Monday, July 11, 2011
ద్వితీయాశ్వాసం - సింహావలోకనం
ఇదీ ఇప్పటి వరకూ జరిగిన కథ. ఒకసారి ఈ రెండు ఆశ్వాసాలు సింహావలోకనం చేస్తే, ఆముక్తమాల్యదలో వర్ణనలది సింహభాగమని అనిపించక మానదు. అది నిజమే కూడా. కావ్యరచనలో ఒకో కవిదీ ఒకో ప్రత్యేక శైలి. రాయలకి కథని బిగువుగా నడిపించడం మీద దృష్టి లేదు. అనంతమైన తన ఊహశక్తికి రూపాన్నివ్వడమూ అనేక తాత్త్విక రాజనైతిక విషయాలని వివరించడమూ మొదలైన వాటిపైననే అతనికి మక్కువ ఎక్కువ. ఆముక్తమాల్యదలో మనకి అదే దర్శనమిస్తుంది. అయితే అందులో తనదైన ప్రకర్షని విశిష్టతని చూపించగలిగాడు కాబట్టే అది ఒక మంచి కావ్యంగా నిలిచింది. ఉదాహరణకి మధురాపుర వర్ణనలో భాగంగా ఉన్న చతుర్వర్ణాల వర్ణనని మనుచరిత్రలో అదే వర్ణనతో పోల్చి చూస్తే రాయల విలక్షణత స్పష్టంగా తెలుస్తుంది. మనుచరిత్రలో ఇలా ఉంటుంది:
అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి
ముది మదితప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
బింకాన పిలిపింతు రంకమునకు
అచటి మేటికిరాటు లలకాధిపతినైన
మును సంచిమొదలిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి
నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
ఇది పెద్దన దృష్టి. ఇంచుమించు ఆ కాలంలోని ఇతర కవుల దృష్టి కూడా ఇదే. విప్రులు మహాపండితులు. రాజులు గొప్ప పరాక్రమవంతులు. వైశ్యులు అధిక ధనవంతులు. శూద్రులు సస్యసంపదలో సమృద్ధులు. వారి వర్ణనలో అతిశయోక్తులే ఎక్కువ. రాయల దృష్టి మరికొంత విపులమైనది. మరింత వాస్తవికమైనది. ఇతను వర్ణించిన బ్రాహ్మణులు పరమ నిష్ఠాగరిష్ఠులు, వేదనిధులు, నిత్యాగ్నిహోత్రులు. ఎవరి ముందూ చేయిచాపని ఆత్మగౌరవ సంపన్నులు. అలాగే క్షత్రియులు వీరులే కాదు, సదాచారపరులు. దానవ్రతులు. సాముగారడీ వంటి విద్యల్లో ఆరితేరినవారు. వైశ్యులు కూడా, ధనవంతులే కాదు ఏ మాత్రమూ గర్వము లేకుండా నిరంతరమూ దానం చేసేవారు. రైతుల ధాన్యరాసులు రాజ్యవైభవానికి కారకమైనవి. ఈ వర్ణనలో కేవలం ఆయా వర్ణాలవారి వ్యక్తిగత గుణగణాలే కాక, అవి సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడతాయో కూడా మనకి స్పష్టమవుతుంది. అది రాయలవారి ప్రత్యేక దృష్టి.
రాయలవారి వర్ణనలన్నీ కూడా విలక్షణమైనవే. సామాన్య జనజీవితాన్ని వర్ణనలలో చిత్రీకరించడం రాయలవారి విశిష్టత. ఆముక్తమాల్యదలో కనిపించేటంత సామాజికచిత్రణ మరే ఇతర సమకాలీన కావ్యంలోనూ మనకి కనిపించదు. ద్వితీయాశ్వాసంలో సూదీర్ఘమైన గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకిది కనిపించింది కదా. అసలీ సామాజిక చిత్రణ కోసమే ప్రత్యేకంగా రాయలు అంతటి సుదీర్ఘ వర్ణనలకి పూనుకున్నాడేమో అని కూడా అనిపిస్తుంది! జానపద గేయాలు, ఏతాములు, నీటికి తడిసిన మట్టివాసన, ఆ వాసనకి తోడు రాలిన పాదిరి పూల పరిమళం, మామిడిముక్కల తాలింపుతో చేసిన చేపల కూర, ఇసుకలో పాతిపెట్టిన చల్లని కొబ్బరిబొండాలు - ఇలా ఎన్నెన్నో జానపదుల బతుకు చూడికలు మనకా వర్ణనల్లో కనిపిస్తాయి. రాయల దృష్టి మనుషులతో ఆగిపోదు. కొంగల గుంపులు బొమ్మిడాయులని తినడం, ఎఱ్ఱచీమలు గుడ్లను మోస్తూనే ఆహారాన్ని సేకరించడం మొదలైన వాటిని కూడా సునిశితంగా పరిశీలిస్తుంది! అంతేకాదు, రాయల దృష్టి ఎంత నిశితమో అతని ఊహ అంత విశాలం! అది కూడా గ్రీష్మ ఋతు వర్ణనలలో మనకి కనిపిస్తుంది.
అతివృష్టిన్ మును వార్ధి గూర్చు నెడకాడౌటం దమిం గూర్చునన్
మతి లంచంబుగ హేమ టంకములు మింటం బొల్చు పర్జన్య దే
వత కీ నెత్తిన కేలనా బొలిచె నిర్వారిస్రవంతిన్ బయ
శ్చ్యుతి నమ్రచ్ఛద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్
వేసవికాలంలో ఏరులన్నీ ఎండిపోయాయి. అక్కడక్కడ ఉన్న బురదలో వాడిపోయిన తామర తూళ్ళు పైకి వచ్చి వేలాడుతున్నాయి. పువ్వుకున్న రేకులు వడలి వాలిపోవడంతో మధ్యనున్న పసుపుపచ్చని దుద్దులు (కర్ణికలు) స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యం ఎలా ఉన్నదంటే - వర్షాకాలంలో తమని (నదులని) తమ చెలికాడైన సముద్రునితో జతగూర్చే పర్జన్య దేవతకి త్వరగా వచ్చి కరుణించమని చేతులెత్తి మొక్కుకుంటూ, బంగారు నాణాలు లంచంగా ఇవ్వబూనుతున్నాయా అన్నట్టుగా ఉందిట! వాడిపోయిన సన్నని తామరతూళ్ళు చేతులు. పసుపుప్పచ్చని దుద్దులే బంగారు దీనారాలు. అదీ కృష్ణరాయని ఊహ! పైగా ఈ పద్యం వల్ల రాయల కాలానికే "లంచం" అన్న పద్ధతి ఉన్నదని కూడా మనకి తెలుస్తోంది (బహుశా, మొట్టమొదట తిక్కన భారతంలో కనిపిస్తుందీ "లంచం"!).
వట్టి వర్ణనలే కాకుండా, ప్రధానకథకి బీజం పడింది కూడా ద్వితీయాశ్వాసంలోనే అని గమనించవచ్చు. పాండ్యరాజ సభలో విష్ణుచిత్తుని వాదన, అతని విజయము, ఆ తరువాత జరిగే కథాక్రమానికంతా ద్వితీయాశ్వాసంలోనే విత్తు నాటుకుంది. అంతే కాదు, ఈ కావ్య కథానాయకుడైన విష్ణుమూర్తి నేరుగా కావ్యంలోకి ప్రవేశించింది కూడా యీ ఆశ్వాసంలోనే! ఆముక్తమాల్యద కావ్య నాయకుడు విష్ణువా విష్ణుచిత్తుడా అని సందేహం రావచ్చు. కావ్య సంప్రదాయాన్ని అనుసరించి విష్ణుమూర్తే నాయకుడవుతాడని విమర్శకులు తేల్చారు. ఎందుకంటే ఆముక్తమాల్యద కావ్యంలో ప్రధానకథ గోదా కల్యాణం. గోదాదేవి నాయిక. కాబట్టి ఆ రంగనాథుడే నాయకుడు. పైగా, విష్ణుచిత్తుడు ఏమి చేసినా అది స్వామి ఆదేశంతోనూ అనుగ్రహంతోనే కాబట్టి అతడు నాయక స్థానానికి అర్హుడు కాదు. కావ్యాలలో కూడా అనేక రకాలున్నాయి. పారిజాతాపహరణము వసుచరిత్ర వంటి కావ్యాలలో నాయకుడెవరన్నది సుస్పష్టం. అలాంటి కావ్యాలలో మొత్తం కథంతా ఒకే సూత్రమ్మీద నడుస్తుంది. కాశీఖండం, పాండురంగమాహాత్మ్యం వంటి స్థలపురాణ ప్రధానమైన కావ్యాలలో ప్రత్యేకంగా నాయకుడని ఎవరూ ఉండరు. కథలో ఏకసూత్రత కూడా ఉండదు. అనేక కథల సమాహరంగా ఉంటాయి. మనుచరిత్ర, ఆముక్తమాల్యద వంటి కావ్యాలు వేరే తరహాకి చెందినవి. ఇటువంటి కావ్యాలలో అనేక కథలుంటాయి కాని, అవి ఒకే గమ్యం దిశగా సాగుతాయి. ఒకో కథలో ఒకో పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఇటువంటి కావ్యాలలో నాయక నిర్ణయం కొద్దిగా కష్టమవుతుంది. అంతిమ గమ్యాన్ని గమనించి, కథలలో ఉన్న ఏకసూత్రతని గుర్తించడం ద్వారా నాయకుడెవరన్నది నిర్ణయించాలని విమర్శకుల మతం. ఆ దృష్టితో విచారిస్తే ఆముక్తమాల్యద నాయకుడు విష్ణుమూర్తి అన్నది స్పష్టమవుతుంది.
విష్ణువు నాయకుడు కావడం వల్లనే, తనే స్వయంగా పూనుకొని విష్ణుచిత్తుని పాండ్యరాజు దగ్గరకి ప్రయాణం కట్టించాడు. విష్ణుమహిమ చేతనే అక్కడ సభలో విష్ణుచిత్తుడు వాదంలో విజయం సాధిస్తాడు. విష్ణుచిత్తుడు చేసిన చర్చ ఏమిటి, అతను వాదంలో ఎలా గెలిచాడన్నది తృతీయాశ్వసంలో మనం చూడబోతున్నాము. ఇందులో చాలా గాఢమైన ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. లోతైన విచారణ అవసరమవుతుంది. దానికోసం సిద్ధం కండి!
Saturday, July 2, 2011
మధురానగర ప్రయాణము - ద్వితీయ ఆశ్వాసాంతం
తే. విల్లిపుత్తూరిలో నల్ల విష్ణుచిత్తుఁ
డతుల తులసీసుగంధిమాల్యమును మూల
మంత్రమున నక్కుఁ జేర్చుచో మన్ననా రు
దారమధురోక్తి నవ్విధ మానతిచ్చి.
విల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుడు అష్టాక్షరి అనే మహామంత్రమైన మూలమంత్రాన్ని జపిస్తూ శ్రేష్ఠమైన, పరిమళభరితమైన తులసీదళాలతో చేసిన మాలతో స్వామివారి వక్షస్ధలాన్ని అలంకరిస్తుండగా ఆ మన్నారు స్వామి గంభీరంగా ఈ విధంగా ఆనతినిచ్చాడు..
ఉ. నేఁడు మహామతీ! మధుర నీవు రయంబునఁ జొచ్చి యందుఁ బాం
డీఁడు దివాణము న్నెఱయ నించినఁ బ్రేలెడు దుర్మదాంధులన్
బోఁడిమి మాన్చి మన్మహిమముం బ్రకటించి హరింపు శుల్కమున్
వాఁడును రోసినాఁ డిహము వైష్ణవుఁగా నొనరింపు సత్కృపన్.
మహాబుద్దిశాలి అయిన విష్ణుచిత్తుడా! నీవు ఈరోజే మధురకు ప్రయాణము కట్టి అక్కడి పాండ్యరాజు యొక్క కొలువులో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న దుర్మదాంధుల గర్వమణచి నా మహిమలను గురించి తెలియజేసి విజయశుల్కాన్ని తీసుకో.అలాగే ఈ లోకముపై విరక్తి కలిగిన పాండ్యరాజును ఉత్తముడైన వైష్ణవుడిగా మార్చుము అని మన్నారుస్వామి ఆదేశించాడు.
సభలోని పండితులని పట్టుకొని దుర్మదాంధులనే పెద్దమాట ఎందుకన్నాడు మన్నారుస్వామి? వారు భగవత్ తత్త్వం నిజంగా తెలుసుకోకుండానే తమకి తెలుసునని అహంకరిస్తున్నారు కాబట్టి. అలాంటి అహంకారం వల్ల వాళ్ళు నిజంగా ఆ దైవాన్ని తెలుసుకోలేక పోతున్నారని. అంటే భక్తులకి తప్ప పండితులకి భగవంతుని గురించి తెలియదని ఆముక్తమాల్యద నిశ్చయం. ఇది విశిష్టాద్వైత మతం.
తే. అనిన వడవడ వడఁకి సాష్టాంగ మెఱఁగి
సమ్మదాశ్రులు పులకలు ముమ్మరింప
వినయవినమితగాత్రుఁడై విప్రవరుఁడు
వెన్నునకు భక్తి నిట్లని విన్నవించె.
తను నిత్యం కొలిచే దైవం ఒక్కసారిగా ప్రత్యక్షమై తనతో మాట్లాడితే, అదీ తను కలలో కూడా ఊహించని విషయాన్ని గురించి చెపితే ఆ భక్తుని పరిస్థితి ఎలా ఉంటుంది. అప్పటి విష్ణుచిత్తుని స్థితిని వివరిస్తున్న పద్యం. మన్నారుస్వామి మాటలు విన్న విష్ణుచిత్తుడు గడగడ వణికిపోయాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. పులకించిపోయాడు. సాష్టాంగ ప్రణామము చేసాడు. బ్రాహ్మణోత్తముడైన విష్ణుచిత్తుడు ఆ విష్ణవుకు, వినయంతో , భక్తితో ఈ విధంగా విన్నవించాడు.
శా.స్వామీ! నన్ను నితఃపురాపఠితశాస్త్ర గ్రంథజాత్యంధు, నా
రామక్ష్మాఖననక్రియా ఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ
స్తోమాస్నిగ్ధ కరున్, భవద్భనదాసు, న్వాదిఁగాఁ బంపుచో
భూమీభృత్సభ నోట మైన నయశంబు ల్మీకు రాకుండునే?
స్వామీ! నేను ఇంతవరకూ ఏ గ్రంధమూ చదవక జ్ఞానములో పుట్టుగుడ్డివాడిని (ఇతః పురా అపఠిత శాస్త్రగ్రంథున్).
ఆరామ క్ష్మా ఖననక్రియా ఖర ఖనిత్ర ఉద్యత్ కిణ స్తోమ అస్నిగ్ధ కరున్ - నిత్యం పూలతోటలో భూమిని గునపముతో తవ్వుటవలన కాయలు కాచిన బిరుసైన చేతులు కలిగినవాడిని. నీ కోవెలకు సేవకుడిని. అలాంటి నన్ను రాజాస్దానములో వాదనకు పంపుతున్నావు. అక్కడ అజ్ఞానుడనైన నా మూలంగా గెలుపు లభించక ఓటమి కలిగినచో ఆ అపకీర్తి నీకే కదా ... అని వాపోయాడు విష్ణుచిత్తుడు.
మ. గృహసమ్మార్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాతపత్రధృతియో, ప్రాగ్దీపికారోపమో,
నృహరీ వాదము లేల? లేరె యితరు ల్నీ లీలకుం బాత్రముల్
"స్వామీ .. మీ కోవెల శుభ్రపరచడమో, తీర్ధము తేవడమో, దేవరవారు విలాసానికి ఊరేగే పల్లకీ మోయడమో, తులసీదండలు కట్టి అలంకరించడమో, గరుత్మంతుని బొమ్మగల ధ్వజము మోయడమో, విసనకఱ్ఱ, గొడుగు మొదలైనవి పట్టుకోవడమో, నీ గుడిముంధు దీపం పెట్టడమో - ఇలాంటి పనులైతే నేను చెయ్యగలను కాని వాదానికి వెళ్ళమంటావేమిటి! నీ లీలకి వేరే ఎవరూ తగినవారే దొరకలేదా!" అని విన్నవించుకుంటున్నాడు విష్ణుచిత్తుడు. వాల్లభ్యము అంటే గరుత్మంతుని గుర్తుగల జెండా. దీన్ని పట్టుకోడం పరమ భగవద్దాసులకే లభించే అనుగ్రహ విశేషం). ఈ పద్యంలో వర్ణించిన పనులన్నీ స్వామికైంకర్యంలో భాగం. శ్రీవైష్ణవంలో ఇది పరమ సేవగా భావింపబడింది. "నీ లీల" అన్నాడు కాబట్టి, వాదన చేసేది ఎవరైనా చేయించేది విష్ణువే అన్న జ్ఞానం విష్ణుచిత్తునిలో పరిపూర్ణంగా ఉంది. ఆ జ్ఞానమే ఇతర పండితులలో లోపించింది. అందుకే విష్ణువు విష్ణుచిత్తుణ్ణి ఎన్నుకున్నది.
తే. అనినఁ దద్భక్తి కెద మెచ్చి యచ్యుతుండు
మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి
'వా దితనిచేత గెలిపింతు: నాదుమహిమ
మువిద కను' మని ప్రాభవం బొప్పఁ బలికి.
విష్ణుచిత్తుడి మాటలు విన్న శ్రీహరి అతని భక్తికి మెచ్చుకొని చిరునవ్వుతో తన దేవేరి లక్ష్మీదేవి మోమును చూసి దేవీ నా మహిమతో పాండ్యరాజు కొలువులో ఈ విష్ణుచిత్తుని వాదమున గెలిపిస్తాను చూడుము అని మరొక్కమాట ఆనతినిచ్చాడు . "మొలకనగ వొప్ప శ్రీదేవి మోము సూచి" - ఎంత సొగసైన వాక్యం!
ఇంతకీ హఠాత్తుగా లక్ష్మీదేవి ఎక్కడనుండి వచ్చింది? ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకంటే కావ్యంలోని మతం శ్రీవైష్ణవం. అంటే ఇందులో విష్ణువు ఎల్లెప్పుడూ లక్ష్మీదేవితోనే ఉంటాడు. ఉంటుంది సరే, మరి కవి ఈ మాటలు విష్ణుమూర్తి చేత లక్ష్మీదేవితో ఎందుకు చెప్పించాడు? ఎందుకంటే ఈ కావ్యంలో నాయకుడు విష్ణువే కాబట్టి. విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో వాదనలో గెలవబోతున్న గెలుపు నిజానికి నాయకుడైన విష్ణుమూర్తిదే. ఇదొక రకంగా అతని జైత్రయాత్ర సన్నాహం. నాయికతో తన ప్రభావాన్ని గూర్చి, గెలుపు గూర్చి నాయకుడు పలకడం వీర రసపోషకం.
క. నీయిచ్చయె? మిన్నక పో
వోయి, మునిప్రవర! నిన్ను నొప్పింతును భూ
నాయకసభ, నిందులకై
యేయడ్డము వలవ దవల నే నున్నాఁడన్
ఇవి కూడా వీరుని ప్రతాపాన్ని పలికించే మాటలే. "ఓ మునిశ్రేష్ఠుడా! ఇందులో నీ యిష్టంతో పనేముంది? నీవు మారు మాటాడక పాండ్యరాజు సభకు వెళ్లు. నిన్నా సభలో ఒప్పించి (గెలిపించి) తీరుతాను. దానికి అడ్డుచెప్పకు. అన్నిటికీ నేనున్నానుగా.", అని పలికాడు మన్నారుస్వామి. శ్రీవైష్ణవంలో ప్రపత్తియోగం అంటారు దీన్ని. భగవంతుని శరణు అని అతని ఆనతి చొప్పున నడుచుకోడమే ప్రపత్తి యోగం. దాని లక్షణమే ఈ పద్యంలో చెప్పబడింది.
ఇంకేముంది, స్వామి అలా ఆనతిస్తే భక్తుడు శిరసావహించ వలసిందే కదా. మధురానగర ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. అంత దూరం ప్రయాణం, అక్కడ బస - ఈ ఏర్పాట్లన్నీ చూసుకోమని ఆ గుడి పూజారికి మన్నారుస్వామే ఆనతిచ్చాడు. ఆ పూజారి మాట మేరకు ఆలయ పారుపత్తేదారు (ధర్మకర్త వంటివాడు) గుడి భాండాగారం నుండి కావలసినంత సంబడం (దారి ఖరుచు), తన పల్లకీని విష్ణుచిత్తునికి ఇచ్చాడు. ప్రయాణాన్ని ప్రారంభించాడు విష్ణుచిత్తుడు.
సీ. భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి
కట్టిన పొరివిళంగాయ గమియు
నెసటిపోఁతలు గాఁగ నేర్పరించిన చిరం
తనపు శాలిక్షేమతండులములు
వడిఁబెట్టి లోఁ జెఱకడము సాఁబా లూన్పఁ
జెలఁగు సంబారంపుఁ జింతపండు
పెల్లు లోహండి కావళ్ల కొమ్ముల వ్రేలు
గిడ్డిమొత్తపు నేతిలడ్డిగలును
బెరుఁగువడియంబులును, బచ్చివరుగు, బేడ,
లురుతరాచ్యుతపూజోపకరణపేటి
కలును, చాత్తిన చాత్తని కులము బలసి
విధినిషేధము లెఱిఁగి తే మధుర కరిగె.
భర్త ఇతర ప్రదేశాలకు ప్రయాణం కట్టినప్పుడు అతని ఇల్లాలు ఎటువంటి లోటు రాకుండా అన్నీ అమర్చి పెడుతుంది. ముఖ్యంగా భోజన సామగ్రి. అదే విధంగా మన్నారుస్వామి ఆదేశం మేరకు విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణం కట్టగా సాద్వీమణియైన ఆతని ఇల్లాలు దారికి అవసరమైన తిండి పదార్థాలు వగైరా జాగ్రత్తగా కట్టి ఇచ్చింది. అవి ఏంటి అంటే...
1. మూటగట్టిన పొరివిళంగాయగములు - ఈ పదార్ధములు ఏంటి? ఎలా ఉంటాయి?? దారిలో తినడానికి అంటే వెలగపండులాంటివి ఐతే కావు. మన నిఘంటువులు 'పొరి'పదానికి వండిన శాకము లేదా కూర అని చెప్తున్నాయి. తమిళంలో కూరను పారి అంటారు. కన్నడంలో 'పురి' అంటారు. ఆచార్య లంకసాని చక్రధర రావుగారు తెలుగు వ్యత్పత్తికోశంలో 'పారు' లేదా 'పొరి విళంగాయ'ని పెసరపిండి, పంచదార కలిపి తయారు చేసిన ఒక తీపి పదార్ధం అని అర్ధం చెప్పారు. 11వ శతాబ్దినాటి కన్నడ మానసోల్లాస గ్రంధంలో 'పురి విళంగాయ'లను మరమరాలు లేదా బొరుగులు, వేయించిన పెసరపప్పు, బెల్లం పాకంలో ఉడికించి చేసే ఉండలు అని చెప్పారు.
2. ఎసటిలో పోసి వండుకోడానికి వీలుగా శుభ్రపరచిన పాత బియ్యము
3. నలుసులు వగైరా లేకుండా శుభ్రం చేసిన జీలకర్ర, బెల్లము, తగువిధముగా దినుసులు కలిపి దంచిన చింతపండు
ఇంకా కావళ్ల కొనలయందు ఆవునేతితో నింపిన చిన్న మూతికల పిడతలను వ్రేలాడగట్టి, పెరుగు వడియాలు, వరుగులు, చాయపప్పు ఉన్నాయి. ఆ ఇల్లాలు తాను వెంట లేకున్నా భర్తకు ఎటువంటి లోటు కలగకుండా ఈ సంభారాలు ఇచ్చింది. ఇవియే కాక విష్ణుపూజకు కావలసిన పరికరములు మొదలైనవి ఉంచిన పెట్టెలను బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తాదులు ఎవ్వరెవ్వరేమేమి తేవడానికి అర్హులో ఆయా వస్తువులు తీసుకొస్తుండగా ఆ విష్ణుచిత్తుడు మధురకు ప్రయాణమయ్యాడు. (ఇక్కడ చాత్తిన, చాత్తని అనే పదప్రయోగం గురించి తెలుసుకుంటే .. చాత్తినవారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివి భగవతుని సన్నిధిలో అర్పించిన బ్రాహ్మణోత్తములైన శ్రీవైష్ణవులు, చాత్తనివారనగా ద్రావిడ ప్రబంధాన్ని చదివినా కూడా భగవంతుని సన్నిదిలో అర్పణచేసే అధికారం లేని ఇతర వర్ణ వైష్ణవులు.. )
ఇంతటితో ద్వితీయాశ్వాసం కథ ముగిసింది. ఇక ఆశ్వాసాంత పద్యాలు.
చ. యమనియమాదిలభ్య, ద్రుహిణాది జరన్మరుదిభ్య, సంసృతి
శ్రమహరనామకీర్తన, మురప్రవికర్తన, పాతకావలీ
దమన, రమాంగనాకమన, తామరసాయతనేత్ర, భక్త హృ
ద్ర్భమతృణదాత్ర, భూయువతి రంజన, వర్ణ జితాభ్రఖంజనా!
రాయలు ఆ దేవదేవుని ప్రార్ధనతో ఈ ఆశ్వాసం ముగిస్తూ ఆ మన్నారుస్వామిని వేనోళ్ల స్తుతించాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయమ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ,సమాధులనే అష్టాంగ యోగములచే పొంద సాధ్యమైనట్టివాడా, బ్రహ్మాది ముసలి దేవతలకు కూడా ప్రభువైనట్టివాడా, జనన మరణాది రూప సంసారమందలి శ్రమను హరించే నామసంకీర్తనము గలవాడా, మురాసురిని ఖండించినవాడా, పాపసమూహమును హరియించువాడా, లక్ష్మీదేవికి ప్రియమైనవాడా, తామరరేకులవంటి విశాలమైన నేత్రములు గలవాడా, భక్తజన హృదయములలోని అజ్ఞానమన్న గడ్డిని కోయు కొడవలివంటివాడా, భూమియను స్త్రీని సంతోషపెట్టువాడా, నిజదేహకాంతిచే మేఘాలను గెలిచి వాటి కాంతిని కాటుకగా ధరించినవాడా అని శ్రీహరిని స్తోత్రం చేసాడు.
మాలిని.
ద్రుహిణజముఖమౌని స్తోమ నిస్తంద్ర భాస్వ
ద్దహరవిహరమాణాతామ్ర పాదాంబుజాతా
బహిర బహిరపార ప్రాణికోటి ప్రపూర్ణా!
మహిమ వినుత వాణీ మాధురీ వేద్యపర్ణా.
బ్రహ్మవలన పుట్టిన నారదుడు మొదలైన మునిబృందముయొక్క హృదయమనే ఆకాశంలో విహరిస్తున్న ఎఱ్ఱని కమలములవంటి పాదములు కలవాడా! లోపలా బయటా అంతటా అనంతమైన జీవసముదాయంతో నిండినవాడా! ఎవరి మహిమను సరస్వతి గానం చేస్తూంటే ఆ మాధుర్యానికి పార్వతి సంతోషిస్తున్నదో, అలాంటి శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తున్నాడు రాయలు.
మ. ఇది భూమండన కొండవీడుధరణీభృద్దుర్గపూర్వాద్రి భా
స్వదిభేశాత్మజ వీరభద్రజన జీవగ్రాహ రాహూయమా
ణ దృఢాంచద్భుజ కృష్ణరాయమహిభృన్నామాస్మదాము క్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యము ద్వితీయంబై మహిం బొల్పగున్.
ఆముక్తమాల్యదలో ఇది రెండవ ఆశ్వాసం. అది హృద్యపద్యాలతో శోభిస్తున్నది. దాని కర్త శ్రీకృష్ణదేవరాయలన్న పేరుగల చక్రవర్తి. ఆ రాయలు, కొండవీడూ ఉదయగిరి దుర్గాలకి ఏకిక అయిన వీరభద్రగజపతి సేనల ప్రాణాలని రాహువులా తన ప్రకాశించే దృఢమైన బాహువులతో గ్రహించినవాడు.
===
ఈ టపాలోని పద్యాలన్నీ లంకా గిరిధర్ స్వరంలో ...
Tuesday, May 17, 2011
విప్రుల సుభాషితాలు
అప్పెను వేసవి విభవము
విప్పుగ దన్నగర నికట వృషగిరిహరికిం
దెప్ప తిరునాళ్ళు రా, ముద
మొప్పన్ పరదేశి విప్రుడొక్కడు భక్తిన్
మధురానగరానికి సమీపంలో వృషగిరి అనే విష్ణు క్షేత్రం ఒకటి ఉంది. అలా పెను వేసవి ఎసరేగిన రోజుల్లో ఆ ఆలయానికి తెప్ప తిరునాళ్ళ ఉత్సవం వచ్చింది. ఆ ఉత్సవాన్ని చూడడానికి ఒక పరదేశ బ్రాహ్మణుడు వచ్చాడు. ఉత్సవాన్ని తిలకించి, స్వామిని సేవించి, తిరిగి వెళుతూ, దగ్గరగానే ఉంది కాబట్టి, మధురానగర వైభవాన్ని చూడాలని అక్కడకు వెళ్ళాడు. నగరమంతా తిరిగి సాయంకాలం వైగై నదిలో సంధ్యావందనం చేసుకొని రాజుగారి పురోహితుని ఇంటికి ఆతిథిగా వెళ్ళాడు. అక్కడి భోజనవైభవం ఎలా ఉందంటే:
పరిపక్వ సురభి రంభా ఫలంబులతోడ,
దళమెక్కు పనస పెందొలలతోడ,
ఘృతపిండ నిభ కర్కరీ ఖండములతోడ,
బలుదెఱంగుల మావిపండ్లతోడ,
గోస్తనీ మృదు గుళుచ్ఛ స్తోమములతోడ,
గప్పు లేఱిన వడప్రప్పుతోడ,
సుమధుర స్థూల దాడిమబీజముల తోడ,
దనుపారు రసదాడి గనెలతోడ,
బానకంబతిథుల కిడ్డ, దాను గ్రోలి
యర్చనాదత్త చందన చర్చ దేలి,
విరులు సిగ దాల్చి కర్పూర వీటి జౌరు
కొట్టుచు ద్విజుండు వెన్నెల బిట్టుగాయ
(ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
బాగా మగ్గిన కర్పూర చక్కరికేళి అరటిపళ్ళు, బలిసిన పనసపండ్ల తొనలు, నేతిముద్దల్లాగా ఉన్న పందిరి దోసకాయముక్కలు, రకరకాల మామిడిపండ్లు, మెత్తని ద్రాక్ష గుత్తులు, పొట్టు ఏఱి కడిగిన వడపప్పు, తియ్యని బలిసిన దానిమ్మగింజలు, రసదాడి అనే అరటిముక్కలు, చల్లని పానకం - వీటితో కూడిన ఫలాహారం! అన్నీ వేసవికాలానికి తగిన పదార్థాలే. ఆ ఫలాహారం తీసుకున్న తర్వాత, ఆ పరదేశ బ్రాహ్మణుడు, గృహస్థు ఇచ్చిన మంచి గంధాన్ని వంటికి పూసుకొని, కొప్పులో పూలు పెట్టుకొని(అవును పూర్వకాలంలో పురుషులుకూడా కొప్పులో పువ్వులు పెట్టుకొనేవారు!), కర్పూరతాంబూలాన్ని చక్కగా నములుతూ, వెన్నెల పిండారబోసినట్లు కాస్తూ ఉంటే - ఏమి చేసాడో తర్వాతి పద్యంలో తెలుస్తుంది.
ఇలాంటి వర్ణనలు ఒకనాటి నాగరికతని మన కళ్ళముందుంచుతాయి. ప్రకృతికి మనిషి ఎంత దగ్గరగా జీచించేవాడో వీటినిబట్టి తెలుసుకోవచ్చు.
మాత్రసంచి తలాడగా, మార్గవేది
నొక్క డార్యలు, గీత లొండొకడు, దా సు
భాషితంబులుగా, దోడి బ్రాహ్మణౌఘ
ముబుసుపోకకు జదువ బరున్న వేళ
( పై పద్యం రవి స్వరంలో)
రాజపురోహితుని యింట అతిథులు చాలామందే ఉంటారు కదా. యీ పరదేశ విప్రునితో పాటు అలా వచ్చిన ఇతర బ్రాహ్మణులందరూ ఫలాహారాన్ని స్వీకరించి ఆరుబయట వెన్నెలలో ఆ యింటి అరుగుపై విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్గవేది అంటే ఇంటిముందున్న వీథి అరుగు. ఈ కాలంలో అరుగులున్న యిళ్ళు చాలా అరుదైపోయాయి, కొన్నాళ్ళకి అవంటే ఏమిటో తెలియని పరిస్థితి రావచ్చు. ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులే ఉండేవి. వచ్చిన అతిథులు హాయిగా ఆ అరుగులమీదనే రాత్రి పడుకొనే వారు. మాత్రసంచి అంటే భుజానికి అటూ యిటూ వేలాడే మూటలతో ఉండే సంచి. దాన్ని తలగడగా పెట్టుకొని యీ పరదేశ విప్రుడు కూడా నడుం వాల్చాడు. వెంటనే నిద్రపట్టెయ్యదు కదా. అంచేత ఉబుసుపోకకి తమకి వచ్చిన శ్లోకాలు చదవడం మొదలుపెట్టారు. ఒకరేమో ఆర్యలు (ఆర్యా సంస్కృతంలో ఒక వృత్తం, తెలుగులో కందం లాంటిదే) చదువుతూ ఉంటే మరొకరు గీతలు (బహుశా వేదాంత గీతలు) పాడుతున్నారు. ఈ బ్రాహ్మణుడేమో సుభాషితాలు చదువుతున్నాడు.
అలాంటి సమయంలో రాజు మత్స్యధ్వజుడు చక్కగా శృంగారించుకొని భోగిని పొందుకై అదే మార్గాన వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ యీ రాజపురోహితుని ఇంటి ముందు నుంచి వెళుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి ఆ పరదేశి విప్రుడు చదువుతున్న ఒక సుభాషితం రాజు చెవినబడింది. అంత బిగ్గరగా చదువుతున్నారన్న మాట! ఏమిటా సుభాషితమంటే:
వినియె, "నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినాళికి, రాత్రికై దివం
బున, జరకై వయస్సునను, బూని పరంబున కిప్పుడుద్యమం
బనువుగ చేయగా వలయు" నంచు బురోహిత ధర్మ మాత్మ గీ
ల్కొన నల విప్రుడా ద్విజులలోన సుభాషితమున్ బఠింపగన్
(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో)
చతుర్ ద్వయి అంటే నాలుగు రెళ్ళు ఎనిమిది. వృష్టి దినాళి అంటే వర్షపు రోజులు, వానాకాలం. అది నాలుగు నెలలు. వానరోజుల్లో పనులు పెద్దగా జరగవు (ప్రకృతి మీద ఎక్కువగా ఆధారపడే ఆ కాలంలో సంగతి యిది). కాబట్టి అప్పుడు కష్టపడకుండా జీవితం సాగాలంటే, మిగతా ఎనిమిది నెలలూ కష్టపడి ఆ నాలుగు నెలలకూ సరిపడా సరుకులు సమకూర్చుకోవాలి. అలాగే, రాత్రి పని చెయ్యం కదా, నిద్రపోతాం. అలా హాయిగా నిద్రపోగలగాలంటే, ఉదయం పని చెయ్యాలి. ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. హాయిగా నిద్రపోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. అంటే రేపటి గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేనంతగా ఆ రోజే సంపాదించుకోవాలి. రెండు, గాఢ నిద్ర కలగాలంటే శరీరం అలసి ఉండాలి. అలా అలసేట్టుగా పని చెయ్యాలి. శారీరిక మానసిక ప్రశాంతతలకి రెంటికీ పగలు పని చెయ్యడం అవసరమన్నమాట. అలాగే, ముసలితనంలో ఎక్కువ పరిశ్రమ చెయ్యలేం కదా. ఆ రోజులు హాయిగా గడిచిపోవాలంటే, వయసులో ఉన్నప్పుడే తగినంత గడించాలి. ఇక్కడ దాకా చెప్పి ఊరుకుంటే అది సుభాషితం అవ్వదు. భారతీయచింతన అక్కడితో ఆగిపోదు. మనకి కాలం ముసలితనంతోనో, మృత్యువుతోనో ఆగిపోదు. ఇహమొక్కటే ధ్యేయము కాదు. ఇహముతో పాటు పరముని (అంటే మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాతి పరిస్థితి) కూడా ఆలోచించమంటుంది. అలా పరములో కూడా సుఖపడేందుకు తగిన పరిశ్రమ బతికుండగానే, ఇహంలోనే చెయ్యాలి. ఇహలోకంలో ముందుచూపుతో చేసే కార్యాలని ముందుగా వర్ణించి, అదే విధంగా పరలోకాన్ని గురించి కూడా ముందుచూపుతో వ్యవహరించాలని చెప్పడం వల్ల సుభాషితం మనసుకి బాగా నాటుకుంటుంది. రాజు ఆత్మని హత్తుకుపోయింది. ఈ పద్యానికి మూలమైన సంస్కృత సుభాషిత శ్లోకం ఇది:
వర్షార్థ మష్టౌ ప్రయతేత మాసాన్, నిశార్ధ మర్థం దివసే యతేత
వార్థక్యహేతోర్వయసా నవేన, పరత్రహేతో రిహ జన్మనా చ
రాజేమో భోగిని యింటికి పోతున్నాడు. అతని దృష్టి భోగలగ్నమై ఉంది. సుభాషితమేమో మోక్షదృష్టిని బోధిస్తోంది. అలాంటి పరిస్థితిలో యీ శ్లోకం రాజు మనసులో నాటుకుంది అంటే ఆ రాజు హృదయం ఎంతో సుకుమారమైనదై ఉండాలన్న మాట. ఒక రోగిని, ముసలివాడిని, శవాన్ని చూసి సిద్ధార్థుడు సన్యసించాడంటే అతని హృదయం ఎంత సుకుమారమైనదో! అలానే యీ శ్లోకం వినగానే మత్స్యధ్వజుని మనసులో విరాక్తి భావం ఏర్పడింది. ఎలా ఏర్పడిందో యీ కింద పద్యంలో అద్భుతంగా వర్ణించాడు రాయలు:
విని, తద్గ్రంథార్థము నె
మ్మనమున నూహించి, తెలిసి, మ్రాన్ పడి, కడకుం
దన మోసమునకు భయపడి,
జనపతి యటు చనక నిలిచి, సంతాపమునన్
( పై పద్యం రవి స్వరంలో)
ఆ సుభాషితాన్ని రాజు విన్నాడు. విని దాని అర్థాన్ని ఒకసారి మనసులో భావించాడు. భావించి తెలుసుకున్నాడు. తెలుసుకొని మ్రాన్ పడి పోయాడు! ఒక్క క్షణ కాలంలో, ఒక సుడి తిరిగినట్లు, ఒక మెరుపు మెరిసినట్లు, జరిగిన హఠాత్పరిణామాన్ని, అంతే వేగంగా చిన్న చిన్న పదాలతో కందంలో కదనుతొక్కించాడు రాయలు. చివరికి మత్స్యధ్వజుడు తనని తాను చేసుకుంటున్న ఆత్మవంచనకి భయపడి, ఇక ముందుకి సాగక, ఆవేదనతో అక్కడే నిలబడిపోయాడు. ఏమిటి తనకి తాను చేసుకుంటున్న మోసము? అది తర్వాతి పద్యాలలో సాగే అతని ఆలోచనాపరంపర ద్వారా తెలుస్తుంది.
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుద ప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి; యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మనుప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే!
( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
అయ్యో! ఈ రాజ్యవైభవాలేమిటి? ఈ భోగాలేమిటి? వీటికోసం ఇంత ఆరాటమేమిటి? ఇదంతా నీటి బుడగలాంటి శరీరం కోసమే కదా! యుగాంతాల దాకా, రెండు యుగాల మధ్యన కూడా బతికిన మనువులాంటి వారు కూడా యముని దెబ్బకు రూపురేఖలు లేకుండా పోయారే!
ఉన్నట్లయుండు నద్దరి
కిన్నరులను నావ చేర్చు క్రియ వెసదా బో
కున్నట్ల యుండి కాలం
బున్నరులకు వయసుబుచ్చి మోసము దెచ్చున్
( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
కూర్చున్నవాళ్ళని కూర్చున్నట్లే ప్రయాణీకులని, పడవ, ఇవతలి ఒడ్డునుండి అవతలి ఒడ్డుకి తీసుకుపోతుంది. ప్రయాణికులు కష్టపడి ఈదడమంటూ ఉండదు కదా. అలాగే, కాలం కూడా కదులుతున్నట్లు తెలియకుండానే వయసుని దాటించి (బాల్యం, యౌవనం, వార్థక్యం యివన్నిటినీ దాటించి) చివరికి మోసంతో, మృత్యువు దగ్గరకి తీసుకుపోతుంది. కాలాన్ని నది దాటించే పడవతో పోల్చడం ఒక అద్భుతమైన భావం. కదిలేది మనం కాదు పడవ. అలానే కాలం కూడా. దీని గమ్యం మృత్యువే!
సగరు, నలుం, బురూరవు, ద్రిశంకుసుతున్, బురుకుత్సు, గార్తవీ
ర్యు, గయు, బృథుం, భగీరథు, సుహోత్రు, శిబిం, భరతుం, దిలీపునిన్,
భృగుకులు, యౌవనాశ్వు, శశిబిందు, ననంగుని, నంబరీషు, బూ
రుగురుని, రంతి, రాఘవు, మరుత్తుని గాలము కోలుపుచ్చదే
( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
ఎందెరెందరు రాజులనీ చక్రవర్తులనీ కాలం తీసుకువెళ్ళిపోలేదు! సగరుడు, నలుడు, పురూరవుడు, త్రిశంకుసుతుడైన హరిశ్చంద్రుడు, పురుకుత్సుడు, కార్తవీర్యుడు, గయుడు, పృథువు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, భృగుకులుడైన పరశురాముడు, యువనాశ్వుని పుత్రుడైన మాంధాత, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, పూరుని తండ్రయిన యయాతి, రంతిదేవుడు, శ్రీరాముడు, మరుత్తుడు - ఈ పద్యంలో మత్స్యధ్వజుడు పేర్కొన్న రాజులందరూ ఎంతో పేరున్న గొప్ప చక్రవర్తులు.
సగరుడు, కార్తవీర్యుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు - వీళ్ళని షట్చక్రవర్తులంటారు. గయుడు, అంబరీషుడు. శశిబిందుడు, అనంగుడు, పృథుచక్రవర్తి, మరుత్తుడు, భరతుడు, సుహోత్రుడు, దిలీపుడు, రాముడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మాంధాత, భగీరథుడు - ఈ పదహారుగురు షోడశ మహారాజులు. అలాంటి మహారాజులు, చక్రవర్తులే కాలగతిలో కలిసిపోయారు!
వర్గత్రయ పరత ముహు
స్స్వర్గక్ష్మా మధ్యమాధ్వ జాంఘాలికతా
దుర్గతియు నొల్ల, మఱి యప
వర్గదు డేవేల్పెఱింగి వాని భజింతున్
( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)
ధర్మ అర్థ కామములన్న త్రివర్గమే ప్రధానంగా జీవితాన్ని సాగిస్తూ వచ్చాను. దీనివల్ల స్వర్గానికి పోయి తిరిగి భూమిమీద పుట్టి - ఇలా భూ స్వర్గాల మధ్య మార్గంలో మాటిమాటికీ పిక్కబలం కొద్దీ పరుగులుపెట్టే దుస్థితి నాకింక వద్దు. నాలుగోదయిన మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరో తెలుసుకొని, అతడిని సేవిస్తాను.
"మధ్యమాధ్వ" - మధ్య త్రోవ. అధ్వము అంటే మార్గం అని అర్థం. అధ్వాన్నము అన్న పదం చాలామందికి తెలిసే ఉంటుంది. ఏదైనా బాగులేకపోతే, అధ్వాన్నంగా ఉంది అంటాం. దీని అర్థం అధ్వ+అన్నం - అంటే త్రోవలో తినే అన్నం అని! ప్రయాణంలో భోజన సౌఖ్యం ఉండదు కదా. ఏది దొరికితే అది, లేదా ఏది పట్టుకు వెళ్ళగలిస్తే అది ఎదో ఒకటి, ఎక్కడో అక్కడ కతకడమే కదా. అలాంటి సుష్టుదనం లేని పరిస్థితికి అధ్వాన్నం అనే పదం వాడుకలోకి వచ్చింది. "జంఘలు" అంటే పిక్కలు. జాంఘాలికత అంటే పిక్కబలం.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. అందులో మొదటి మూడిటి మీదనే దృష్టి ఉన్న మానవుడు ముక్తిపొందలేడు. ఎంత ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపినా, అది పుణ్యాన్ని మాత్రమే ఇస్తుంది, ముక్తిని కాదన్నమాట. ఆ పుణ్యం స్వర్గ ప్రాప్తి కలిగిస్తుంది. చేసుకున్న పుణ్యం అయిపోగానే మళ్ళీ భూమ్మీద జన్మించడమే. నాల్గవ పురుషార్థమైన మోక్షమ్మీద దృష్టి పెట్టినప్పుడే యీ చావుపుట్టుకల చక్రం నుండి ముక్తి లభిస్తుంది. ఇది సనాతన భారతీయ చింతన.
సుభాషితం వినగానే మత్స్యధ్వజునిలో ఇంతటి వైరాగ్యం కలిగింది! అప్పుడా సుభాషితం చదివి తనకి జ్ఞానోదయం కలిగించిన ఆ బ్రాహ్మణుడికి తాంబూలముతో కూడిన దక్షిణ యిప్పించి తన అంతఃపురానికి తిరిగి వెళిపోయాడు. ఆ తర్వాత కొలువు తీర్చి, మహామహా పండితులనందరినీ రప్పించి, మీ మీ శాస్త్రాలలో మోక్షప్రదాత అయిన భగవంతుడు ఎవరో తేల్చి చెప్పండి అని చర్చ మొదలుపెట్టాడు. అంతే కాదు:
వాద మొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వాని కని బీరపువ్వుల బోని టంక
సాల వాటులు నించి యాస్థాని గట్ట
గాల సర్పము గతి వ్రేలు జాలె జూచి
(పై పద్యం లంక గిరిధర్ స్వరంలో)
వివాదంలో ఎవడైతే గెలిచి తత్త్వ స్థాపన చేస్తాడో ఆ పండితుని కోసమని బీరపువ్వుల్లాంటి పచ్చని బంగారు నాణేలను నింపిన ఒక వలసంచిని ఆస్థానంలో వేలాడదీసాడట! వలసంచి అంటే వలలాగా చిన్నచిన్న కన్నాలున్న సంచి. అందులోంచి బంగారునాణేలు చక్కగా కనిపిస్తున్నాయి. కన్నాలలోంచి నాణేలు బంగారపు రంగు గడులుగడులుగా కనిపిస్తున్నాయి. పైగా ఆ నాణేల బరువుకి ఆ సంచి బహుశా సాగికూడా ఉంటుంది. దానితో అది ఒక కాలసర్పంలా కనిపించిందట! పైగా వాళ్ళని భయపెడుతోంది కూడా నన్నమాట. అదేమిటి బంగారు నాణేల సంచి భయపెట్టడమేమిటి? అంటే, మహామహా పండితుల మనసులోనూ ఆశ రేపి, వాళ్ళని అవమానాల పాలు చేస్తుంది కాబట్టి. వాదనలో ఓడిపోతే అవమానమే కదా. ఇలా బాహ్య రూపంలో కనిపించే పోలికతో పాటుగా వాటి స్వభావంలోని పోలికని కూడా ధ్వనించడం గొప్ప విషయం!
అలాగే, బంగారు నాణేలని బీరపువ్వులతో పోల్చడం బహుశా రాయలు తప్ప వేరే ఏ కవి చెయ్యలేడేమో! రాయలకి ప్రకృతి అంటే అంత మమేకం. పైగా బీరపువ్వులతో పోల్చడంలో మరో విశేషముంది. బీరపువ్వులు పచ్చగా ఉంటాయి. మేలిమి బంగారమే (రాగి కలపనిది) అంత పచ్చగా ఉంటుంది. ఆ నాణెములు మేలిమి బంగారువి అన్న విషయాన్ని యీ పోలిక ధ్వనిస్తోంది.
ఇంతకీ ఏ భగవంతుడు ముక్తిని ఇస్తాడన్న సందేహం హాస్యాస్పదంగా తోచవచ్చు. ఏ దేవుడైనా ముక్తిని యిస్తాడు కదా అని అనుకోవచ్చు. దానికంత చర్చ దేనికి అని కూడా అనిపించవచ్చు. నిజమే. కాని ఇక్కడ రాజు పరిస్థితిని మనం గమనించాలి. రాజు ప్రత్యేకంగా ఒక పరమ భక్తుడు కాడు. అసలు అప్పటి వరకూ ముక్తి మీద ధ్యాసే లేదు. మనలో చాలామంది దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. కాని ఎంతమందిమి ముక్తికోసం ఆ పని చేస్తాం? ఏదో సాంసారికమైన కష్టాలని దాటాలనో, లేదా ఇహలోక కోర్కెలను తీర్చుకోవాలనో దైవ ప్రార్థనలు, పూజలు చేస్తాము. ఆ రాజు కూడా అప్పటిదాకా అలాగే చేస్తూ వచ్చాడు. కాని ఇప్పుడు హఠాత్తుగా ముక్తి మీదకి దృష్టి మళ్ళింది. అసలు ముక్తి పొందే మార్గమేమిటో కూడా అతనికి తెలియదు. ముక్తికోసం ఏదైనా దైవాన్ని కొలవాలన్నా ఆ దైవం మీద గురి కుదరాలి. ముక్తికోసం ఆ దైవాన్ని కొలిచే విధానం తెలిసి ఉండాలి. అదిగో అది తెలుసుకోడానికే ఆ చర్చ. ఆ చర్చ ద్వారా తనకి ముక్తి గురించిన విషయ పరిజ్ఞానం కలుగుతుంది. ఆ చర్చ ద్వారా తనకి ఒక దైవమ్మీద గురి కుదరాలి. ఆ దైవాన్ని అర్చించే విధానం తెలియాలి. అది రాజు ఆశయం.
సరే పండితులు చాలామంది వచ్చి చర్చ జరిపారు. వారివారి మతానుసారంగా రకరకాల దేవతలని ప్రతిపాదించారు. వైదికసంప్రదాయం నుండి పుట్టిన ఆరు మతాలు పూర్వకాలంలో బాగా వ్యాప్తిలో ఉండేవి. ఒకొక్క మతము ఒకో దైవ స్వరూపాన్ని అర్చిస్తుంది. అవి శైవము (శివుడు), వైష్ణవము (విష్ణువు), శాక్తము (శక్తి), స్కాందము (స్కందుడు అంటే కుమారస్వామి), గాణాపత్యము (గణపతి), సౌరము (సూర్యుడు). ఆ షణ్మతముల వారు వారి వారి దేవతలని ప్రతిపాదించారు. వీరు కాక కొంతమంది అగ్నిని, కొంతమంది చంద్రుడిని, మరికొంతమంది బ్రహ్మని కూడా ప్రతిపాదించారు. అయితే వాదనలు చేసారే కాని ఎవ్వరూ ఏదీ తేల్చి చెప్పలేకపోయారు. కేవలం పండితులైన వారు చర్చ జరపగలరే కాని, మోక్ష తత్త్వాన్ని ఎలా స్థాపించగలరు? ముక్తి మార్గాన్ని ఆశ్రయించిన ఒక పరమ భక్తుడికే అది సాధ్యమవుతుంది. అందుకే దానికి విష్ణుచిత్తుడు అవసరమయ్యాడు. అదెలా జరిగిందో ఆ వివరాలు వచ్చే టపాలో తెలుసుకుందాం.