తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, December 3, 2012

వర్షాకాల వర్ణన



సరిగ్గా విష్ణుచిత్తునిలాగే, యామునాచార్యుడు పాండ్యరాజు సభలో పండితులను ఓడించి విజయం సాధించాడు. అందరి వాదాలను ఒక్కటొక్కటిగా సహేతుకంగా ఖండించి "విష్ణుమూర్తియే పరమాత్మ, విశిష్టాద్వైతమే గొప్పమతం" అని నిరూపించాడు. అప్పుడు ఆ  మహారాజు యామునాచార్యుని ప్రతిభను గుర్తించి సాష్టాంగ ప్రణామం చేసి పూజించాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ రాజు యామునాచార్యుని ప్రతిభకు మెచ్చి తన చివరి చెల్లెలినిచ్చి వివాహం జరిపించి, అర్ధరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు.  తాను ఇతర దేవతలను, దేవాలయాలను, భక్తులను కూడా గౌరవిస్తూ, భక్తితో శ్రీహరిని సేవించాడు. ఒక ఆచార్యుడు రాజయ్యాడు.! రాజ్యాభిషేకం తర్వాత యామునాచార్యుడికి అస్త్రశస్త్ర విద్యలు, రాజనీతి, స్వయంగా నేర్పించి, దివ్యాస్త్ర మంత్రాలు కూడా ఉపదేశించాడు పాండ్యరాజు. రాజు అయినవాడు తరచూ శత్రువులపై దండెత్తి జయించి రావాలని హెచ్చరించాడు. కాని వస్తున్నది వర్షాకాలం. వర్షాకాలంలోదండయాత్ర చేయుట తగదని మంత్రి, పురోహితులు వారించారు. ఆ వర్షాకాలాన్ని అద్భుతమైన పద్యాలలో రాయలవారు ఈ విధంగా వర్ణిస్తున్నాడు.



 మ. తనతోయం బినరశ్ము లెత్త, నిల వాత్యారేణుమూర్తిన్ మహేం

      ద్రునకుం జెప్పగ, మ్రుచ్చుఁ బట్ట దివమందు న్విల్ఘటింపం, భయం

      బునఁ దద్రశ్మిసహస్రము న్వెస డిగెం బో డాఁగి వే గ్రుమ్మరిం

      , ననం ధారలు దోఁచె మించు వెలిఁగింప న్మబ్పుల న్వెల్లిపై.

ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం - తోడి


వానాకాలంలోని గాలివానని చిత్రిస్తున్న పద్యమిది. ఆకాశంలో ఓ వైపు దట్టని మేఘాలు, మెఱపులు. మరోవైపు ఇంద్రధనుస్సు. దుమ్ము రేపే జోరుగాలి. హోరువాన. ఇవన్నీ ఉన్నాయీ పద్యంలో. వీటన్నిటినీ కలిపి ఒక అందమైన కథ అల్లాడు కవి. భూమి, తనలోని ఉదకాన్ని (నీటిని) సూర్యకిరణాలు ఎత్తుకుపోయాయని, సుడిగాలి రేణువుల రూపంలో వెళ్లి దేవేంద్రుడితో మొఱ పెట్టుకుందిట. వెంటనే ఆ ఇంద్రుడు విల్లంబులు ధరించి ఆకాశంలో దొంగను పట్టుకోవడానికి బయలుదేరాడు. మబ్బుల చాటున మెఱుపుల రూపంలో దాగిన ఆ కిరణాలిది గమనించి, తాము దొంగిలించిన నీటినంతా తొందరగా పారేయాలనే ఆత్రుతతో గ్రుమ్మరించేస్తున్నట్టుగా వర్షం కుండపోతగా కురుస్తోందట!

ఈ వర్ణనలో రాయలవారి రాజధర్మ నిర్వహణ తొంగిచూడటం లేదూ! ఇందులో మరొక విశేషం కనిపిస్తుంది. సూర్యుని వేడిమికి భూమ్మీద నీరు ఆవిరై మేఘాలు ఏర్పడి వానలు కురిసే జలచక్రం గురించిన అవగాహన, కనీసం రాయలనాటి కాలానికి మన దేశంలో ఉందని తెలుస్తుంది. ఆ శాస్త్రపరిజ్ఞానాన్ని అందమైన కథ రూపంలో చెప్పడమూ కనిపిస్తుంది.


 తే. పుట్ట వెడలి నభోభిత్తిఁ బట్టు శక్ర

     కార్ముకపుఁ బెద్ద పలువన్నెకట్ల జెఱ్ఱి

     దైన నడచెడు కాళ్ళగుంపనఁగ గాలిఁ

     గార్కొని దిగంతముల వానకాళ్లు నడచె

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

మెఱుపు కాంతిలోనో సూర్యకాంతిలోనో వర్ష ధారలను చూస్తే, గాలికి ఊగుతూ అవి నడుస్తున్నట్టుగా కనిప్సితాయి. వాటినే వానకాళ్ళంటారు. ఇక్కడ కవి ఆ వానకాళ్ళని వర్ణిస్తున్నాడు. పైన ఆకాశంలో ఏడు రంగుల హరివిల్లుంది. అది రంగురంగుల జెఱ్ఱిలా ఉందట! పుట్టనుండి బయటకు వచ్చి ఆకాశమన్న గోడ మీద నడుస్తున్న ఆ రంగురంగుల జెఱ్ఱి కాళ్ళ గుంపులాగా ఉన్నాయట వానకాళ్ళు!

కాళిదాసు మేఘదూతంలోని "వల్మీకాగ్రాత్ ప్రభవతి హి ధనుఃఖండ మాఖండలస్య" అన్న శ్లోక పాదం యీ పద్యానికి ఆధారం అనిపిస్తుంది. వల్మీకంనుండి ఇంద్రధనుస్సు పుట్టింది అని అర్థం! పుట్టనుండి హరివిల్లు పుట్టడమేమిటని సందేహం. "వల్మికో సాతపో మేఘః" అన్న అమరకోశం ప్రకారం, వల్మీకం అనే పదానికి ఎండతో కూడిన మబ్బు అనే అర్థం కూడా ఉంది. అంచేత అక్కడ కాళిదాసు ఉద్దేశం ఎండ పడిన మేఘంనుండి ఉద్భవించిన ఇంద్రధనుస్సు అని పండితులు వ్యాఖ్యానించారు (ఇంద్రధనుస్సు ఏర్పడడం వెనకనున్న భౌతిక కారణం కాళిదాసు కాలానికే తెలుసననడానికిది రుజువని కూడా అన్నారు). అయితే ఇక్కడ రాయలవారు ఆ పదానికి పుట్ట అనే అర్థమే తీసుకొని, ఆ ఊహకు కొనసాగింపుగా ఆ హరివిల్లుని పుట్టనుండి వెడలిన పలువన్నెల కట్లజెఱ్ఱితో పోల్చారు!

  


 సీ. ఎలగోలుజల్లు మున్ పెళపెళ నేటవా

        ల్పడి గాలి నట్టిండ్లఁ దడిపి చనఁగ

     నట్టె తో వడగండ్ల కట్టావులు దుమార

        మావుల రేఁచి రెండవదియుఁ జన

     మఱి మూఁడవది నిల్చి మెఱసి బిట్టుఱిమి శీ

        కరవారి సృష్టిఁ జీకటిగ నలమ

     నుయ్యెలచేరుల యోజఁ బై పై వెండి

        జల్లుపైజల్లు పెల్లల్లుకొనఁగ



 తే. భూభిదాపాది దుర్భరాంభోభరంపు

     వడి మరుజ్ఝంఝఁ దెరలక కడవ వంచి

     నట్లు హోరని ధారౌఘ మైక్య మొంది

     విన్ను మన్నును నొకటిగా వృష్టి బలసె.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...


ఈ పద్యంలో అంచెలంచెలుగా కురిసే వానని స్వభావోక్తిలో వర్ణిస్తున్నారు రాయలవారు. మొదటి జల్లు పెళపెళధ్వనితో  ఏటవాలుగా వచ్చి గాలితో కలిసి గుమ్మాలు దాటి నట్టింట్లోకి దూరి తడిపేసి వెళుతుంది. వెంటనే రెండవ జల్లు వడగళ్ళతో వచ్చి భూమిని తడిపి, వేడిపొగలూ, దుమ్మూ రేపి వెళిపోతుంది. ఆ వెనకే మూడవజల్లు వచ్చి కొంతసేపు ఆగి ఉరుములు మెరుపులతో, చిరు తుంపరలతో అంతా చీకటి చేస్తుంది. ఇక ఆ తర్వాత జల్లు మీద జల్లు ఉయ్యేల గొలుసుల్లా పెనవేసుకుపోయి కురవడం మొదలుపెడతాయి. కారు మబ్బులు కమ్మి, జోరుగాలితో కూడి, భరింపలేని వేగంతో, భూమి ఆకాశాలు ఏకమైనట్లుగా హోరుమనే ధ్వని చేస్తూ, కడవతో నీరు గ్రుమ్మరించినట్టు విడువకుండా కురుస్తుంది వాన.


 చం. పెళపెళ మబ్బు బిట్టుఱుమ భీతి విదూరశిలాంకుర చ్చటో

      త్పులకినియై ప్రియు న్నిదురవోవు హరి న్వడిఁ గౌఁగిలింపఁగాఁ,

      దలరి ధరిత్రి సాఁచు గఱు దాల్చిన గేళ్ళన గంకణంపుమ్రోఁ

      తలఁ బులు దేల వండు పయిఁదాల్చి నదు ల్వెసఁ జొచ్చెవారిధిన్.

ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - శంకరాభరణం..


పెళపెళమని మబ్బురిమింది. ఏకాంతంలో కాంత భూదేవికి భయం కలిగింది. పక్కనే ఉన్న భర్త గాఢంగా నిద్రిస్తున్నాడు (వానాకాలంలో నాలుగునెలపాటు విష్ణుమూర్తి నిద్రలోకి వెళతాడని అంటారు కదా!). భయం పోగొట్టుకోడానికి భర్తపై చేయిచాచినట్లు నదులు దీర్ఘంగా సాగాయి. నదిలో కొత్తనీరు కదా, గడ్డి తేలుతోంది. అవి భూదేవి పొందిన గగుర్పాటుకి గుర్తుల్లాగా ఉన్నాయి. శరీరమ్మీద పులకలన్న మాట. ఆ నదిలో నీటిపక్షులు కిలకిలమంటున్నాయి. అవి, ఆ నదులనే చేతులకి ధరించిన గాజుల గలగలల్లాగ ఉన్నాయి. వానాకాలంలో బురదకూడా ఉంటుంది కదా. అది భూదేవి తాల్చిన గంధపుపూతలాగా ఉందట! అలా, ఆ వర్షాకాలపు నదులు సముద్రంలో సంగమించడం, భీతిల్లిన భూకాంత తన ప్రియుని కౌగిలించుకున్నట్టుగా ఉన్నదని కవి ఊహ. ఇక్కడ మళ్ళీ మనం గుర్తుకు తెచ్చుకోవలసిన విషయం - ఈ కావ్యంలో ప్రధానరసం శృంగారం. పైగా కావ్యనాయిక అయిన గోదాదేవి భూదేవి అవతారం. అంచేత అక్కడక్కడా యిలాంటి వర్ణనలు ఆ రసస్ఫురణను కలిగిస్తాయి.



 క. ఘనవృష్టి కతన ఫణు లే

    పున నల వల్మీకరంధ్రములు మూయఁగ నె

    త్తినగొడుగు లనఁగ చత్రా

    కనికాయం బవని నెల్లకడలం బొడమెన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...

వానాకాలంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులు గుంపులుగుంపులుగా పొటమరించాయి. ఇది ఎలా ఉందంటే - వానలు పెల్లుగా కురియటం వల్ల పాములు పుట్టల్లో దూరి వానధారలు లోపలకు రాకుండా కన్నాల మీద గొడుగులు విప్పుకొని లోపల కూర్చున్నాయా - అన్నట్ట్లు ఉందట. బహుశా "పుట్టగొడుగు" అనే పేరుకి ఇంత చక్కని అర్థం చెప్పిన కవి ఒక్క రాయలేనేమో!



 క. కాకోదరాహితుల వ

    ల్మీకంబులఁ దూర్చె మెఱసి మేఘుం, డని గుం

    పై కనుఁగొని పొగడె నన్

    భేకధ్వను లెసఁగె వృత్త భేదానుకృతిన్

ఈ  పద్యం రాఘవ స్వరంలో.. రాగం - భూపాలం


పై పద్యంలో పాములు పుట్టల్లోకి దూరిపోవడం చిత్రించబడింది కదా. అలా తమ శత్రువులైన పాములని మేఘుడు పరాక్రమంతో, మెరుపులనే ఆయుధాలతో దండెత్తి వాటిని పుట్టల్లో దూరిపోయేట్టు చేసి తమని కాపాడినందుకు అతన్ని ప్రశంసిస్తూ రకరకాల ఛందస్సులలో కప్పలు స్తుతిస్తున్నాయా అన్నట్టు కప్పల అరుపులు (భేక ధ్వనులు) వినిపుస్తున్నాయట! వేదంలో భేకసూక్తాలని ఉన్నాయి. వాటి పరమార్థమేమిటో మనకు తెలియలేదు. కాని అర్థం మాత్రము, వానలు వచ్చి తమకు ఆనందం కలిగించాయని మేఘుని ప్రశంసించడం - అని బోధపడింది. ఛందమంటే వేదం కనక వృత్తభేదమన్న పదంతో వేదంలోని భేకసూక్తాలని కవి సూచిస్తున్నట్టుగా భావించవచ్చు.

 

 చం. తడి తల డిగ్గి ముంప, జడతం దుదఱెప్పలఁ గన్ను విప్పి, పు

       ల్పొడచుచు నీరు ముంగఱల పోలిక ముక్కునఁ గూడ, నోటఁ గొం

       తొడియుచు గూఁటి కఱ్ఱ సగ మొత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా

       వడఁకుటె కాక చేష్టుడిగె పక్షులు వక్షము జానువుల్ చొరన్..


వాననీటిలో తడిసిన పక్షుల అవస్థ చక్కని స్వభావోక్తిలో అత్యంత సహజంగా చిత్రించే వర్ణన యిది. వాననీరు తలపైనుంచి దిగి శరీరమంతటినీ తడిపేసింది. రెప్పలార్పడానికి కూడా అవ్వడం లేదు. కంటి తుదలతో మెల్లగా కళ్ళను తెరుస్తున్నాయి. అప్పుడా నీటిచుక్కలు ముక్కు మీద పడి ముంగరలాగ మెరుస్తూ, మెల్లగా నోట్లోకి జారుతున్నాయి. ఆ నీటిని కొంత తాగి, మరికొంత తమ గూటికున్న పుల్లలకి రాస్తున్నాయి. వణుకుతూ రెక్కలు విదిలిస్తున్నాయి. చివరకి, చలి పోగొట్టుకోడానికి మోకాళ్ళను రెక్కలు కప్పిన రొమ్ములోకి జొనిపి, అలా చేష్టలుడిగి మునగదీసుకు కూర్చుండిపోయాయి.



 ఉ. కాలునిదున్న నందినయి గంటలు దున్నక మంటినా, మహా

     కాలుని నంది దున్ననయి కర్దమమగ్నత లేక మంటి నా,

     హాలికు లెన్నఁడుం దెగని యౌరులచేలును జాకుమళ్ళునుం

     గా లలి నేరుసాఁగి రిలఁ గల్గుపసింగొని పేద మున్నుగన్.

ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో...

వ్యవసాయంలో మెఱకదుక్కి, దమ్ము(రొంపి)దుక్కి అని రెండు రకాల దుక్కులు (దున్నడం) ఉన్నాయి. మెఱకదుక్కి అంటే మెట్టపొలాలు (బురద లేని బీడు పొలాలు) దున్నడం, ఏడ్లతోనే తప్ప దున్నపోతుల చేత చేయించరు. రొంపిదుక్కి అంటే బురదతో ఉన్న పొలాన్ని చదను చేయడం. ఇది దున్నలచేత చేయిస్తారు, ఎడ్లతో కాదు. యామునాచార్యుని రాజ్యంలోని రైతులు ఈ రెండు రకాల పొలాలనూ (ఔరుగంట్ల పొదలతో ఉన్న మెరకచేనుని, బురదతోనిండిన జాకుమళ్ళనీ కూడా) ఎక్కడెక్కడ ఉన్న ఎడ్లతోనూ దున్నపోతులతోనూ దున్నిస్తున్నారట. అది చూసి యముని వాహనమైన దున్నపోతుకీ, శివుని వాహనమైన నందికీ (ఎద్దు) భయం పట్టుకుంది, తమ చేత కూడా దుక్కి చేయిస్తారేమోనని! కాని మళ్ళీ వాటికవే సర్దిచెప్పుకున్నాయట. ఏమిటని? నేను ఎద్దుని కాదు కదా, అంచేత నాకు మెరక దున్నే బాధ తప్పిందని యముని మహిషమూ, నేను దున్నని కాదు కదా, అంచేత బురదలో పొర్లే బాధ తప్పిందని శివుని వృషభమూ సంతోషించాయట! అంత సమృద్ధిగా పేదరైతులు సైతం ఏరువాక సాగించారు.

 

 క. వరుజుబడి రొంపిఁ ద్రొక్కం

    జరణంబులఁ జుట్టి పసిఁడి చాయకడుపులం

    బొరి నీరుకట్టె లమరెను

    బిరుదులు హాలికులు దున్నఁ బెట్టిరొ యనఁగన్.

ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో...


రైతులు రొంపి దుక్కిలో పొలంగట్ట్ల వెంబడి బురద తొక్కుతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి వానపాములు చుట్టుకున్నాయి. వాటి కడుపులు బంగారు రంగులో మెరుస్తున్నాయి. అది ఎలా ఉందంటే, వ్యవసాయంలో గొప్ప పండితులైన ఆ రైతులు, తమ పాండిత్యానికి చిహ్నంగా బంగారు గండపెండేరాలను ధరించారా అన్నట్టుగా ఉన్నదట!

 

 మ. గురుగుం జెంచలిఁ దుమ్మి లేఁదగిరిసాకుం దింత్రిణీపల్లవో

      త్కరముం గూడఁ బొరంటి నూనియలతోఁ గట్టావికుట్టారికో

      గిరముల్ మెక్కి తమిం బసుసుల్ పొలము వో గ్రేఁపుల్ మెయిన్ నాక మేఁ

      కెరువుంగుంపటి మంచ మెక్కిరి ప్రభుత్త్వైకా ప్తి రెడ్లజ్జడిన్..



ఇంత వర్షంలో కూడా ఇల్లాల్లు తమ భర్తలకోసం ఆ కాలంలో దొరికిన కూరలు, ఆకుకూరలతోనే రుచికరమైన భోజనం తయారుచేస్తారు. వర్షాకాలంలో పొలాల గట్ల మీద, బీళ్ళలో, గోడలమీద దొరికే కురకటము (గురుగాకు), చెంచెలియాకు, తుమ్మియాకు, లేత తగిరిసాకు, చింతచిగురుతో కలిపి నూనెతో యిగురుబెట్టి, ఆవిరి తేలుతున్న కుఱుచయారికల (కుట్టారికల) అన్నం కడుపునిండా తిని (పీకలదాకా మెక్కి!), పశువులని పొలాలకి తోలి, మేకెరువుతో రాజుకున్న కుంపటి మంచం కింద పెట్టుకొని, గుడిసెలో ఓ మూల కట్టేసిన దూడలు తమ శరీరాలను నాకుతున్నా పట్టించుకోకుండా, తమ పెద్దరికం ఉట్టిపడుతూ ఉండగా, హాయిగా గుఱ్ఱుపెట్టి పడుకుంటారట ఆ ఊరి రెడ్లు. ఇక్కడ కర్షకజీవన సౌందర్యం అద్భుతంగా వర్ణించబడింది. మేకెరువు చాలా ఆరోగ్యకరమట. ముఖ్యంగా క్షయరోగాన్ని నివారిస్తుందట! "ఓగిరము మెక్కి" అనడంలో ఎంత తృప్తిగా భుజించారో ధ్వనిస్తుంది. "మంచమెక్కిరి" అనడంలో "హాయిగా మంచమెక్కి పడుకున్నారు" అనే ధ్వని ఉంది.


ఇలా మొత్తం అరవై పద్యాలలో వర్షాకాల వర్ణన చేసారు కృష్ణదేవరాయలు. మచ్చుకి కొన్ని పద్యాలు మాత్రం ఇక్కడ వివరించడం జరిగింది. ఆ వర్ణనల్లో శాస్త్రవిషయాలు, సమాజ జీవితం, అద్భుత కల్పనలు, స్వభావోక్తి - అన్నీ కనిపిస్తాయి. వర్ష ఋతువు తర్వాత శరదృతు వర్ణన వస్తుంది. ఆ వర్ణనావైవిధ్యం, వైదుష్యం, తర్వాతి టపాలో...

Thursday, September 27, 2012

యామునాచార్యుని సభాప్రవేశం

ఎలాగైనా తనను సభకు పిలిపించి వాదం ఏర్పాటు చేయగలిస్తే, తాను పండితవాదనలో నెగ్గి, వైష్ణవమత స్థాపించగలనని యామునాచార్యుడు మహారాణితో విన్నవించుకున్నాడు. 


తే. గ్రీష్మసమయనిరుత్సాహకేకిరమణి
నవఘనధ్వని కలరుచందమున నలరి,
యేకతమ నర్మగోష్ఠిఁ బ్రాణేశుతోడ
నతని విధ మెఱిఁగింప, నిట్టట్టు వడుచు.
 
(ఈ పద్యం రాఘవ స్వరంలో . రాగం - సామ )

యామునాచార్యుని మాటలు విన్న మహారాణి సంతోషించింది. ఎంతగా సంతోషించినదంటే, వేసవికాలంలో నిరుత్సాహంగా కాలం గడుపుతున్న ఆడనెమలి, మేఘ ద్వని వినగానే ఎలా ఆనందిస్తుందో అలా సంతసించింది. ఎంత చక్కని ఉపమానం!
మహారాజుతో ఏకాంతంగా సరససల్లాపాలాడే సమయంలో యామునాచార్యుని గురించి ప్రస్తావించింది. అది విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. అట్టిట్టయిపోయి:

క. భూవల్లభుఁ "డెట్టెట్టూ!
తా వాదము సేసి శివమతంబు జయింపం
గా వచ్చెనొ? చూతముగా,
రావింపు" మటన్న నాఁటిరాత్రి చనంగన్.
 
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఆ పాండ్యరాజు తన భార్యతో "ఎట్టెట్టా! ఆ బ్రహ్మచారి తన వాదనతో శైవమతాన్ని జయింపగలడా?? సరే అదీ చూద్దాం. అతన్ని రప్పించు" అన్నాడు.
ఇది చిన్న పద్యమైనా రాజు ఇట్టట్టుపడడాన్ని మంచి నాటకీయంగా చిత్రిస్తుంది. ఎట్టెట్టు, తా, వాదము సేసె, శివమతంబును, జయింపగావచ్చునో - అన్న మాటలన్నీ ప్రతిది నొక్కినొక్కి పలికితే తప్ప అతని తబ్బిబ్బు పాఠకులకు అబ్బురంగా కనిపించదు. ఇదే సహజమైన సంభాషణలో ఉండే కాకువు. రెండవ పాదం "తా వాదము", మూదవ పాదం "గా వచ్చెనొ", యిలా విడిపోవడం, నాల్గవపాదం "రావింపుము" అని మొదలుకావడం, యిదంతా అతడు పడ్డ ఆశ్చర్యాన్ని, అతని మాటల్లోని వేళాకోళాన్నీ ధ్వనించే రచనా సంవిధానకం. నాల్గవ పాదం రావింపుము అని తెగేసి చెప్పినట్లుగా ప్రారంభించడం యామునాచార్యుడు తప్పక ఓడిపోతాడన్న రాజు నమ్మకాన్ని ధ్వనిస్తుంది.
సరే ఆ రాత్రి గడిచాక మర్నాడు పొద్దునే సభ ఏర్పాటు చేసారు. మహారాణికూడా ఆ సభలో రాజు పక్కనే ఆసీనురాలయింది. రాజు అనుమతితో  యామునాచార్యుని సభకు రప్పించింది.

క. ద్వారంబు సొచ్చి, కీలిత
గారుడమహి వజ్రవేదికం జివురులఁ గెం
పారు నొక పిప్పలముఁ గని
యా రావిన్ వాదసాక్షికై వలగొనుచున్

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
యామునాచార్యుడు సభలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ సభకూ రాజద్వారానికీ మధ్య ఒక రావిచెట్టు ఉంది. చుట్టూ గరుడపచ్చలూ వజ్రాలు పొదిగిన అరుగుతో, ఎఱ్ఱని చివుళ్ళతో, అందంగా ఉందా చెట్టు. ఆ రావి చెట్టుకు నమస్కరించి తాను చేయబోయే వాదనకు సాక్షిగా నిలిపి, ప్రదక్షిణము చేసి సభలోకి ప్రవేశించాడు యామునాచార్యుడు. రావిచెట్టు విష్ణుస్వరూపం!

చుట్టూ జటాధారులైన శైవాచార్యులందరూ కూర్చొని ఉండగా, దట్టమైన విబూదితో, చెవులకు, మెడలోను రుద్రాక్షలతో, రత్న కంబలిపైనున్న చిన్న గద్దెపై కూర్చొని ఉన్నాడు పాండ్యరాజు. పక్కనే ఉన్న తలగడపై మోచేయి పెట్టి, నంది ప్రతిమలుగల ఉంగరాల చేతిలో చెక్కిలి ఆనించి, శైవాగమాలు వింటున్నాడు. అలా కూర్చున్న రాజు దగ్గరకు వెళ్ళి యామునాచార్యుడు యజ్ఞోపవీతాన్ని కానుకగా యిచ్చాడు. 

అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ
రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్

అగ్నిహోత్రం దగ్గరకు కాని, ఎవరైనా యింటికి కాని, ఆలయానికి కాని, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, రాజు, దైవం, గురువు దగ్గరకు కాని, వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదన్నది ఆచారం. యామునాచార్యుడు బ్రహ్మచారి. అంచేత తనకు ఉచితమైన, తన దగ్గరుండే ఒక యజ్ఞోపవీతాన్ని రాజుకు సమర్పించాడు. కాని రాజు వీరశైవుడు కాబట్టి దాన్ని తిరస్కరించాడు. హేళనగా, కొంచెం కోపంగా యిలా అన్నాడు:

తే. "సంగతియె యోయి, యిసుమంత ఠింగణావు!
తత్వనిర్ణయవాదంబు దరమె నీకు?
నోడితేనియుఁ బట్టి మొఱ్ఱో యనంగ
లింగమును గట్టకుడుగ, మెఱింగి నొడువు"
 
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"ఇది నీకు తగునటోయీ? వేలెడంత లేవు! (ఠింగణా అంటే చిన్నవాడు, పొట్టివాడు అని అర్థం) భగవత్తత్త్వ సిద్ధాంతము గురించి నువ్వేం మాట్లాడతావు. ఇది నీకు సాధ్యమైన పనియేనా? ఒకవేళ ఈ వాదనలో నీవు ఓడిపోతే ఎంత మొత్తుకున్నా పట్టి బంధించి లింగధారణ చేయించి పంపుతాము. ఈ విషయం గురించి మరోసారి ఆలోచించుకుని మాట్లాడు" అని చెప్పాడు. ఠాంక్విన్ దేశంనుండి దిగుమతి అయ్యే గుఱ్ఱాలను ఠింగణాలు అనేవారట. అవి పొట్టి గుఱ్ఱాలు కాబట్టి, పొట్టివాళ్ళను ఆ పేరుతో పిలిచేవారు. 

తే. వాదుల మటంచుఁ జెప్పించి వత్తు: రోట
మైన దయ నీరె యేమైన నని విలజ్ఞ
జూటుఁదనమున సభ లెక్కు చొరవకాండ్రు:
పాఱువారల సుద్ది సెప్పంగ నేల?
 
( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)

ఇంకా యిలా అంటున్నాడు: "బ్రాహ్మణుల సంగతి వేరే చెప్పడం దేనికి? సిగ్గులేకుండా ఏవరో ఒకరి మధ్యవర్తిత్వంలో సిఫార్సు మీద వస్తారు, శాస్త్రవాదం చేస్తామంటూ. ఓడిపోయినా ఎంతో కొంత ముట్టచెపుతారు కదా అని ఆశ."  "జూటు" అనేది "ఝూటా" అనే హిందీ పదంనుండివచ్చి ఉండాలి.
తన మతస్థులే ఓడిపోతే తానూ, తనకు ఆప్తులైన శైవులందరూ చక్రాంకితాలు వేసుకుంటామని, యామునాచార్యుడు ఓడిపోతే అతనితో పాటు రాణికూడా లింగధారణ చెయ్యాలని అంటాడు రాజు. దానికి రాణి ఒప్పుకొని, మీరు మీ మాట మీద నిలబడండి, దీనికి పంచభూతాలే సాక్షి అంటుంది. అప్పుడు యామునాచార్యుడు లేచి, రాజు పలికిన మాటలకు ఇలా అన్నాడు:

క. "దేవా, యిట్లని యానతి
యీ వల, దేఁ గడుపుఁగూటి కిట రా, నా డ
బ్బేవారిఁ బ్రోవ? భిక్షా
జీవిక వర్ణికిని విధి సృజించెనె గాదే?"
 
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

"ఓ రాజా! నీవలా అనుట తగదు. నేను ఒంటరి బ్రహ్మచారిని. నా కడుపుకూటికి జూటుదనంతో యిలా రాజసభలకు వచ్చే పని నాకు లేదు. అలా సంపాదించిన డబ్బుతో నేనెవరిని పోషించాలి కనక? బ్రహ్మచారులకు ఆ భగవంతుడే భిక్షాటన వృత్తిని విధించాడు కదా."

యింకా ఇలా అన్నాడు:

తే. ఎవ్వఁడే సర్వభూతస్థుఁ డిత్తెఱంగు
నకును బ్రేరేఁచె, నతనియానతియె తెచ్చె,
నెఱిఁగినవి నాల్గు నొడువ నేమేని లెస్స:
యతఁడ బొంకిన నేమిసేయంగ వచ్చు?
 
( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో) 

"సర్వభూతాలలో ఉన్నవాడెవడో నన్ను ప్రేరేపించి యిక్కడకు తీసుకువచ్చాడు. నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పినందువల్ల ఏ ఫలితం కలిగినా మంచిదే. ఆ భగవంతుడే అబద్ధము ఆడితే నేనేం చేయగలను." అని, "మీరు చెప్పిన దానికి నేను బద్ధుడనై ఉంటాను. నా వాదనలో ఓటమి లక్షణాలు కనిపిస్తే, అమ్మగారు సిఫార్సు చేసిన పండితుడనని నా మీద దయ చూపించనక్కరలేదు. మీరు చెప్పినట్టే చెయ్యండి" అని చెప్పాడు.
అప్పుడు వాదన జరిగింది. సరిగ్గా విష్ణుచిత్తుడు మత్స్యధ్వజుని సభలో చేసిన వాదననే యిక్కడ కూడా యామునాచార్యుడు చేసి, అదే రీతిలో సభలోని పండితులందరినీ ఓడించాడు. "విష్ణుమూర్తియే పరమాత్మ, విశిష్టాధ్వైతమే గొప్ప మతం" అని నిరూపించాడు.

క. ఆయెడను నొక్కపలు కెదు
రై యుండెడు పిప్పలమున నాయెను విన "నో
హో, యిది నిక్కము, నృప, నా
రాయణుఁడె పరంబు, కొల్వు మతని" నటంచున్.
 
( ఈ పద్యం  రాఘవ స్వరంలో  రాగం - కీరవాణి )
అంతట సింహద్వారం సమీపంలో సాక్షీభూతంగా ఉన్న రావిచెట్టునుండి "ఓహో వినండి. ఇది నిజము. ఓ రాజా! నారాయణుడే పరమాత్మ. అతనిని పూజింపుము" అన్న మాటలు వినిపించాయి. దానితో యామునాచార్యుని గెలుపు నిశ్చయమయ్యింది. ఈ యామునాచార్యుని విజయంతో కథ మరో కొత్త మలుపు తిరిగింది!

Sunday, August 19, 2012

యామునాచార్య చరిత్ర

తే. ప్రభువు లరిగిరి క్రమ్మఱఁ బాండ్యనగరి,
కమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ
దన చిరంతన తులసికాదామకరణ
దాస్యమును జేసికొంచుఁ దత్పరత నుండె.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
మత్స్యద్వజుడు పంపిన మంత్రి, సామంతులు మొదలైనవారు రాత్రంతా విష్ణుచిత్తుని ఆతిథ్యం స్వీకరించి మరునాడు సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత విష్ణుచిత్తుడు యథావిధిగా భగవదారాధనలో మునిగిపోయాడు. మన్నారుస్వామికి ప్రీతికరమైన తులసీమాలల అలంకరణ సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడితో విష్ణుచిత్తుని జైత్రయాత్ర కథ ముగిసింది. విష్ణుచిత్తుడు తిరిగి తన భగవదర్చనలో తులసీమాలల కట్టుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. ఇది ఒక ఉదాత్తమైన ముగింపు.

ఇప్పుడొక కొత్త కథ మొదలవుతోంది. ఇది యామునాచార్యుని కథ. శ్రీవైష్ణవమతంలో ఆచార్యుల పరంపర ఉంది. అందులో యామునాచార్యుడు ఒక ప్రధానాచార్యుడు. ఇతను
రామానుజాచార్యుని కన్నా ముందువాడు, క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కథ చెప్పబోతున్నది విష్ణుమూర్తి. చెపుతున్నది లక్ష్మీదేవితో. ఒకనాడు మధ్యాహ్న వేళ విష్ణుచిత్తుడు స్వామికి పుష్పమాలికను సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని అదృశ్యంగా గమనిస్తున్న విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో యిలా అంటున్నాడు:


తే. 'యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున' ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"యామునాచార్యుడొక్కడు, ఈ మహాత్ముడొక్కడు. నా దయవల్ల విశిష్టాద్వైత దర్శనాన్ని ఉద్ధరించారు." అని శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో అన్నాడు. విష్ణుచిత్తుడిని చూసినప్పుడు విష్ణుమూర్తికి యామునాచార్యుడు గుర్తుకువచ్చాడన్న మాట. యామునాచార్యుడే ఎందుకు గుర్తుకువచ్చాడో, కథలోకి వెళితే తెలుస్తుంది. నిజానికి యామునాచార్యుడు విష్ణుచిత్తుని తర్వాతి కాలం వాడు. అయినా భగవంతునికి కాలావధి లేదు కదా! ఇక్కడ "అస్మదీయ కృపాతిశయమున" అన్నది చాలా ముఖ్యమైన పదం. అంటే నా కృప వల్లనే వారు తమ కార్యాలను సాధించారు అని నొక్కి చెపుతున్నాడు. దీని ద్వారా ఈ కావ్యానికి అసలైన నాయకుడు శ్రీమహావిష్ణువే అనే విషయాన్ని స్ఫురింపజేస్తున్నారు రాయలవారు.
విష్ణుమూర్తి యిలా అనేసరికి అమ్మవారు ఆసక్తిగా, ఎవరా యామునాచార్యుడు, ఏమా కథా అని అడిగింది. విష్ణుమూర్తి తన భార్యకు యామునాచార్యుని కథ చెప్పడం మొదలుపెట్టాడు.

తే. అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్య విద్య లభ్య
సించుచుండ, నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుడే యొకండు.
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం మాయామాళవగౌళ )

ఈ యమునాచార్యుడు చిన్నవయసునుండే గురుకులంలో ఉండి వేదశాస్త్రాలను అభ్యసించాడు. ఆ కాలంలో ఇప్పటి పాండ్య రాజు పూర్వ వంశస్థుడైనవాడే రాజుగా ఉండేవాడు. ఇక్కడ తెలుస్తుంది, యామునాచార్యుడే విష్ణుమూర్తికి ఎందుకు గుర్తుకువచ్చాడో. యామునాచార్యుని కాలంలో, అతనుండే దేశాన్ని కూడా పాండ్య వంశానికి చెందిన రాజే పరిపాలన చేస్తూండేవాడు. అయితే ఈ రాజుకీ ఆ రాజుకీ తేడా ఉంది. యామునాచార్యుని కాలంలోని రాజు,

తే. వెఱ్ఱిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు
నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,
హరుఁడె పరతత్వ మను, మదీయాలయముల
నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్లె.

ఆ రాజు శైవమత పక్షపాతి. ఆ వెఱ్ఱి ముదరడం వల్ల ఆ రాజు విష్ణు కీర్తిని, స్తుతిని సహించలేకపోయేవాడు. అంతేగాక తన రాజ్యంలోని వారెవరూ విష్ణువిగ్రహారాధన కూడా చేయరాదని కట్టడి చేసాడు. వైష్ణవాలయాలలో జరిగే ఉత్సవాలు చూసి అసహ్యించుకుంటూ శివుడే పరబ్రహ్మమని అంటూ తన స్నేహితులతో అదే విధంగా ఉండేవాడు. ఇక్కడ "వెఱ్ఱిశైవంబు" అంటే రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు. అసలు శైవమే వెఱ్ఱిదని ఒక అర్థం. వెఱ్ఱిగా మారిన శైవమని మరొక అర్థం. శైవులలో కూడా వీరశైవులు వేరేగా ఉన్నారు. ఇక్కడ ఆ వీరశైవాన్నే వెఱ్ఱిశైవంగా పేర్కొన్నాడని మనం భావించాలి. ఎందుకంటే, మతం ఎప్పుడైనా పరమత సహనం కలిగినంత కాలం బాగానే ఉంటుంది. అది కోల్పోయినప్పుడే అది వెఱ్ఱిగా మారుతుంది. రాయలవారు ఎంతటి శ్రీవైష్ణవ మతావలంబి అయినా, శైవుల పట్లగాని, ఇతర మతాలవారి పట్లగాని అనాదరం చూపించలేదు, మనకు తెలిసినంతలో. శ్రీవైష్ణవులలోనే కొందరు వీరవైష్ణవులు ఆ పని చేసారు. వారిది కూడా వెఱ్ఱే అవుతుంది.
రాయలవారిక్కడ ఆ వెఱ్ఱి శైవం ఎలా ఉందో వర్ణిస్తారు. అది వేదాలను నమ్మదు. వేదపండితులను గౌరవించకుండా కేవలం జంగములనే పూజిస్తారు. ఇంటి ఇలవేల్పులను పట్టించుకోరు. కేవలం వీరభద్రుడినే కొలుస్తారు. ప్రాచీనాలయాలు శిథిలమైపోతున్నా, వాటి గురించి పట్టించుకోక కేవలం జంగములకు మఠాలను మాత్రమే స్థాపిస్తున్నాడు రాజు. మతం రాజకీయంలోకి, రాజ్యపాలనలోకి ప్రవేశిస్తే ఏర్పడే అవస్థ యిక్కడ వర్ణిస్తున్నాడు రాయలు. రాజు శైవమతావలంబి కావచ్చు. అంత మాత్రాన ఇతర దేవాలయాలను పట్టించుకోక పోవడం రాజుగా అతని బాధ్యతారాహిత్యమే అవుతుంది. పైగా ఈ వైపరీత్యం ఎంత దాకా వెళ్ళిందంటే:

క. శివలింగముఁ దాల్చిన జన
నివహం బేమైనఁ జేయనిది పాపము దా
నవుఁ గా దనఁ; డా సమయము
నవు నను విప్రులక యగ్రహారము లిచ్చున్.

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
ఈ రాజు శివలింగాన్ని ధరించినవారు ఎటువంటి దుష్కార్యాలు చేసినా వారిని మందలించక, శిక్షించకుండా కనీసం అది తప్పు, పాపం అని కూడా చెప్పేవాడు కాదు. శైవాచారమే గొప్ప అని రాజుకు తలూపే బ్రాహ్మణులకు అగ్రహారాలు మొదలైన ధనసంపద దానం చేసేవాడు.
అసలు శైవమతాన్ని అవలంబించని వారికి దేశబహిష్కరణ శిక్ష విధించేవాడట. దానితో, తమ పుట్టినూరు విడిచి వెళ్ళలేక బ్రాహ్మణులు కొందరు శైవ వేషం వేసుకొని తిరిగేవారు.

క. శీలముఁ బట్టియు గంజా
హాల లుపాంశున భుజించు నధముల బైటం
జాలఁడు వైవన్, విప్ర
స్ఖాలిత్యము బైలుసేసి కనుగిఱపు సభన్



( పద్యం లంకా గిరిధర్ స్వరంలో)


శైవుల పట్ల ఆ రాజుకు ఎంత పక్షపాతం అంటే వాళ్లు శివదీక్షను స్వీకరించిన తర్వాత కూడా గంజాయి, సారా సేవించినా వాళ్లని పట్టుకుని శిక్షించడు కాని బ్రాహ్మణులు తెలియక చేసిన చిన్న తప్పులకు కూడా వాళ్లని సభనుండి వెళ్లగొట్టి శైవుల వైపు కన్నుగీటుతూ హేళనగా నవ్వేవాడు.


రాజు ఎంత దుర్మార్గుడైనా అతని పట్టపురాణి మాత్రం విష్ణుభక్తురాలు. తన భర్త చేసే దుష్కార్యాలు చూసి బాధపడేది. ఆమె ఎంతటి శ్రేష్ఠురాలంటే,

సీ. వింగడం బైనట్టి ముంగిట నెలకొన్న

బృందావనికి మ్రుగ్గు వెట్టుఁ దాన;

దశమినాఁ డేకభుక్తము సేసి, యవలినాఁ

డోర్చి జాగరముతో నుండు నిట్రు;

బారసి పోనీదు, పై నిద్రఁ బాఱుట

క్కలుపాడు మత్పుణ్యకథలఁ ద్రోయు;

నేమంపు మూన్నాళ్లు కామింప దధినాధు;

మఱునాఁడు కన్నును మనసుఁదనియ


నారజపు వన్నెఁ బ్రియు సెజ్జ కరుగుఁ గూర్మి;

నరుగుచో నాభి దుడిచి కప్పురపు నాభిఁ

బెట్టు; నిట్టుల మద్భక్తి పుట్టియును ని

జేశు నెడ భక్తి చెడదు మదిష్ట మగుట


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - వరాళి )

విశాలంగా, సుందరంగా ఉన్న ఇంటి ముంగిలిలోనున్న తులసీవనంలో శుభ్రం చేసి తానే ముగ్గులు పెట్టేది.. ప్రతీ దశమినాడు ఒంటిపూట భోజనం చేసి ఏకాదశినాడు అభోజనంగా ఉండి రాత్రి జాగారం చేసేది. బారసినాడు (ద్వాదశినాడు) కూడా వ్రత దీక్షలో ఉండి, ఆ రాత్రి బ్రాహ్మణ స్త్రీలు పాడే శ్రీహరి పుణ్యకథలను వింటూ నిద్రపోకుండా గడుపుతుంది. ఆ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజులలో భర్తకు కూడా దూరంగా ఉండేది. త్రయోదశినాడు భర్తకు నచ్చేవిధంగా అందంగా అలంకరించుకుంటుంది. తన కస్తూరీ తిలకాన్ని తుడిచి కర్పూరపు తిలకం దిద్దుకుని భర్త అంతఃపురానికి వెళుతుంది. కస్తూరి వైష్ణవుల బొట్టు. అంచేత భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు దాన్ని తుడిచేస్తుంది. కర్పూరం విభూతిలా ఉంటుంది కనుక అది పెట్టుకుంటుంది. విష్ణువు మీద ఎంత భక్తి ఉన్నా పత్రివ్రతా ధర్మం ఆదరణీయం కనుక భర్తపట్ల భక్తిలో ఏమాత్రం లోపం రానిచ్చేది కాదు. రాజ్యమంతటా తన వీరశైవాన్ని స్థాపించినా, తన అంతఃపురంలోనే, తన భార్యచేత వైష్ణవపూజ మానిపించ లేకపోయాడన్న మాట ఆ రాజు!


రాజు తన భక్తులను నిరాదరిస్తూ, కష్టాలకు గురిచేస్తూ ఉంటే భగవంతుడు ఉపేక్షించడు కదా. కాని దేశానికి రాజైన వాని ద్వారానే ధర్మం రక్షింపబడాలి. అధర్మం జరుగుతున్న చోటల్లా భగవంతుడే అవతరించాలంటే కుదరని పని. అంచేత రాజులో ఎలాగైనా మార్పు తేవాలనుకున్నాడు విష్ణుమూర్తి. అందుకోసం యామునాచార్యుని రాజు కొలువుకు పంపించి అక్కడి శైవపండితులను వాదనలో గెలిచి విశిష్టాద్వైతాన్ని అతడు స్థాపించేలా చెయ్యాలనుకొని, యామునాచార్యుని మనసులో ఆలోచన పుట్టించాడు.

ఇక్కడ మనం గమనించ వలసిన విషయమేమిటంటే, విష్ణుచిత్తునికి స్వయంగా స్వామి ప్రత్యక్షమై పాండ్యరాజసభకు వెళ్ళమని ఆదేశించాడు. యామునాచార్యునికి అలా కాక అతని మనసులో ఆలోచన పుట్టేలా చేసాడు. అంటే నేరుగా దర్శనమిచ్చేంత పరిపక్వత యామునాచార్యుడు ఇంకా సంపాదించ లేదన్న మాట.

సరే, విష్ణుచిత్తుని కాలంలోని పాండ్యరాజుకు స్వయంగా వైరాగ్యం కలిగి మతాన్ని తాను అవలంబించాలో తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని కథలో పాండ్యరాజు అలా కాదు కదా. ఇతడు వెఱ్ఱిశైవుడు. ఇతని సభలో ప్రవేశించడం ఎలా మరి? అందుకోసమే అతని భార్య విష్ణుభక్తురాలయ్యింది. రాజు నిరసించిన భక్తులకూ, పూజ్యులకూ, వెనక ద్వారం గూండా ఈమె ఆశ్రయమిస్తూ ఉండేది! అక్కడకు వెళ్ళాడు యామునాచార్యుడు. వెళ్ళి రాణిగారికి ఆశీర్వచన అక్షతలు పంపించి, తన వివరాలు తెలియజెప్పాడు. తాను వైష్ణవ బ్రహ్మచారిననీ, రాజు వైష్ణవ విముఖుడు కాబట్టి తమలాంటి వారిని సభలోకి రానివ్వడనీ, భార్యకు అతను అనుకూలుడు కాబట్టి, ఆమె మాట వింటాడనీ, అంచేత ఆమె ఎలాగైనా తనను సభకు రప్పించి వాదం ఏర్పాటు చేయిస్తే వైష్ణవమత స్థాపన తాను చేయగలనని విన్నవించుకుంటాడు.


ఆమె రాజును ఒప్పించి సభను ఏర్పాటు చేస్తుందా, యామునాచార్యుడు వాదన గెలుస్తాడా, గెలిస్తే తర్వాత ఏమవుతుంది అన్న కథ తర్వాతి టపాల్లో చూద్దాం.

Related Posts Plugin for WordPress, Blogger...