తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Saturday, January 26, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 3

యామునాచార్యుడు కొడుకుకు రాజనీతి బోధ కొనసాగిస్తున్నాడు. రాజైన వాడు ఎప్పుడూ ఒకటిరెండు విషయాలకే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మి ఆవేశపడి చర్యలు తీసుకొనక.. వాడు తనకు నిజంగానే హితము చెప్పుచున్నాడా లేక పరహితము కోరే వాడా అన్న సంగతులను ఎప్పటికప్పుడు ఇతరులచే విచారణ జరిపిస్తూ ఉండాలి. తొందరపడి ఆవేశపడి ఎటువంటి నిర్ణయములు చేయరాదని భావన.
ఇక రాజు దినచర్య ఎలా ఉండాలో తెలుసుకొవలసిన అగత్యం గురించి యామునాచార్యులవారి ద్వారా రాయలవారు తెలియజేస్తున్నారు. రాజు యొక్క దినచర్య వివరంగా తెలియపరచిన విధానం మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సీ.సౌఖ శాయనిక భిషక్పూర్వకము కల్య
వేళ గార్తాంతిక ద్విజుల గోష్ఠి
జామువోవ నమాత్య సామంత పూర్వకం
బర్ధార్జనస్థ కాయస్థ గోష్ఠి
దిన మధ్యమమున మర్దన మల్లపూర్వకం
బగు సూదసూప కృన్మృగయు గోష్ఠి
యపరాహ్ణమున దేవతార్చనా పూర్వకం
బార్య ధర్మాది కృద్యతుల గోష్ఠి
తే.గీ.భక్తిమీద విదూషక పూర్వకము పు
రాణ కవిగోష్ఠి, చారపూర్వకము సంజ
జాము గాయక గోష్ఠి, నిశన్ సుషుప్తి
పూర్వకము ప్రేయసీ గోష్ఠి  పొసగు బతికి.
          
           ప్రాత:కాలమున సుఖ నిద్రనడుగువారు, వైద్యులను, జ్యోస్యులగు బ్రాహ్మణులను రాజు దర్శించవలెను. రాజు వారితో తన దేహారోగ్యమును గూర్చి గ్రహానుకూలతాననుకూలతల గురించి చర్చించవలెను. ఝాము ప్రొద్దు ఎక్కిన తరువాయి మంత్రి సామంతులతోను, ధనార్జన నియుక్తులయిన కరణము వంటి వారితో ఆదాయ వ్యయముల గురించి చర్చించవలెను. తరువాయి అంగమర్దనము, మల్లురతో వ్యాయామము,వంటవారితోను, వేటగాండ్రతోను తెచ్చిన మాంసము గురించి తేవలసిన విశేషములను మాట్లాడవలెను. అపరాహ్నమున దేవతార్చన సమయమున, పెద్దలతో, ధర్మాధికారులతో సన్యాసులతోను భాషించదగును. భోజనానంతరం విదూషకులతో హాస్య సంభాషణము సాగించాలి. పౌరాణికులతో, కవులతో గోష్ఠి కార్యక్రమములు నిర్వహించవలెను. నాలుగవ జామున చారులకు దర్శనమీయవలెను. పాటకచేరీలు, రాత్రి ప్రేయసితో సరస సల్లాపములు తదుపరి సుఖ నిద్ర.

చ. హితులు భిషగ్గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్హితా
హితులు ధనార్జనాది నృపకృత్యనియుక్తులు వెండి కేవలా
హితులు దశావశార్పిత సమృద్ధ రమాహరణేచ్ఛు; లౌటనా,
హితమును నట్లకా జతుర వృతింజరించుట నీతి రేనికిన్.

రాజునకు వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు ఎప్పుడూ మేలునే చేకూర్చుదురన్న సత్యము మరువరాదు. ధనార్జన లోనగు రాచకార్యములలో అధికారులు హితులగుదురు. రాజద్రవ్యమును అపహరించుట, కనిపెట్టి దండించునన్న భయము వలన అహితులు అగుదురు.  వారి ధన సమృద్ధిని  దుర్వృత్తిని రాజు అణచుటకు పూనుకొనును కాన, వారు ఏ విధముగానైనా రాజును మదిలో ద్వేషిస్తూనే ఉంటారు. కావున రాజు అనేవాడు ఈ మూడు తరగతుల వారిని సదా కనిపెట్టి మంత్రాంగం సాగించాలి. రాజు కూడా హితుడుగా, హితాహితుడుగా, కేవల హితుడుగా నటించవలసి యుండును.

కం.తనుభృశ దమనజ సుకృతము
ధన దత్తిన కొనగ వలయు దత్త దృతుక
మర్దన మజ్జన భోజనలే
పన వసన ప్రసవ వహన పరతం బతికిన్.

    రాజ్యాన్ని ధర్మబుద్ధితో న్యాయాన్యాయ విచక్షణతో పరిపాలించే రాజు సకల భోగములను హాయిగా అనుభవించవచ్చు. దేహదమన కారివలె తపస్సు చేయనక్కరలేదు. పుణ్యమును దాన ధర్మములచే పొందవచ్చును.

కం. విను వర్గసమత నృపుడు
న్నను ధర్మాంశంబె హెచ్చెనా, పెరమడి కె 
త్తిన నీరును దెగి యలరా
జనపు మడికి నెక్కినట్లు చను ముదమందన్.

ధర్మార్ధ కామ మోక్షములు మూడింటిలోను రాజు ధర్మము విషయమై ఎక్కువ ధనము ఖర్చైనట్లైతే మిక్కిలి సంతోషించాలి. మూడింటిలో ధర్మ విషయమైన విషయాలకే అధిక ప్రాధాన్యత ఉండాలని అర్ధం.

కం.చేయునది రాజ్యమట, యఘ
మే యవధిగ నీగువారమే మనజన; దా
మ్నయాంబు  నశక్యాను
ష్ఠేయము జెప్పదు; స్వశక్తి జేయగ జెప్పున్.

రాయలవారు ఒక వంక రాజ్యం చేస్తూనే మరోవంక సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేవారు. అందువల్లనే తను నమ్మిన, ఆచరించిన సూత్రాలను, ఇంకా తనకు తిమ్మరుసు, మంత్రులు, దండనాయకులు చెప్పిన రాజనీతిని భావితరాలకు ఈ ఆముక్తమాల్యద గ్రంధం ద్వారా  అందించాడు. "రాజ్యాంతే నరకం ధృవం" అన్న విషయం గురించి  రాయలవారు వివరిస్తున్నారు. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తాడు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో హింసకు పాల్పడడం జరుగుతుంది. అందువల్ల నరకప్రాప్తి గలుగుతుందన్న విషయం తెలియనిది కాదు. అందువల్ల భవిష్యత్తులో రాజులు చక్రవర్తులు పాప భయంతో బెరుకుగా అసమర్ధవంతమైన పరిపాలన చెయ్యకూడదన్న ఉద్దేశ్యంతో, యామునాచార్యుని పాత్ర ద్వారా వివరిస్తున్నారు.  యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే పుణ్యం కలుగుతుంది నిజమే!  కానీ ఆవిషయం ఎవరూ స్వర్గం నుండి కానీ నరకం నుండి కానీ వచ్చి చెప్పలేదుకదా!  అందువల్ల రాజు తన కర్తవ్యం ప్రకారం నమ్మిన సత్యాన్ని అమలు పరుస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అన్న విషయం మాత్రమే గ్రహిస్తే చాలు. మనుదండధరాధులు దోషమని తెలిసికూడా కర్తవ్య నిర్వహణ చేయడం ఉదహరిస్తూ..వివిధ పురాణాలలో ఉన్న న్యాయాన్యాలను, వివిధ శిక్షణల గురించిన విషయాలను విపులీకరించి చెప్తున్నారు రాయలవారు.

చతుర్ధాశ్వాసం ముగిస్తూ రాయలవారు ఒక చక్కని శార్దూల పద్యాన్ని రచించారు. దానిలో తను కటకమును జయించి పొట్నూరు వద్ద విజయ స్థంభమును నాటించిన విషయం ప్రస్తావించి, కృష్ణరాయ భూపతి అను పేరు గలిగిన నేను ఆముక్త మాల్యద ప్రబంధంలో నాలుగవ ఆశ్వాసాన్ని పూర్తి చేశానని చెప్పుకున్నారు.
ఇంతటితో చతుర్ధాశ్వాసం సమాప్తం. సారి పంచమాశ్వాసంతో కలుసుకుందాం. శెలవు.

Friday, January 11, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 2

ఆముక్త మాల్యద బ్లాగు ఆగి చాలా కాలం అయింది.  కారణాలు అనేకం.  మీకు కొంచెం వెనక్కి వెళ్ళి…కధ చెప్పి మళ్ళీ పద్యాల్లోకి వస్తాను.  మనం చతుర్ధాశ్వాసం లో ఉన్నాం.   వాదములో యామునాచార్యుడు నెగ్గడంతో  రాజు తన రాజ్యంలో కొంత భాగానికి  యామునాచార్యుని రాజును చేసితన చెల్లెలినిచ్చి పెళ్ళి చేసాడు. అతడు దివ్యాస్త్ర మహిమ కలవాడు గనుక దిగ్విజయము చేయవలెనని కోరిక కలిగి  సర్వరాజులను జయించి రాజ్య భోగలాలసుడయ్యాడు. యామునాచార్యుని తండ్రి  నాథముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు యామునాచార్యుని చూసి రాజ్య వ్యసనమేమిటీ? పాపమేమిటని వాపోయాడుఅతని మనసు మార్చడానికి ఏదైనా చేయాలని అనుకుని, రాజదర్శనము చేసుకునిరాజా! మీ పూర్వులు నిక్షేపమును కావేరినది యొక్క ఒకానొక ద్వీపమున ఉంచారు దాని చుట్టూ పాము ఉంటుంది. పద్మము శంఖము కూడా వుంటాయి.” అని రాజును తీసుకుని శ్రీరంగనాథుని చూపించడం వరకూ తెలుసుకున్నాము. తర్వాత శ్రీరామమిశ్రుడు రాజును తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుని చూపించాడు. వెంటనే యామునాచార్యునికి తను చేసిన తప్పు తెలిసి జ్ఞానము కలిగింది. వెంటనే  తన కొడుకుకు రాజ్యాన్ని అప్పగించి తాను సన్యాసము తీసుకున్నాడు. తరువాత కొడుకుకు రాజనీతిని బోధించసాగాడు. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద నిద్రించునప్పుడు ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరిచి ఉంటుందిరాజు కూడా అదే విధంగా  అన్నివేళలా అప్రమత్తుడై ఉండాలి. ఇంటాబయటా ఉన్న శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండక తప్పదని చెప్తాడు. తర్వాయి, యమునాచార్యుడు రాజనీతిని కొనసాగిస్తున్నాడు. సన్యాసులు, జడధారులకు అగ్రహారములవంటివి దానమీయరాదు. అటుల యిచ్చిన యెడల వారు వారి వారి కర్తవ్యములను విస్మరించి భోగలాలసులగుదురు. వధించవలసినంతటి నేరము చేసినవారికి ముమ్మారు అవకాశమీయుము. ఇంకను దుశ్చర్యలు ఆపనిచో వధించవలెను. రాజ్యములో వందిమాగద బృందాన్ని కనిపెట్టి ఉండాలి. విదేశములనుండి గుర్రములు, గజములు దిగుమతి చేసుకొనుచుండవలయును. ఎవరైనా రోగగ్రస్తులైన వారు విదేశములనుండి వచ్చినచో వారిని వారి జాతివారి వద్దకే పంపవలెను. శతృవర్గపు రాజులతో చాలా జాగ్రత్తగా మెలగవలెను. నీచ ప్రవృత్తితోను, మోసముతోను వారిని జయించుట తగదు.


కం. అహితుడు వేడిన నేలెడు
మహి సగమేనిచ్చి తెగని మైత్రిగొని విభుం
డహి భయము మాన్పుకోదగు
నహిభయ మహిభయముకంటె నధికము గాదే

రాజుకు బయటి శత్రువు కన్నను, తన పక్షము వారు పగబూనినట్లైతే అత్యంత ప్రమాదమని గ్రహించాలి. అది పాము కంటే భయంకరము. బయటి శతృవు కోరితే సగం భూభాగం యిచ్చి అయినా భయం పోగొట్టుకొని, తర్వాత స్వపక్ష భయమును సమర్ధవంతంగా నిర్మూలించుకొనాలి.

వేయి మాటలెందుకు? కంటకులను తుదముట్టించని రాజ్యములో రాజుకు గానీ ప్రజలకు గానీ సుఖశాంతులుండవని గమనించుకోవలెను. బెస్తవానికి చిక్కిన చేప నేలపైబడి గింజుకొనునంతవరకు ఓపికవహించి తర్వాత బుట్టలో వేసుకున్నట్టుగా బలవంతుల విషయంలో తొందర పడకూడదు. నెమ్మదిగా కార్య సాధనకై అడుగులు వేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన దండనీతిని గురించి తెలుసుకోనాలి. వ్యసనములు - పాన స్త్రీ మృగయా ద్యూత వాక్పారుష్య దండపారుష్యార్ధ దూషణముల గురించి తెలియ జెప్పెదను వినుము.

సీ. దండపారుష్యంబు, కొండెంబున నతర్క
మరి సంధి కెడయీక మర్ల బడుట................(1)
యవలితప్పెన్నికన్న విదేశ్యు జెరుచుట
ప్రతి ప్రవర్తకున కేర్పడగ జేత........................(2)
జనునవిశ్వాసంబు గనుగొని మెలగుట
విశ్వసనీయుని వేర్పరచుట..........................(3)
మోమోట మంత్రంబుచో మిక్కిలిడుకొంట
మంత్రభేత్తకు నాజ్ఞ మరచియుంట.................(4)

తే.గీ. వింత పుట్టిన గనుగల్గి చింతసేయు
కుంట, మాన్యుల పట్టున నొక్క చూపె
చూడకుంట, విహీనుల గూడుకొంట
వ్యసనియై ఉంట, చలముంట వలదు పతికి.
అని సెలవిచ్చిన యమునాచార్యుడు కొడుకుకు రాజనీతిని కొనసాగిస్తున్నాడు.

1. దండ పారుష్యమునందు నేరమునకు మించి శిక్షలను విధించరాదు. కొండెములు చెప్పినవారిని నమ్మి శిక్షలు విధించరాదు. నిజమా కాదా అని జాగ్రత్తగా విచారించుకోవాలి. 2. తనకు దేశాంతరరాజు చేసిన అపరాధములను చెప్పవచ్చిన విదేశీయుని వానిని వాని దేశపు రాజుకు పట్టి యిచ్చుట. 3. తనకు ద్వేషము చేయునని యెరింగియు వారలతో స్నేహము చేయుట తగదు. 4. మంత్రులు యితర అధికారులు చెప్పిన మాటలు నమ్మి విచారించక శిక్షలు విధించుట చేయరాదు. అలాగే పూజ్యులను నిందించుట, మోసగాండ్రకు స్థానమిచ్చుట, సప్తవ్యసనములలో ఉండుట, మాత్సర్యము వహించుట అనునవి రాజుకు ఏమాత్రము తగదు.


లోక స్వభావమునకు వ్యతిరేకమైన ఉత్పాతములు జరిగినప్పుడు బ్రాహ్మణులను పూజించుట, దేవతలకు పూజలు చేయుట, అగ్నికి హోమము చేయుట మొదలగు కార్యములు నిర్వర్తింపవలయును. రాజు అధికారులకు పోటీలు పెట్టడం వలన వారి వారి గొప్పలు చెప్పుకోవడమే గాక యితరుల లోపములను చెప్పెదరు. ఆవిధముగా అందరి బలములు, అందరి బలహీనతలను రాజు నిత్యము తెలుసుకొనుచుండవలెను. 
Related Posts Plugin for WordPress, Blogger...