులో తన యిష్టానిష్టాల ప్రమేయం లేదని దృఢంగా నమ్మి ఆ కర్మ చేసినట్లయితే, ఆ కర్మఫలం (పుణ్యపాపాలు) అతనికి అంటదు. అసలు ఒకనికి తన స్వభావరీత్యా ఒక కర్మ చేసేందుకు శక్తే లేనప్పుడు, ఆ కర్మని చెయ్యకపోవడం వలన అధర్మం జరగదు. పైగా అలా చెయ్యాలని అనుకోవడమే అధర్మమవుతుంది. ఇక్కడ ఖాండిక్యుడు చెప్పిన ధర్మసూక్ష్మం యిది!

"ధర్మచ్ఛలంపు లోభంబు" అన్నది చాలా అద్భుతమయిన మాట. స్వార్థపరుడు, తనకి లాభాన్ని చేకూర్చేదానికి ధర్మమన్న అందమైన ముసుగు వేస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైనదని అతని భావన.

ధర్మాధర్మ విచక్షణతో కూడిన ఖాండిక్యుని వివరణ విని కేశిధ్వజుడు ఎంతో సంతోషిస్తాడు. "నువ్వు చెప్పినది చాలా సబబుగా ఉంది. నేనుకూడా నా ధర్మాన్ని అనుసరించే రాజ్యపరిపాలన, యజ్ఞయాగాది కర్మలను ఆచరిస్తున్నాను. ఈ కర్మల వల్ల కలిగే పుణ్యఫలాన్ని వదిలించుకోవడానికి భోగాలని అనుభవిస్తున్నాను. పవిత్రమైన మన నిమివంశం చేసుకున్న అదృష్టం కొద్దీ నీకిలాంటి తత్త్వచింతన కలిగింది." అని చెప్పి, ఖాండిక్యుడు కోరినట్టుగా, పరమార్థాన్ని బోధించే విద్య అతనికి చెప్పడం మొదలుపెడతాడు కేశిధ్వజుడు. ఆ వివరాలు తదుపరి టపాలో చూద్దాం.

Related Posts Plugin for WordPress, Blogger...