తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Wednesday, October 19, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 3

ఖాండిక్యుని యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్న కేశీధ్వజుడు, తలపెట్టిన క్రతువులో యజ్ఞదేనువు పులిబారిన పడి చనిపోవడంతో, శత్రువైనా తన సోదరుడు ఖాండిక్యుని పరిష్కారం కోరడానికి అతనుండే అడవికి వెళతాడు. శత్రువు తనంతట తానే వచ్చినపుడు అతనిని సంహరించి రాజ్యాన్ని దక్కించుకొనుమని ఖాండిక్యునికి మంత్రులు సలహా యిస్తారు. ఖాండిక్యుడు అది ధర్మసమ్మతము కాదని వారించి, కేశీధ్వజునికి తగిన ప్రాయశ్చితం చెప్పి పంపిస్తాడు. కేశీధ్వజుడు తిరిగి తన రాజ్యమునకు వెళ్లి తన యజ్ఞాన్ని ఏ లోపమూ లేకుండా సంపూర్ణంగా నిర్వహిస్తాడు. ఇప్పటివరకూ జరిగిన కథ యిది. అలా యాగాన్ని పూర్తిచేసిన కేశిధ్వజుడు అవబృథస్నానం చేసి, ఋత్విక్కులను, వైతాళికులను, సదస్యులను, యాచకులను అందరినీ సత్కరించాడు.

తే.

మఱియుఁ గోరినవారి యక్కఱలు తీర్చి

యును మన:పూర్తి చాల కొయ్యనఁ దలంచి,

'యకట గురుదక్షిణ యొసంగ నయితి' నంచు

మగుడఁ జని, శంక నతఁడు సంభ్రమపడంగ.

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

ఇంకా అడిగినవారందరికీ వారు కోరిన అవసరాలు తీర్చాడు. అయినప్పటికీ అతని మన్సులో ఏదో వెలితి మిగిలిపోయింది. ఆలోచించగా అతనికో విషయం గుర్తొచ్చింది. ప్రాయశ్చితాన్ని సూచించిన ఖాండిక్యునికి గురుదక్షిణ ఇవ్వడం మరిచానే అనుకుంటూ మళ్లీ అడవికి వెళ్లాడు. మళ్లీ వచ్చిన కేశీధ్వజుడిని చూసి ఖాండిక్యుడు సందేహంతో తొట్రుపాటుపడ్డాడు. ఇదేమిటబ్బా! మళ్ళీ వచ్చాడు అని.

ఖాండిక్యుని కంగారు అర్థంచేసుకున్న కేశిధ్వజుడు అతడిని వారించి, "రాజా! నీకు గురుదక్షిణ యివ్వడానికి వచ్చాను. నీ కోరికేమిటో చెప్పు" అని అడిగాడు. దానితో మళ్ళీ కేశిధ్వజుడు తన మంత్రులతో సమావేశమయ్యాడు!

క.

'గురుదక్షిణ యిచ్చుట కీ

నరవరుఁ డేతెంచె; మీరు నా కనురక్తుల్;

పరికించి పదింబదిగా

నరయుఁడు మది నెద్ది మేలు ప్రార్ధించుటకున్.'



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

"మీరు నాకు ఆప్తులు, కేశిధ్వజుడు నాకు గురుదక్షిణ ఇవ్వడానికి వచ్చాడు. బాగా ఆలోచించి ఏమడిగితే బావుంటుందో తెలపండి", అని అడిగాడు.

ఈ పద్యం చివరిపాదంలో యతి గమనార్హం. "అరయుడు"లోని "అ"కి, "ప్రార్థించు"లోని "ప్రా"కి యతి ఎలా కుదురుతుంది? యతి అక్షరాలలో ఒకటి అచ్చు అయినప్పుడు, రెండవది కూడా అచ్చు కాని "య", "హ"లు కాని అయినప్పుడే యతి చెల్లుతుంది. ఇక్కడ ఎలా చెల్లిందంటే, "ప్రార్థించు" అన్న పదం "ప్ర+అర్థించు" అనే పదాల కలయిక కాబట్టి, అర్థించు పదంలో "అ"తో యతిమైత్రి జరిగింది. "ప్రార్థన" వంటి పదాలలో (నిత్యసమాసాలు), సంధి జరిగాక వచ్చిన "ప్రా" అన్న అక్షరంతో కాని, సంధి జరగక ముందున్న "అ" అన్న అక్షరంతో కాని యతిమైత్రి కుదురుతుంది.

ఖాండిక్యుడు అలా అనగానే అతని ఆప్తులందరూ, "మహారాజా! ఇవ్వాళ కదా దైవమున్నదని తెలిసింది! ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ ధరాతలాన్నంతటిని గురుదక్షిణగా గ్రహించి మమ్మల్నందరినీ రక్షించు", అని అన్నారు. మంత్రులింకా యిలా అంటున్నారు:

ఉ.

ఎన్నఁడు లావుగూడు మన? కెన్నఁడగున్ దఱి? యయ్యెనేని పో

రెన్నిక యౌనె? పోరిన జయింపనె చెప్పిరె? నీదు భాగ్యసం

పన్నతఁ జేరెఁ గార్య మిటు; బంధు సుహృత్తతి కొక్కకీడు రా

కున్నటు లుండఁగానె; సిరు లూరక చావక నోవ కబ్బునే?"



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - సునాద వినోదిని )

"మనకు ఎప్పుడు సైన్యబలము చేకూరుతుంది? అనుకూలమైన సమయం ఎప్పుడొస్తుంది? సమయము చిక్కినా యుద్ధం చేయవచ్చునా? ఒకవేళ యుద్ధము చేసినా మనమే జయిస్తామన్న నమ్మకం ఉన్నదా? ఇప్పుడు నీ అదృష్టం కొద్దీ ఇలా కలిసి వచ్చింది. బంధుమిత్రులలో ఏ ఒక్కరికీ ఎలాంటి కష్టమూ కలగకుండా, ఒక్కరూ చావకుండా, బాధ కలగకుండా సిరిసంపదలు నీవున్నచోటికే వెతుక్కుంటూ వచ్చాయి." అన్నారు. ఇందులో ఒక రాజనీతి సూత్రం చెప్పబడింది. బలము, కాలము అనుకూలంగా ఉన్నప్పుడే దండయాత్ర చేయాలి. సంధి, యుద్ధాలలో ఏది అనుకూలమైనదో జాగ్రత్తగా పరిశీలించి అనుసరించాలి.

ఇలా, మరల వాళ్ళకి తోచినది చెప్పారా మంత్రులు. ఈ ఖాండిక్యుడు వాళ్ళ మాటలు వింటాడా!

చ.

అనవుడు నల్ల నవ్వి మనుజాధిపుఁ డిట్లను:- " మీర లర్ధసా

ధనపరతంత్రకోవిదులు దక్క, మహాసుఖదాయి మోక్షమా

ర్గ నయ విచారకోవిదులు గా, రతిచంచల రాజ్యలక్ష్మి నే

మని చని వేఁడువాఁడఁ బరమార్ధము వేఁడక యమ్మహామతిన్?

మంత్రులు చెప్పిన మాటలు విన్న ఖాండిక్యుడు మందహాసం చేస్తూ యిలా అన్నాడు. "మీరు అర్ధశాస్త్ర కోవిదులే తప్ప మోక్షమార్గ విచారణలో ప్రవీణులు కారు. మహాజ్ఞాని అయిన కేశిధ్వజుడిని పరమార్థ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగకుండా అతి చంచలమైన రాజ్యలక్ష్మిని ఇవ్వమని నేనెలా అడగగలను?".

విష్ణుచిత్తునితో స్వామి మాట్లాడిన సందర్భంలో "నేడు మహామతీ" అంటూ ఆ విష్ణుచిత్తునికి వాడిన మాట "మహామతి".మళ్ళీ యిక్కడ కేశిధ్వజుని గురించి ఖాండిక్యుడు అన్నాడు. అతిలోక సంబంధమైన విచారణ బుద్ధి కలవాడు మహామతి. అలాంటి మహామతి అయిన కేశిధ్వజుడు నీకేమి కావాలో కోరుకోమంటే, అతి చంచలమైన రాజ్యాన్ని ఏ ముఖం పెట్టుకొని అడుగుతాను చెప్పండి! అన్నాడు ఖాండిక్యుడు. మంత్రులు ఎంతసేపూ, "అర్థసాధన పరతంత్రకోవిదులు". అంటే అర్థసాధనకి బానిసలయిపోయారు. కేశిధ్వజుడిని వేడవలసినది ఏమిటి? "పరమార్థం", అంటే ఉత్కృష్టమైన అర్థం! ఆ పరమార్థం ముందు వట్టి అర్థం ఎంతటి హీనమైనది! "అర్థం", "పరమార్థం" అనే యీ మాటలలో ఆ మంత్రులు కోరుకొమ్మన్నదానికీ, అసలు కోరుకోవలసిన దానికీ మధ్య అంతరమెంతుందో అద్భుతంగా ధ్వనింపజేసాడు రాయలు. కవి అన్నవాడు పదాలని ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో, ప్రయోగించాలో దీన్ని చూస్తే అర్థమవుతుంది.

ఇంకా ఖాండిక్యుడు తన మంత్రులతో యిలా అంటాడు,"నిమివంశంలో జన్మించిన మాకు లక్ష్యం గావలసినది ఉత్తమమైన జ్ఞానయోగమే కాని రాజ్యం కాదు. పైగా ఆ కేశిధ్వజుడు అలాంటి జ్ఞానం కలిగినవాడు కూడాను. అందువల్ల వాడి చేత పొందదగినది యోగమే కాని రాజ్యం కాదు". అని నిక్కచ్చిగా చెప్పేసి, నన్నింక వదలండని బయటకి వచ్చి కేశిధ్వజునితో, "నిజంగానే నేనడిగిన గురుదక్షిణ చెల్లిస్తావా" అని అడుగుతాడు. అంటే "ఆఁ! తప్పకుండా", అంటాడు కేశిధ్వజుడు. అప్పుడు తనకి భవబంధాలని నశింపజేసే అధ్యాత్మవిద్యని ప్రసాదించమని అడుగుతాడు. అది విని, "ఆహాహా! హాయిగా నా రాజ్యసర్వస్వాన్నీ అడిగి తీసుకోక యిదేమి కోరికకోరావయ్యా! రాజన్నవాడికి అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది రాజ్యమే కదా." అని అంటాడు కేశిధ్వజుడు. దానికి ఖాండిక్యుడీ విధంగా సమాధానం చెపుతాడు:

మ.

'విను కేశిధ్వజ, ధాత్రి వేఁడమికి నా వేదించెదన్ హేతు: వ

జ్ఞునకుంగాక వివేకి కేల జనియించున్ లౌల్య మెందున్? రణం

బునఁ బాడిన్ రిపుఁ గూల్చు వాఁడియుఁ బ్రజాపోషంబు ధర్మంబు రా

జున కౌ; నైన నశక్తుఁ ద్వద్విజితరాజ్యున్ నన్నఘంబంటునే?

" కేశీధ్వజా! నేను రాజ్యాన్ని కోరకపోవడానికి గల కారణం చెబుతాను విను. లోకంలో ఎక్కడైనా లోలత్వం అన్నది అజ్ఞానికి గాని వివేకికి ఎందుకు కలుగుతుంది. యుద్ధంలో శత్రువులను సంహరించడం, లేదా ఓడించి సామ్రాజ్యాన్ని దక్కించుకోవడం, దాన్ని సుస్థిరపరుచుకుని ప్రజలను చక్కగా పాలించడం అన్నవి రాజధర్మాలు. అయితే నేను నీతో యుద్ధంలో ఓడిపోయి నా సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి రాజ్యాన్ని పరిపాలించకపోవడం అన్న పాపం నన్ను అంటదు." అన్నాడు ఖాండిక్యుడు.

ఇక్కడ రెండు అంశాలని ప్రస్తావించాడు ఖాండిక్యుడు. ఒకటి, తాను రాజ్యాన్ని కోరుకోవడం లౌల్యమవుతుంది. అది తప్పు. అజ్ఞులకే తప్ప వివేకవంతులకి అలాంటి లౌల్యం కలగదు. తాను అజ్ఞాని కాదు. రెండు, అసలు రాజ్యం కోరుకోవడం లౌల్యమెలా అవుతుంది? రాజన్నవానికి రాజ్య సంపాదన, పరిపాలన ధర్మాలు కదా అని అన్నట్లయితే దానికి కూడా సమాధానం చెపుతున్నాడు. యుద్ధంలో ధర్మంగా శత్రువులని జయించి రాజ్య పరిపాలన చెయ్యడం రాజధర్మం. తాను యుద్ధంలో కేశిధ్వజుని చేత ఓడిపోయాడు. కాబట్టి తాను అశక్తుడు. అంచేత తాను రాజ్యాన్ని కోరకపోవడం అధర్మం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే, యిక్కడొక విశేషం స్ఫురిస్తుంది. పుట్టుకతో ఖాండిక్యుడు క్షత్రియుడయినా, గుణాన్ని అనుసరించి చూస్తే అతడికి రాజయ్యే అర్హత లేదు. ఆ శక్తి అతడికి లేదు. అలాంటప్పుడు రాజధర్మం అతనికి వర్తించదు అని చెపుతున్నాడు. అంటే ధర్మం అన్నది కేవలం పుట్టుకచేత కాక, గుణాన్ని అనుసరించి కూడా ఉంటుందన్న విషయం స్ఫురించడం లేదూ?

ఖాండిక్యుడింకా యిలా వివరిస్తున్నాడు:

సీ.

నరనాథ, యీ రాజ్యపరిపాలనారాతి

హననాదికృతరూప యగు నవిద్య

యనధికారికి విసర్జనముఁ గావింపంగఁ

గలుషంబు రా; దధికారియైన

వాఁడు విసర్జింప వచ్చు వర్ణాచార

లోపంబుచే నగు పాపలేప;

మైన నేనిత్తుఁ గొమ్మనఁ గొను ధరణి భో

గమునకుఁ గాక ధర్మమున కగునె?

కాన సత్క్షత్రియులకు భైక్ష్యంబు కీడు;

మత్ప్రధానులు వేడు సామ్రాజ్యమనెడు

పలుకు ధర్మచ్ఛలంపు లోభం బయుక్త

మిది యెఱిగి రాజ్య మడుగ నే నిచ్చగింప



( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం .. సురటి)

ఓయి కేశీధ్వజా! ఈ రాజ్యపాలనము, శత్రుసంహారము మొదలైన పేర్లతో కొనసాగుతున్న అవిద్యారూపమైన కర్మని, అధికారి కానివాడు విసర్జించవచ్చు. అందువల్ల అతనికి పాపం అంటదు. కాని అధికారి అయినవాడు విసర్జిస్తే వర్ణాశ్రమ ధర్మానికి లోపం కలుగుతుంది. ఫలితంగా అతనికి పాపం అంటుకుంటుంది. అయినా నేను యుద్ధంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని నువ్వు యిస్తా తీసుకో అంటే నేను తీసుకుంటే ఆ రాజ్యం భోగ ప్రవృత్తికే తప్ప ధర్మనిర్వహణకు పనికిరాదు. కనుక క్షత్రియుడైన రాజుకు ఈ భిక్షాన్నం అనర్థాన్ని కలిగిస్తుంది. నా మంత్రులు నన్ను రాజ్యాన్ని కోరుకోమన్నారు. అది ధర్మం అన్న ముసుగులో ఉన్న లోభగుణం. అది అనుచితం కనుక నాకు ఇష్టం లేదు.అందుకే రాజ్యమడుగక బ్రహ్మవిద్యను కోరుకున్నాను అని వివరించాడు ఖాండిక్యుడు.

రాజ్యపరిపాలన, శత్రువులని చంపడం మొదలయినవన్నీ అవిద్య. అవిద్య అంటే కర్మ. కర్మ చేసినవాడికి పుణ్యపాపాలుంటాయి కదా? మరి కర్మని విడిచిపెట్ట వచ్చా అంటే, ఎవరికయితే కర్మ చేసే అధికారం (చెయ్యగలసిన సామర్థ్యం) ఉన్నదో అతడు కర్మని విసర్జించినట్లయితే అప్పుడు వర్ణధర్మానికి లోపం కలుగుతుంది. అప్పుడతనికి కర్మ చెయ్యకపోయినా, యీ ధర్మాతిక్రమణం వలన పాపం కలుగుతుంది. దీనికి మరి నిష్కృతి ఏమిటంటే, కర్మ చెయ్యడానికి అధికారమూ, సామర్థ్యమూ ఉన్నవాడు కర్మ చేసి తీరాలి. కాని తాను చేస్తున్నది కేవల ధర్మనిర్వహణకే కాని అందులో తన యిష్టానిష్టాల ప్రమేయం లేదని దృఢంగా నమ్మి ఆ కర్మ చేసినట్లయితే, ఆ కర్మఫలం (పుణ్యపాపాలు) అతనికి అంటదు. అసలు ఒకనికి తన స్వభావరీత్యా ఒక కర్మ చేసేందుకు శక్తే లేనప్పుడు, ఆ కర్మని చెయ్యకపోవడం వలన అధర్మం జరగదు. పైగా అలా చెయ్యాలని అనుకోవడమే అధర్మమవుతుంది. ఇక్కడ ఖాండిక్యుడు చెప్పిన ధర్మసూక్ష్మం యిది!

"ధర్మచ్ఛలంపు లోభంబు" అన్నది చాలా అద్భుతమయిన మాట. స్వార్థపరుడు, తనకి లాభాన్ని చేకూర్చేదానికి ధర్మమన్న అందమైన ముసుగు వేస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైనదని అతని భావన.

ధర్మాధర్మ విచక్షణతో కూడిన ఖాండిక్యుని వివరణ విని కేశిధ్వజుడు ఎంతో సంతోషిస్తాడు. "నువ్వు చెప్పినది చాలా సబబుగా ఉంది. నేనుకూడా నా ధర్మాన్ని అనుసరించే రాజ్యపరిపాలన, యజ్ఞయాగాది కర్మలను ఆచరిస్తున్నాను. ఈ కర్మల వల్ల కలిగే పుణ్యఫలాన్ని వదిలించుకోవడానికి భోగాలని అనుభవిస్తున్నాను. పవిత్రమైన మన నిమివంశం చేసుకున్న అదృష్టం కొద్దీ నీకిలాంటి తత్త్వచింతన కలిగింది." అని చెప్పి, ఖాండిక్యుడు కోరినట్టుగా, పరమార్థాన్ని బోధించే విద్య అతనికి చెప్పడం మొదలుపెడతాడు కేశిధ్వజుడు. ఆ వివరాలు తదుపరి టపాలో చూద్దాం.

Monday, September 12, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 2

యాగధేనువుని పులి చంపివేయడం వల్ల కలిగిన ఆటంకానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసుకొనేందుకు కేశిధ్వజుడు, తాను ఓడించిన శత్రువని కూడా లెక్కచెయ్యకుండా ఖాండిక్యుని దగ్గరకు బయలుదేరాడు కదా. ఇప్పుడతడు ఖాండిక్యుని వద్దకు వెళుతున్నది ఒక రాజుగా కాదు, అర్థిగా! కాబట్టి, ఆర్భాటమేమీ లేకుండా, కేవలం జింకతోలు కప్పుకొని, నిరాయుధుడై, ఖాండిక్యుడున్న అడవిని ప్రవేశించాడు. ఖాండిక్యుడు అడవిలో వేగులని పెట్టాడు కదా. కేశిధ్వజుడు అడవి ప్రవేశించగానే అతని రథానికున్న జండాని చూసి అతడు కేశిధ్వజుడని వాళ్ళు గుర్తుపట్టేసారు. కేశిధ్వజుడు వస్తున్నాడని అడవిలోని ఖాండిక్యునికి తెలియాలని పెద్ద పెద్ద కూతలు పెడుతూ సైగలు చేసారు. ఆ కేకలని అడవిలో నివసిస్తున్న ఖాండిక్యుని పరివారమంతా విన్నారు. అమ్మ బాబోయి! కేశిధ్వజుడు ఇక్కడికి కూడా దండెత్తి వస్తున్నాడనుకొని వాళ్ళందరూ భయపడ్డారు. ఖాండిక్యుడు తన భటులని వాళ్ళకి అండగా పంపి వాళ్ళ భయాన్ని తీర్చి, కొండ కనుమలలో విలుకాండ్రని ఏర్పాటు చేసి, కేశిధ్వజుడిని ఎదుర్కోడానికి వెళ్ళాడు. వెళ్ళి:

క. వచ్చు రిపుఁ జూపులనె చుఱ
పుచ్చుచు, సిరిఁ గొనుట మగుడఁ బొడముట రుష ము
చ్చిచ్చున లావెచ్చఁగ వి
ద్యుచ్చల చాపజ్యఁ దూపు దొడుగుచుఁ బలికెన్.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)



ఎదురుగా వస్తున్న కేశిధ్వజుణ్ణి చూసాడు. "నా సర్వసంపదని తీసుకుని కుడా మళ్ళీ యిలా నా మీదకి దండెత్తి వస్తాడా!", అన్న కోపం ముచ్చిచ్చులాగా (త్రేతాగ్ని) ఖాండిక్యుని మండించింది. ఆ కోపపు చూపులతోనే కేశిధ్వజుణ్ణి కాల్చేస్తూ, మెఱుపుతీగలాంటి తన వింటినారికి బాణాన్ని సంధించాడు.

"నా సమస్త సామ్రాజ్యాన్నీ అపహరించింది చాలక, మారీచునిలాగా జింకతోలు కప్పుకొని పెద్ద మునిలాగా మాలో ప్రవేశించి మా ప్రాణాలు తీయడానికి వచ్చావా! ఈ వాడియైన బాణంతో నిన్ను సంహరిస్తాను." అని తీవ్రమైన కోపంతో అన్నాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు చెయ్యెత్తి అతడిని వారించాడు. "నేను నీకు కీడు చేద్దామని రాలేదు. నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను" అని, జరిగిన విషయమంతా చెప్పాడు. చెప్పి, "నువ్వు నాకు దయతో ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించినా సరే, నీ బాణంతో నన్ను చంపేసినా సరే. నీ యిష్టం" అన్నాడు.

విషయమంతా విన్న ఖాండిక్యుడు ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజ్యం లేక అడవుల్లో జీవిస్తున్నా, తనకీ పరివారం ఉంది. మంత్రులున్నారు. స్నేహితులున్నారు. వాళ్ళతో చర్చించకుండా తను ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోకూడదు. ఇది రాజనీతి. అందుచేత, వాళ్ళందరినీ పక్క చెట్ల గుంపుల్లోకి పిలిచి, విషయం చెప్పి, ఏమి చెయ్యాలన్న విషయంపై మంతనాలు మొదలుపెట్టాడు.
క. పాలు గలవాఁడు మన కొక
జాలి యిడక తానె తారసానకు వచ్చెన్;
వేల యిదె, లెమ్ము, నృప! కృప
చాలున్, గారాకు మేపి చంపకు ప్రజలన్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

ఖాండిక్యుని మంత్రులు వాళ్ళకి తెలిసిన రాజనీతిని వాళ్ళు చెప్పారు. శత్రువు మనను శ్రమ పెట్టక తనంతట తానుగా వెదుక్కుంటూ వచ్చాడు. రాజా! ఇదే తగిన సమయం. ఇంతవరకు చూపిన దయ, జాలి చాలు. నిన్ను ఆశ్రయించిన ప్రజలను పండుటాకులు తినిపించి చంపకు. తొందరగా యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము, అని చెప్పారు. తమ భార్యాబిడ్డలూ అడవుల్లో పడుతున్న అవస్థలు వర్ణించారు. కేశిధ్వజుని కనక ఇప్పుడు సంహరిస్తే, రెండు రాజ్యాలూ లభిస్తాయి. ఏ ఉపాయంతోనైనా శత్రుసంహారం చేసి అధికైశ్వర్యాన్ని పొంది ప్రజలని రక్షించడమే ధర్మమని రాజనీతిని బోధించారు. పైగా, తన సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన త్రిశీర్షుని, గురువనికూడా చూడకుండా ఇంద్రుడు సంహరించ లేదా అని దృష్టాంతం కూడా చూపెట్టారు. అలాగే మరో దృష్టాంతం కూడా చూపించారు.
క. అవమతిఁ బితృఘ్న లగు భూ
ధవుల వెదకి పిల్లపిల్లతరము దునిమి భా
ర్గవుఁడు ముని యయ్యె: మఱి వై
భవము వలదు, శాంతి కైనఁ బగ దెగ కగునే?



( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం బృందావని )

పరశురాముడు తన తండ్రిని చంపిన రాజులనే కాక ఇతర రాజులనూ, వారి పిల్లలనూ, పిల్లలకు పిల్లలనూ వెదకి వెదకి మరీ సంహరించాడు. ఆ తర్వాతనే అతను ముని అయ్యాడు. మరి నువ్వు రాజ్యభోగాలు అక్కరలేదు అనుకున్నా, మనశ్శాంతి కోసమైనా నీ పగ తీర్చుకోవలసినదే కదా అని చెప్పారు.
మంత్రులైన వాళ్ళ మాటల్లో ఎంత చాకచక్యముంటుందో చూడండి. ఎలాగైనా ఖాండిక్యుని ఒప్పించాలని రకరకాలుగా చెప్పుతున్నారు. పురాణ దృష్టాంతాలనే కాకుండా లోక వృత్తాంతాన్ని కూడా ఉదాహరణగా చెపుతున్నారీ పద్యంలో:
క. పులి మల డిగి యూళ్ళకు న
క్షులరుజ రా జనము మాంచుకోఁ బనిచి, గవిన్
నెలకొన సురియలు గొని చని
పొలియునొ? యూరఁ గుయిరేఁగి పొడుచునొ? చెపుమా?



( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

"పులికి కంటిజబ్బు వచ్చి దారి తెలియక తనుండే పర్వతము దిగి ఊరిలోకి వస్తే, అక్కడి ప్రజలు దాని మీద దయదలిచి "కంటిజబ్బు మాన్పుకోమ్మా!", అని తిరిగి పంపించి, తర్వాత ఎప్పుడో అది జబ్బు తగ్గి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కత్తులు కటార్లతో వెళ్లి చంపుతారా? లేక ఊళ్ళోకి వచ్చినప్పుడే చంపుతారా? నువ్వే చెప్పు", అని అన్నారు.
రాయలవారికి జంతుస్వభావాన్ని గురించి బాగా తెలుసు. పులి యీనినప్పుడు దానికి కళ్ళకి కలకవస్తుందిట. అప్పుడది ఊళ్ళోకి వస్తుంది. అది ఇక్కడ పోలిక తెచ్చారు. వాక్యనిర్మాణంలో కాని, పద్యరచనలో కాని అంతా తెలుగుదనమే! "చెపుమా!" అని పద్యాన్ని ముగించడంలో మంత్రులు రాజు తెలివితక్కువతనాన్ని తెగేసి చెప్పినట్లయ్యింది!

ఇలా అనేక రకాలుగా మంత్రులు, కేశిధ్వజుని సంహరించమని ఖాండిక్యునికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.

క. మీ నొడివినయది కార్యం
బౌ; నిప్పని సేయ రాజ్య మంతయు మనకున్,
వానికిఁ బరలోకము జిత
మౌ నొక్కట; నిందు వాసు లరయఁగ వలయున్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

మంత్రులు చెప్పినది సాంతం విన్నాడు ఖాండిక్యుడు. "వినదగు నెవ్వరు చెప్పిన, వినినంతనె వేగపడక వివరింప దగున్" అన్న మాటకి తగ్గట్టుగా, అతను విచారించడం మొదలుపెట్టాడు. తన మంత్రులతో ఇలా అంటున్నాడు. "మీరన్నది నిజమే! మీరు చెప్పినట్టు అతడిని చంపితే ఒకేసారి మనకు రాజ్యం తిరిగి లభిస్తుంది. అతనికి పరలోక సౌఖ్యం సిద్ధిస్తుంది. కాని ఈ రెండింటికి మధ్య గల అంతరాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉన్నది". అవతలవారు చెప్పినది నిజమంటూనే, తన వాదనని వినిపించడం మంచి వాక్చాతుర్యం, వాదపటిమ!

ఇంతకుముందు కేశిధ్వజుని పాత్ర ఎలా అయితే అఖండ యజ్ఞదీక్షా జ్యోతిలో వెలిగిందో, అలానే ఇక్కడ సద్విచార కాంతిలో ఖాండిక్యుని పాత్ర ధగద్ధగాయమానంగా ప్రకాశించడం మనకి కనిపిస్తుంది! "రాజ్యసౌఖ్యం ఎంత కాలముంటుంది? తన చేతిలో మరణించే కేశిధ్వజుడు శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఈ అల్పకాల సుఖం కోసం పాపం చేసి ఆ శాశ్వత కాల సుఖానికి దూరం కావడం తగునా?" - ఇదీ ఖాండిక్యుని విచారధార.
క. "బద్ధాంజలిపుటు దీనున్
గ్రుద్ధతఁ దనమఱుఁగు సొరఁగఁ గూల్చుట కడుఁ గీ,
డుద్ధతి పరలోకార్జన
బుద్ధికి" నను కణ్వవాక్యములు దలఁప రొకో!


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం కానడ )
"చేతులు మోడ్చి దీనంగా శరణు కోరి వచ్చిన శత్రువును అహంకారంతో సంహరించడం పరలోకప్రియుడైన వానికి మిక్కిలి పాపాన్ని అంటగడుతుంది" అన్న కణ్వమహర్షి మాటలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పాడు తన మంత్రులతో. మంత్రులు ఇంద్ర, పరశురామ కథలు చెప్పి తమ రాజనీతిని ప్రదర్శించారు. ఖాండిక్యుడు కణ్వవాక్యాల ద్వారా వారి మాటలను తిరస్కరించాడు!

అలా తన అభిప్రాయాన్ని మంత్రులకి నిశ్చయంగా తెలిపి కేశిధ్వజుని దగ్గరకి వచ్చి, అతని సమస్యని వివరంగా తెలుసుకుని, అతనికి తగిన ప్రాయశ్చిత్తాన్ని చెపుతాడు ఖాండిక్యుడు. కేశిధ్వజుడు అది తెలుసుకొని, తిరిగి తన రాజ్యాన్ని చేరుకొని దాన్ని ఆచరించి యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తాడు.

లౌకికమైన రాజనీతికీ పారలౌకికమైన ధర్మానికీ మధ్యనున్న సున్నితమైన సమతౌల్యాన్ని చిత్రించే కథ యిది. ఆ సమతౌల్యాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించే పాత్రలుగా ఖాండిక్య కేశిధ్వజులని తీర్చిదిద్దాడు రాయలు. ఆముక్తమాల్యద కావ్యమంతటా కూడా ఇలాంటి సమతౌల్యమే కనిపిస్తుంది. బహుశా రాయలవారు తన నిజజీవితంలో కూడా లౌకిక పారలౌకిక ధర్మాలని ఇలానే సమతూకంతో నిర్వహించారని మనం ఊహించవచ్చు. అయితే, యీ కథ ఇక్కడితో అయిపోతే విష్ణుచిత్తుడు చెప్పదలచుకున్న పరమార్థం తెలియనే తెలియదు! ఖాండిక్య కేశిధ్వజుల యీ ధర్మప్రవర్తన, పరమార్థమైన మోక్షానికి ఎలా దారితీస్తుందో ముందు కథలో మనకి తెలుస్తుంది.

Friday, August 12, 2011

ఖాండిక్య కేశీధ్వజ సంవాదము - 1

విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో పండితులను తన వాదంతో ఓడించి నారాయణుని తత్వాన్ని విశదీకరించి అతని సాక్షాత్కారాన్ని ఉపకరించే మరో ఉపనిషత్ కథ ఖాండిక్య కేశీధ్వజ సంవాదాన్ని చెప్పడం ప్రారంభించాడు.


మ. జనకాఖ్యాఖిలరాజ మొప్పు నిమివంశం; బందు ధర్మధ్వజుం
డను భూజాని మితధ్వజాఖ్య వసుధాధ్యక్షుం జగద్రక్షణా
వనజాతాక్షు గృతధ్వజాఖ్యుఁ గనియె; న్వారిద్దఱు న్గర్మఠున్
ఘనవిజ్ఞానుఁ గ్రమంబునం గనిరి తత్ఖాండిక్యుఁ గేశీధ్వజున్..

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)


నిమి వంశంలో జన్మించిన ప్రతీ ఒక్కరికి జనకుడని పేరు ఉంటుంది. ఆ వంశంలోని ధర్మధ్వజుడనే మహారాజుకు మితధ్వజుడు, కృతధ్వజుడనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో మితధ్వజుడికి కర్మశూరుడైన ఖాండిక్యుడు, కృతధ్వజునికి బ్రహ్మజ్ఞాని అయిన కేశీధ్వజుడు జన్మించారు.


క. వారివురు దమలోపల
వేరము గొని, రాజ్యకాంక్ష విజిగీషువు లై
హోరాహోరిగఁ బోరిరి
బారాదిదినంబు లవని ప్రజలు దలంకన్.

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం రాఘవ స్వరంలో.. రాగం కుంతలవరాళి )


ఖాండిక్య కేశీధ్వజులు సోదరులైనా పరస్పరం వైరము పెంచుకొని , రాజ్యాపేక్ష చేత యుద్ధానికి సిద్ధపడ్డారు. వారి రాజ్యాలలోని ప్రజలు భయభ్రాంతులను చేస్తూ రోజుల తరబడి యుద్ధం చేసేవారు.

జేతుమిఛ్చా జిగీష - గెలవాలనే కోరిక జిగీష. బారాది అన్న పదం హిందుస్తానీ "బారా" (పన్నెండు) నుండి వచ్చినది. శ్రీనాథుని కాలంనుండీ ఉరుదూ పారసీ హిందుస్తానీ పదాలు తెలుగు సాహిత్యంలో హెచ్చుగా కనిపిస్తాయి. "హోరాహోరీ" అంటే గంటల తరబడి అని మనకి తెలుసు. ఇది "హోరా" అన్న పదంనుంచి పుట్టిన పదం. హోరా అంటే గంట. ఇది గ్రీకునుండి సంస్కృతంలోకి వచ్చిన పదం. బహుశా ఇంగ్లీషులోని "hour"కి కూడా ఇదే మూలం.


ఇక్షుమతీ నదీతీరాన ఎన్నో రోజులు యుద్ధం చేసిన తర్వాత కేశీధ్వజుని ధాటికి తట్టుకోలేక ఖాండిక్యుడు యుద్ధభూమిని వీడి పారిపోయాడు. అడవిలోకి వలసపోయాడు. ఎంతయినా రాజే కనక, అక్కడ ఒక రహస్యప్రదేశంలో గుడిసెలు ఏర్పాటు చేసి, చిన్నపాటి ఊరు నెలకొల్పాడు. తనతో వచ్చిన గురు భట పరివారంతో అక్కడ నివసింప సాగాడు. దారి పొడుగునా శత్రు సంచారాన్ని పసిగట్టి చెప్పడానికి వేగులని ఏర్పాటు చేసాడు.


శా. ఆ కేశీధ్వజుఁ డంత నా నృపుని రాజ్యం బెల్లఁ జేర, న్ఫలం
బాకాంక్షింపక 'గెల్తు మృత్యువు నవిద్య న్బుట్టకుందుం దుదన్
జాకుందు న్వడి' నంచు యోగ నియతిం జ్ఞానాశ్రయుం డై మఖా
నీకంబుల్ రచియించు చం దొకటికిం దీక్షించి తా నున్న చోన్.

Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

గెలిచిన కేశీధ్వజుడు ఖాండిక్యుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అయినా అమృతత్వాన్ని(మోక్షాన్ని) కోరుకొని యోగాసక్తితో జ్ఞానమును ఆశ్రయించి ఎన్నో యాగములు చేసాడు. అలా ఒక యజ్ఞమును ప్రారంభించి దీక్ష వహించి ఉండగా.


ఈ పద్యంలో "గెల్తు మృత్యువు నవిద్య , న్బుట్టకుందుం, దుదన్జాకుందు న్వడి" అన్నదానికి అన్వయం కొద్దిగా తికమక పెట్టేది. ఒక రకమైన అర్థం - "మృత్యువును, అవిద్యను గెల్చెదను. చావుపుట్టుకలు లేని మోక్షాన్ని పొందుతాను" అని. ఇది సులువయిన అన్వయం. అయితే దీనికి వ్యాఖ్యానం వ్రాసిన వేదం వేంకటరాయశాస్త్రిగారు, తుమ్మపూడి కోటేశ్వరరావుగారు ఇద్దరూ కూడా వేరే అర్థాన్ని ఇచ్చారు. అదేమిటంటే, "అవిద్య చేత మృత్యువుని గెలుస్తాను. జనన మరణ ప్రవాహ రూపమయిన సంసారాన్ని దాటి మోక్షాన్ని పొందుతాను" అని. ఇక్కడ అవిద్య చేత మృత్యువుని గెలవడం ఏమిటి? అన్న సందేహం వస్తుంది. దానికి వారు ఈశోపనిషత్తులోని ఒక వాక్యం ఉదహరించారు - "అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే". అంటే అవిద్య ద్వారా మృత్యువుని తరించి విద్యద్వారా అమృతత్వాన్ని పొందాలి అని. దీనికి వ్యాఖ్యానం - అవిద్య అంటే కర్మమార్గం. విద్య జ్ఞానమార్గం. అమృతత్వం అంటే ముక్తి. అంటే యజ్ఞ యాగాదుల ద్వారా మృత్యువుని జయించవచ్చు (స్వర్గాది లోకాలను పొంది). అయితే అది ముక్తి కాదు. ముక్తి కేవలం జ్ఞానం ద్వారానే లభ్యమవుతుంది. విశిష్టాద్వైతం కర్మ, జ్ఞానమార్గాల సముచ్చయం. అందుకే ఇక్కడ కేశిధ్వజుడు జ్ఞానాశ్రయుడయినా యజ్ఞాలని ఆచరించాడు. బహుశా దాన్ని బలపరచడం కోసం పద్యాన్ని యిలా వ్యాఖ్యానించారు కాబోలు.


చ. పులు మఖశాలికానికటభూముల మేయుచు నేటి వెంటఁ బె
ల్లల మెడునీఱముం దఱిపి యామ్యపతాకన ఘర్మధేను వా
కెళవున నాడువాల భుజగిం గని గోండ్రని యంగలార్చుచున్
గళగతఘంటమ్రోయ నుఱుకం బిడుగుం బలె దాఁకి యుద్ధతిన్
Get this widget | Track details | eSnips Social DNA

(ఈ పద్యం రాఘవ స్వరంలో..రాగం రంజని )


ప్రతి యాగానికి ఒక యాగధేనువు (గోవు) ఉంటుంది. అది చాలా పవిత్రమయినది. అది లేకుండా యాగం సాగదు.
ఈ యాగం జరుగుతూండగా, దాని యాగధేనువు ఆ యజ్ఞశాలకు సమీప ప్రదేశంలో గడ్డి మేస్తూ, అక్కడికి దగ్గరలోనే ఏటి ఒడ్డున బాగా దుబ్బుగా పెరిగిన పొదలవైపు వెళ్లింది. అంతలో ఆ పొదలమధ్య యముని పతాకంలా, పాములాగా కదులుతున్న పులితోకను గమనించింది. వెంటనే భయంతో గోండ్రు గోండ్రుమని అరుస్తూ మెడగంటలు మ్రోగుతుండగా పరుగెత్తింది. అయితే అంతకు మించిన వేగంతో పులి కూడా పరిగెత్తుకుంటూ పిడుగులాగా ఆవు మీదికి దూకింది.


ఉ. గబ్బు సమక్షికం బయి మొగం బడువ, న్దరుపర్ణముల్పడన్
ద్రొబ్బుచుఁ, గార్మొగిళ్ల రొదతోఁ జెఱలాడెడు బొబ్బరింత గా
డ్పుబ్బి విసంజ్ఞగాఁగఁ జెవు లూఁదిన, వల్లవుఁ డుర్విఁ గూలఁగా
బెబ్బులి గొంతుక్రోల్గఱచి పెల్లున మార్మెడ ద్రెళ్ల దాఁటుచున్
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

ఈగలతో కూడిన దుర్గంధం పులి ముఖాన కొడుతుండగా, చెట్ల ఆకులు రాలునట్టుగ ఆవును తోస్తూ, వర్షాకాలపు మేఘాల వలె గాండ్రిస్తూ దాని మీదకు దూకింది పులి. ఆ శబ్దానికి పశులకాపరి కింద పడి మూర్చపోయాడు. ఆ పెద్దపులి ఆవు కంఠనాళాన్ని కొరికి మెడను విరిచింది.


ఆ. తనువుఁ గొమ్ము గొరిజ గొనకుంఢ మలఁపుచుఁ
జప్పు డెసఁగఁ దోఁక నప్పళించి,
శోణితంబు గ్రోలుచునె నేర్పుమై ఘర్మ
గవిని గవికి నీడ్చు నవసరమున.
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)


పెద్దపులి ఆవు కొమ్ముగాని, కాలిగిట్ట కాని తనకు తగలకుండా నేర్పుతో దానిని తిప్పుతూ పెద్ద చప్పుడయ్యేట్టు తోకతో కొడుతూ, రక్తాన్ని తాగుతూ, ఆ యాగధేనువుని తన గుహకి ఈడ్చుకు పోతోంది.


చ.పొలమరు లంది కూఁత లిడ, భూసురు లన్నదిలోన వార్చి, మ్రాఁ
కుల తుద లెక్కి, చప్పటలు గొట్టి యదల్పఁగ, సాహిణీలు మా
వులఁ బఱపంగ, వైచి సెలవు ల్వెస నాకుచుఁ బోయె వృక్షమం
డలికయి తేలుచున్ గుటగుటధ్వని సారె మలంగి చూచుచున్
Get this widget | Track details | eSnips Social DNA

(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

పులి ఆవును లాక్కెళుతూ ఉండగా చూసి ఆ ప్రాంతంలో అక్కడక్కడా ఉన్న పొలం పనులు చేసుకునేవారు గట్టిగా అరుస్తూ వచ్చారు, అక్కడి నదిలో సంధ్యవార్చడానికి వచ్చిన బ్రాహ్మణులు చెట్లపైకి ఎక్కి చప్పట్లు కొట్టి అదిలించారు. అంతలో కొందరు రౌతులు గుర్రాలెక్కి పులిని వెంట తరిమారు. ఆ హడావిడికి పులి ఆవుని వదిలిపెట్టి పెదవి మూలలు నాకుతూ గుటగుట శబ్దం చేస్తూ వెనుదిరిగి చూస్తూ వెళ్లిపోయింది.


క. జుఱుజుఱుకని నెత్తురు వెలి
కుఱుకుచు రొదసేయ, నఱితి యొడపినె యూర్పుల్
పఱవ, మిడిగ్రుడ్ల వణఁకుచుఁ
గొఱప్రాణముతోడఁ దన్నుకొను నమ్మొదవున్
Get this widget | Track details | eSnips Social DNA

( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

ఆవు గొంతునుండి రక్తం వెచ్చగా జుఱుకు జుఱుకు మను శభ్దంతో వుబికి వస్తూ ఉంది. గొంతులో తెగిన నాళాలనుండి దాని నిట్టూర్పు గాడ్పులు ప్రసరించడం తెలుస్తూనే ఉంది. ఇటువంటి దయనీయమైన స్థితిలో కళ్లు తేలవేసి కొనవూపిరితో కొట్టుకుంటుంది ఆ ఆవు.

ఇక ఆవు బతకదని నిశ్చయించుకొని, పశులకాపరులు వేళ్ళి రాజుకా వార్త విన్నవించారు. దీనికింక ప్రాయశ్చిత్తమేమిటని రాజు ఋత్విక్కులని అడిగాడు. వారు తమకి తెలియదని కసేరువన్న అతడిని అడగమన్నారు. కసేరువన్న అతను శునకుడన్న మరొకడిని అడగమని చెప్పాడు. తనకి కూడా తెలియదని, దీని గురించి చెప్పగలిగినవాడు ఒక్క ఖాండిక్యుడేనని, నీకు మంచిదనిపిస్తే వెళ్ళి అతడినే అడగమని చెపుతాడు శునకుడు.

చ. నరపతి పల్కె 'మౌని వర, నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపు ఫలం బొడఁగూడుఁ; గా కమ
త్సరగతిఁ జెప్పె నేని మఖతంత్ర మతంత్రముఁ గాక పూర్ణ మౌ
నిరుదెఱఁగు న్మదీప్సితమె, యేఁగెద'నంచు రథాధిరూఢుడై.

అప్పుడా శునకునితో కేశిధ్వజుడు ఇలా అన్నాడు, "మునివర్యా! అలాగే తప్పకుండా వెళ్ళి అడుగుతాను. ప్రాయశ్చితాన్ని అడగడానికి వెళ్లినప్పుడు నా శత్రువైన ఖాండిక్యుడు పూర్వ వైరంతో నన్ను చంపినచో యజ్ఞం మధ్యలో ప్రాణాలు వీడుటచేత యజ్ఞఫలము నాకే లభించును. లేదా మాత్సర్యాన్ని వదిలి ప్రాయశ్చితం చెప్పినచో యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది. కావున రెండు విధాలు నాకు లాభం చేకూరుస్తాయి. ఏది జరిగినా నాకు సమ్మతమే", అని చెప్పి రధమును ఎక్కి బయలుదేరాడు.

ఆనాటి రాజుల స్వభావాలు ఈ కథలో చాలా అందంగా చిత్రించబడ్డాయి. ఇక్కడ కేశిధ్వజుడు ప్రాణాలను పణంగా పెట్టి ఖాండిక్యుని దగ్గరకి వెళుతున్నాడు. అతనికి యజ్ఞం పూర్తికావాలన్న తపనే కాని ప్రాణభీతి లేదు. పైగా తనవల్ల అడవులు పట్టినవాడి దగ్గరకు వెళ్ళడం ఎంత సాహసం! "ఏగెదనంచు రథాధిరూఢుడై" - వెళతాను అంటూనే రథం ఎక్కేసాడన్న మాట. అంటే యాగాన్ని పూర్తి చెయ్యాలని అంత ఆతృత!


మరి తనని అడవులపాలు జేసిన కేశిధ్వజునికి ఖాండిక్యుడు ప్రాయశ్చిత్తాని చెప్పాడా లేదా ఏం చేసాడన్నది వచ్చే టపాల్లో చూద్దాం.

========
Related Posts Plugin for WordPress, Blogger...