తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, September 12, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 2

యాగధేనువుని పులి చంపివేయడం వల్ల కలిగిన ఆటంకానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసుకొనేందుకు కేశిధ్వజుడు, తాను ఓడించిన శత్రువని కూడా లెక్కచెయ్యకుండా ఖాండిక్యుని దగ్గరకు బయలుదేరాడు కదా. ఇప్పుడతడు ఖాండిక్యుని వద్దకు వెళుతున్నది ఒక రాజుగా కాదు, అర్థిగా! కాబట్టి, ఆర్భాటమేమీ లేకుండా, కేవలం జింకతోలు కప్పుకొని, నిరాయుధుడై, ఖాండిక్యుడున్న అడవిని ప్రవేశించాడు. ఖాండిక్యుడు అడవిలో వేగులని పెట్టాడు కదా. కేశిధ్వజుడు అడవి ప్రవేశించగానే అతని రథానికున్న జండాని చూసి అతడు కేశిధ్వజుడని వాళ్ళు గుర్తుపట్టేసారు. కేశిధ్వజుడు వస్తున్నాడని అడవిలోని ఖాండిక్యునికి తెలియాలని పెద్ద పెద్ద కూతలు పెడుతూ సైగలు చేసారు. ఆ కేకలని అడవిలో నివసిస్తున్న ఖాండిక్యుని పరివారమంతా విన్నారు. అమ్మ బాబోయి! కేశిధ్వజుడు ఇక్కడికి కూడా దండెత్తి వస్తున్నాడనుకొని వాళ్ళందరూ భయపడ్డారు. ఖాండిక్యుడు తన భటులని వాళ్ళకి అండగా పంపి వాళ్ళ భయాన్ని తీర్చి, కొండ కనుమలలో విలుకాండ్రని ఏర్పాటు చేసి, కేశిధ్వజుడిని ఎదుర్కోడానికి వెళ్ళాడు. వెళ్ళి:

క. వచ్చు రిపుఁ జూపులనె చుఱ
పుచ్చుచు, సిరిఁ గొనుట మగుడఁ బొడముట రుష ము
చ్చిచ్చున లావెచ్చఁగ వి
ద్యుచ్చల చాపజ్యఁ దూపు దొడుగుచుఁ బలికెన్.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)



ఎదురుగా వస్తున్న కేశిధ్వజుణ్ణి చూసాడు. "నా సర్వసంపదని తీసుకుని కుడా మళ్ళీ యిలా నా మీదకి దండెత్తి వస్తాడా!", అన్న కోపం ముచ్చిచ్చులాగా (త్రేతాగ్ని) ఖాండిక్యుని మండించింది. ఆ కోపపు చూపులతోనే కేశిధ్వజుణ్ణి కాల్చేస్తూ, మెఱుపుతీగలాంటి తన వింటినారికి బాణాన్ని సంధించాడు.

"నా సమస్త సామ్రాజ్యాన్నీ అపహరించింది చాలక, మారీచునిలాగా జింకతోలు కప్పుకొని పెద్ద మునిలాగా మాలో ప్రవేశించి మా ప్రాణాలు తీయడానికి వచ్చావా! ఈ వాడియైన బాణంతో నిన్ను సంహరిస్తాను." అని తీవ్రమైన కోపంతో అన్నాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు చెయ్యెత్తి అతడిని వారించాడు. "నేను నీకు కీడు చేద్దామని రాలేదు. నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను" అని, జరిగిన విషయమంతా చెప్పాడు. చెప్పి, "నువ్వు నాకు దయతో ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించినా సరే, నీ బాణంతో నన్ను చంపేసినా సరే. నీ యిష్టం" అన్నాడు.

విషయమంతా విన్న ఖాండిక్యుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజ్యం లేక అడవుల్లో జీవిస్తున్నా, తనకీ పరివారం ఉంది. మంత్రులున్నారు. స్నేహితులున్నారు. వాళ్ళతో చర్చించకుండా తను ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోకూడదు. ఇది రాజనీతి. అందుచేత, వాళ్ళందరినీ పక్క చెట్ల గుంపుల్లోకి పిలిచి, విషయం చెప్పి, ఏమి చెయ్యాలన్న విషయంపై మంతనాలు మొదలుపెట్టాడు.
క. పాలు గలవాఁడు మన కొక
జాలి యిడక తానె తారసానకు వచ్చెన్;
వేల యిదె, లెమ్ము, నృప! కృప
చాలున్, గారాకు మేపి చంపకు ప్రజలన్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఖాండిక్యుని మంత్రులు వాళ్ళకి తెలిసిన రాజనీతిని వాళ్ళు చెప్పారు. శత్రువు మనను శ్రమ పెట్టక తనంతట తానుగా వెదుక్కుంటూ వచ్చాడు. రాజా! ఇదే తగిన సమయం. ఇంతవరకు చూపిన దయ, జాలి చాలు. నిన్ను ఆశ్రయించిన ప్రజలను పండుటాకులు తినిపించి చంపకు. తొందరగా యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము, అని చెప్పారు. తమ భార్యాబిడ్డలూ అడవుల్లో పడుతున్న అవస్థలు వర్ణించారు. కేశిధ్వజుని కనక ఇప్పుడు సంహరిస్తే, రెండు రాజ్యాలూ లభిస్తాయి. ఏ ఉపాయంతోనైనా శత్రుసంహారం చేసి అధికైశ్వర్యాన్ని పొంది ప్రజలని రక్షించడమే ధర్మమని రాజనీతిని బోధించారు. పైగా, తన సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన త్రిశీర్షుని, గురువనికూడా చూడకుండా ఇంద్రుడు సంహరించ లేదా అని దృష్టాంతం కూడా చూపెట్టారు. అలాగే మరో దృష్టాంతం కూడా చూపించారు.
క. అవమతిఁ బితృఘ్న లగు భూ
ధవుల వెదకి పిల్లపిల్లతరము దునిమి భా
ర్గవుఁడు ముని యయ్యె: మఱి వై
భవము వలదు, శాంతి కైనఁ బగ దెగ కగునే?



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం బృందావని )

పరశురాముడు తన తండ్రిని చంపిన రాజులనే కాక ఇతర రాజులనూ, వారి పిల్లలనూ, పిల్లలకు పిల్లలనూ వెదకి వెదకి మరీ సంహరించాడు. ఆ తర్వాతనే అతను ముని అయ్యాడు. మరి నువ్వు రాజ్యభోగాలు అక్కరలేదు అనుకున్నా, మనశ్శాంతి కోసమైనా నీ పగ తీర్చుకోవలసినదే కదా అని చెప్పారు.
మంత్రులైన వాళ్ళ మాటల్లో ఎంత చాకచక్యముంటుందో చూడండి. ఎలాగైనా ఖాండిక్యుని ఒప్పించాలని రకరకాలుగా చెప్పుతున్నారు. పురాణ దృష్టాంతాలనే కాకుండా లోక వృత్తాంతాన్ని కూడా ఉదాహరణగా చెపుతున్నారీ పద్యంలో:
క. పులి మల డిగి యూళ్ళకు న
క్షులరుజ రా జనము మాంచుకోఁ బనిచి, గవిన్
నెలకొన సురియలు గొని చని
పొలియునొ? యూరఁ గుయిరేఁగి పొడుచునొ? చెపుమా?



( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"పులికి కంటిజబ్బు వచ్చి దారి తెలియక తనుండే పర్వతము దిగి ఊరిలోకి వస్తే, అక్కడి ప్రజలు దాని మీద దయదలిచి "కంటిజబ్బు మాన్పుకోమ్మా!", అని తిరిగి పంపించి, తర్వాత ఎప్పుడో అది జబ్బు తగ్గి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కత్తులు కటార్లతో వెళ్లి చంపుతారా? లేక ఊళ్ళోకి వచ్చినప్పుడే చంపుతారా? నువ్వే చెప్పు", అని అన్నారు.
రాయలవారికి జంతుస్వభావాన్ని గురించి బాగా తెలుసు. పులి యీనినప్పుడు దానికి కళ్ళకి కలకవస్తుందిట. అప్పుడది ఊళ్ళోకి వస్తుంది. అది ఇక్కడ పోలిక తెచ్చారు. వాక్యనిర్మాణంలో కాని, పద్యరచనలో కాని అంతా తెలుగుదనమే! "చెపుమా!" అని పద్యాన్ని ముగించడంలో మంత్రులు రాజు తెలివితక్కువతనాన్ని తెగేసి చెప్పినట్లయ్యింది!

ఇలా అనేక రకాలుగా మంత్రులు, కేశిధ్వజుని సంహరించమని ఖాండిక్యునికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.

క. మీ నొడివినయది కార్యం
బౌ; నిప్పని సేయ రాజ్య మంతయు మనకున్,
వానికిఁ బరలోకము జిత
మౌ నొక్కట; నిందు వాసు లరయఁగ వలయున్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

మంత్రులు చెప్పినది సాంతం విన్నాడు ఖాండిక్యుడు. "వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింప దగున్" అన్న మాటకి తగ్గట్టుగా, అతను విచారించడం మొదలుపెట్టాడు. తన మంత్రులతో ఇలా అంటున్నాడు. "మీరన్నది నిజమే! మీరు చెప్పినట్టు అతడిని చంపితే ఒకేసారి మనకు రాజ్యం తిరిగి లభిస్తుంది. అతనికి పరలోక సౌఖ్యం సిద్ధిస్తుంది. కాని ఈ రెండింటికి మధ్య గల అంతరాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉన్నది". అవతలవారు చెప్పినది నిజమంటూనే, తన వాదనని వినిపించడం మంచి వాక్చాతుర్యం, వాదపటిమ!

ఇంతకుముందు కేశిధ్వజుని పాత్ర ఎలా అయితే అఖండ యజ్ఞదీక్షా జ్యోతిలో వెలిగిందో, అలానే ఇక్కడ సద్విచార కాంతిలో ఖాండిక్యుని పాత్ర ధగద్ధగాయమానంగా ప్రకాశించడం మనకి కనిపిస్తుంది! "రాజ్యసౌఖ్యం ఎంత కాలముంటుంది? తన చేతిలో మరణించే కేశిధ్వజుడు శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఈ అల్పకాల సుఖం కోసం పాపం చేసి ఆ శాశ్వత కాల సుఖానికి దూరం కావడం తగునా?" - ఇదీ ఖాండిక్యుని విచారధార.
క. "బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధతఁ దనమఱుఁగు సొరఁగఁ గూల్చుట కడుఁ గీ,
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి" నను కణ్వవాక్యములు దలఁప రొకో!


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం కానడ )
"చేతులు మోడ్చి దీనంగా శరణు కోరి వచ్చిన శత్రువును అహంకారంతో సంహరించడం పరలోకప్రియుడైన వానికి మిక్కిలి పాపాన్ని అంటగడుతుంది" అన్న కణ్వమహర్షి మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పాడు తన మంత్రులతో. మంత్రులు ఇంద్ర, పరశురామ కథలు చెప్పి తమ రాజనీతిని ప్రదర్శించారు. ఖాండిక్యుడు కణ్వవాక్యాల ద్వారా వారి మాటలను తిరస్కరించాడు!

అలా తన అభిప్రాయాన్ని మంత్రులకి నిశ్చయంగా తెలిపి కేశిధ్వజుని దగ్గరకి వచ్చి, అతని సమస్యని వివరంగా తెలుసుకుని, అతనికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెపుతాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు అది తెలుసుకొని, తిరిగి తన రాజ్యాన్ని చేరుకొని దాన్ని ఆచరించి యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తాడు.

లౌకికమైన రాజనీతికీ పారలౌకికమైన ధర్మానికీ మధ్యనున్న సున్నితమైన సమతౌల్యాన్ని చిత్రించే కథ యిది. ఆ సమతౌల్యాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించే పాత్రలుగా ఖాండిక్య కేశిధ్వజులని తీర్చిదిద్దాడు రాయలు. ఆముక్తమాల్యద కావ్యమంతటా కూడా ఇలాంటి సమతౌల్యమే కనిపిస్తుంది. బహుశా రాయలవారు తన నిజజీవితంలో కూడా లౌకిక పారలౌకిక ధర్మాలని ఇలానే సమతూకంతో నిర్వహించారని మనం ఊహించవచ్చు. అయితే, యీ కథ ఇక్కడితో అయిపోతే విష్ణుచిత్తుడు చెప్పదలచుకున్న పరమార్థం తెలియనే తెలియదు! ఖాండిక్య కేశిధ్వజుల యీ ధర్మప్రవర్తన, పరమార్థమైన మోక్షానికి ఎలా దారితీస్తుందో ముందు కథలో మనకి తెలుస్తుంది.

Friday, August 12, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 1

విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో పండితులను తన వాదంతో ఓడించి నారాయణుని తత్వాన్ని విశదీకరించి అతని సాక్షాత్కారాన్ని ఉపకరించే మరో ఉపనిషత్ కథ ఖాండిక్య కేశీధ్వజ సంవాదాన్ని చెప్పడం ప్రారంభించాడు.


మ. జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షు గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశీధ్వజున్..

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)


నిమి వంశంలో జన్మించిన ప్రతీ ఒక్కరికి జనకుడని పేరు ఉంటుంది. ఆ వంశంలోని ధర్మధ్వజుడనే మహారాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో మితధ్వజుడికి కర్మశూరుడైన ఖాండిక్యుడు, కృతధ్వజునికి బ్రహ్మజ్ఞాని అయిన కేశీధ్వజుడు జన్మించారు.


క. వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం రాఘవ స్వరంలో.. రాగం కుంతలవరాళి )


ఖాండిక్య కేశీధ్వజులు సోదరులైనా పరస్పరం వైరము పెంచుకొని , రాజ్యాపేక్ష చేత యుద్ధానికి సిద్ధపడ్డారు. వారి రాజ్యాలలోని ప్రజలు భయభ్రాంతులను చేస్తూ రోజుల తరబడి యుద్ధం చేసేవారు.

జేతుమిఛ్చా జిగీష - గెలవాలనే కోరిక జిగీష. బారాది అన్న పదం హిందుస్తానీ "బారా" (పన్నెండు) నుండి వచ్చినది. శ్రీనాథుని కాలంనుండీ ఉరుదూ పారసీ హిందుస్తానీ పదాలు తెలుగు సాహిత్యంలో హెచ్చుగా కనిపిస్తాయి. "హోరాహోరీ" అంటే గంటల తరబడి అని మనకి తెలుసు. ఇది "హోరా" అన్న పదంనుంచి పుట్టిన పదం. హోరా అంటే గంట. ఇది గ్రీకునుండి సంస్కృతంలోకి వచ్చిన పదం. బహుశా ఇంగ్లీషులోని "hour"కి కూడా ఇదే మూలం.


ఇక్షుమతీ నదీతీరాన ఎన్నో రోజులు యుద్ధం చేసిన తర్వాత కేశీధ్వజుని ధాటికి తట్టుకోలేక ఖాండిక్యుడు యుద్ధభూమిని వీడి పారిపోయాడు. అడవిలోకి వలసపోయాడు. ఎంతయినా రాజే కనక, అక్కడ ఒక రహస్యప్రదేశంలో గుడిసెలు ఏర్పాటు చేసి, చిన్నపాటి ఊరు నెలకొల్పాడు. తనతో వచ్చిన గురు భట పరివారంతో అక్కడ నివసింప సాగాడు. దారి పొడుగునా శత్రు సంచారాన్ని పసిగట్టి చెప్పడానికి వేగులని ఏర్పాటు చేసాడు.


శా. ఆ కేశీధ్వజుఁ డంత నా నృపుని రాజ్యం బెల్లఁ జేర, న్ఫలం
బాకాంక్షింపక 'గెల్తు మృత్యువు నవిద్య న్బుట్టకుందుం దుదన్
జాకుందు న్వడి' నంచు యోగ నియతిం జ్ఞానాశ్రయుం డై మఖా
నీకంబుల్ రచియించు చం దొకటికిం దీక్షించి తా నున్న చోన్.

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

గెలిచిన కేశీధ్వజుడు ఖాండిక్యుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అయినా అమృతత్వాన్ని(మోక్షాన్ని) కోరుకొని యోగాసక్తితో జ్ఞానమును ఆశ్రయించి ఎన్నో యాగములు చేసాడు. అలా ఒక యజ్ఞమును ప్రారంభించి దీక్ష వహించి ఉండగా.


ఈ పద్యంలో "గెల్తు మృత్యువు నవిద్య , న్బుట్టకుందుం, దుదన్జాకుందు న్వడి" అన్నదానికి అన్వయం కొద్దిగా తికమక పెట్టేది. ఒక రకమైన అర్థం - "మృత్యువును, అవిద్యను గెల్చెదను. చావుపుట్టుకలు లేని మోక్షాన్ని పొందుతాను" అని. ఇది సులువయిన అన్వయం. అయితే దీనికి వ్యాఖ్యానం వ్రాసిన వేదం వేంకటరాయశాస్త్రిగారు, తుమ్మపూడి కోటేశ్వరరావుగారు ఇద్దరూ కూడా వేరే అర్థాన్ని ఇచ్చారు. అదేమిటంటే, "అవిద్య చేత మృత్యువుని గెలుస్తాను. జనన మరణ ప్రవాహ రూపమయిన సంసారాన్ని దాటి మోక్షాన్ని పొందుతాను" అని. ఇక్కడ అవిద్య చేత మృత్యువుని గెలవడం ఏమిటి? అన్న సందేహం వస్తుంది. దానికి వారు ఈశోపనిషత్తులోని ఒక వాక్యం ఉదహరించారు - "అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే". అంటే అవిద్య ద్వారా మృత్యువుని తరించి విద్యద్వారా అమృతత్వాన్ని పొందాలి అని. దీనికి వ్యాఖ్యానం - అవిద్య అంటే కర్మమార్గం. విద్య జ్ఞానమార్గం. అమృతత్వం అంటే ముక్తి. అంటే యజ్ఞ యాగాదుల ద్వారా మృత్యువుని జయించవచ్చు (స్వర్గాది లోకాలను పొంది). అయితే అది ముక్తి కాదు. ముక్తి కేవలం జ్ఞానం ద్వారానే లభ్యమవుతుంది. విశిష్టాద్వైతం కర్మ, జ్ఞానమార్గాల సముచ్చయం. అందుకే ఇక్కడ కేశిధ్వజుడు జ్ఞానాశ్రయుడయినా యజ్ఞాలని ఆచరించాడు. బహుశా దాన్ని బలపరచడం కోసం పద్యాన్ని యిలా వ్యాఖ్యానించారు కాబోలు.


చ. పులు మఖశాలికానికటభూముల మేయుచు నేటి వెంటఁ బె
ల్లల మెడునీఱముం దఱిపి యామ్యపతాకన ఘర్మధేను వా
కెళవున నాడువాల భుజగిం గని గోండ్రని యంగలార్చుచున్
గళగతఘంటమ్రోయ నుఱుకం బిడుగుం బలె దాఁకి యుద్ధతిన్
Get this widget | Track details | eSnips Social DNA

(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం రంజని )


ప్రతి యాగానికి ఒక యాగధేనువు (గోవు) ఉంటుంది. అది చాలా పవిత్రమయినది. అది లేకుండా యాగం సాగదు.
ఈ యాగం జరుగుతూండగా, దాని యాగధేనువు ఆ యజ్ఞశాలకు సమీప ప్రదేశంలో గడ్డి మేస్తూ, అక్కడికి దగ్గరలోనే ఏటి ఒడ్డున బాగా దుబ్బుగా పెరిగిన పొదలవైపు వెళ్లింది. అంతలో ఆ పొదలమధ్య యముని పతాకంలా, పాములాగా కదులుతున్న పులితోకను గమనించింది. వెంటనే భయంతో గోండ్రు గోండ్రుమని అరుస్తూ మెడగంటలు మ్రోగుతుండగా పరుగెత్తింది. అయితే అంతకు మించిన వేగంతో పులి కూడా పరిగెత్తుకుంటూ పిడుగులాగా ఆవు మీదికి దూకింది.


ఉ. గబ్బు సమక్షికం బయి మొగం బడువ, న్దరుపర్ణముల్పడన్
ద్రొబ్బుచుఁ, గార్మొగిళ్ల రొదతోఁ జెఱలాడెడు బొబ్బరింత గా
డ్పుబ్బి విసంజ్ఞగాఁగఁ జెవు లూఁదిన, వల్లవుఁ డుర్విఁ గూలఁగా
బెబ్బులి గొంతుక్రోల్గఱచి పెల్లున మార్మెడ ద్రెళ్ల దాఁటుచున్
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

ఈగలతో కూడిన దుర్గంధం పులి ముఖాన కొడుతుండగా, చెట్ల ఆకులు రాలునట్టుగ ఆవును తోస్తూ, వర్షాకాలపు మేఘాల వలె గాండ్రిస్తూ దాని మీదకు దూకింది పులి. ఆ శబ్దానికి పశులకాపరి కింద పడి మూర్చపోయాడు. ఆ పెద్దపులి ఆవు కంఠనాళాన్ని కొరికి మెడను విరిచింది.


ఆ. తనువుఁ గొమ్ము గొరిజ గొనకుంఢ మలఁపుచుఁ
జప్పు డెసఁగఁ దోఁక నప్పళించి,
శోణితంబు గ్రోలుచునె నేర్పుమై ఘర్మ
గవిని గవికి నీడ్చు నవసరమున.
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)


పెద్దపులి ఆవు కొమ్ముగాని, కాలిగిట్ట కాని తనకు తగలకుండా నేర్పుతో దానిని తిప్పుతూ పెద్ద చప్పుడయ్యేట్టు తోకతో కొడుతూ, రక్తాన్ని తాగుతూ, ఆ యాగధేనువుని తన గుహకి ఈడ్చుకు పోతోంది.


చ.పొలమరు లంది కూఁత లిడ, భూసురు లన్నదిలోన వార్చి, మ్రాఁ
కుల తుద లెక్కి, చప్పటలు గొట్టి యదల్పఁగ, సాహిణీలు మా
వులఁ బఱపంగ, వైచి సెలవు ల్వెస నాకుచుఁ బోయె వృక్షమం
డలికయి తేలుచున్ గుటగుటధ్వని సారె మలంగి చూచుచున్
Get this widget | Track details | eSnips Social DNA

(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

పులి ఆవును లాక్కెళుతూ ఉండగా చూసి ఆ ప్రాంతంలో అక్కడక్కడా ఉన్న పొలం పనులు చేసుకునేవారు గట్టిగా అరుస్తూ వచ్చారు, అక్కడి నదిలో సంధ్యవార్చడానికి వచ్చిన బ్రాహ్మణులు చెట్లపైకి ఎక్కి చప్పట్లు కొట్టి అదిలించారు. అంతలో కొందరు రౌతులు గుర్రాలెక్కి పులిని వెంట తరిమారు. ఆ హడావిడికి పులి ఆవుని వదిలిపెట్టి పెదవి మూలలు నాకుతూ గుటగుట శబ్దం చేస్తూ వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయింది.


క. జుఱుజుఱుకని నెత్తురు వెలి
కుఱుకుచు రొదసేయ, నఱితి యొడపినె యూర్పుల్
పఱవ, మిడిగ్రుడ్ల వణఁకుచుఁ
గొఱప్రాణముతోడఁ దన్నుకొను నమ్మొదవున్
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆవు గొంతునుండి రక్తం వెచ్చగా జుఱుకు జుఱుకు మను శభ్దంతో వుబికి వస్తూ ఉంది. గొంతులో తెగిన నాళాలనుండి దాని నిట్టూర్పు గాడ్పులు ప్రసరించడం తెలుస్తూనే ఉంది. ఇటువంటి దయనీయమైన స్థితిలో కళ్లు తేలవేసి కొనవూపిరితో కొట్టుకుంటుంది ఆ ఆవు.

ఇక ఆవు బతకదని నిశ్చయించుకొని, పశులకాపరులు వేళ్ళి రాజుకా వార్త విన్నవించారు. దీనికింక ప్రాయశ్చిత్తమేమిటని రాజు ఋత్విక్కులని అడిగాడు. వారు తమకి తెలియదని కసేరువన్న అతడిని అడగమన్నారు. కసేరువన్న అతను శునకుడన్న మరొకడిని అడగమని చెప్పాడు. తనకి కూడా తెలియదని, దీని గురించి చెప్పగలిగినవాడు ఒక్క ఖాండిక్యుడేనని, నీకు మంచిదనిపిస్తే వెళ్ళి అతడినే అడగమని చెపుతాడు శునకుడు.

చ. నరపతి పల్కె 'మౌని వర, నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపు ఫలం బొడఁగూడుఁ; గా కమ
త్సరగతిఁ జెప్పె నేని మఖతంత్ర మతంత్రముఁ గాక పూర్ణ మౌ
నిరుదెఱఁగు న్మదీప్సితమె, యేఁగెద'నంచు రథాధిరూఢుడై.

అప్పుడా శునకునితో కేశిధ్వజుడు ఇలా అన్నాడు, "మునివర్యా! అలాగే తప్పకుండా వెళ్ళి అడుగుతాను. ప్రాయశ్చితాన్ని అడగడానికి వెళ్లినప్పుడు నా శత్రువైన ఖాండిక్యుడు పూర్వ వైరంతో నన్ను చంపినచో యజ్ఞం మధ్యలో ప్రాణాలు వీడుటచేత యజ్ఞఫలము నాకే లభించును. లేదా మాత్సర్యాన్ని వదిలి ప్రాయశ్చితం చెప్పినచో యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. కావున రెండు విధాలు నాకు లాభం చేకూరుస్తాయి. ఏది జరిగినా నాకు సమ్మతమే", అని చెప్పి రధమును ఎక్కి బయలుదేరాడు.

ఆనాటి రాజుల స్వభావాలు ఈ కథలో చాలా అందంగా చిత్రించబడ్డాయి. ఇక్కడ కేశిధ్వజుడు ప్రాణాలను పణంగా పెట్టి ఖాండిక్యుని దగ్గరకి వెళుతున్నాడు. అతనికి యజ్ఞం పూర్తికావాలన్న తపనే కాని ప్రాణభీతి లేదు. పైగా తనవల్ల అడవులు పట్టినవాడి దగ్గరకు వెళ్ళడం ఎంత సాహసం! "ఏగెదనంచు రథాధిరూఢుడై" - వెళతాను అంటూనే రథం ఎక్కేసాడన్న మాట. అంటే యాగాన్ని పూర్తి చెయ్యాలని అంత ఆతృత!


మరి తనని అడవులపాలు జేసిన కేశిధ్వజునికి ఖాండిక్యుడు ప్రాయశ్చిత్తాని చెప్పాడా లేదా ఏం చేసాడన్నది వచ్చే టపాల్లో చూద్దాం.

========

Monday, July 25, 2011

విష్ణుచిత్తుని వాదము

శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని తృతీయాశ్వాసాన్ని ఆ వేంకటరాయని ప్రార్ధనతో ప్రారంభించాడు. ఈ ఆశ్వాసంలో విష్ణుచిత్తుడు రాజాస్ధానంలో పండితులను నిర్ద్వందంగా ఓడించిన విధానము, ఖాండిక్య కేశీధ్వజుల సంవాదము వివరిస్తున్నాడు..

కం. శ్రీక్షితినీళా వర! దను
జోక్షప్రాణహర! దంష్ట్రికోత్కృత్తహిర
ణ్యాక్షక్షపాచర! కృపా
వీక్షాదృతబాహులేయ! వేంకటరాయా!


( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం -హమీర్ కల్యాణి )

లక్ష్మీదేవికి, భూదేవికి, నీళాదేవికి నాథుడైనవాడా! వృషభాసురుని (ఉక్షము అంటే ఎద్దు) సంహరించినవాడా! వరాహావతారమున తన కోఱలచే హిరణ్యాక్షుని ఖండించినవాడా! దయతో కుమారస్వామిని ఆదరించిన వేంకటరాయా! అని సంభోదిస్తూ తృతీయాశ్వాసానికి శ్రీకారం పలికాడు రాయలు..
నీళాదేవి కుంభకుడన్న వాని కూతురు. కాలనేమి అనే రాక్షసి కొడుకులు ఆబోతురూపాలలో గొల్లపల్లెను బాధిస్తూ ఉండగా వారిని చంపినవానికి తన కూతురునిచ్చి పెళ్ళి చేస్తానని కుంభకుడు చాటిస్తే, శ్రీకృష్ణుడు వారిని చంపి నీళాదేవిని పెళ్ళి చేసుకున్నాడు. అలానే వరాహావతారంలో భూదేవిని రక్షించి ఆమెకి భర్త అయినాడు. భూ నీళా దేవిల ప్రస్తావన తెచ్చి, దానికి అనుసంధానంగా ఆయా రాక్షసులని సంహరించినవానిగా పేర్కొనడం పద్యానికి ఒక చక్కని అమరిక తెచ్చింది. విశిష్టాద్వైత మతంలో గోదాదేవిని నీళాదేవి స్వరూపంగా భావిస్తారు.
కుమారస్వామి వేంకటనాథుని కొలిచినట్టుగా కథ ఉంది. అతని పేరు మీదనే స్వామి పుష్కరిణి ఏర్పడింది.

శా. నిత్యంబున్ బ్రతిహారి వాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి మ్రొక్కఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్వల రాజదత్త వరరత్న స్వర్ణపీఠస్థుఁడై


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మన్నారుస్వామి ఆదేశానుసారము పాండ్యరాజు కొలువులో పండితులతో వాదమొనరించుటకు వెళ్లాడు విష్ణుచిత్తుడు. ఆ మధురానగర రాజాస్ధానంలో పరతత్త్వ నిర్ణయం కోసమైన వాద ప్రతివాదాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అందులో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలనుండి పండితులు విచ్చేస్తున్నారు. అందుకే అక్కడి ద్వారపాలకుడు రాజుగారికి విన్నవించడం, ఆజ్ఞ తీసుకోవడం లాంటి ఆనవాయితీ లేకుండానే విష్ణుచిత్తుని లోపలికి పంపించాడు. సభలోకి ప్రవేశించిన విష్ణుచిత్తుడు అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ ప్రకాశము చూసి “ఎవరో ఈ మహాత్ముడు!” అనుకుని రాజుతో సహా సభాసదులందరూ లేచి నమస్కరించారు. విష్ణుచిత్తుడు సభలో ప్రవేశించి మహారాజు తనకు సమర్పించిన రత్నఖచిత సింహాసనంలో ఆసీనుడయ్యాడు.

. అతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వ
ద్ర్వాతంబుఁ జూచి, ‘లాఁతుల
మా తరవాయుడుగ? మాటలాడుం’ దనుచు


(ఈ
పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

రాజుగారి
ఆతిధ్యము స్వీకరించిన తర్వాత విష్ణుచిత్తుడు తన మనసునందు మహావిష్ణువు ఆవరించగా, తమ వాదము మాని నిశ్శబ్దంగా ఉన్న పండితులను చూస్తూ “మనమేమన్నా పరాయివాళ్లమా? వాదం ఎందుకు ఆపారు? మొదలెట్టండి!”, అన్నాడు. విష్ణువు తన చిత్తంలో పూర్తిగా అలముకొని, విష్ణుచిత్తుడన్న అతని పేరు గొప్ప సార్థక్యాన్ని పొందిందిప్పుడు. అందుకే అతనిలో ఆ తేజస్సు! విష్ణుచిత్తుని మాటల్లోని చొరవ గమనించాలి. అదంతా విష్ణుమూర్తి చలవే!

సరే వాదప్రతివాదాలు మళ్ళీ మొదలుపెట్టారు పండితులు. కొన్ని మాటల్లోనే వారి తెలివితేటలు గ్రహించి, వారి వాదములో లోతులేదని తనలో తాను నవ్వుకొని, పండితుల చెప్పుతున్నది పూర్తయిన తర్వాత తాను కూడా మాట్లాడేందుకు రాజు అనుమతిని తీసుకున్నాడు విష్ణుచిత్తుడు. రాజును మధ్యవర్తిగా ఉండమని తన వాదమును ప్రారంభించాడు.

సీ. అందులో నొకమేటి కభిముఖుండై యాతఁ
డనిన వన్నియును మున్ననువదించి;
తొడఁగి యన్నిటి కన్ని దూషణంబులు వేగ
పడక తత్సభ యొడఁబడఁగఁ బల్కి
ప్రక్కమాటల నెన్న కొక్కొకమాటనె
నిగ్రహస్థాన మనుగ్రహించి;
క్రందుగా రేఁగినం గలఁగ కందఱఁ దీర్చి
నిలిపి; యమ్మొదలి వానికినె మగిడి;

తే. మఱి శ్రుతి స్మృతి సూత్ర సమాజమునకు
నైక కంఠ్యంబు గల్పించి, యాత్మమతము
జగ మెఱుంగఁగ రాద్ధాంతముగ నొనర్చి;
విజితుఁగావించి దయ వాని విడిచి పెట్టి



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)
వాదమంటే ఎలా జరపాలో చక్కగా వివరించే పద్యమిది! ఆనాటికే కాదు ఈనాటికీ ఎవరు చక్కని వాదము చెయ్యాలన్నా యీ పద్ధతినే అనుసరించాలి. ముఖ్యంగా చట్ట సభలలో వాదులాడుకొనే మన నాయకులు దీన్ని నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది!
విష్ణుచిత్తుడు ముందుగా అక్కడి పండితులలో మేటియనిపించిన ఓ పండితుడి వైపు తిరిగి అతని వాదమును మొత్తం అనువాదము చేసి, ఆ వాక్యాలలోని దోషాలను ఒక్కటొక్కటిగా ఎత్తి చూపుతూ సభలోనివారందరూ అంగీకరించి మెచ్చుకొను విధంగా వాటిని ఖండించాడు. ప్రక్కనున్న పండితులు పలికే వితండ వాదాన్ని పట్టించుకొనక ఒక్కో మాటతోనే క్లుప్తంగా వారి పరాజయ హేతువును సూచించాడు. తమ పరాజయాన్ని తట్టుకోలేని పండితులు మూకుమ్మడిగా తనతో వాదానికి దిగినా ఏమాత్రం జంకకుండా అందరినీ సమాధానపరిచాడు. తర్వాత తనతో వాదమునకు దిగిన మొదటి పండితుని వైపు తిరిగి వేదాలు, బ్రహ్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు – వీటన్నిటి పరమార్ధం ఒక్కటే అని వాటి ఏకవాక్యతని (ఏకగ్రీవతని) స్ధాపించిన పిమ్మట స్వమతము అనగా శ్రీవైష్ణవమే విశిష్టమైనదని లోకానికి స్పష్టం చేసాడు. తనచేతిలో ఓడిన పండితుడిని దయతో క్షమించి విడిచిపెట్టాడు. ఇదే విధంగా అక్కడ వాదించిన పండితులందరితోనూ ప్రతివాదము చేసి ఒక్కొక్కడినే ఓడించాడు విష్ణుచిత్తుడు.

ఆ చేసే వాదములో అన్యమత ఖండనం ఎలా చేసాడో ఈ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు. పెద్ద వ్యాఖ్యానం అవసరమైన పద్యమిది. ఈ పద్యం అర్థం కావాలంటే అసలు మన భారతదేశంలో పూర్వమున్న మతాల అన్నిటి గురించి మనకి తెలియాలి. మనకిప్పుడు "హిందూ మతం"గా చెలామణీ అవుతున్నది నిజానికి చాలా "మతాల" సమ్మేళనం. అయితే ఇంచుమించుగా ఈ "మతాలన్నీ" వేదాలని ఆధారం చేసుకున్నవే.
ఇప్పుడీ పద్యంలో ప్రస్తావించిన మతాలు ఒక్కొక్కటే ఏమిటన్నది చూద్దాం.

సీ. 'జగదుద్గతికిని బీజము ప్రధాన' మన 'నీ
క్షత్యాది' వీశు నశబ్దవాదిఁ
బొరి 'నీశుఁడేన' నా 'భోగమాత్రే'త్యాద్యు
దాహృతిస్ఫూర్తి మాయావివాది,
'ఫలియించుఁ గ్రియయ' నా 'ఫలమత' యిత్యాది
సర్వేశుఁ గొనని యపూర్వవాది,
'శాస్త్రయోనిత్వాది' సరణి నీశ్వరునిఁ దె
ల్పెడు 'ననుమాన' మన్పీలువాది

'నిత్యులందెల్ల నిత్యు'డన్ శ్రుత్యురూక్తి
'క్షణిక సర్వజ్ఞ తేషి' సౌగత వివాది,
'ననుపవత్తేర్నా' యను సూత్ర మాదియైన
వాణి 'నృపతీశు' బ్రత్యక్షవాది గెలిచె


( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)

మొదటి పాదంలో ఉన్నది సాంఖ్యమనే మతం. దీనినే సాంఖ్యదర్శనం అంటారు. ఈశ్వరుడు లేదా బ్రహ్మము, శుద్ధ జ్ఞానస్వరూపమని, జత్ సృష్టికి మూలకారణం "ప్రధానము"(ప్రకృతి) అని చెప్పే మతమిది. అయితే దీనిని "ఈక్షతేర్నాశబ్దం" అనే బ్రహ్మసూత్రాన్ని ఉపయోగించి ఖండిచాడు విష్ణుచిత్తుడు. ఈ బ్రహ్మసూత్రం సంఖ్య 1:1:5. దీని వివరణ ఏమిటంటే - "తదైక్షత బహూస్యాం" అనే శ్రుతి వాక్యాన్ని బట్టి, "తాను అనేకత్వాన్ని పొందాలని సృష్టి కారకమైన బ్రహ్మము ఈక్షణము (సంకల్పము) చేసినది" అని వేదాలలో చెప్పబడింది. కాని ప్రకృతికి (అచేతనము కాబట్టి), అలాంటి "సంకల్పము" చేసే శక్తి లేదు. అంచేత అదే జగత్తుకి మూలమని చెప్పడం "అశబ్దం" అంటే వేదాలకి సమ్మతం కాదు. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్య అంశమేమిటంటే, ఈ మతాలన్నిటికీ కూడా వేదాలే ఆధారం. అంచేత ఈ వాదోపవాదాలన్నీ కూడా వేదాలని అనుసరించి జరిగేవే. వేదాలు ఒక common platform అన్నమాట!

ఇక రెండవ పాదంలో ఉన్నది అద్వైతము. ఇది "ఈశుడు ఏనె" అంటే, నేనే ఈశ్వరుడిని అని, జగత్తు కేవలం మాయ అని చెప్పే మతం. దీనిని "భోగమాత్ర సామ్య లింగాశ్చ" అనే బ్రహ్మసూత్రం చెప్పి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది బ్రహ్మసూత్రాలలో, నాలుగవ అధ్యాయంలో నాలుగవ పాదంలో ఇరవై ఒకటవ సూత్రం (4:4:21). దీని వివరణ ఏమిటంటే - ముక్తి పొందిన జీవుడు, కేవలం ఆనందానుభవంలో మాత్రమే పరమాత్మతో సమానుడవుతాడు అని వేదం ప్రతిపాదించిన విషయం. అంటే, జగత్ సృష్టిస్థితిలయాది శక్తులు ముక్తిపొందిన జీవాత్మకి సంభవించవు. అవి పరమాత్మకి మాత్రమే ఉంటాయి. ఆ విధంగా, జీవాత్మ పరమాత్మల మధ్య సంపూర్ణమైన అద్వైతం సంభవం కాదు.

మూడవ పాదంలో చెపుతున్న మతం మీమాంస. కర్మయే జీవికి సుఖదుఃఖాది ఫలాలను ఇస్తుందని యీ మతం చెపుతుంది. దానిని "ఫలమత ఉపపత్తేః" అనే బ్రహ్మసూత్రాన్ని చూపించి ఖండించాడు విష్ణుచిత్తుడు. ఇది మూడవ అధ్యాయం రెండవ పాదంలో ముప్పై ఎనిమిదవ సూత్రం(3:2:38). కర్మఫలాన్ని ఇచ్చేది బ్రహ్మమే అని యీ సూత్రం చెపుతుంది.

నాల్గవది వైశేషిక దర్శనం. దీనిలోనిదే పీలువాదము, అంటే పరమాణువుల సంయోగముతో జగత్తు ఏర్పడుతుందని చెప్పే వాదము. ఈ మతం అనుమాన ప్రమాణాన్ని ఆధారం చేసుకుంటుంది. అనుమాన ప్రమాణం అంటే కార్య కారణ సంబంధాన్ని ఉపయోగించి సత్యాన్ని నిర్ణయించడం. ఉదాహరణకి దూరంగా కనిపించిన పొగనిబట్టి, అక్కడ నిప్పు ఉండి ఉండాలని నిర్ణయించడం (నిప్పుని ప్రత్యక్షంగా చూడకపోయినా). ఇది ఒక రకంగా ఇప్పటి హేతువాదానికి దగ్గరగా ఉంటుంది. ఈ మతాన్ని విష్ణుచిత్తుడు, "శాస్త్ర యోనిత్వాత్" అనే బ్రహ్మసూత్రం ఆధారంగా పరాస్తం చేసాడు. ఇది మొదటి అధ్యాయం మొదటి పాదంలో మూడవ సూత్రం. ఇందులో "శాస్త్రం" అంటే వేదం. వేదాలని పుట్టించినవాడు పరబ్రహ్మమని, అతడిని తెలుసుకోడానికి ఆ వేదాలే ఆధారమని యీ సూత్రం చెపుతుంది. కాబట్టి పరబ్రహ్మాన్ని గూర్చి తెలుసుకోడానికి వేదాలే ప్రమాణం కాని వైశేషికుల అనుమాన ప్రమాణం సరికాదని ఆ వాదాన్ని ఖండించాడు.

తరువాతది బౌద్ధమతం. సౌగతుడు అంటే బౌద్ధమతాన్ని అనుసరించేవాడు. బౌద్ధమత ప్రకారం జగత్తులోని సర్వ వస్తువులూ క్షణికాలు. వారిని క్షణికవాదులు అంటారు. బౌద్ధం నిరీశ్వర వాదం. ఈ వాదాన్ని కఠోపనిషత్తులోని "నిత్యో నిత్యానాం" అనే వాక్యంతో ఖండిచాడు విష్ణుచిత్తుడు. అంటే పరబ్రహ్మము నిత్యమైన వాటిలోకెల్లా నిత్యమైనది అని.

తర్వాతది చార్వాకమతం. ఇది కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్నే అంగీకరిస్తుంది. అంటే కనిపించేదే నిజమని నమ్మేది. ఇది ఒక రకంగా ఇవ్వాళ మనకి కనిపించే భౌతికవాదం అని అనవచ్చు. చార్వాకులు రాజే ఈశ్వరుడని అంటారు. ఈ మతాన్ని "అనుపపత్తేస్తు న శారీరః" అనే బ్రహ్మసూత్రంతో ఖండించాడు. ఈ సూత్ర సంఖ్య 1:2:3. జీవునికి ఉండే భౌతికమైన శరీరము బ్రహ్మమునకు ఉండదు అని చెపుతుంది. అందువల్ల బ్రహ్మాన్ని గురించి భౌతిక పరిశీలనతో తెలుసుకోవడం సాధ్యము కాదు. బౌద్ధ మతాన్నీ చార్వాకాన్నీ నాస్తిక మతాలుగా (అంటే వేద ప్రామాణ్యాన్ని ఒప్పుకోనివి) భావిస్తారు.

ఈ విధంగా అక్కడున్న సమస్త మతాలవారి వాదములని విష్ణుచిత్తుడు ఖండించాడు. ఈ పద్యమంతా రాయలవారి తత్త్వ పరిజ్ఞానానికి అనుపమ నిదర్శనం. ఇందులో చూపించిన అన్యమత ఖండనమంతా శ్రీమద్రామానుజాచార్యులవారు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యాన్ని (దీనికి శ్రీభాష్యమని పేరు) ఆధారంగా చేసుకున్నదే. ఆరు మతాలనూ, వాటి ఖండన విధానాన్ని ఒకే పద్యంలో గుత్తెత్తించడం సామాన్య విషయం కాదు. విష్ణుచిత్తుడి చేత ఎలా ఆ వాదాన్ని జరిపించాడో, అలాగే రాయలవారి చేత ఆ విష్ణువే వ్రాయించాడేమో అనిపించేంత ఆశ్చర్యకరమైన విషయమిది!

శా. విద్వద్వందితుఁడాత డిట్లు సుఖ సంవిత్తత్వబోధైక చుం
చుద్వైపాయనసూత్రసచ్ఛ్రుతుల నీశున్ మున్ నిరూపించి, పైఁ
దద్విష్ణుత్వము దాని కన్య దివిషద్వ్యావర్తనంబున్ విశి
ష్టాద్వైతంబును దేటగాఁ దెలుప మాటాడెన్ బ్రమాణంబులన్


( ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం.. ఖరహరప్రియ )

విద్వాంసులచేత స్తుతించబడిన ఆ విష్ణుచిత్తుడు, యీ విధంగా సచ్చిదానంద రూపమైన పరమేశ్వరుని ఉనికిని బ్రహ్మసూత్రములూ శ్రుతి వాక్యముల ద్వారా ముందు స్థాపించి, తర్వాత ఆ పరమాత్మ యొక్క విష్ణుత్వమునూ ఆతనికీ ఇతర దేవతలకీ ఉన్న భేదమునూ తద్వారా విశిష్టాద్వైతమునూ ప్రమాణ పూర్వకంగా స్పష్టముగా బోధించాడు. ముందు అన్య మత నిరసనం చేసి తరువాత స్వమత స్థాపన చేసాడన్న మాట. విశిష్టాద్వైతాన్ని ఎలా స్థాపించాడో యీ కింద పద్యంలో వివరిస్తున్నాడు రాయలు.

సీ. ఆదినారాయణుండాయె నొక్కఁడ, బ్రహ్మ
లేఁడు, మహేశుండు లేఁడు, లేదు
రోదసి, లేఁడు సూర్యుఁఢు, లేఁడు చంద్రుండు,
లేవు నక్షత్రముల్, లేవు నీళ్లు,
లే దగ్ని; యట్లుండ 'లీల నేకాకిత
చనదు; పెక్కయ్యెద ననుచు నయ్యెఁ
జిదచిద్ద్వయంబు సొచ్చి' యని ఛాందోగ్యంబు
దెలిపెడు; నంతరాదిత్యవిద్య

తే. నర్కులోఁ బుండరీకాక్షుఁ డతఁడ యగుట
కక్షిణీయని యష్టదృక్ త్ర్యక్ష దశ
తాక్ష విధి రుద్ర శక్రాదులందు నొకఁడు
కామి కాశ్రుతియే విలక్షణతఁ దెలిపె




( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

సృష్టి ఆరంభంలో నారాయణుడొక్కడే అంతటా నిండి ఉండేవాడు. బ్రహ్మ, ఈశ్వరుడు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, అగ్ని.. ఏవీ లేవు. అట్టి పరిస్థితుల్లో, అంతటా నేనొక్కడనై ఉంటే లీల జరగదని, ఒక్కడినే అనేకమవుతాను అని సంకల్పించిన నారాయణుడు, చేతన అచేతన పదార్థాలలో ప్రవేశించి తానే బహురూపములయ్యాడు. ఛాందోగ్యంలోని అంతరాదిత్య విద్యలో తెలిపినట్టుగా సూర్యునిలో ఉన్న పుండరీకాక్షుడతడే! ఎనిమిది కన్నులున్న బ్రహ్మ, త్రినేత్రుడైన రుద్రుడు, సహస్రాక్షుడైన ఇంద్రుడు - వీరందరిలో ఒకడు కాడు, వారికంటే అతీతుడు. అందుకు ఛాందోగ్యం "అక్షిణి" అంటూ రెండు కన్నులున్నవానిగా పేర్కొనడమే నిదర్శనం. అంతేగాక ఈ సృష్టి అంతటా లోపల, వెలుపల తానే నిండివున్నాడన్న విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తు ఉద్ఘోషిస్తుంది.. కాబట్టి శ్రుతి విష్ణువే పరమదైవమని చెపుతున్నదని శ్రీవైష్ణవ మతాన్ని స్థాపించాడు.

ఈ పద్యంలో రాయలవారు అనేక ఉపనిషత్ వాక్యాలను తెనిగించారు. ఉదాహరణకి "ఆదినారాయణుండాయె నొక్కడు..." మొదలైనవి మహోపనిషత్తులోని యీ ఉక్తికి అనువాదం: "ఏకో హ వై నారాయణ ఆసీన్న బ్రహ్మా నేశానో నాపో న్నాగ్నీషోమౌ నేమే ద్యావా పృథివీ న నక్షత్రాణి న సూర్యో న చంద్రమాః". అలాగే ఛాందోగ్యోపనిషత్తులో "త దైక్షత బహు స్యాం ప్రజాయేయేతి..." అనే వాక్యం - "లీల ఏకాకిత చనదు పెక్కయ్యెదననుచు..." అన్నదానికి మూలం.
మనకి ఉపనిషత్తులలో మొత్తం 32 బ్రహ్మవిద్యలు ఉన్నట్టుగా పండితులు గుర్తించారు. అందులో అంతరాదిత్య విద్య ఒకటి. బ్రహ్మవిద్య అంటే పరబ్రహ్మమును తెలుసుకొనే మార్గాన్ని బోధించేది. అది అంత సులభ వంటబట్టే విద్య కాదు. అందుకే "అదొక బ్రహ్మవిద్యా!" అన్న నానుడి వచ్చింది (ఇంగ్లీషులో It is not a rocket science అన్నట్టుగా). "యెయేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుషాః" అని ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది అంతరాదిత్య విధ్య. సూర్యమండల మధ్యంలో హిరణ్మయ (బంగారపు కాంతులతో ప్రకాశించే) పురుషుడిని ఉపాసించే విద్య యిది. ఆ పురుషుని గురించి వివరిస్తూ, "తస్య యదా కప్యాసం ఏవమక్షిణి" అని ఆ ఉపనిషత్తు చెపుతుంది. అంటే, సూర్యునిచేత అప్పుడే వికసింపబడిన పద్మాల వంటి నేత్రద్వయం కలిగినవాడు అని.

ఇంకా అనేక వేదోపనిషత్ వాక్యాల ఆధారంగా సర్వమునకు పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని నిరూపించాడు విష్ణుచిత్తుడు. అంతే కాదు, బ్రహ్మరుద్రాదులు ఆయా సమయాలలో కొన్ని ప్రయోజనాల కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన రూపాలే కనుక ధర్మార్థకామాలని కోరే వారు తప్ప, మోక్షం కావాలనుకున్న వారికి వారినారాధించటం కర్తవ్యం కాదని నిర్ధారణ చేసాడు. ముముక్షువు (ముక్తిని ఆకాంక్షించేవాడు) పరమాత్ముడైన పుండరీకాక్షుని ఆశ్రయించక తప్పదని తేల్చి చెప్పాడు.

ఇలా విశిష్టాద్వైతాన్ని స్థాపించిన అనంతరం, ఆ పరమాత్మ అయిన నారాయణుని ఎలా తెలుసుకోవడమో తెలియజెప్పే ఖాండిక్య-కేశిధ్వజ సంవాదమనే కథని చెపుతున్నాను వినమని ఆ కథని చెప్పడం ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.
ఖాండిక్య-కేశిధ్వజుల కథ తరువాతి టపాల్లో...
Related Posts Plugin for WordPress, Blogger...