తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, February 20, 2019

గోదాదేవి వృత్తాంతము - 1

మనం ప్రస్తుతం పంచమాశ్వాసంలోకి ప్రవేశించాం. అన్ని ప్రబంధాలలో ఆశ్వాసాంతంలో దైవప్రార్ధనతో స్వస్తి పలికినట్లే ఆశ్వాసారంభం కూడా దైవ ప్రార్ధనతోనే ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణుని కీర్తిస్తూ ఆరంభించాడు. ఇక చదవండి.
కం.శ్రీ నీళా జాంబవతీ
మానస తామరస విహార మాణ మిళిందా
భా నద్యుదయ కళిందా
నానాంఘ్రిశిరోక్ష శేషనగ హర్యక్షా!    (5-1)
శ్రీకృష్ణ భగవానునికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, సుదంత, మిత్రవింద, లక్షణ అనేపేర్లు గల ఎనిమిది మంది భార్యలు. అందు కుంభుడను గొల్లదొర కూతురు నీళాదేవి, జాంబవంతుని కుమార్తె జాంబవతి వీరిద్దరూ పట్టపు రాణులు. వారి హృదయములయందు స్వామి తుమ్మెద తామర పూలలో ఎట్లు విహరించునో అట్లు విహరిస్తాడు అని చెప్పి స్వామి వర్ణన కొనసాగిస్తూ, నల్లనైన కళింద పర్వతము నుండి నల్లనైన యమునానది జనించిన రీతిగా నల్లని దేహకాంతి కలిగినవాడా అని కీర్తిస్తూ, లెక్కలేని పాదములు, లెక్కలేని నేత్రములు, లెక్కలేనన్ని శిరస్సులు కలిగినవాడా అని శ్రీమహావిష్ణువును కీర్తిస్తున్నాడు. ఏదైనా ఒక కొండ గుహలో సింహము నివసించినట్లు శేషాచలం అనే కొండలో నివసించే శ్రీవేంకటాధిపా అని అత్యంత విశిష్టంగా కీర్తిస్తూ ఆశ్వాసారంభం జరిగింది.
రాయలవారు పురుషసూక్తం నిత్యం పఠించేవారని పై పద్యం వలన తెలుస్తుంది. దానిలో "ఓం సహస్రశ్శీర్షా పురుష: సహస్స్రాక్షాత్ సహస్రపాత్" అని మొదలెడతాం. భావం మొత్తం యధాతధంగా విరాట్స్వరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క అనంతమైన శిరస్సులను, నేత్రాలను, పాదాలను ఒక్కసారి తలుచుకుని ఆరంభించడం వలన  రాయలవారికే గాక ఈ కావ్యం చదివినవారికి కూడా సర్వపుణ్యలోకాలు లభించగలవు.
"అవధరింపు మవ్విష్ణుచిత్తుండు" (5-2)  అనే వచనం ముందున్న పద్యానికి కర్తృత్వంగా భావించవలెను.
మహాస్రగ్ధర: ఒకనాడామ్రాంకు రౌఘం బురు కుసుమ కుడుం గోదర క్షోణి దల్ప
ప్రకరంబై కాంక్షచే మున్పతుల బదరిపై బ్రౌఢి వాటించి నిట్టూ
ర్పెక దొట్టం డస్సి వీరాయిత మఱి మఱితా రెట్ల  మున్నట్ల యౌనా
యికలం గందర్పుడోటం బెఱిగి తఱిమి వీపేసెనానంటు తోటన్ (5-3)

వసంత ఋతువు వచ్చింది. పూదోటలోని పొదరిండ్లన్నీ నిండార పుష్పించి సుమధురంగా శోభిస్తున్నాయి. వానిలోపల వున్న విశాలమైన ప్రదేశాలలో లేమావి చిగుళ్ళ మొత్తలు ఆ పొదలకు పాన్పులాగా అమరి యుండగా అనుదులో స్త్రీపురుషులు విశృంఖలంగా రతిక్రీడా నిమగ్నులై యున్న విధం చెప్తున్నాడు రాయలవారు. నాయికలు మొడట సమరతియందున్నవారు, తర్వాత నాయకులను బెదిరించి పురుషాయితమునకు బాల్పడి, దాని వలన డస్సి, మరలా యధాతధంగా క్రిందకు చేరుతున్నారు. తద్వరా  ఆ పొదలలోని మావి చిగుళ్ళు పురుషుల వెనుకభాగాన వీపులకు అంటుకున్నాయి. ఆ అంటుకొన్న విధాన్ని ఎలా చమత్కారంగా ఒక ఉత్ప్రేక్షాలంకారంలో రాయలవారు చెప్పడం గమనించవలసి యున్నది. మరునికళలో ఓడినందువలన మన్మధుడు వారిని తరిమి వీపులపై చరిచినట్లున్నది అని చెప్తున్నాడు.
ఇట్టి వనమునందు ఒక నాడు విష్ణుచిత్తుడు అని ముందు పద్యంతో అన్వయం ఉంది. ముఖ్యంగా ఈ పద్య నేపధ్యం అర్ధం చేసుకోవలసిన అగత్యం ఉంది. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని పద్యంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టుగా రాబోయే పద్యాలలో గోదాదేవిని విష్ణుచిత్తుడు దర్శించడానికి ఏర్పరచిన గొప్ప నేపధ్యాన్ని నర్మగర్భంగా రాయలవారు సూచించారని తెలుస్తున్నది.

ఉ. వింగడమైన యొక్క వనవీధి గనుంగొనె నీడ సున్నపున్
రంగుట రంగు పచ్చల యరంగయి పో వెలిదమ్మి బావికిం
జెంగట నుల్లసిల్లు తులసీవన సీమ శుభాంగి నొక్క బా
లం గురువింద కందళ దళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్. (5-4)
 
విష్ణుచిత్తుడు ఆ శృంగారవీధిలో నడుస్తూ చెట్ల నీడలచేత మరకత మయమయినట్లుగా కనపడుచుండగా దాని సమీపమున ఉన్న ఒక తులసీవనములో శుభలక్షణాలను కలిగి యున్న ఒక ఆడ శిశువును చూశాడు.  భావం విషయం కాసేపు ప్రక్కన బెట్టి ఇక్కడి విశేషాన్ని గమనిస్తే కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలో “ఒక్కబాలంకనుగొనె అని మాత్రమే  కావ్యంలో వ్రాశాడు. ‘అయోనిజ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. గోదాదేవి  దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఈ కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి. కానీ, సీత పొలంలో దొరికినట్టే, గోదాదేవి పూదోటలో దొరికినట్టు రాయల తరువాతి కవులు పోల్చే ప్రయత్నం చేశారు.
అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్
పైన పేర్కొన్న పద్యం 17వ శతాబ్దికి చెందిన నందవర భాస్కర శేషాచలామాత్యుడు గారి “నాచ్చారు పరిణయం కావ్యంలోది “అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీతభూమిలో దొరికినట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడీ పద్యంలో కవి. అంతేకాదు తాళ్ళపాక తిరువేంగళనాథుడు కూడా ‘పరమయోగి విలాసంలో ఇదే అర్థంలో గోదాదేవిని వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమేదేవుడు! రాయలవారి ఆనాటి సమాజదర్పణం ఈ కావ్యం.

చ. కనుగొని విస్మయం బొదవగా గదియంజని సౌకుమార్యముం
దను రుచియు న్సులక్షణ వితానము దేజము జెల్వు గొంత సే
పనిమిష దృష్టి జూచి యహహా!యనపత్యున కమ్ముకుందు డే
తనయగ నాకు నీ శిశువు దా గృప సేసె నటంచు హృష్టుడై (5-5)

ఆ శిశువును చూసి ఆశ్చర్యపడ్డాడు విష్ణుచిత్తుడు. దగ్గరకు వెళ్ళి ఆ శరీర కోమలత్వము, మేని వన్నెను, శుభలక్షణాలను గమనించాడు. కొంత వడి రెప్పలార్చక చూసిన పిమ్మట ఆహా! ఏమి నా భాగ్యము.నా పుణ్యము. నేను బిడ్డలు లేని వాడినని తలచి నా మీద కరుణించి ఆ శ్రీమన్నారాయణుడు నాకు ఈమెను కూతురుగా ప్రసాదించాడు అని సంతోషంతో ఎంతో పొంగిపోయాడు. ఆమె భగవన్నిర్ణయముగా భావించి పాలిచ్చి పెంచు చుండెను. ఆమె వయసునకు వచ్చిన విధమును వర్ణిస్తున్నాడు రాయలవారు.
సీ.వాతెఱ తొంటికై వడి మాట లాడదు
కుటిలవృత్తి వహించె గుంతలంబు
లక్షులు సిరులురా నరచూడ్కి గనుగొనె
నాడించె బొమగొని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్ష గడకొత్తె
బాణిపాదము లెఱ్ఱవాఱదొడగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
ఱొచ్చోర్వ కీటు లోగజొచ్చె మేను
తే.గీ వట్టిగాంభీర్య మొక్కడు వెట్టుకొనియె
నాభి నానాటి కీగతి నాటిపొందు
చవుకయైనట్టి యిచ్చట జనదు నిలువ
ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె. (5-7)

ఆమె అధరోష్టము పూర్వమువలె మాటాడడంలేదనడంలో ఆమెలో రాజసం హెచ్చిందన్న భావం స్ఫురింపజేశాడుతల వెండ్రుకలు పూర్వంలాగా సాధారణంగా ఉండడంలేదు, వంకరలు తిరిగాయి ఆరాళ కుంతల అయిందని చెప్తున్నాడు. కంటి చూపు చిన్ననాటివలె చూడడం లేదు. యౌవనాతిశయం చేత నీల, రక్త, శ్వేత వర్ణములచే మెరుగెక్కి విలాసవంతమయినాయట. కనుబొమలకు కాంతి హెచ్చింది. స్తనములనెడి వస్త్వంతరములు కలిగిన యనంతరం తన్నుపేక్షించి జేరనీక మూలకు ద్రోచెను అనగా జవ్వనమందు చన్నులు చెన్నుమీరెనను భావము. యౌవనం అంకురించగా కాళ్ళు చేతులు ఎరుపెక్కసాగాయి. లేమియే గానీ చిన్ననాటి కలిమి నడుముకు లేదనడంలో నడుము చిక్కి సన్నబడినదని అర్ధము. సందడి కోర్వదు. గతంలో వలె గాక బెట్టుగా యుంటూ ఉన్నది. అలనాటి స్నేహము ఇప్పుడు వుండగూడదన్నట్టుగా శరీరంలో బాల్యం తొలిగిపోయిందని భావము.

Saturday, January 26, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 3

యామునాచార్యుడు కొడుకుకు రాజనీతి బోధ కొనసాగిస్తున్నాడు. రాజైన వాడు ఎప్పుడూ ఒకటిరెండు విషయాలకే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మి ఆవేశపడి చర్యలు తీసుకొనక.. వాడు తనకు నిజంగానే హితము చెప్పుచున్నాడా లేక పరహితము కోరే వాడా అన్న సంగతులను ఎప్పటికప్పుడు ఇతరులచే విచారణ జరిపిస్తూ ఉండాలి. తొందరపడి ఆవేశపడి ఎటువంటి నిర్ణయములు చేయరాదని భావన.
ఇక రాజు దినచర్య ఎలా ఉండాలో తెలుసుకొవలసిన అగత్యం గురించి యామునాచార్యులవారి ద్వారా రాయలవారు తెలియజేస్తున్నారు. రాజు యొక్క దినచర్య వివరంగా తెలియపరచిన విధానం మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సీ.సౌఖ శాయనిక భిషక్పూర్వకము కల్య
వేళ గార్తాంతిక ద్విజుల గోష్ఠి
జామువోవ నమాత్య సామంత పూర్వకం
బర్ధార్జనస్థ కాయస్థ గోష్ఠి
దిన మధ్యమమున మర్దన మల్లపూర్వకం
బగు సూదసూప కృన్మృగయు గోష్ఠి
యపరాహ్ణమున దేవతార్చనా పూర్వకం
బార్య ధర్మాది కృద్యతుల గోష్ఠి
తే.గీ.భక్తిమీద విదూషక పూర్వకము పు
రాణ కవిగోష్ఠి, చారపూర్వకము సంజ
జాము గాయక గోష్ఠి, నిశన్ సుషుప్తి
పూర్వకము ప్రేయసీ గోష్ఠి  పొసగు బతికి.
          
           ప్రాత:కాలమున సుఖ నిద్రనడుగువారు, వైద్యులను, జ్యోస్యులగు బ్రాహ్మణులను రాజు దర్శించవలెను. రాజు వారితో తన దేహారోగ్యమును గూర్చి గ్రహానుకూలతాననుకూలతల గురించి చర్చించవలెను. ఝాము ప్రొద్దు ఎక్కిన తరువాయి మంత్రి సామంతులతోను, ధనార్జన నియుక్తులయిన కరణము వంటి వారితో ఆదాయ వ్యయముల గురించి చర్చించవలెను. తరువాయి అంగమర్దనము, మల్లురతో వ్యాయామము,వంటవారితోను, వేటగాండ్రతోను తెచ్చిన మాంసము గురించి తేవలసిన విశేషములను మాట్లాడవలెను. అపరాహ్నమున దేవతార్చన సమయమున, పెద్దలతో, ధర్మాధికారులతో సన్యాసులతోను భాషించదగును. భోజనానంతరం విదూషకులతో హాస్య సంభాషణము సాగించాలి. పౌరాణికులతో, కవులతో గోష్ఠి కార్యక్రమములు నిర్వహించవలెను. నాలుగవ జామున చారులకు దర్శనమీయవలెను. పాటకచేరీలు, రాత్రి ప్రేయసితో సరస సల్లాపములు తదుపరి సుఖ నిద్ర.

చ. హితులు భిషగ్గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్హితా
హితులు ధనార్జనాది నృపకృత్యనియుక్తులు వెండి కేవలా
హితులు దశావశార్పిత సమృద్ధ రమాహరణేచ్ఛు; లౌటనా,
హితమును నట్లకా జతుర వృతింజరించుట నీతి రేనికిన్.

రాజునకు వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు ఎప్పుడూ మేలునే చేకూర్చుదురన్న సత్యము మరువరాదు. ధనార్జన లోనగు రాచకార్యములలో అధికారులు హితులగుదురు. రాజద్రవ్యమును అపహరించుట, కనిపెట్టి దండించునన్న భయము వలన అహితులు అగుదురు.  వారి ధన సమృద్ధిని  దుర్వృత్తిని రాజు అణచుటకు పూనుకొనును కాన, వారు ఏ విధముగానైనా రాజును మదిలో ద్వేషిస్తూనే ఉంటారు. కావున రాజు అనేవాడు ఈ మూడు తరగతుల వారిని సదా కనిపెట్టి మంత్రాంగం సాగించాలి. రాజు కూడా హితుడుగా, హితాహితుడుగా, కేవల హితుడుగా నటించవలసి యుండును.

కం.తనుభృశ దమనజ సుకృతము
ధన దత్తిన కొనగ వలయు దత్త దృతుక
మర్దన మజ్జన భోజనలే
పన వసన ప్రసవ వహన పరతం బతికిన్.

    రాజ్యాన్ని ధర్మబుద్ధితో న్యాయాన్యాయ విచక్షణతో పరిపాలించే రాజు సకల భోగములను హాయిగా అనుభవించవచ్చు. దేహదమన కారివలె తపస్సు చేయనక్కరలేదు. పుణ్యమును దాన ధర్మములచే పొందవచ్చును.

కం. విను వర్గసమత నృపుడు
న్నను ధర్మాంశంబె హెచ్చెనా, పెరమడి కె 
త్తిన నీరును దెగి యలరా
జనపు మడికి నెక్కినట్లు చను ముదమందన్.

ధర్మార్ధ కామ మోక్షములు మూడింటిలోను రాజు ధర్మము విషయమై ఎక్కువ ధనము ఖర్చైనట్లైతే మిక్కిలి సంతోషించాలి. మూడింటిలో ధర్మ విషయమైన విషయాలకే అధిక ప్రాధాన్యత ఉండాలని అర్ధం.

కం.చేయునది రాజ్యమట, యఘ
మే యవధిగ నీగువారమే మనజన; దా
మ్నయాంబు  నశక్యాను
ష్ఠేయము జెప్పదు; స్వశక్తి జేయగ జెప్పున్.

రాయలవారు ఒక వంక రాజ్యం చేస్తూనే మరోవంక సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేవారు. అందువల్లనే తను నమ్మిన, ఆచరించిన సూత్రాలను, ఇంకా తనకు తిమ్మరుసు, మంత్రులు, దండనాయకులు చెప్పిన రాజనీతిని భావితరాలకు ఈ ఆముక్తమాల్యద గ్రంధం ద్వారా  అందించాడు. "రాజ్యాంతే నరకం ధృవం" అన్న విషయం గురించి  రాయలవారు వివరిస్తున్నారు. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తాడు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులలో హింసకు పాల్పడడం జరుగుతుంది. అందువల్ల నరకప్రాప్తి గలుగుతుందన్న విషయం తెలియనిది కాదు. అందువల్ల భవిష్యత్తులో రాజులు చక్రవర్తులు పాప భయంతో బెరుకుగా అసమర్ధవంతమైన పరిపాలన చెయ్యకూడదన్న ఉద్దేశ్యంతో, యామునాచార్యుని పాత్ర ద్వారా వివరిస్తున్నారు.  యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే పుణ్యం కలుగుతుంది నిజమే!  కానీ ఆవిషయం ఎవరూ స్వర్గం నుండి కానీ నరకం నుండి కానీ వచ్చి చెప్పలేదుకదా!  అందువల్ల రాజు తన కర్తవ్యం ప్రకారం నమ్మిన సత్యాన్ని అమలు పరుస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారా లేదా అన్న విషయం మాత్రమే గ్రహిస్తే చాలు. మనుదండధరాధులు దోషమని తెలిసికూడా కర్తవ్య నిర్వహణ చేయడం ఉదహరిస్తూ..వివిధ పురాణాలలో ఉన్న న్యాయాన్యాలను, వివిధ శిక్షణల గురించిన విషయాలను విపులీకరించి చెప్తున్నారు రాయలవారు.

చతుర్ధాశ్వాసం ముగిస్తూ రాయలవారు ఒక చక్కని శార్దూల పద్యాన్ని రచించారు. దానిలో తను కటకమును జయించి పొట్నూరు వద్ద విజయ స్థంభమును నాటించిన విషయం ప్రస్తావించి, కృష్ణరాయ భూపతి అను పేరు గలిగిన నేను ఆముక్త మాల్యద ప్రబంధంలో నాలుగవ ఆశ్వాసాన్ని పూర్తి చేశానని చెప్పుకున్నారు.
ఇంతటితో చతుర్ధాశ్వాసం సమాప్తం. సారి పంచమాశ్వాసంతో కలుసుకుందాం. శెలవు.

Friday, January 11, 2019

యామునాచార్యుని రాజనీతి బోధ - 2

ఆముక్త మాల్యద బ్లాగు ఆగి చాలా కాలం అయింది.  కారణాలు అనేకం.  మీకు కొంచెం వెనక్కి వెళ్ళి…కధ చెప్పి మళ్ళీ పద్యాల్లోకి వస్తాను.  మనం చతుర్ధాశ్వాసం లో ఉన్నాం.   వాదములో యామునాచార్యుడు నెగ్గడంతో  రాజు తన రాజ్యంలో కొంత భాగానికి  యామునాచార్యుని రాజును చేసితన చెల్లెలినిచ్చి పెళ్ళి చేసాడు. అతడు దివ్యాస్త్ర మహిమ కలవాడు గనుక దిగ్విజయము చేయవలెనని కోరిక కలిగి  సర్వరాజులను జయించి రాజ్య భోగలాలసుడయ్యాడు. యామునాచార్యుని తండ్రి  నాథముని. ఆయన గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు పుండరీకాక్షుడు. ఆయన కూడా గొప్ప భక్తుడు. ఆయన శిష్యుడు శ్రీరామమిశ్రుడు యామునాచార్యుని చూసి రాజ్య వ్యసనమేమిటీ? పాపమేమిటని వాపోయాడుఅతని మనసు మార్చడానికి ఏదైనా చేయాలని అనుకుని, రాజదర్శనము చేసుకునిరాజా! మీ పూర్వులు నిక్షేపమును కావేరినది యొక్క ఒకానొక ద్వీపమున ఉంచారు దాని చుట్టూ పాము ఉంటుంది. పద్మము శంఖము కూడా వుంటాయి.” అని రాజును తీసుకుని శ్రీరంగనాథుని చూపించడం వరకూ తెలుసుకున్నాము. తర్వాత శ్రీరామమిశ్రుడు రాజును తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుని చూపించాడు. వెంటనే యామునాచార్యునికి తను చేసిన తప్పు తెలిసి జ్ఞానము కలిగింది. వెంటనే  తన కొడుకుకు రాజ్యాన్ని అప్పగించి తాను సన్యాసము తీసుకున్నాడు. తరువాత కొడుకుకు రాజనీతిని బోధించసాగాడు. ఎలుగుబంటి చెట్టుకొమ్మ మీద నిద్రించునప్పుడు ఒక కన్ను మూసి, ఒక కన్ను తెరిచి ఉంటుందిరాజు కూడా అదే విధంగా  అన్నివేళలా అప్రమత్తుడై ఉండాలి. ఇంటాబయటా ఉన్న శత్రువులను ఒక కంట కనిపెడుతూ ఉండక తప్పదని చెప్తాడు. తర్వాయి, యమునాచార్యుడు రాజనీతిని కొనసాగిస్తున్నాడు. సన్యాసులు, జడధారులకు అగ్రహారములవంటివి దానమీయరాదు. అటుల యిచ్చిన యెడల వారు వారి వారి కర్తవ్యములను విస్మరించి భోగలాలసులగుదురు. వధించవలసినంతటి నేరము చేసినవారికి ముమ్మారు అవకాశమీయుము. ఇంకను దుశ్చర్యలు ఆపనిచో వధించవలెను. రాజ్యములో వందిమాగద బృందాన్ని కనిపెట్టి ఉండాలి. విదేశములనుండి గుర్రములు, గజములు దిగుమతి చేసుకొనుచుండవలయును. ఎవరైనా రోగగ్రస్తులైన వారు విదేశములనుండి వచ్చినచో వారిని వారి జాతివారి వద్దకే పంపవలెను. శతృవర్గపు రాజులతో చాలా జాగ్రత్తగా మెలగవలెను. నీచ ప్రవృత్తితోను, మోసముతోను వారిని జయించుట తగదు.


కం. అహితుడు వేడిన నేలెడు
మహి సగమేనిచ్చి తెగని మైత్రిగొని విభుం
డహి భయము మాన్పుకోదగు
నహిభయ మహిభయముకంటె నధికము గాదే

రాజుకు బయటి శత్రువు కన్నను, తన పక్షము వారు పగబూనినట్లైతే అత్యంత ప్రమాదమని గ్రహించాలి. అది పాము కంటే భయంకరము. బయటి శతృవు కోరితే సగం భూభాగం యిచ్చి అయినా భయం పోగొట్టుకొని, తర్వాత స్వపక్ష భయమును సమర్ధవంతంగా నిర్మూలించుకొనాలి.

వేయి మాటలెందుకు? కంటకులను తుదముట్టించని రాజ్యములో రాజుకు గానీ ప్రజలకు గానీ సుఖశాంతులుండవని గమనించుకోవలెను. బెస్తవానికి చిక్కిన చేప నేలపైబడి గింజుకొనునంతవరకు ఓపికవహించి తర్వాత బుట్టలో వేసుకున్నట్టుగా బలవంతుల విషయంలో తొందర పడకూడదు. నెమ్మదిగా కార్య సాధనకై అడుగులు వేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన దండనీతిని గురించి తెలుసుకోనాలి. వ్యసనములు - పాన స్త్రీ మృగయా ద్యూత వాక్పారుష్య దండపారుష్యార్ధ దూషణముల గురించి తెలియ జెప్పెదను వినుము.

సీ. దండపారుష్యంబు, కొండెంబున నతర్క
మరి సంధి కెడయీక మర్ల బడుట................(1)
యవలితప్పెన్నికన్న విదేశ్యు జెరుచుట
ప్రతి ప్రవర్తకున కేర్పడగ జేత........................(2)
జనునవిశ్వాసంబు గనుగొని మెలగుట
విశ్వసనీయుని వేర్పరచుట..........................(3)
మోమోట మంత్రంబుచో మిక్కిలిడుకొంట
మంత్రభేత్తకు నాజ్ఞ మరచియుంట.................(4)

తే.గీ. వింత పుట్టిన గనుగల్గి చింతసేయు
కుంట, మాన్యుల పట్టున నొక్క చూపె
చూడకుంట, విహీనుల గూడుకొంట
వ్యసనియై ఉంట, చలముంట వలదు పతికి.
అని సెలవిచ్చిన యమునాచార్యుడు కొడుకుకు రాజనీతిని కొనసాగిస్తున్నాడు.

1. దండ పారుష్యమునందు నేరమునకు మించి శిక్షలను విధించరాదు. కొండెములు చెప్పినవారిని నమ్మి శిక్షలు విధించరాదు. నిజమా కాదా అని జాగ్రత్తగా విచారించుకోవాలి. 2. తనకు దేశాంతరరాజు చేసిన అపరాధములను చెప్పవచ్చిన విదేశీయుని వానిని వాని దేశపు రాజుకు పట్టి యిచ్చుట. 3. తనకు ద్వేషము చేయునని యెరింగియు వారలతో స్నేహము చేయుట తగదు. 4. మంత్రులు యితర అధికారులు చెప్పిన మాటలు నమ్మి విచారించక శిక్షలు విధించుట చేయరాదు. అలాగే పూజ్యులను నిందించుట, మోసగాండ్రకు స్థానమిచ్చుట, సప్తవ్యసనములలో ఉండుట, మాత్సర్యము వహించుట అనునవి రాజుకు ఏమాత్రము తగదు.


లోక స్వభావమునకు వ్యతిరేకమైన ఉత్పాతములు జరిగినప్పుడు బ్రాహ్మణులను పూజించుట, దేవతలకు పూజలు చేయుట, అగ్నికి హోమము చేయుట మొదలగు కార్యములు నిర్వర్తింపవలయును. రాజు అధికారులకు పోటీలు పెట్టడం వలన వారి వారి గొప్పలు చెప్పుకోవడమే గాక యితరుల లోపములను చెప్పెదరు. ఆవిధముగా అందరి బలములు, అందరి బలహీనతలను రాజు నిత్యము తెలుసుకొనుచుండవలెను. 
Related Posts Plugin for WordPress, Blogger...