తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, March 2, 2011

గ్రీష్మం

మధురాపుర వర్ణన అయింది. మహారాజు మత్స్యధ్వజుని పరిచయం అయ్యింది. అమిత వైభోగంతో ఆ పాండ్యరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి రాజుతో పరమ భాగవతుడైన విష్ణుచిత్తునితో పరిచయం ఎలా సంఘటించబోతోంది? శృంగార పురుషుడయిన పాండ్యరాజుకి భక్తి ఎలా జనిస్తుంది? వసంతకాలం శృంగార రసబంధురం. దాన్ని విరిచేది గ్రీష్మం. అలాంటి గ్రీష్మం అప్పుడు ప్రవేశించింది. ఎండల తీవ్రత హెచ్చరిల్లింది. ఆ వేసవి కాలాన్ని సుమారు డెబ్భై పద్యాలలో మహాద్భుతంగా వర్ణించాడు రాయలు. అందులో కొన్నిటిని మాత్రం రుచిచూద్దాం. ఈ వర్ణనల్లో ఎంత ఊహవైచిత్ర ఉంటుందో అంత సహజ సామాజిక చిత్రణ ఉంటుంది.

తే. పాటల వసుంధరారుహ భాగధేయ

మాతతమరీచికాంబువర్షాగమంబు

ధరణిఁ బొడసూపె నంత నిదాఘసమయ

మదుటుతో శాల్మలీఫల విదళనంబు



(ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో)

వేసవి కాలం ఉద్ధతితో వచ్చింది. అది ఎలాంటిదంటే, పాదిరి చెట్లను చెట్ల పాలిటి అదృష్టదేవత. ఎండమావులనే నీటికి వర్షాకాలాము., బూరుగుకాయలని పగులకొట్టేది. వేసవి రాకతో పాటల వృక్షాలు పుష్పించడం, ఎండమావు లేర్పడటం, బూరుగుకాయలు పగిలిపోవడం సహజంగా జరిగే పరిణామాలు.

మ. దవధూమంపుఁదమంబులోఁ దమరస ద్రవ్యంబుఁ బంకేజబాం

ధవభానుప్రతతుల్ హరింపఁ గుయివెంటన్వెళ్లు శూన్యోరుకూ

ప వితానం బనఁ జూడఁజూడఁ బుడమిన్‌ బాటిల్లి పైవిప్పులై

యవసం బంచుల నాడఁగా నెగసె వాత్యాళి న్రజశ్చక్రముల్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

వేసవిలో సుడిగాలులు (వాత్యాళి) రేగుతున్నాయి. ఆ సుడిగాలుల్లో చిక్కిన దుమ్ము గుండ్రంగా తిరుగుతూ పైగి ఎగురుతోంది, అవే రజశ్చక్రములు. అలా ఎగురుతున్న ఆ ధూళి చక్రాలు ఎలా ఉన్నాయంటే, ఎండిపోయిన పెద్ద పెద్ద బావులు మెల్ల మెల్లగా పైకెగిరిపోయున్నాయా అన్నట్టు ఉన్నాయిట. ఎందుకా బావులు పైకెగరుతున్నాయి? వేసవిలో కారుచిచ్చులు బాగా అంటుకుంటాయి కదా. ఆ కార్చిచ్చుపొగల(దవధూమము) చీకటిలో (తమంబు), తమ రసము (నీరు) అనే ద్రవయాన్ని (డబ్బుని) సూర్య కిరణాలు అనే దొంగల గుంపు దొంగిలించేసాయి (చీకట్లోనే కదా దొంగతనాలు జరిగేవి!). సూర్యుడు రాజులాంటి వాడైతే అతని కిరణాలు రాజోద్యోగులవంటి వారు. మరి అలాంటి రాజ సేవకులు తమ సంపదని హరిస్తే అవి రాజు దగ్గర మొరపెట్టుకుంటాయి కదా. అలా ఆ పెద్ద బావులన్నీ కలిసి సూర్యుడి దగ్గర మొరపెట్టుకోడానికి ఆకాశంపైకి ఎగురుతున్నట్టుగా ఉన్నాయిట దుమ్ముతో కూడిన ఆ సుడిగాలులు.

వేసవిలో కనిపించే సహజ దృశ్యాలన్నిటినీ ఒక దానికొకటి గుదిగుచ్చి ఒక అద్భుతమైన ఊహ చెయ్యడం ఈ పద్యంలో మనం చూడవచ్చు. కారుచిచ్చు, ధూళినిండిన సుడిగాలులు, ఎండిపోయిన పెద్ద పెద్ద బావులు - ఇవన్నీ వేసవిలో కనిపించే దృశ్యాలే కదా!

చ. పడమర వెట్ట నయ్యుడుకుఁ బ్రాశన మొల్లక కూటిపేదలై

బడలిక నూడు నచ్చిలువ ప్రగ్గములన్ రవియాజ్ఞ మాటికిన్

ముడియిడఁ బిచ్చుగుంటు రథమున్ నిలుపన్ బయనంబు సాగమిన్

జడను వహించె నాఁగ దివసంబులు దీర్ఘము లయ్యెనత్తఱిన్



( ఈ పద్యం చదువరి స్వరంలో)

వేసవికాలంలో పగలు ఎక్కువగా, రాత్రుళ్లు తక్కువగా ఉంటాయి. వేడికి పగలు మరీ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది సహజం. కాని రాయలు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడో చూడండి. సూర్యుడు రథసారధి అనూరుడు. గరుత్మంతుని అన్నయైన ఇతడు ఊరువులు లేనివాడు. అందుకే పిచ్చుగుంటు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి పగ్గాలు పాములు. అవి గాలినే ఆహారముగా తీసుకుంటాయి. వాటికి వాయుభుక్కులు, గాలిమేపరులు అని పేరు. గ్రీష్మంలో పడమరనుండి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులు (ఎదురుగాలులన్న మాట) అవి భుజించలేకపోతున్నాయి. ఆహారము లేక నీరసపడిపోతున్నాయి. దానితో రథసారధి చేతిలో ఉన్న పగ్గాలు ముడులు విడిపొతున్నాయి. సూర్యుడి ఆజ్ఞప్రకారం రధాన్ని ముందుకు నడిపించక తప్పదు. అందుకే విడిపొయిన పగ్గాలను మళ్లీ ముడులేసుకుంటూ, రథాన్ని ఆపుకుంటూ నడపడం వల్ల సూర్యుడి ప్రయాణం ఆలస్యమై పగలు దీర్ఘమవుతున్నాయి. ఏం ఊహ!

చ. భరితనిజాంబుబింబిత విభాకరబింబ విజృంభితప్రభాం

కురముల నధ్వనీకకృతకూపకపంక్తులు వొల్చె నబ్ధిరా

డ్విరహభరంబున న్బొడమువెచ్చకు శాంతి యొనర్ప వాహినీ

తరుణులు మేన దట్టముగఁ దాల్చిన ముత్తెపుఁబేరులో యనన్

యాత్రికులు నీళ్లను తాగడానికి నదులలో చేసుకున్న చెలమలచాళ్లలో సూర్యకిరణాలు ప్రతింబింభిస్తున్నాయి. ఆ కిరణాలు ఎలా ఉన్నాయంటే సముద్రుడితో వేసవి మూలంగా కలవకుండుటచే విరహవేదన వలన పుట్టిన వేడికి ఉపశమింపచేయడానికి నదులనే స్త్రీలు ధరించిన ముత్యపుదండలవలె ప్రకాశిస్తున్నాయి. సూర్యకిరణాల స్వచ్చతను, ప్రకాశాన్ని ముత్యాలతో పోల్చాడు కవి.

ఉ. మీటగు మీలనెల్ల మును మ్రింగి క్రమంబున నైనయొండ పె

న్బీటిక వెంటఁ దోఁచుతొగవేరుబడి న్గొడుపై చెలంగఁగా

ద్రోటికఁ గర్దమద్రవముతోనె నశించిన బొమ్మడాయ డా

త్కూటకులంబులం దినె బకోటకులంబు జలహ్రదంబులన్.



( ఈ పద్యం చదువరి స్వరంలో)

కొంగల గుంపులు ఆ నీళ్ళు లేని చెరువుల్లో దిగి చేపలను వేటాడుతున్నాయి. ముందుగా నోటికందిన పెద్ద పెద్ద చేపలని తినేసాయి. క్రమంగా ఎండలు ముదరడంతో చెరువుల్లో బురద కూడా నెర్రెలు పారింది. ఆ నెర్రెలలోంచి (పగుళ్ళలోంచి) కలువపువ్వుల వేరులు నీటికోసం అడుగుకి పోయాయి. వాటి పక్కనే బొమ్మిడాయులు (చేపల్లో రకం) గుచ్చబడ్డ పుల్లల్లాగా ఉన్నాయి. అవి కూడా నీటికోసం నెర్రెల్లో నుండి లోపలకి వెళుతూ ఉంటే తడి ఆరిపోయి బురద గట్టిపడిపోయింది. అందులో చిక్కుకుని బొమ్మిడాయిలు ఇతర చిన్న చిన్న చేపలు చచ్చిపోయాయి. కొంగలు తమ ముక్కులను లోపలికంటూ గుచ్చి వాటిని తింటున్నాయి.

ఇంతటి చిత్రాన్ని ఒక్క పద్యంలో మనకి రాయలవారు చూపిస్తున్నారు! ఎంతగా ప్రకృతిని పరిశీలిస్తే ఇలాంటి వర్ణనలు చెయ్యగలరు!

శా. ప్రాతర్వేళల నట్టివెట్ట సొగసై పాటిల్లెఁ గుంభోంభనో

ద్భూతాంబుధ్వని వాద్యమై మరుదధఃపుంజీభవత్పాటల

వ్రాతామ్రేడితసిక్తభూసురభిళారామాంబుకుల్యాబహు

స్రోతస్సంధుల నంధుయంత్రనతికృత్ప్రోద్గీత గేయౌఘముల్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం భూపాల రాగం)

అలాంటి వేసవిలోనూ ప్రాతర్వేళలు (పొద్దుపొడుపు వేళలు) చాలా సొగసుగా ఉన్నాయిట. ఏవిటా సొగసంటే, బావుల పైనుండే ఏతాములను (అంధు యంత్రాలు) త్రొక్కేవారు (అతికృత్) గొంతెత్తి (ప్రోద్గీత) గేయాలెన్నిటినో పాడుతూ ఉన్నారు. ఆ పాటలకి తాళం వేస్తున్నట్టు ఆ ఏతాములకున్న కుంభాలను (బానలను) ముంచడం వల్ల (ఉంభన) పుట్టిన (ఉద్భూత) అభు ధ్వని (నీటి చప్పుడు) వస్తోంది. ఆ జానపదగేయ మాధుర్యాన్ని రెట్టింపు చేసేది మరొకటి ఉంది. అదేమిటంటే, పాటలీ వృక్షాల కింద పాదుల్లో రాత్రికి రాలిన పువ్వులు గాలికి గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. మడవలలో నుండి నీరు ప్రవహిస్తూ ఉంటే తడిసిన నేల వాసనను రెట్టిస్తూ ఆ పూల వాసనలు వ్యాపిస్తున్నాయి. ఆ వాసనలు, ఏతాము తోడేవాళ్ళ పాటలు, దానికి లయబద్ధంగా వస్తున్న ఏతాపు బాన చేసే చప్పుడు అన్నీ కలిసి ఆ పొద్దుపొడుపులకి ఎంతో సొగసు చేకూరుస్తున్నాయి.

జానపద గేయాలు, ఏతాములు, నీటికి తడిసిన మట్టివాసన, ఆ వాసనకి తోడు రాలిన పాదిరి పూల పరిమళం - ఎంత సహజమైన, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణమో!

తే . మెండుమీఱిన పతఘి బీఱెండ దాఁకి

యొల్లఁబోయిన లేబొండుమల్లెపొదల

తుదలఁ జప్పటలై కడుదొడ్డ లగుచుఁ

బొడమె మొగ్గలగము లగ్గిబొబ్బలట్లు



( ఈ పద్యం రాఘవ స్వరంలో... రాగం.. నాట)

వేసవిలోనే విరిసే మల్లెపూల గురించి చెప్పేదేముంది. మండువేసవిలొని వేడికి బొండుమల్లెల పొదల చివళ్ళు వాడి అణిగిపోయి ఉన్నాయి. ఆ కొనలనున్న పెద్ద పెద్ద మల్లె మొగ్గలు అగ్గి బొబ్బల్లాగా కనిపిస్తున్నాయి.

తే. ఎసఁగు కట్టావిక్రియ నావి రెగయఁ బగటి

యెండ యుడుకాఱకుండు భూమండలమునఁ

బొలిచె మాపటఁ బండువెన్నెల చకోర

పోతవితతికిం జాఁపట్టు వోసినట్టు.



(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

తీవ్రమైన ఎండవేడికి నేల పెనంలా ఉందని అనడం సర్వసాధారణం. రాత్రుళ్లు కూడా భూమిలోంచి వేడి ఆవిర్లు పైకి వస్తున్నాయి.. రాత్రి పండు వెన్నెల కూడా కురుస్తోంది. అదెలా ఉందంటే, ప్రకృతి మాత చకోరపు పిల్లలకొసం వేడి పెనం లాంటి భూమిపై పండువెన్నెలని అట్టులా వేస్తే ఆవిరి పైకెగసినట్టుగా ఉందని అని చమత్కరించాడు కవి.

శా. తారుణ్యాతిగ చూతనూత్న ఫలయుక్ తైలాభిఘూర స్వన

ద్ధారా ధూపిత శుష్యదంబుహృత మాత్స్యచ్చేద పాకోద్గతో

ద్గారంపుంగన రార్చు భోగులకు సంధ్యావేళలం గేళికాం

తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారికే ళాంబువుల్



( ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో)

వేసవిలో ఆహారము సాత్వికముగా ఉండాలి. అలా లేకున్న వేడిమి చేసి విపరీతముగా త్రేపులు వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. అరోగ్యం కూడా తేడా చేస్తుంది. గ్రీష్మకాలంలో భోగులు, అప్పుడే పచ్చిదనం పోతున్న మామిడికాయ ముక్కలు, చేపల ముక్కలు కలిపి కూర వండుకుని తిన్నారు. ఆ కూరలో నూనెతో తిరగమోత పెట్టారు. ఆ తిరగమోతకి అందులో నీరు చుయ్యిమంటూ పొగ చిమ్ముతూ ఇగిరిపోయింది. అలాంటి కూరను వాళ్ళు తినడం వల్ల అది వేడి చెసి త్రేపులు మొదలయ్యాయి. ఆ అవస్థ నుండి తప్పించుకోవడానికి వాళ్లు సాయంకాలసమయంలో తోటల్లో ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలని కొట్టుకొని తాగుతున్నారు.

ఇసకలో పాతిపెట్టడం పైన ఎండవేడి కొట్టకుండా చల్లగా ఉండడానికి. తాటికాయలు కూడా ఇలాగే రాత్రులు బావిలో వానవేసి తెల్లవారినంతనే వాటిని కొట్టుకొని చల్లని తాటిముంజులు తినడం కూడా పల్లెటూళ్ళలో జరిగేదే.

తే. తోఁటఁ బగ లుండి, మల్లెలు దుఱిమి, కావు

లమర మాపైన నిక్షుయంత్రముల కొయ్యఁ

జేరుప్రజ వొల్చె భావివృష్టికిని గ్రుడ్డు

తో మధురిమేచ్చ దిగు నెఱ్ఱచీమ లనగ



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

పగలంతా తోటలో పని పాటలు చేసుకుంటూ అలసిపోయి సూర్యాస్తమయం కాగానే కొప్పుల్లో మల్లెపూలు పెట్టుకుని (ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా కొప్పుల్లో పువ్వులు పెట్టుకొనేవారు), కావిరంగు బట్టలతో (బహుశా మట్టికొట్టుకు పోవడం వల్ల అయ్యుండొచ్చు), చెఱకు గానుగల (ఇక్షుయంత్రాలు) వద్ద మూగుతున్నారు ప్రజలు. ఎర్రరంగు ఒంటిపై తెల్లని మల్లెల్లతో వాళ్ళు ఎలా ఉన్నారంటే, రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, తియ్యని ఆహారం సేకరించడానికి తమ గుడ్లతో సహా ఆ చెఱకు గానుగల దగ్గర చేరారా అన్నట్టుగా ఉన్నారు.

ఇదొక ఆశ్చర్యకరమైన పోలిక!

Tuesday, January 18, 2011

గాలులు ...మత్స్యధ్వజుడు

రాయలు మధురాపురములోని గాలిని కూడా అత్యంత రమణీయంగా వర్ణించాడు. సామాన్యుని కంటికి కనపడని అందాలుకూడా కవికి కనిపిస్తాయేమో. మలయానిలమంటే మలయ పర్వతంనుండి వచ్చే గాలి. ఆ కొండపై గంధపుతోపులు విస్తారంగా ఉంటాయి. ఆ తోపులనుండి వాసనలను గ్రహించి వచ్చిన గాలి నగరంలో నెమ్మదిగా ప్రసరిస్తున్నది.. ఆ వీస్తున్న గాలి ఏమేమి చేస్తోందంటే:

సీ. మదగంధతారతమ్యము యామ్యకరికిఁ ద

త్కరులకుం గనబలెఁ గటము లొరసి,

సురతశ్రమజ మౌటఁ జూపోపకయుబలె?

గామినీ మృదుగండఘర్మ ముడిపి

పరిమళవాహేచ్ఛఁ బ్రాణమీబలెఁ జించు

మృగనాభిచర్మభస్త్రికలు దూఱి

అహితపన్నగభేదు లనబలె గృహవిటం

కపుఁగలాపుల నొయ్యగఱులు నిమిరి.

తే. వీటిసామగ్రిఁ గనుఁగొన వేగపడక

నడవఁ దనదిక్కు పుష్పదంతద్విపంబు

నెక్కెనో యన జడగతి నెపుడుఁ బొలయు

నందుఁ జందనశిఖరిమందానిలుండు.



(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో )

యముని దిక్కునున్న(దక్షిణ దిక్కు) ఏనుగుకు, మధురాపురంలోని గజములకు గల మదవాసనల తేడా తెలుసుకోవడానికో అన్నట్టు ఆ ఏనుగుల గంఢస్థలములను తాకుతూ అందున్న పరిమళాన్ని గ్రహిస్తోంది. మలయపర్వతం ఉండేది దక్షిణం వైపు కాబట్టి దక్షిణపు గాలినే మలయమారుతమంటారు. రతిక్రీడ తర్వాత అలసిన వనిత చెక్కిళ్ల చెమటను ఆర్చునట్టుగా వాటిని తాకి అక్కడి సుగంధమును గ్రహిస్తోంది, చించిన బొడ్డు కలిగి పడి ఉన్న కస్తూరీ మృగములకు ప్రాణము కలిగించునట్టుగా వాటి బొడ్డులోని చర్మపు తిత్తులలోకి జొరబడి ఆ సుగంధమును కూడా గ్రహిస్తోంది. తమకు శత్రువులైన పాములను భేదించేట్టుగా ఉన్న గృహాలలో పెంపుడు నెమళ్లను స్నేహంతో దువ్వినటుల వాటి ఱెక్కలను నిమురుతోంది. గాలిని తినేవి పాములు. ఆ పాములని చంపుతున్నవి నెమళ్ళు. శత్రువుకి శత్రువు మిత్రుడు కదా! అందుకా గాలికి నెమళ్ళతో స్నేహం!

ఆ పట్టణములోని సకల సమృద్ధిని చూడాలనే కోరికతో తొందరపడకుండా, తనే దిక్కునుండి వచ్చిందో ఆ దిక్కునున్న (దక్షిణపు దిక్కు) పుష్పదంతమనే ఏనుగుపై స్వారీ చేస్తూ మెల్లిగా సంచరిస్తున్నట్టుగా, గంధపుకొండ మీదుగా మలయమారుతం సువాసనాభరితమై మధురాపురములో వీస్తున్నదని భావం.. విలిబుత్తూరులో గాలి భక్తి పారవశ్యం కలదైతే, ఇక్కడి గాలి రాచఠీవి కలిగినది.

ఇప్పుడింక ఆ మధురానగరాన్ని ఏలుతున్న రాజుని వర్ణిస్తున్నాడు.

సీ. ద్విద్వయోపాయ ధీవిద్వద్వతంసంబు,

షాడ్గుణ్యచాతురీ చక్రవర్తి

క్రీడాచలీకృత శ్రీఖండగిరిరాజు,

కనకాద్రిముద్రణ గ్రంథకర్త

యందూనిబద్ధాబ్ద

బృంద వేదండాళి,

వననిధి స్తంభ నాధునికరఘువు

తామ్రపర్ణ్యమలపాథః కేళిహంసంబు,

లంకేశమైత్రీ ప్రియంకరుండు

తే. స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ

మకుటమోటన శతకోటి మంత్రభృత్య

భూతభూతాత్తశాంభవ భూమికుండు

దత్పురం బేలుఁ బాండ్య మత్స్యధ్వజుండు.

( ఈ పద్యం కామేశ్వరరావు స్వరంలో )

మధురానగరానికి మహారాజు మత్స్యధ్వజుడు, అంటే చేప గుర్తున్న జెండా కల రాజు.

ఆయన రెండు రెళ్ళు(ద్విద్వయ) నాలుగు ఉపాయాల (సామ, దాన, భేద, దండ ఉపాయాలు) ప్రావీణ్యంగల పండితులలో శ్రేష్టుడు. షడ్గుణములయందు చతురత కలిగినవాడు.

షడ్గుణాలు: సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైదీభావం, సమాశ్రయం.

సంధి: కొన్ని షరతులతో శత్రువుతో చేయి కలపడం.

విగ్రహం: దండెత్తివచ్చిన శత్రువును యుద్ధముచే అడ్డుకోవడం.

యానం: శత్రువు మీదికి దండెట్టి వెళ్ళడం,

ఆసనం: విగ్రహము ప్రారంభించి తన దేశంలోనే ఉండడం.

ద్వైదీభావం: సగం సేన తో దండెత్తి వెళ్ళడం.

సమాశ్రయం: మధ్యస్తుని గా శరణు జొచ్చడం

మలయపర్వతముపై విలాస యాత్రలు చేసేవాడు. బంగారుకొండపై తన బిరుదును ప్రకటించుకున్నవాడు. ఏనుగులను కట్టినట్టు మేఘాలను బంధించినవాడు. సముద్రం మీద వంతెన నిర్మించిన నేటి కాలపు రఘురాముడు. తమిళ సింహళ దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయి కనుక అతను కూడా రామునిలా వారధి నిర్మించి ఉండాలి. మేఘాలను బంధించడం అన్నది విచిత్ర విషయం. మంత్రశక్తితో కావలసినప్పుడు వానలు కురిపించే శక్తి ఇతనికి ఉందని అర్థం చేసుకోవాలి. తామ్రపర్ణి నదిలో విహరించే హంస. విభీషణునితో చెలిమి చేసినవాడు. రామాయణంలో ఈ రాజు గురించి వచ్చిన ప్రస్తావనల ఆధారంగా చేసిన వర్ణనలివి.

అగస్త్యముని దక్షిణ దిక్కుకు వచ్చి పాండ్యదేశంలో ఆశ్రమం కట్టుకున్నాడని పురాణోక్తి. కాబట్టి నిత్యమూ అతని ఆశీర్వాదాలు పొందినవాడు పాండ్యరాజు. ఇంద్రుని కిరీటాన్ని మొట్టే బాణసమూహం కలవాడు, అంటే ఇంద్రుకి మించిన పరాక్రమం కలవాడని. మంత్రశక్తితో భూతగణాలను స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆ భూతనాథుడైన శివునిలా ఉన్నాడు.

ఇక్కడీ పాండ్యరాజు వర్ణనని విష్ణుచిత్తుని వర్ణనతో పోల్చుకోవాలి. పోల్చుకోమని కవి చెప్పకనే చెపుతున్నాడు. అక్కడ "ద్వయసద్మం" ఉంటే ఇక్కడ "ద్విద్వయోపాయం" ఉంది. అక్కడున్నది భక్తి, ఇక్కడున్నది రాజనీతి. అలాగే అక్కడ కూడా సంకెలకి "అందూ" అన్న మాటే ప్రయోగించడం గుర్తుందా! ఇక్కడ పాండ్యరాజు మేఘాలనే ఎనుగులని గొలుసులతో కట్టినట్టు బంధిస్తే విష్ణుచిత్తుడు ఏకంగా విష్ణుమూర్తి అనే ఏనుగునే యోగమనే సంకెలతో బంధించాడక్కడ. అంటే పాండ్యరాజుది భౌతికతశక్తి, విష్ణుచిత్తునిది ఆధ్యాత్మికశక్తి. భౌతికశక్తి పరిమితిని చెప్పి, దానికి మించిన ఆధ్యాత్మికశక్తి మనిషికి ఎలా అవసరమో పాండ్యరాజ విష్ణుచిత్తుల కథ ద్వారా నిరూపించబోతున్నాడు. ఆ సూచనగానే వారిరువురి వర్ణనలూ ఔచిత్యంతో శోభిల్లాయి!

ఉ. ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ

ల్కందఁ గొనం; డొరుం డొరుతల న్వినిపించినమాట డెందముం

జెంద ముదంబు దక్కి చెడఁ జేయఁ డొరు; న్వినతాస్యుఁ డౌ నుతిం

పం దనుఁ; బందనుం గొఱత వల్కఁడు శూరతఁ దానుమించియున్.


( పద్యం రాఘవ స్వరంలో.. రాగం . బేగడ )

చంద్రవంశభూషణుడగు మత్స్యధ్వజుడు ఎప్పుడూ నీతి తప్పనివాడు, ధీరుడు, ఉదాత్తుడు, వినయశీలి, ప్రజలు కష్టపడేలా పన్నులు వేయడు, చెప్పుడు మాటలు విని జనులను బాధపెట్టడు, తనను ఎంతగా పొగిడినా పొంగిపోక, పరాక్రమముచేత గర్వముతో ఎవ్వరినీ తక్కువ చేయనివాడు. ఇటువంటి సద్గుణాలుకలిగిన ఆ మహారాజు

జనరంజకముగా రాజ్యమును పాలించేవాడు.

శా. దానత్యాగపతత్త్రమై తొలు పతత్త్రం బంబుధార న్సదా

నానం, దత్సితకీర్తిహంసి చనుమింటం; గ్రొత్త నా నేల,నా

నానీరార్ద్రపతత్త్ర యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే

లా నిల్చుంగతి యన్యపత్రి గతిఁ బత్త్రైక ప్రదేశాఫ్లుతిన్?



( పద్యం రవి స్వరంలో)

ఈ పద్యంలో మత్స్యధ్వజుడి కీర్తిని హంసతో పోల్చాడు రాయలు.

కీర్తి తెల్లగా ఉంటుందని కవి సమయం, అది స్వచ్ఛతకి చిహ్నం. అందుకే తెల్లని వస్తువులతో పోల్చడం ఆనవాయితీ (వెన్నెల, ఐరావతం మొదలైనవి. "నరసింహ కృష్ణరాయని

కరమరుదగు కీర్తి" గురించిన చాటువు బాగా ప్రసిద్ధమైనదే!). ఇక్కడ రాయలవారు పాండ్యరాజు కీర్తిని హంసతో పోలుస్తున్నారు. హంసతో పోల్చడంలో ఉన్న మరొక ఔచిత్యం, అది దశదిశలా ఎగురుతుంది (వ్యాపిస్తుంది). అలాగే హంస శ్రేష్ఠతకి కూడా సూచకం. ఇంతవరకూ చెప్పి ఊరుకుంటే అతను కృష్ణదేవరాయలే అవ్వడు! ఆ కీర్తి అనే హంసకి రెండు రెక్కలూ దానం, త్యాగమునట. అంటే నిరంతర దాన త్యాగల వల్లనే ఆయన కీర్తి హంస ఎగురుతోందన్నమాట. దానమంటే నీరు ధారపోసి అడిగినవారికి ఇచ్చేది. త్యాగమంటే అదేమీ లేకుండా తన దగ్గరున్న వస్తువుని ఇచ్చివేయడం. అంచేత దానమనే ఒక రెక్క ఎప్పుడూ తడుస్తూనే ఉందన్న మాట. మామూలుగా పక్షులు తడి రెక్కలతో ఎగరలేవు. అయితే హంస మాత్రం రెండు రెక్కలూ తడిసినా ఎగరగలదు. ఇక్కడ తడుస్తున్నది ఒక రెక్కనే కదా. అంచేత కీర్తి అనే ఆ హంస ఎగరడంలో ఆశ్చర్యమేమీ లేదు అని సమర్థించాడు. ఒక ఊహని రాయలవారు ఎంత సమగ్రంగా ఆలోచిస్తారో అన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ.

రాజు అనేవాడు ఎలా ఉండాలో రాయలవారు ఒక రాజుగా చెప్పడంలో ఏమీ విశేషము లేదు. ఐతే ఆ వర్ణనామాధురి అధ్బుతం. పై మూడు పద్యాల తర్వాత ఇంకా తెలుసుకోవాలంటే..నీతి సారంలో ప్రతాపరుద్రుడు ఏమంటాడో చూద్దాము.

"జనపతి పర్జన్యుగతిం

దనభూప్రజ బ్రోవవలయు, దగ బ్రోవడయే

దను బాసిపోవు నా ప్రజ

ఘన నీరస సరసి బాయ ఖగముల భంగిన్."

అలాగే క్షేమేంద్రుడు.. తన సకల నీతి సమ్మతంలో..

"రాజ రాజ వంశ భూజన పతులీలి

రకట! మంత్రి తొలగి యలికి నాడు

యేది పసుపుసేయ నిటు నిల్వబోలదు

రాజు లేని కయ్య మోజు పడునె"

అలా రాజు అన్నవాడు ప్రజల మెప్పుగోరి పన్నులకై ప్రజలను బాధించక మంత్రి మాట విని, పొగడినా ఉబ్బక, కన్నబిడ్డల్లా చూడాలని రాయలు చెప్పడం చాలా ఔచిత్యం గా ఉంది.

Tuesday, December 21, 2010

చతుర్వర్ణాల వర్ణన

అష్టాదశ వర్ణనల సంప్రదాయాన్ని పాటిస్తూ రాయలు మధురాపురంలోని చతుర్వర్ణాలవారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, కాపులను గురించి వర్ణించాడు. మనఃప్రవృత్తికి అనుగుణమైన వృత్తులకి చిహ్నంగా ఉండేవి వర్ణాలు. రాజ్య పరిపాలన వర్ణాశ్రమాచారాన్ని పరిరక్షించే విధంగా ఉండేది. ఇది సామాజిక భద్రతను చూచించే పరిపాలనా విషయంగా ఆ నాటి కవులు వర్ణించేవారు.


. చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా

ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,

పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞ శీలు రా

హరి ధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.-



( ఈ పద్యం సనత్ స్వరంలో )


మధురాపురంలోని బ్రాహ్మణులు పరమనిష్ఠా గరిష్టులు. వేద పర్వతాలు. నిత్యాగ్నిహోత్రులు. వారందరూ సోమయాజులగుటచే వారి దక్షిణ హస్తమునందు అగ్ని ఉంటుందని అంటారు. దానోదకముచే (దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు) తేమ తాకి ఆ అగ్ని చల్లారుతుందని దేవేంద్ర, కుబేరాదులు వచ్చి దానమిస్తానన్నా తమ దక్షిణ హస్తమును (కుడిచేతిని) చాపరు. ప్రతినిత్యమూ జపయజ్ఞములు చేసే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరికీ చేయి చాపరు అని భావము.

అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఎంత ముఖ్యమో “నచికేతోపాఖ్యానం” లో దగ్గుపల్లి దుగ్గన ఇలా చెప్తాడు.

"వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు
వేదములును యాగ విధుల నొడవు
యజ్ఞములకు మూలమగ్నిహోత్రముగాన
నగ్ని హోత్ర సేవ యాత్మ సేవ."

అలాగే రాయలు కూడా మధురాపురంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా కొనియాడాడు. ఇతర కావ్యాలలో సాధారణంగా బ్రాహ్మణులని పండితులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాని రాయలవారిక్కడ బ్రాహ్మణుల వైదిక కర్మ నిష్ఠని వర్ణించారు.


. ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు

స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై

పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః

పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.-


(ఈ పద్యం రాఘవ స్వరంలో )

ఇక క్షత్రియకుమారులు మహావీరులు. వజ్ర సమానమైన బాహువులు అనే పరిఘలతో శత్రు రాజులను లొంగదీసుకోగలరు. వీరు ఎంత బలశాలులు, ధైర్యవంతులంటే యుద్ధమునందు కూడా కవచము ధరించరు. కాని వీళ్లు కవచం వాడేది ఒకే సందర్భంలో. అది మంత్రోచ్చారణ సమయంలో. రాకుమారులు నేర్చుకునే ప్రతి అస్త్రము ప్రయోగించడానికి ప్రత్యేకమైన మంత్రము ఉంటుంది. ప్రతి మంత్రానికి మంత్రకవచం ఉంటుంది. అందుకే ఆ అస్త్రప్రయోగ సమయంలోనే కవచం వాడతారు అని శ్లేషగా చెప్పాడు కవి. అంతే కాక గొప్ప భుజశక్తి గల ఈ రాకుమారులు రెండు చేతుల ఐదేసి వేళ్లు కలిపి పదిగా చేసి అంటే చేతులు జోడించి ఆశ్రయించరు. కాని అదే రెండు చేతులు కలిపి దోసిలితో దానం చేయడానికి మాత్రం వెనుకాడరు. సాధారణంగా రాజ్యం కోసం మహారాజు ముందు మట్టిలో పొర్లి దణ్ణాలు పెడతారు. ఈ రాజకుమారులు అలా చేయరు. కాని వీళ్లు కూడా మట్టిలో పొర్లుతారు. ఎక్కడంటే ఖళూరిక అనే సాము గరిడీ చేసే ప్రదేశంలో. దీనివల్ల మధురాపురంలోని రాజకుమారులు సాముగరిడీలో కూడా నిష్ణాతులే అని తెలుస్తుంది. "అయిదు పది చెయ్యడం" అన్నది చక్కని తెలుగు నుడికారం.


శా. దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత

స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్

సంభూతం బగుపైడికోటి కొకడై నానాఁటికిన్ హెచ్చు చ

య్యంభోదావళి గప్ప గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్



( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)


మధురపురంలోని కోమట్లు ధర్మము వీడక నిజాయితీగా వ్యాపారం చేసేవారు. పూర్వం కోటీశ్వరులు తమ సంపదకి గుర్తుగా ఒక్కొక్క కోటికి ఒకో జెండాని ఎగరేసేవారు (కోటికి పడగలెత్తడం అన్న నానుడి ఇలా వచ్చిందే). ఆ నగరంలోని వైశ్య వీథులు అలా ఎగరేసిన జెండాలతో ఎంతగా నిండిపోయిందంటే, అవి ఆ పైనున్న మబ్బులని కూడా కప్పేసాయిట! అంటే ఆ నగరంలోని వైశ్యులు అంత ధనవంతులన్న మాట. ధనవంతులవ్వడమే కాదు. ఎలాంటి గర్వం లేకుండా వారు నిరంతరం దానాలు చేసేవారు. ఆ దానధారలు ఏరులై పారి, ఆ నీటికి వీథులలోని స్తంభాలు కూడా చిగురించాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ పతాకలు.

ప్రాచీన సమాజంలో వైశ్యులు వ్యాపారులు, ధన రక్షకులు. బ్రాహ్మణులు విద్యారక్షకులు, క్షత్రియులు రాజ్య రక్షకులు, శూద్రులు సస్య క్షేత్ర రక్షకులు. అందరూ కాపులే. నిరంతర దానం వైశ్యులకి విధి. బుద్ధునికి విరివిగా విహారాదులు కట్టించినది వైశ్యులే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ పద్యం ప్రాచీన సమాజంలో వైశ్యులంటే ఎలా ఉండేవారన్నది చక్కగా వర్ణిస్తోంది. ఇతర కావ్యాల్లో వైశ్యులు కుబేరులని మాత్రమే వర్ణించబడితే, ఇక్కడ దానధర్ములని చెప్పడం రాయలవారి సామాజిక పరిజ్ఞానాన్ని పట్టిచూపుతోంది. ఈ వైశ్యుల దానం దంభాపేతం. అంటే ఏదో మిషతో చెయ్యడం కాకుండా పవిత్ర దృష్టితో చేస్తున్న దానం అన్నమాట. పద్యం ఇక్కడ ప్రారంభం కావడం కూడా వారి స్వభావానికి గీటురాయి.


తే. నృపులపదహల రేఖల కెల్ల మా భు

జాగ్ర హలరేఖలే మూల మనుచుఁ గోటి

కొండలుగ ధాన్యరాసులు పండువీట

సుజనభజనైక విఖ్యాతి శూద్రజాతి



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )


ఆపురంలోని చెప్పుకోదగిన మరో ముఖ్యమైన జాతి సస్య రక్షకులైన శూద్రజాతి. వారి భుజాలమీది మోసిన నాగలి గుర్తులే మహారాజుల పాదములలోని హలాకార రేఖలు అనుకుంటారు. తాము నాగలి పట్టి వ్యవసాయం చేసి కోట్ల కొండలుగా నానావిధ ధాన్యరాశులను పండిస్తున్నారు. అన్నదాతలై సత్పురుషులకు సేవచేస్తూ సుఖసంతోషాలు పొందుతున్నారు. సాముద్రిక శాస్త్రంలో పాదాలందు హలరేఖ పంచ మహాపురుష లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది. హల రేఖలు మహా వైభవాన్ని సూచిస్తాయి. రాజులకి తద్వారా రాజ్యానికి ఆ వైభవాన్ని ఇస్తున్నది రైతులే అని తాత్పర్యం.
Related Posts Plugin for WordPress, Blogger...