తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, July 25, 2011

విష్ణుచిత్తుని వాదము

శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని తృతీయాశ్వాసాన్ని ఆ వేంకటరాయని ప్రార్ధనతో ప్రారంభించాడు. ఈ ఆశ్వాసంలో విష్ణుచిత్తుడు రాజాస్ధానంలో పండితులను నిర్ద్వందంగా ఓడించిన విధానము, ఖాండిక్య కేశీధ్వజుల సంవాదము వివరిస్తున్నాడు..

కం. శ్రీక్షితినీళా వర! దను
జోక్షప్రాణహర! దంష్ట్రికోత్కృత్తహిర
ణ్యాక్షక్షపాచర! కృపా
వీక్షాదృతబాహులేయ! వేంకటరాయా!


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం -హమీర్ కల్యాణి )

లక్ష్మీదేవికి, భూదేవికి, నీళాదేవికి నాథుడైనవాడా! వృషభాసురుని (ఉక్షము అంటే ఎద్దు) సంహరించినవాడా! వరాహావతారమున తన కోఱలచే హిరణ్యాక్షుని ఖండించినవాడా! దయతో కుమారస్వామిని ఆదరించిన వేంకటరాయా! అని సంభోదిస్తూ తృతీయాశ్వాసానికి శ్రీకారం పలికాడు రాయలు..
నీళాదేవి కుంభకుడన్న వాని కూతురు. కాలనేమి అనే రాక్షసి కొడుకులు ఆబోతురూపాలలో గొల్లపల్లెను బాధిస్తూ ఉండగా వారిని చంపినవానికి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తానని కుంభకుడు చాటిస్తే, శ్రీకృష్ణుడు వారిని చంపి నీళాదేవిని పెళ్ళి చేసుకున్నాడు. అలానే వరాహావతారంలో భూదేవిని రక్షించి ఆమెకి భర్త అయినాడు. భూ నీళా దేవిల ప్రస్తావన తెచ్చి, దానికి అనుసంధానంగా ఆయా రాక్షసులని సంహరించినవానిగా పేర్కొనడం పద్యానికి ఒక చక్కని అమరిక తెచ్చింది. విశిష్టాద్వైత మతంలో గోదాదేవిని నీళాదేవి స్వరూపంగా భావిస్తారు.
కుమారస్వామి వేంకటనాథుని కొలిచినట్టుగా కథ ఉంది. అతని పేరు మీదనే స్వామి పుష్కరిణి ఏర్పడింది.

శా. నిత్యంబున్ బ్రతిహారి వాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి మ్రొక్కఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్వల రాజదత్త వరరత్న స్వర్ణపీఠస్థుఁడై


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మన్నారుస్వామి ఆదేశానుసారము పాండ్యరాజు కొలువులో పండితులతో వాదమొనరించుటకు వెళ్లాడు విష్ణుచిత్తుడు. ఆ మధురానగర రాజాస్ధానంలో పరతత్త్వ నిర్ణయం కోసమైన వాద ప్రతివాదాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అందులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలనుండి పండితులు విచ్చేస్తున్నారు. అందుకే అక్కడి ద్వారపాలకుడు రాజుగారికి విన్నవించడం, ఆజ్ఞ తీసుకోవడం లాంటి ఆనవాయితీ లేకుండానే విష్ణుచిత్తుని లోపలికి పంపించాడు. సభలోకి ప్రవేశించిన విష్ణుచిత్తుడు అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ ప్రకాశము చూసి “ఎవరో ఈ మహాత్ముడు!” అనుకుని రాజుతో సహా సభాసదులందరూ లేచి నమస్కరించారు. విష్ణుచిత్తుడు సభలో ప్రవేశించి మహారాజు తనకు సమర్పించిన రత్నఖచిత సింహాసనంలో ఆసీనుడయ్యాడు.

. అతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వ
ద్ర్వాతంబుఁ జూచి, ‘లాఁతుల
మా తరవాయుడుగ? మాటలాడుం’ దనుచు


(ఈ
పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

రాజుగారి
ఆతిధ్యము స్వీకరించిన తర్వాత విష్ణుచిత్తుడు తన మనసునందు మహావిష్ణువు ఆవరించగా, తమ వాదము మాని నిశ్శబ్దంగా ఉన్న పండితులను చూస్తూ “మనమేమన్నా పరాయివాళ్లమా? వాదం ఎందుకు ఆపారు? మొదలెట్టండి!”, అన్నాడు. విష్ణువు తన చిత్తంలో పూర్తిగా అలముకొని, విష్ణుచిత్తుడన్న అతని పేరు గొప్ప సార్థక్యాన్ని పొందిందిప్పుడు. అందుకే అతనిలో ఆ తేజస్సు! విష్ణుచిత్తుని మాటల్లోని చొరవ గమనించాలి. అదంతా విష్ణుమూర్తి చలవే!

సరే వాదప్రతివాదాలు మళ్ళీ మొదలుపెట్టారు పండితులు. కొన్ని మాటల్లోనే వారి తెలివితేటలు గ్రహించి, వారి వాదములో లోతులేదని తనలో తాను నవ్వుకొని, పండితుల చెప్పుతున్నది పూర్తయిన తర్వాత తాను కూడా మాట్లాడేందుకు రాజు అనుమతిని తీసుకున్నాడు విష్ణుచిత్తుడు. రాజును మధ్యవర్తిగా ఉండమని తన వాదమును ప్రారంభించాడు.

సీ. అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
డనిన వన్నియును మున్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్ని దూషణంబులు వేగ
పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేఁగినం గలఁగ కందఱఁ దీర్చి
నిలిపి; యమ్మొదలి వానికినె మగిడి;

తే. మఱి శ్రుతి స్మృతి సూత్ర సమాజమునకు
నైక కంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁగావించి దయ వాని విడిచి పెట్టి



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
వాదమంటే ఎలా జరపాలో చక్కగా వివరించే పద్యమిది! ఆనాటికే కాదు ఈనాటికీ ఎవరు చక్కని వాదము చెయ్యాలన్నా యీ పద్ధతినే అనుసరించాలి. ముఖ్యంగా చట్ట సభలలో వాదులాడుకొనే మన నాయకులు దీన్ని నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది!
విష్ణుచిత్తుడు ముందుగా అక్కడి పండితులలో మేటియనిపించిన ఓ పండితుడి వైపు తిరిగి అతని వాదమును మొత్తం అనువాదము చేసి, ఆ వాక్యాలలోని దోషాలను ఒక్కటొక్కటిగా ఎత్తి చూపుతూ సభలోనివారందరూ అంగీకరించి మెచ్చుకొను విధంగా వాటిని ఖండించాడు. ప్రక్కనున్న పండితులు పలికే వితండ వాదాన్ని పట్టించుకొనక ఒక్కో మాటతోనే క్లుప్తంగా వారి పరాజయ హేతువును సూచించాడు. తమ పరాజయాన్ని తట్టుకోలేని పండితులు మూకుమ్మడిగా తనతో వాదానికి దిగినా ఏమాత్రం జంకకుండా అందరినీ సమాధానపరిచాడు. తర్వాత తనతో వాదమునకు దిగిన మొదటి పండితుని వైపు తిరిగి వేదాలు, బ్రహ్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు – వీటన్నిటి పరమార్ధం ఒక్కటే అని వాటి ఏకవాక్యతని (ఏకగ్రీవతని) స్ధాపించిన పిమ్మట స్వమతము అనగా శ్రీవైష్ణవమే విశిష్టమైనదని లోకానికి స్పష్టం చేసాడు. తనచేతిలో ఓడిన పండితుడిని దయతో క్షమించి విడిచిపెట్టాడు. ఇదే విధంగా అక్కడ వాదించిన పండితులందరితోనూ ప్రతివాదము చేసి ఒక్కొక్కడినే ఓడించాడు విష్ణుచిత్తుడు.

ఆ చేసే వాదములో అన్యమత ఖండనం ఎలా చేసాడో ఈ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు. పెద్ద వ్యాఖ్యానం అవసరమైన పద్యమిది. ఈ పద్యం అర్థం కావాలంటే అసలు మన భారతదేశంలో పూర్వమున్న మతాల అన్నిటి గురించి మనకి తెలియాలి. మనకిప్పుడు "హిందూ మతం"గా చెలామణీ అవుతున్నది నిజానికి చాలా "మతాల" సమ్మేళనం. అయితే ఇంచుమించుగా ఈ "మతాలన్నీ" వేదాలని ఆధారం చేసుకున్నవే.
ఇప్పుడీ పద్యంలో ప్రస్తావించిన మతాలు ఒక్కొక్కటే ఏమిటన్నది చూద్దాం.

సీ. 'జగదుద్గతికిని బీజము ప్రధాన' మన 'నీ
క్షత్యాది' వీశు నశబ్దవాదిఁ
బొరి 'నీశుఁడేన' నా 'భోగమాత్రే'త్యాద్యు
దాహృతిస్ఫూర్తి మాయావివాది,
'ఫలియించుఁ గ్రియయ' నా 'ఫలమత' యిత్యాది
సర్వేశుఁ గొనని యపూర్వవాది,
'శాస్త్రయోనిత్వాది' సరణి నీశ్వరునిఁ దె
ల్పెడు 'ననుమాన' మన్పీలువాది

'నిత్యులందెల్ల నిత్యు'డన్ శ్రుత్యురూక్తి
'క్షణిక సర్వజ్ఞ తేషి' సౌగత వివాది,
'ననుపవత్తేర్నా' యను సూత్ర మాదియైన
వాణి 'నృపతీశు' బ్రత్యక్షవాది గెలిచె


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మొదటి పాదంలో ఉన్నది సాంఖ్యమనే మతం. దీనినే సాంఖ్యదర్శనం అంటారు. ఈశ్వరుడు లేదా బ్రహ్మము, శుద్ధ జ్ఞానస్వరూపమని, జత్ సృష్టికి మూలకారణం "ప్రధానము"(ప్రకృతి) అని చెప్పే మతమిది. అయితే దీనిని "ఈక్షతేర్నాశబ్దం" అనే బ్రహ్మసూత్రాన్ని ఉపయోగించి ఖండిచాడు విష్ణుచిత్తుడు. ఈ బ్రహ్మసూత్రం సంఖ్య 1:1:5. దీని వివరణ ఏమిటంటే - "తదైక్షత బహూస్యాం" అనే శ్రుతి వాక్యాన్ని బట్టి, "తాను అనేకత్వాన్ని పొందాలని సృష్టి కారకమైన బ్రహ్మము ఈక్షణము (సంకల్పము) చేసినది" అని వేదాలలో చెప్పబడింది. కాని ప్రకృతికి (అచేతనము కాబట్టి), అలాంటి "సంకల్పము" చేసే శక్తి లేదు. అంచేత అదే జగత్తుకి మూలమని చెప్పడం "అశబ్దం" అంటే వేదాలకి సమ్మతం కాదు. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్య అంశమేమిటంటే, ఈ మతాలన్నిటికీ కూడా వేదాలే ఆధారం. అంచేత ఈ వాదోపవాదాలన్నీ కూడా వేదాలని అనుసరించి జరిగేవే. వేదాలు ఒక common platform అన్నమాట!

ఇక రెండవ పాదంలో ఉన్నది అద్వైతము. ఇది "ఈశుడు ఏనె" అంటే, నేనే ఈశ్వరుడిని అని, జగత్తు కేవలం మాయ అని చెప్పే మతం. దీనిని "భోగమాత్ర సామ్య లింగాశ్చ" అనే బ్రహ్మసూత్రం చెప్పి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది బ్రహ్మసూత్రాలలో, నాలుగవ అధ్యాయంలో నాలుగవ పాదంలో ఇరవై ఒకటవ సూత్రం (4:4:21). దీని వివరణ ఏమిటంటే - ముక్తి పొందిన జీవుడు, కేవలం ఆనందానుభవంలో మాత్రమే పరమాత్మతో సమానుడవుతాడు అని వేదం ప్రతిపాదించిన విషయం. అంటే, జగత్ సృష్టిస్థితిలయాది శక్తులు ముక్తిపొందిన జీవాత్మకి సంభవించవు. అవి పరమాత్మకి మాత్రమే ఉంటాయి. ఆ విధంగా, జీవాత్మ పరమాత్మల మధ్య సంపూర్ణమైన అద్వైతం సంభవం కాదు.

మూడవ పాదంలో చెపుతున్న మతం మీమాంస. కర్మయే జీవికి సుఖదుఃఖాది ఫలాలను ఇస్తుందని యీ మతం చెపుతుంది. దానిని "ఫలమత ఉపపత్తేః" అనే బ్రహ్మసూత్రాన్ని చూపించి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది మూడవ అధ్యాయం రెండవ పాదంలో ముప్పై ఎనిమిదవ సూత్రం(3:2:38). కర్మఫలాన్ని ఇచ్చేది బ్రహ్మమే అని యీ సూత్రం చెపుతుంది.

నాల్గవది వైశేషిక దర్శనం. దీనిలోనిదే పీలువాదము, అంటే పరమాణువుల సంయోగముతో జగత్తు ఏర్పడుతుందని చెప్పే వాదము. ఈ మతం అనుమాన ప్రమాణాన్ని ఆధారం చేసుకుంటుంది. అనుమాన ప్రమాణం అంటే కార్య కారణ సంబంధాన్ని ఉపయోగించి సత్యాన్ని నిర్ణయించడం. ఉదాహరణకి దూరంగా కనిపించిన పొగనిబట్టి, అక్కడ నిప్పు ఉండి ఉండాలని నిర్ణయించడం (నిప్పుని ప్రత్యక్షంగా చూడకపోయినా). ఇది ఒక రకంగా ఇప్పటి హేతువాదానికి దగ్గరగా ఉంటుంది. ఈ మతాన్ని విష్ణుచిత్తుడు, "శాస్త్ర యోనిత్వాత్" అనే బ్రహ్మసూత్రం ఆధారంగా పరాస్తం చేసాడు. ఇది మొదటి అధ్యాయం మొదటి పాదంలో మూడవ సూత్రం. ఇందులో "శాస్త్రం" అంటే వేదం. వేదాలని పుట్టించినవాడు పరబ్రహ్మమని, అతడిని తెలుసుకోడానికి ఆ వేదాలే ఆధారమని యీ సూత్రం చెపుతుంది. కాబట్టి పరబ్రహ్మాన్ని గూర్చి తెలుసుకోడానికి వేదాలే ప్రమాణం కాని వైశేషికుల అనుమాన ప్రమాణం సరికాదని ఆ వాదాన్ని ఖండించాడు.

తరువాతది బౌద్ధమతం. సౌగతుడు అంటే బౌద్ధమతాన్ని అనుసరించేవాడు. బౌద్ధమత ప్రకారం జగత్తులోని సర్వ వస్తువులూ క్షణికాలు. వారిని క్షణికవాదులు అంటారు. బౌద్ధం నిరీశ్వర వాదం. ఈ వాదాన్ని కఠోపనిషత్తులోని "నిత్యో నిత్యానాం" అనే వాక్యంతో ఖండిచాడు విష్ణుచిత్తుడు. అంటే పరబ్రహ్మము నిత్యమైన వాటిలోకెల్లా నిత్యమైనది అని.

తర్వాతది చార్వాకమతం. ఇది కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తుంది. అంటే కనిపించేదే నిజమని నమ్మేది. ఇది ఒక రకంగా ఇవ్వాళ మనకి కనిపించే భౌతికవాదం అని అనవచ్చు. చార్వాకులు రాజే ఈశ్వరుడని అంటారు. ఈ మతాన్ని "అనుపపత్తేస్తు న శారీరః" అనే బ్రహ్మసూత్రంతో ఖండించాడు. ఈ సూత్ర సంఖ్య 1:2:3. జీవునికి ఉండే భౌతికమైన శరీరము బ్రహ్మమునకు ఉండదు అని చెపుతుంది. అందువల్ల బ్రహ్మాన్ని గురించి భౌతిక పరిశీలనతో తెలుసుకోవడం సాధ్యము కాదు. బౌద్ధ మతాన్నీ చార్వాకాన్నీ నాస్తిక మతాలుగా (అంటే వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకోనివి) భావిస్తారు.

ఈ విధంగా అక్కడున్న సమస్త మతాలవారి వాదములని విష్ణుచిత్తుడు ఖండించాడు. ఈ పద్యమంతా రాయలవారి తత్త్వ పరిజ్ఞానానికి అనుపమ నిదర్శనం. ఇందులో చూపించిన అన్యమత ఖండనమంతా శ్రీమద్రామానుజాచార్యులవారు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యాన్ని (దీనికి శ్రీభాష్యమని పేరు) ఆధారంగా చేసుకున్నదే. ఆరు మతాలనూ, వాటి ఖండన విధానాన్ని ఒకే పద్యంలో గుత్తెత్తించడం సామాన్య విషయం కాదు. విష్ణుచిత్తుడి చేత ఎలా ఆ వాదాన్ని జరిపించాడో, అలాగే రాయలవారి చేత ఆ విష్ణువే వ్రాయించాడేమో అనిపించేంత ఆశ్చర్యకరమైన విషయమిది!

శా. విద్వద్వందితుఁడాత డిట్లు సుఖ సంవిత్తత్వబోధైక చుం
చుద్వైపాయనసూత్రసచ్ఛ్రుతుల నీశున్ మున్ నిరూపించి, పైఁ
దద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశి
ష్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడెన్ బ్రమాణంబులన్


( ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం.. ఖరహరప్రియ )

విద్వాంసులచేత స్తుతించబడిన ఆ విష్ణుచిత్తుడు, యీ విధంగా సచ్చిదానంద రూపమైన పరమేశ్వరుని ఉనికిని బ్రహ్మసూత్రములూ శ్రుతి వాక్యముల ద్వారా ముందు స్థాపించి, తర్వాత ఆ పరమాత్మ యొక్క విష్ణుత్వమునూ ఆతనికీ ఇతర దేవతలకీ ఉన్న భేదమునూ తద్వారా విశిష్టాద్వైతమునూ ప్రమాణ పూర్వకంగా స్పష్టముగా బోధించాడు. ముందు అన్య మత నిరసనం చేసి తరువాత స్వమత స్థాపన చేసాడన్న మాట. విశిష్టాద్వైతాన్ని ఎలా స్థాపించాడో యీ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు.

సీ. ఆదినారాయణుండాయె నొక్కఁడ, బ్రహ్మ
లేఁడు, మహేశుండు లేఁడు, లేదు
రోదసి, లేఁడు సూర్యుఁఢు, లేఁడు చంద్రుండు,
లేవు నక్షత్రముల్, లేవు నీళ్లు,
లే దగ్ని; యట్లుండ 'లీల నేకాకిత
చనదు; పెక్కయ్యెద ననుచు నయ్యెఁ
జిదచిద్ద్వయంబు సొచ్చి' యని ఛాందోగ్యంబు
దెలిపెడు; నంతరాదిత్యవిద్య

తే. నర్కులోఁ బుండరీకాక్షుఁ డతఁడ యగుట
కక్షిణీయని యష్టదృక్ త్ర్యక్ష దశ
తాక్ష విధి రుద్ర శక్రాదులందు నొకఁడు
కామి కాశ్రుతియే విలక్షణతఁ దెలిపె




( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

సృష్టి ఆరంభంలో నారాయణుడొక్కడే అంతటా నిండి ఉండేవాడు. బ్రహ్మ, ఈశ్వరుడు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, అగ్ని.. ఏవీ లేవు. అట్టి పరిస్థితుల్లో, అంతటా నేనొక్కడనై ఉంటే లీల జరగదని, ఒక్కడినే అనేకమవుతాను అని సంకల్పించిన నారాయణుడు, చేతన అచేతన పదార్థాలలో ప్రవేశించి తానే బహురూపములయ్యాడు. ఛాందోగ్యంలోని అంతరాదిత్య విద్యలో తెలిపినట్టుగా సూర్యునిలో ఉన్న పుండరీకాక్షుడతడే! ఎనిమిది కన్నులున్న బ్రహ్మ, త్రినేత్రుడైన రుద్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు - వీరందరిలో ఒకడు కాడు, వారికంటే అతీతుడు. అందుకు ఛాందోగ్యం "అక్షిణి" అంటూ రెండు కన్నులున్నవానిగా పేర్కొనడమే నిదర్శనం. అంతేగాక ఈ సృష్టి అంతటా లోపల, వెలుపల తానే నిండివున్నాడన్న విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తు ఉద్ఘోషిస్తుంది.. కాబట్టి శ్రుతి విష్ణువే పరమదైవమని చెపుతున్నదని శ్రీవైష్ణవ మతాన్ని స్థాపించాడు.

ఈ పద్యంలో రాయలవారు అనేక ఉపనిషత్ వాక్యాలను తెనిగించారు. ఉదాహరణకి "ఆదినారాయణుండాయె నొక్కడు..." మొదలైనవి మహోపనిషత్తులోని యీ ఉక్తికి అనువాదం: "ఏకో హ వై నారాయణ ఆసీన్న బ్రహ్మా నేశానో నాపో న్నాగ్నీషోమౌ నేమే ద్యావా పృథివీ న నక్షత్రాణి న సూర్యో న చంద్రమాః". అలాగే ఛాందోగ్యోపనిషత్తులో "త దైక్షత బహు స్యాం ప్రజాయేయేతి..." అనే వాక్యం - "లీల ఏకాకిత చనదు పెక్కయ్యెదననుచు..." అన్నదానికి మూలం.
మనకి ఉపనిషత్తులలో మొత్తం 32 బ్రహ్మవిద్యలు ఉన్నట్టుగా పండితులు గుర్తించారు. అందులో అంతరాదిత్య విద్య ఒకటి. బ్రహ్మవిద్య అంటే పరబ్రహ్మమును తెలుసుకొనే మార్గాన్ని బోధించేది. అది అంత సులభ వంటబట్టే విద్య కాదు. అందుకే "అదొక బ్రహ్మవిద్యా!" అన్న నానుడి వచ్చింది (ఇంగ్లీషులో It is not a rocket science అన్నట్టుగా). "యెయేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుషాః" అని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది అంతరాదిత్య విధ్య. సూర్యమండల మధ్యంలో హిరణ్మయ (బంగారపు కాంతులతో ప్రకాశించే) పురుషుడిని ఉపాసించే విద్య యిది. ఆ పురుషుని గురించి వివరిస్తూ, "తస్య యదా కప్యాసం ఏవమక్షిణి" అని ఆ ఉపనిషత్తు చెపుతుంది. అంటే, సూర్యునిచేత అప్పుడే వికసింపబడిన పద్మాల వంటి నేత్రద్వయం కలిగినవాడు అని.

ఇంకా అనేక వేదోపనిషత్ వాక్యాల ఆధారంగా సర్వమునకు పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని నిరూపించాడు విష్ణుచిత్తుడు. అంతే కాదు, బ్రహ్మరుద్రాదులు ఆయా సమయాలలో కొన్ని ప్రయోజనాల కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన రూపాలే కనుక ధర్మార్థకామాలని కోరే వారు తప్ప, మోక్షం కావాలనుకున్న వారికి వారినారాధించటం కర్తవ్యం కాదని నిర్ధారణ చేసాడు. ముముక్షువు (ముక్తిని ఆకాంక్షించేవాడు) పరమాత్ముడైన పుండరీకాక్షుని ఆశ్రయించక తప్పదని తేల్చి చెప్పాడు.

ఇలా విశిష్టాద్వైతాన్ని స్థాపించిన అనంతరం, ఆ పరమాత్మ అయిన నారాయణుని ఎలా తెలుసుకోవడమో తెలియజెప్పే ఖాండిక్య-కేశిధ్వజ సంవాదమనే కథని చెపుతున్నాను వినమని ఆ కథని చెప్పడం ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.
ఖాండిక్య-కేశిధ్వజుల కథ తరువాతి టపాల్లో...

Monday, July 11, 2011

ద్వితీయాశ్వాసం - సింహావలోకనం

ఇప్పటికి ఆముక్తమాల్యద రెండు ఆశ్వాసాలు పూర్తయ్యాయి. విలిబుత్తూరులో పరమవైష్ణవ భాగవతుడైన విష్ణుచిత్తుని పరిచయం జరిగింది. విలిబుత్తూరు ఏ రాజ్యంలో అయితే ఉన్నదో ఆ పాండ్యరాజ్య రాజధాని మధురానగరము, ఆ రాజ్యాన్ని ఏలే పాండ్యరాజు మత్స్యధ్వజుడూ కూడా పరిచయమయ్యారు. మత్స్యధ్వజుడు సామాన్యమైనవాడు కాదు. రాజనీతి ధురంధరుడు. ధీరుడు, ఉదాత్తుడు, వినయశీలి. రామునిలా సముద్రంపై సేతువుని నిర్మించిన రాజు. పరాక్రమంలో ఇంద్రుని మించినవాడు. మంత్రశక్తి కలవాడు. విలాసపురుషుడు. అలాంటి ఆ రాజు ఒకనాటి రాత్రి తన భోగిని వద్దకు వెళుతూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగుతుంది. అవి వేసవి రోజులు. మధురానగరం సమీపంలో ఉన్న వృషభగిరి అనే విష్ణుక్షేత్రంలో తెప్ప తిరుణాళ్ళు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలు చూడ్డానికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు, తిరుగు ప్రయాణంలో మధురానగరం చూడ్డానికి వస్తాడు. రాజపురోహితుని ఇంట విడిది చేసి, రాత్రి ఫలాహారము తీసుకున్నాక అరుగు మీద పడుకొని తోటి పండితులతో శ్లోకాలు గీతాలు మొదలైనవి చదువుతూ ఉంటాడు. అతను చదివిన ఒక శ్లోకం, ఆ తోవనే వెళుతున్న పాండ్యరాజు చెవిన పడుతుంది. దానితో రాజుకి మనసులో వైరాగ్యభావం ఉదయిస్తుంది. తానిన్నాళ్ళూ ఇహలోక భోగాలలో పడి పరాన్ని గూర్చి మరిచిపోయానన్న జ్ఞానం కలుగుతుంది. ధర్మార్థకామాలనే వర్గత్రయమే ప్రధానంగా జీవితాన్ని సాగిస్తే, జననమరణ చక్రంనుండి విముక్తి లేదని తెలుసుకుంటాడు. మోక్షాన్ని సాధించే మార్గమేదో తెలుసుకోవాలనుకుంటాడు. ఏ దేవుడిని కొలిస్తే మోక్షం లభిస్తుందన్న విషయాన్ని తేల్చడానికి రాజసభలో పెద్ద చర్చ మొదలుపెడతాడు. పండితులు ఎవరికి తోచినట్లు వారు వాదిస్తారు కాని ఏదీ తేలదు. అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి విష్ణుచిత్తునికి ప్రత్యక్షమై అతడినా రాజసభకు వెళ్ళి తన మహిమని చాటి వాదంలో గెలిచి విరక్తుడైన పాండ్యరాజుని వైష్ణవునిగా మార్చమని చెపుతాడు. సందేహించిన విష్ణుచిత్తునికి తాను వెనకన ఉండి అంతా నడిపిస్తాననే భరోసా యిచ్చి ఒప్పిస్తాడు. ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను కూడా ఆలయ పూజారి ధర్మకర్తల ద్వారా విష్ణువే చేయిస్తాడు. విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభకి ప్రయాణమవుతాడు.


ఇదీ ఇప్పటి వరకూ జరిగిన కథ. ఒకసారి ఈ రెండు ఆశ్వాసాలు సింహావలోకనం చేస్తే, ఆముక్తమాల్యదలో వర్ణనలది సింహభాగమని అనిపించక మానదు. అది నిజమే కూడా. కావ్యరచనలో ఒకో కవిదీ ఒకో ప్రత్యేక శైలి. రాయలకి కథని బిగువుగా నడిపించడం మీద దృష్టి లేదు. అనంతమైన తన ఊహశక్తికి రూపాన్నివ్వడమూ అనేక తాత్త్విక రాజనైతిక విషయాలని వివరించడమూ మొదలైన వాటిపైననే అతనికి మక్కువ ఎక్కువ. ఆముక్తమాల్యదలో మనకి అదే దర్శనమిస్తుంది. అయితే అందులో తనదైన ప్రకర్షని విశిష్టతని చూపించగలిగాడు కాబట్టే అది ఒక మంచి కావ్యంగా నిలిచింది. ఉదాహరణకి మధురాపుర వర్ణనలో భాగంగా ఉన్న చతుర్వర్ణాల వర్ణనని మనుచరిత్రలో అదే వర్ణనతో పోల్చి చూస్తే రాయల విలక్షణత స్పష్టంగా తెలుస్తుంది. మనుచరిత్రలో ఇలా ఉంటుంది:

అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు

ఇది పెద్దన దృష్టి. ఇంచుమించు ఆ కాలంలోని ఇతర కవుల దృష్టి కూడా ఇదే. విప్రులు మహాపండితులు. రాజులు గొప్ప పరాక్రమవంతులు. వైశ్యులు అధిక ధనవంతులు. శూద్రులు సస్యసంపదలో సమృద్ధులు. వారి వర్ణనలో అతిశయోక్తులే ఎక్కువ. రాయల దృష్టి మరికొంత విపులమైనది. మరింత వాస్తవికమైనది. ఇతను వర్ణించిన బ్రాహ్మణులు పరమ నిష్ఠాగరిష్ఠులు, వేదనిధులు, నిత్యాగ్నిహోత్రులు. ఎవరి ముందూ చేయిచాపని ఆత్మగౌరవ సంపన్నులు. అలాగే క్షత్రియులు వీరులే కాదు, సదాచారపరులు. దానవ్రతులు. సాముగారడీ వంటి విద్యల్లో ఆరితేరినవారు. వైశ్యులు కూడా, ధనవంతులే కాదు ఏ మాత్రమూ గర్వము లేకుండా నిరంతరమూ దానం చేసేవారు. రైతుల ధాన్యరాసులు రాజ్యవైభవానికి కారకమైనవి. ఈ వర్ణనలో కేవలం ఆయా వర్ణాలవారి వ్యక్తిగత గుణగణాలే కాక, అవి సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడతాయో కూడా మనకి స్పష్టమవుతుంది. అది రాయలవారి ప్రత్యేక దృష్టి.


రాయలవారి వర్ణనలన్నీ కూడా విలక్షణమైనవే. సామాన్య జనజీవితాన్ని వర్ణనలలో చిత్రీకరించడం రాయలవారి విశిష్టత. ఆముక్తమాల్యదలో కనిపించేటంత సామాజికచిత్రణ మరే ఇతర సమకాలీన కావ్యంలోనూ మనకి కనిపించదు. ద్వితీయాశ్వాసంలో సూదీర్ఘమైన గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకిది కనిపించింది కదా. అసలీ సామాజిక చిత్రణ కోసమే ప్రత్యేకంగా రాయలు అంతటి సుదీర్ఘ వర్ణనలకి పూనుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది! జానపద గేయాలు, ఏతాములు, నీటికి తడిసిన మట్టివాసన, ఆ వాసనకి తోడు రాలిన పాదిరి పూల పరిమళం, మామిడిముక్కల తాలింపుతో చేసిన చేపల కూర, ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలు - ఇలా ఎన్నెన్నో జానపదుల బతుకు చూడికలు మనకా వర్ణనల్లో కనిపిస్తాయి. రాయల దృష్టి మనుషులతో ఆగిపోదు. కొంగల గుంపులు బొమ్మిడాయులని తినడం, ఎఱ్ఱచీమలు గుడ్లను మోస్తూనే ఆహారాన్ని సేకరించడం మొదలైన వాటిని కూడా సునిశితంగా పరిశీలిస్తుంది! అంతేకాదు, రాయల దృష్టి ఎంత నిశితమో అతని ఊహ అంత విశాలం! అది కూడా గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకి కనిపిస్తుంది.


అతివృష్టిన్ మును వార్ధి గూర్చు నెడకాడౌటం దమిం గూర్చునన్
మతి లంచంబుగ హేమ టంకములు మింటం బొల్చు పర్జన్య దే
వత కీ నెత్తిన కేలనా బొలిచె నిర్వారిస్రవంతిన్ బయ
శ్చ్యుతి నమ్రచ్ఛద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్

వేసవికాలంలో ఏరులన్నీ ఎండిపోయాయి. అక్కడక్కడ ఉన్న బురదలో వాడిపోయిన తామర తూళ్ళు పైకి వచ్చి వేలాడుతున్నాయి. పువ్వుకున్న రేకులు వడలి వాలిపోవడంతో మధ్యనున్న పసుపుపచ్చని దుద్దులు (కర్ణికలు) స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం ఎలా ఉన్నదంటే - వర్షాకాలంలో తమని (నదులని) తమ చెలికాడైన సముద్రునితో జతగూర్చే పర్జన్య దేవతకి త్వరగా వచ్చి కరుణించమని చేతులెత్తి మొక్కుకుంటూ, బంగారు నాణాలు లంచంగా ఇవ్వబూనుతున్నాయా అన్నట్టుగా ఉందిట! వాడిపోయిన సన్నని తామరతూళ్ళు చేతులు. పసుపుప్పచ్చని దుద్దులే బంగారు దీనారాలు. అదీ కృష్ణరాయని ఊహ! పైగా ఈ పద్యం వల్ల రాయల కాలానికే "లంచం" అన్న పద్ధతి ఉన్నదని కూడా మనకి తెలుస్తోంది (బహుశా, మొట్టమొదట తిక్కన భారతంలో కనిపిస్తుందీ "లంచం"!).


వట్టి వర్ణనలే కాకుండా, ప్రధానకథకి బీజం పడింది కూడా ద్వితీయాశ్వాసంలోనే అని గమనించవచ్చు. పాండ్యరాజ సభలో విష్ణుచిత్తుని వాదన, అతని విజయము, ఆ తరువాత జరిగే కథాక్రమానికంతా ద్వితీయాశ్వాసంలోనే విత్తు నాటుకుంది. అంతే కాదు, ఈ కావ్య కథానాయకుడైన విష్ణుమూర్తి నేరుగా కావ్యంలోకి ప్రవేశించింది కూడా యీ ఆశ్వాసంలోనే! ఆముక్తమాల్యద కావ్య నాయకుడు విష్ణువా విష్ణుచిత్తుడా అని సందేహం రావచ్చు. కావ్య సంప్రదాయాన్ని అనుసరించి విష్ణుమూర్తే నాయకుడవుతాడని విమర్శకులు తేల్చారు. ఎందుకంటే ఆముక్తమాల్యద కావ్యంలో ప్రధానకథ గోదా కల్యాణం. గోదాదేవి నాయిక. కాబట్టి ఆ రంగనాథుడే నాయకుడు. పైగా, విష్ణుచిత్తుడు ఏమి చేసినా అది స్వామి ఆదేశంతోనూ అనుగ్రహంతోనే కాబట్టి అతడు నాయక స్థానానికి అర్హుడు కాదు. కావ్యాలలో కూడా అనేక రకాలున్నాయి. పారిజాతాపహరణము వసుచరిత్ర వంటి కావ్యాలలో నాయకుడెవరన్నది సుస్పష్టం. అలాంటి కావ్యాలలో మొత్తం కథంతా ఒకే సూత్రమ్మీద నడుస్తుంది. కాశీఖండం, పాండురంగమాహాత్మ్యం వంటి స్థలపురాణ ప్రధానమైన కావ్యాలలో ప్రత్యేకంగా నాయకుడని ఎవరూ ఉండరు. కథలో ఏకసూత్రత కూడా ఉండదు. అనేక కథల సమాహరంగా ఉంటాయి. మనుచరిత్ర, ఆముక్తమాల్యద వంటి కావ్యాలు వేరే తరహాకి చెందినవి. ఇటువంటి కావ్యాలలో అనేక కథలుంటాయి కాని, అవి ఒకే గమ్యం దిశగా సాగుతాయి. ఒకో కథలో ఒకో పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఇటువంటి కావ్యాలలో నాయక నిర్ణయం కొద్దిగా కష్టమవుతుంది. అంతిమ గమ్యాన్ని గమనించి, కథలలో ఉన్న ఏకసూత్రతని గుర్తించడం ద్వారా నాయకుడెవరన్నది నిర్ణయించాలని విమర్శకుల మతం. ఆ దృష్టితో విచారిస్తే ఆముక్తమాల్యద నాయకుడు విష్ణుమూర్తి అన్నది స్పష్టమవుతుంది.


విష్ణువు నాయకుడు కావడం వల్లనే, తనే స్వయంగా పూనుకొని విష్ణుచిత్తుని పాండ్యరాజు దగ్గరకి ప్రయాణం కట్టించాడు. విష్ణుమహిమ చేతనే అక్కడ సభలో విష్ణుచిత్తుడు వాదంలో విజయం సాధిస్తాడు. విష్ణుచిత్తుడు చేసిన చర్చ ఏమిటి, అతను వాదంలో ఎలా గెలిచాడన్నది తృతీయాశ్వసంలో మనం చూడబోతున్నాము. ఇందులో చాలా గాఢమైన ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. లోతైన విచారణ అవసరమవుతుంది. దానికోసం సిద్ధం కండి!

Saturday, July 2, 2011

మధురానగర ప్రయాణము - ద్వితీయ ఆశ్వాసాంతం

పాండ్యరాజు కొలువులో పండితులు ఏ దైవాన్ని పూజిస్తే ముక్తి కలుగుతుందన్న విషయంపై వాదన జరుపుతూ ఉన్నారు. అయితే వాదనలు చేసారే కాని ఎవ్వరూ ఏదీ తేల్చి చెప్పలేకపోయారు. ముక్తి మార్గాన్ని ఆశ్రయించిన ఒక పరమ భక్తుడికే అది సాధ్యమవుతుంది. అది విష్ణుచిత్తుడి వలన జరగవలసిన కార్యం. అతనెక్కడో విల్లిపుత్తూరులో స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాడు. అతనిక్కడికి ఎలా ఎందుకు వస్తాడు. అతణ్ణి రప్పించడానికి స్వయంగా విష్ణుమూర్తే పూనుకున్నాడు!

తే. విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుఁ

డతుల తులసీసుగంధిమాల్యమును మూల

మంత్రమున నక్కుఁ జేర్చుచో మన్ననా రు

దారమధురోక్తి నవ్విధ మానతిచ్చి.



విల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుడు అష్టాక్షరి అనే మహామంత్రమైన మూలమంత్రాన్ని జపిస్తూ శ్రేష్ఠమైన, పరిమళభరితమైన తులసీదళాలతో చేసిన మాలతో స్వామివారి వక్షస్ధలాన్ని అలంకరిస్తుండగా ఆ మన్నారు స్వామి గంభీరంగా ఈ విధంగా ఆనతినిచ్చాడు..


ఉ. నేఁడు మహామతీ! మధుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం

డీఁడు దివాణము న్నెఱయ నించినఁ బ్రేలెడు దుర్మదాంధులన్

బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్

వాఁడును రోసినాఁ డిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్.




మహాబుద్దిశాలి అయిన విష్ణుచిత్తుడా! నీవు ఈరోజే మధురకు ప్రయాణము కట్టి అక్కడి పాండ్యరాజు యొక్క కొలువులో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న దుర్మదాంధుల గర్వమణచి నా మహిమలను గురించి తెలియజేసి విజయశుల్కాన్ని తీసుకో.అలాగే ఈ లోకముపై విరక్తి కలిగిన పాండ్యరాజును ఉత్తముడైన వైష్ణవుడిగా మార్చుము అని మన్నారుస్వామి ఆదేశించాడు.

సభలోని పండితులని పట్టుకొని దుర్మదాంధులనే పెద్దమాట ఎందుకన్నాడు మన్నారుస్వామి? వారు భగవత్ తత్త్వం నిజంగా తెలుసుకోకుండానే తమకి తెలుసునని అహంకరిస్తున్నారు కాబట్టి. అలాంటి అహంకారం వల్ల వాళ్ళు నిజంగా ఆ దైవాన్ని తెలుసుకోలేక పోతున్నారని. అంటే భక్తులకి తప్ప పండితులకి భగవంతుని గురించి తెలియదని ఆముక్తమాల్యద నిశ్చయం. ఇది విశిష్టాద్వైత మతం.


తే. అనిన వడవడ వడఁకి సాష్టాంగ మెఱఁగి

సమ్మదాశ్రులు పులకలు ముమ్మరింప

వినయవినమితగాత్రుఁడై విప్రవరుఁడు

వెన్నునకు భక్తి నిట్లని విన్నవించె.





తను నిత్యం కొలిచే దైవం ఒక్కసారిగా ప్రత్యక్షమై తనతో మాట్లాడితే, అదీ తను కలలో కూడా ఊహించని విషయాన్ని గురించి చెపితే ఆ భక్తుని పరిస్థితి ఎలా ఉంటుంది. అప్పటి విష్ణుచిత్తుని స్థితిని వివరిస్తున్న పద్యం. మన్నారుస్వామి మాటలు విన్న విష్ణుచిత్తుడు గడగడ వణికిపోయాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. పులకించిపోయాడు. సాష్టాంగ ప్రణామము చేసాడు. బ్రాహ్మణోత్తముడైన విష్ణుచిత్తుడు ఆ విష్ణవుకు, వినయంతో , భక్తితో ఈ విధంగా విన్నవించాడు.


శా.స్వామీ! నన్ను నితఃపురాపఠితశాస్త్ర గ్రంథజాత్యంధు, నా

రామక్ష్మాఖననక్రియా ఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ

స్తోమాస్నిగ్ధ కరున్, భవద్భనదాసు, న్వాదిఁగాఁ బంపుచో

భూమీభృత్సభ నోట మైన నయశంబు ల్మీకు రాకుండునే?




స్వామీ! నేను ఇంతవరకూ ఏ గ్రంధమూ చదవక జ్ఞానములో పుట్టుగుడ్డివాడిని (ఇతః పురా అపఠిత శాస్త్రగ్రంథున్).

ఆరామ క్ష్మా ఖననక్రియా ఖర ఖనిత్ర ఉద్యత్ కిణ స్తోమ అస్నిగ్ధ కరున్ - నిత్యం పూలతోటలో భూమిని గునపముతో తవ్వుటవలన కాయలు కాచిన బిరుసైన చేతులు కలిగినవాడిని. నీ కోవెలకు సేవకుడిని. అలాంటి నన్ను రాజాస్దానములో వాదనకు పంపుతున్నావు. అక్కడ అజ్ఞానుడనైన నా మూలంగా గెలుపు లభించక ఓటమి కలిగినచో ఆ అపకీర్తి నీకే కదా ... అని వాపోయాడు విష్ణుచిత్తుడు.


మ. గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా

వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ

గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ప్రాగ్దీపికారోపమో,

నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్





"స్వామీ .. మీ కోవెల శుభ్రపరచడమో, తీర్ధము తేవడమో, దేవరవారు విలాసానికి ఊరేగే పల్లకీ మోయడమో, తులసీదండలు కట్టి అలంకరించడమో, గరుత్మంతుని బొమ్మగల ధ్వజము మోయడమో, విసనకఱ్ఱ, గొడుగు మొదలైనవి పట్టుకోవడమో, నీ గుడిముంధు దీపం పెట్టడమో - ఇలాంటి పనులైతే నేను చెయ్యగలను కాని వాదానికి వెళ్ళమంటావేమిటి! నీ లీలకి వేరే ఎవరూ తగినవారే దొరకలేదా!" అని విన్నవించుకుంటున్నాడు విష్ణుచిత్తుడు. వాల్లభ్యము అంటే గరుత్మంతుని గుర్తుగల జెండా. దీన్ని పట్టుకోడం పరమ భగవద్దాసులకే లభించే అనుగ్రహ విశేషం). ఈ పద్యంలో వర్ణించిన పనులన్నీ స్వామికైంకర్యంలో భాగం. శ్రీవైష్ణవంలో ఇది పరమ సేవగా భావింపబడింది. "నీ లీల" అన్నాడు కాబట్టి, వాదన చేసేది ఎవరైనా చేయించేది విష్ణువే అన్న జ్ఞానం విష్ణుచిత్తునిలో పరిపూర్ణంగా ఉంది. ఆ జ్ఞానమే ఇతర పండితులలో లోపించింది. అందుకే విష్ణువు విష్ణుచిత్తుణ్ణి ఎన్నుకున్నది.


తే. అనినఁ దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు

మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి

'వా దితనిచేత గెలిపింతు: నాదుమహిమ

మువిద కను' మని ప్రాభవం బొప్పఁ బలికి.





విష్ణుచిత్తుడి మాటలు విన్న శ్రీహరి అతని భక్తికి మెచ్చుకొని చిరునవ్వుతో తన దేవేరి లక్ష్మీదేవి మోమును చూసి దేవీ నా మహిమతో పాండ్యరాజు కొలువులో ఈ విష్ణుచిత్తుని వాదమున గెలిపిస్తాను చూడుము అని మరొక్కమాట ఆనతినిచ్చాడు . "మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి" - ఎంత సొగసైన వాక్యం!

ఇంతకీ హఠాత్తుగా లక్ష్మీదేవి ఎక్కడనుండి వచ్చింది? ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకంటే కావ్యంలోని మతం శ్రీవైష్ణవం. అంటే ఇందులో విష్ణువు ఎల్లెప్పుడూ లక్ష్మీదేవితోనే ఉంటాడు. ఉంటుంది సరే, మరి కవి ఈ మాటలు విష్ణుమూర్తి చేత లక్ష్మీదేవితో ఎందుకు చెప్పించాడు? ఎందుకంటే ఈ కావ్యంలో నాయకుడు విష్ణువే కాబట్టి. విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో వాదనలో గెలవబోతున్న గెలుపు నిజానికి నాయకుడైన విష్ణుమూర్తిదే. ఇదొక రకంగా అతని జైత్రయాత్ర సన్నాహం. నాయికతో తన ప్రభావాన్ని గూర్చి, గెలుపు గూర్చి నాయకుడు పలకడం వీర రసపోషకం.


క. నీయిచ్చయె? మిన్నక పో

వోయి, మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ

నాయకసభ, నిందులకై

యేయడ్డము వలవ దవల నే నున్నాఁడన్




ఇవి కూడా వీరుని ప్రతాపాన్ని పలికించే మాటలే. "ఓ మునిశ్రేష్ఠుడా! ఇందులో నీ యిష్టంతో పనేముంది? నీవు మారు మాటాడక పాండ్యరాజు సభకు వెళ్లు. నిన్నా సభలో ఒప్పించి (గెలిపించి) తీరుతాను. దానికి అడ్డుచెప్పకు. అన్నిటికీ నేనున్నానుగా.", అని పలికాడు మన్నారుస్వామి. శ్రీవైష్ణవంలో ప్రపత్తియోగం అంటారు దీన్ని. భగవంతుని శరణు అని అతని ఆనతి చొప్పున నడుచుకోడమే ప్రపత్తి యోగం. దాని లక్షణమే ఈ పద్యంలో చెప్పబడింది.


ఇంకేముంది, స్వామి అలా ఆనతిస్తే భక్తుడు శిరసావహించ వలసిందే కదా. మధురానగర ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. అంత దూరం ప్రయాణం, అక్కడ బస - ఈ ఏర్పాట్లన్నీ చూసుకోమని ఆ గుడి పూజారికి మన్నారుస్వామే ఆనతిచ్చాడు. ఆ పూజారి మాట మేరకు ఆలయ పారుపత్తేదారు (ధర్మకర్త వంటివాడు) గుడి భాండాగారం నుండి కావలసినంత సంబడం (దారి ఖరుచు), తన పల్లకీని విష్ణుచిత్తునికి ఇచ్చాడు. ప్రయాణాన్ని ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.


సీ. భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి

కట్టిన పొరివిళంగాయ గమియు

నెసటిపోఁతలు గాఁగ నేర్పరించిన చిరం

తనపు శాలిక్షేమతండులములు

వడిఁబెట్టి లోఁ జెఱకడము సాఁబా లూన్పఁ

జెలఁగు సంబారంపుఁ జింతపండు

పెల్లు లోహండి కావళ్ల కొమ్ముల వ్రేలు

గిడ్డిమొత్తపు నేతిలడ్డిగలును



బెరుఁగువడియంబులును, బచ్చివరుగు, బేడ,

లురుతరాచ్యుతపూజోపకరణపేటి

కలును, చాత్తిన చాత్తని కులము బలసి

విధినిషేధము లెఱిఁగి తే మధుర కరిగె.



భర్త ఇతర ప్రదేశాలకు ప్రయాణం కట్టినప్పుడు అతని ఇల్లాలు ఎటువంటి లోటు రాకుండా అన్నీ అమర్చి పెడుతుంది. ముఖ్యంగా భోజన సామగ్రి. అదే విధంగా మన్నారుస్వామి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణం కట్టగా సాద్వీమణియైన ఆతని ఇల్లాలు దారికి అవసరమైన తిండి పదార్థాలు వగైరా జాగ్రత్తగా కట్టి ఇచ్చింది. అవి ఏంటి అంటే...

1. మూటగట్టిన పొరివిళంగాయగములు - ఈ పదార్ధములు ఏంటి? ఎలా ఉంటాయి?? దారిలో తినడానికి అంటే వెలగపండులాంటివి ఐతే కావు. మన నిఘంటువులు 'పొరి'పదానికి వండిన శాకము లేదా కూర అని చెప్తున్నాయి. తమిళంలో కూరను పారి అంటారు. కన్నడంలో 'పురి' అంటారు. ఆచార్య లంకసాని చక్రధర రావుగారు తెలుగు వ్యత్పత్తికోశంలో 'పారు' లేదా 'పొరి విళంగాయ'ని పెసరపిండి, పంచదార కలిపి తయారు చేసిన ఒక తీపి పదార్ధం అని అర్ధం చెప్పారు. 11వ శతాబ్దినాటి కన్నడ మానసోల్లాస గ్రంధంలో 'పురి విళంగాయ'లను మరమరాలు లేదా బొరుగులు, వేయించిన పెసరపప్పు, బెల్లం పాకంలో ఉడికించి చేసే ఉండలు అని చెప్పారు.

2. ఎసటిలో పోసి వండుకోడానికి వీలుగా శుభ్రపరచిన పాత బియ్యము

3. నలుసులు వగైరా లేకుండా శుభ్రం చేసిన జీలకర్ర, బెల్లము, తగువిధముగా దినుసులు కలిపి దంచిన చింతపండు

ఇంకా కావళ్ల కొనలయందు ఆవునేతితో నింపిన చిన్న మూతికల పిడతలను వ్రేలాడగట్టి, పెరుగు వడియాలు, వరుగులు, చాయపప్పు ఉన్నాయి. ఆ ఇల్లాలు తాను వెంట లేకున్నా భర్తకు ఎటువంటి లోటు కలగకుండా ఈ సంభారాలు ఇచ్చింది. ఇవియే కాక విష్ణుపూజకు కావలసిన పరికరములు మొదలైనవి ఉంచిన పెట్టెలను బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తాదులు ఎవ్వరెవ్వరేమేమి తేవడానికి అర్హులో ఆయా వస్తువులు తీసుకొస్తుండగా ఆ విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణమయ్యాడు. (ఇక్కడ చాత్తిన, చాత్తని అనే పదప్రయోగం గురించి తెలుసుకుంటే .. చాత్తినవారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివి భగవతుని సన్నిధిలో అర్పించిన బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తనివారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివినా కూడా భగవంతుని సన్నిదిలో అర్పణచేసే అధికారం లేని ఇతర వర్ణ వైష్ణవులు.. )



ఇంతటితో ద్వితీయాశ్వాసం కథ ముగిసింది. ఇక ఆశ్వాసాంత పద్యాలు.


చ. యమనియమాదిలభ్య, ద్రుహిణాది జరన్మరుదిభ్య, సంసృతి

శ్రమహరనామకీర్తన, మురప్రవికర్తన, పాతకావలీ

దమన, రమాంగనాకమన, తామరసాయతనేత్ర, భక్త హృ

ద్ర్భమతృణదాత్ర, భూయువతి రంజన, వర్ణ జితాభ్రఖంజనా!




రాయలు ఆ దేవదేవుని ప్రార్ధనతో ఈ ఆశ్వాసం ముగిస్తూ ఆ మన్నారుస్వామిని వేనోళ్ల స్తుతించాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ,సమాధులనే అష్టాంగ యోగములచే పొంద సాధ్యమైనట్టివాడా, బ్రహ్మాది ముసలి దేవతలకు కూడా ప్రభువైనట్టివాడా, జనన మరణాది రూప సంసారమందలి శ్రమను హరించే నామసంకీర్తనము గలవాడా, మురాసురిని ఖండించినవాడా, పాపసమూహమును హరియించువాడా, లక్ష్మీదేవికి ప్రియమైనవాడా, తామరరేకులవంటి విశాలమైన నేత్రములు గలవాడా, భక్తజన హృదయములలోని అజ్ఞానమన్న గడ్డిని కోయు కొడవలివంటివాడా, భూమియను స్త్రీని సంతోషపెట్టువాడా, నిజదేహకాంతిచే మేఘాలను గెలిచి వాటి కాంతిని కాటుకగా ధరించినవాడా అని శ్రీహరిని స్తోత్రం చేసాడు.


మాలిని.

ద్రుహిణజముఖమౌని స్తోమ నిస్తంద్ర భాస్వ

ద్దహరవిహరమాణాతామ్ర పాదాంబుజాతా

బహిర బహిరపార ప్రాణికోటి ప్రపూర్ణా!

మహిమ వినుత వాణీ మాధురీ వేద్యపర్ణా.




బ్రహ్మవలన పుట్టిన నారదుడు మొదలైన మునిబృందముయొక్క హృదయమనే ఆకాశంలో విహరిస్తున్న ఎఱ్ఱని కమలములవంటి పాదములు కలవాడా! లోపలా బయటా అంతటా అనంతమైన జీవసముదాయంతో నిండినవాడా! ఎవరి మహిమను సరస్వతి గానం చేస్తూంటే ఆ మాధుర్యానికి పార్వతి సంతోషిస్తున్నదో, అలాంటి శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తున్నాడు రాయలు.


మ. ఇది భూమండన కొండవీడుధరణీభృద్దుర్గపూర్వాద్రి భా

స్వదిభేశాత్మజ వీరభద్రజన జీవగ్రాహ రాహూయమా

ణ దృఢాంచద్భుజ కృష్ణరాయమహిభృన్నామాస్మదాము క్తమా

ల్యద నాశ్వాసము హృద్యపద్యము ద్వితీయంబై మహిం బొల్పగున్.



ఆముక్తమాల్యదలో ఇది రెండవ ఆశ్వాసం. అది హృద్యపద్యాలతో శోభిస్తున్నది. దాని కర్త శ్రీకృష్ణదేవరాయలన్న పేరుగల చక్రవర్తి. ఆ రాయలు, కొండవీడూ ఉదయగిరి దుర్గాలకి ఏకిక అయిన వీరభద్రగజపతి సేనల ప్రాణాలని రాహువులా తన ప్రకాశించే దృఢమైన బాహువులతో గ్రహించినవాడు.
===

ఈ టపాలోని పద్యాలన్నీ లంకా గిరిధర్ స్వరంలో ...
Related Posts Plugin for WordPress, Blogger...