తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Friday, May 17, 2019

గోదాదేవి వృత్తాంతము - 4

స్వామిని ఆముక్తమాల్యద అర్చనాదులతో గొలువనారంభించినది.

“వ. ఇత్తెఱంగున సకల కాలంబుల నారటంబునకు  నూరట గానకుండియు నప్పుండరీకాక్షి యందుండు నప్పుండరీకాక్షు నారాధనంబున నా రాధారమణుం గ్రమ్మర జెంద డెందంబునన్ దలంచి” (5-88)
ఆ పడతి అహోరాత్రములు పరితాపమునకు ఊరట పొందనిదై శ్రీవిల్లిపుత్తూరునందున్న శ్రీమహావిష్ణువును పూజచేయుచు ఆ స్వామిని పొందుటకు మనసులో తలచుకొని పూజోపచారములు జేయుచుండగా..

ఉ. కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెరంగు పాండు మృ
ద్బిందువుఁ దీర్చి చెందిరము పేచక శీర్షముపైఁ  బలె న్గటిం
జందుర కావిజీ బమరఁ  జల్లని రేయిటి తట్టుపున్గళు
ల్విందులఁ దేల నూనెముడి వెండ్రుకలం దడి తావు లీనగన్ (5-90)

ఆమె ప్రతి రోజూ కోవెలకు బయలుదేరే తీరు వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. మల్లె మొగ్గల్లాంటి దంతములున్న ఆ సుందరి నుదుటిమీద గుమ్మడిగింజ ఆకారంలో తిరుమణి తిలకాన్ని పెట్టుకుంటుంది. ఎత్తైన విశాలమైన పిరుదులమీద సిందూరవర్ణ వల్కలాన్ని ధరిస్తుంది. అది చూడడానికి ఏనుగు కుంభస్థలం మీద సిందూరం పూత పూసినట్లు కనిపిస్తుంది. గతరాత్రి  అలముకున్న పరిమళ ద్రవ్యములసువాసనలకు తుమ్మెదలు శరీరానికి మూగుతుండగా, అంతకుముందు ఎప్పుడో రాసుకున్న నూనెవెంట్రుకలకు తడి అంటుకునీ, అంటుకొనక వింత  శోభలను చేకూరుస్తుంటాయి. అలా దురితలతాలవిత్రయై, విచిత్ర పవిత్ర పరిమళసముచ్చయంగా కోవెలకు బయలుదేరుతుంది. 
శ్రీహరిని భర్తగా పొందడం కోసం గోదాదేవి వ్రతం చేయడం ప్రారంభించింది. ఆ విధానాన్ని వర్ణన చేస్తున్నాడు రాయలవారు.

తే.బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ 
దరు పరిణ తోరుకదళిమంజరియుఁ గొనుడుఁ 
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి (5-91)

చెలికత్తె కట్టి ఇచ్చినటువంటి పెద్ద ఎర్రకలువల పూదండను, చెట్టుమీదే పండిన అరటిగెలను పట్టించుకుని పోయి, గుడిలో అర్చకుడు జనులనందరినీ పంపివేసిన తర్వాత  ఏకాంతంగా, ప్రశాంతంగా  కోవెలలోకి ప్రవేశించి, స్వామికి నమస్కరించి, వేదిక మీద రంగు రంగుల ముగ్గులు పెడుతుంది. జనులనందరినీ  పంపించి వేయడం అంటే వెళ్ళగొట్టడం కాదు, చిరు పూజలున్నవారిని వారి వారి పూజలు చేయించి పంపించి,  విశేష పూజలు అర్చనలు చేసేవారిని తర్వాత లోపలి రప్పించి వారి పూజలు నిర్వహించడం అని అర్ధం తీసుకోవాలి.

తే.గీ.కపిలగవిసర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి    
ద్వయముతో వక్షమునఁ గల్వదండసేర్చి
యగరు ధూపంబు లిడి శర్కరాజ్య యుక్త
హృదయ కదళీఫలాళి నైవేద్యమిచ్చి (5-92)

కపిలధేనువు పాలను కాచి, వెన్నను తీసి కరిగించి చేసిన నేయితో పెద్ద దీపమును వెలిగించి, ద్వయమంత్రమును పఠిస్తూ స్వామి వక్షస్థలము మీద ఎర్రకలువల దండను అలంకరించి, అగరు పొడితో ధూపం ఇచ్చి, చక్కర, నేయి, అరటిపండ్లను నైవేద్యం పెడుతుంది.

కం.ఖండిత పూగీ నాగర
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే
హిండితములు గావించి య
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్ (5-93)

కత్తిరించిన పోకచెక్కలు, సొంటిముక్కలు శ్రేష్ఠమైన కర్పూరపు తునుకలతో కలిపి అఖండమైన భక్తితో తాంబూలాన్ని స్వామికి సమర్పించి చెలికత్తెలతో కదలిపోతుంది.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి
వినతయై మౌళి శఠకోపమును ధరించి
చరణతీర్థముఁ గొని తత్ప్రసాద లబ్ధ
మయినమాల్యముఁ  దాల్చి గేహమునకరుగు (5-94)

ఆ సుందరి గర్భగృహానికి ప్రదక్షిణ జేసి, వినమ్రంగా శఠకోపమును తీసుకుని స్వామీ చరణతీర్థమును తీసుకుని  ఆ స్వామి ప్రసాదముగా అర్చకస్వామి ఇచ్చిన మాలను తీసుకుని ధరించి, యింటికి వెడుతుంది.

కం.ప్రతిదినము నిట్లు చని య
చ్యుత పూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ
చ్యుతధైర్య యగుచు నయ్యదు
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్ (5-95)


ప్రతిదినమూ యిలాగే కోవెలకు వెళ్లి అచ్యుతుని పూజ చేసి వచ్చి ఆమె వియోగ బాధచే సడలిన ధైర్యముతో  ఆ యాదవప్రభువు గుణములను, శ్రీకృష్ణుని గుణములను ద్రావిడ భాషలో పాడుతూ ఉంటుంది. యిలా ఆమె  ఆ ద్రావిడ భాషలో పాడిన పాటలే పాశురములు లేక తిరుప్పావై అంటారు. యిలా కేవలం రెండు ముక్కల్లో అమ్మవారి  దివ్యసారస్వతమైన తిరుప్పావైని లీలామాత్రంగా సూచించాడు శ్రీకృష్ణ దేవరాయలు. రాయలవారి  సర్వతంత్ర స్వతంత్ర సార్వభౌమ లక్షణానికి యిది ఒక ఉదాహరణ. ఎందుకంటే వేరే ఎవరైనా గోదాదేవి నాయికగా  ఉన్న కావ్యములో తిరుప్పావైని విస్తృతంగా ఉదాహరించకుండా ఉండడం అంటే భయపడేవారు, విమర్శలకు,  భక్తితో కూడా. కానీ యిది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ప్రబంధం. కనుక ప్రబంధ లక్షణాలకే ప్రాధాన్యతను ఇచ్చారు  రాయలవారు. యింతలో వసంత ఋతువు ప్రవేశించింది.

Sunday, March 31, 2019

గోదాదేవి వృత్తాంతము - 3

ఆ ఇందువదన సౌందర్యాన్ని అనేక పద్యములలో వివరించి రాయలవారు సరాసరి ఆమే దైనందిన కృత్యానికి వచ్చేశారు.
సీ. తమ తండ్రి శ్రీశ దత్త శ్రీలు గృహమున
ద్రవ్వి తండములయ్యు దనదు తొంటి
స్రగ్వి నిర్మాణ దాస్యంబ నుత్సేకత
జరపుచు బ్రజ్ఞ వైష్ణవ పురాణ
సంహితా వ్యాఖ్యారచన బ్రొద్దు గడుపుచు
గట్టెడు కమ్మ చెంగలువ విరుల
తోమాలె లలకలు దువ్వి కంతునకు నా
ర్ద్ర నిబద్ధ ఖేటకం బనగ నీల
తే.గీ. వృషక కుద్రేఖ నెడమకొక్కింత యొఱగ
నిడిన ధమిల్ల వలయంబు నడుగునందు
గొంతసేపర్ధి గీలించి కూపవారి
నీడ వీక్షించి క్రమ్మఱ గూడ నునుచు.

ఆ చంద్రవదన తన తండ్రియగు విష్ణుచిత్తుండు శ్రియ: పతి కృపవలన అధికమగు సంపదలు గలిగినను, గర్వింపక యధావిధి పుష్పమాలికా కైంకర్యము జేయుచు శ్రీ విష్ణుపురాణ వ్యాఖ్యానము చేత కాలక్షేపము జేయుచు, ఆయనకు సమకూర్చెడి చెంగలువ దండలను తాను కొప్పులో ధరించి నూతిలో నీడ చూచుకొని మరల వానిని బుట్టలో ఉంచెడిది. ఆమె కొప్పు ఎడమవైపుకు ఒరిగి ఉండెడిది.

. నవలా యలంతి పసుపాడి దుకూలము దాల్చి గుబ్బచన్
గోనల దావులుప్పతిల గుంకుమ తేటల నిగ్గు దేరగ
ప్రానన నాభి దీర్చి పితృబద్ధ లతాంతము లర్ధి గొప్పునం
బూని యొకింత సేపునిచిపుచ్చి చెలింగని వెచ్చ నూర్చుచున్.

ఆ యింతి పసుపుతోడి స్నానము చేసి తెల్లని వస్త్రములు ధరించి చనుగుబ్బలు పరిమళములు ఉదయించునట్లు, కుంకుమ కాంతుల యొక్క నిగారింపు కానరాగా కర్పూరము చేతనే తిరుమణిని తీర్చిదిద్ది, తండ్రియగు విష్ణుచిత్తుని చేత కట్టబడిన పుష్పములను కోరిక అతిశయించగా కొప్పున ధరియించి కొంచెంసేపు ఉంచుకొని మరల దీసి చెలికత్తెను జూచి ఉచ్ఛ్వసించును.

ఆమెకు శ్రీమహావిష్ణువుపై గలిగిన మోహం దాని వలన దాను పడుచున్న బాధలు వివరిస్తున్నాడు రాయలవారు.

.ఎఱుగరుగా యొకద్భుతము, నీ చెలి దీర్ఘిక దీర్ధమాడ నా
యఱుత దగిల్చి పోవుదన హారము వోయిన నేను బోవుదున్
మఱవక వెంట బోవ జలమగ్నత నౌ నది సున్నమైన దా
గఱకరి బెట్టి సొమ్మడుగు గాని నిజార్తి ఎరుంగదేమియున్

ఆమె విరహతాపముచేత గ్రాగుడు వలన శరీరమందలి ముక్తాహారములు పెటిలి యున్నాయనీ, ఆమె చెలికత్తెలతో స్నానమాడునపుడు నీటిలో మునుగగా విరిసి సున్నముగా మారెనని..అంత తాప మీమె భరించు చున్నదని చమత్కరిస్తున్నాడు రాయలవారు.
ఆయమ ఇట్లు దు:ఖింప సాగినది.

.అట్టి మురారి కప్పుడును గైమరి ఈకలి వేళ గ్రమ్మఱం
బుట్టి వియోగ వేదనల బొక్కెడు నీ తనువేల తండ్రి దా
నిట్టగు నన్ను నింకొకని కియ్యక తొల్తన యోగశక్తి బో
బెట్టెద దీని వెండియు నుపేంద్ర పదాంబురుహంబు పట్టెదన్

ఆమె శ్రీమహావిష్ణువును ప్రేమించి ఆయననే విహామాడవలెనని నిశ్చయించుకొన్నది. కానీ తన తండ్రి వేరే ఎవరికైనా ఇచ్చి తనకు వివాహము జరుపునేమో నని భయము గలుగుటచేత, యోగశక్తిచే ప్రాణములు విడచి ఆ త్రివిక్రముని పాదచరణముల వద్దకు చేరెదను అని చెప్పుచున్నది.
అని పలుకగా చెలికత్తెలు విని యామెతో నిట్లనిరి.

తే.గీ. అనిన వారలు పల్కి రాయదు వతంస
మెందు జన్నాడు విను రంగ మందె నిల్చె
వేగపాటేల? యతడ నీ విభుడగుటకు
నర్చనాదుల నివ్వీటి హరి భజింపు.


చెలికత్తెలు ఆమె ఎక్కడ ప్రాణత్యాగమొనరించునో అని భయపడి, నీ శ్రీకృష్ణుడెక్కడికినూ బోలేదు. శ్రీరంగమందే కొలువై యున్నాడు. కావున అతడు నీ భర్త కావలనంటే నీ ఊరిలో ఉన్నటువంటి వడపెరుంగోయిలుడయ నను స్వామిని పూజ, అర్చనాదులతో గొలువుమని చెప్పిరి.

Monday, March 11, 2019

గోదాదేవి వృత్తాంతము - 2

          శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని తమిళులు పిలుస్తారు. ‘చూడికొడుత్త నాచ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే తెలుగువాళ్ళు `నాంచారు’ అంటారు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్ (రక్షకురాలు)కోదై (పూలమాల)అనే పేర్లుకూడా ఉన్నాయి. కోదై అనేది తమిళభాషలో ప్రాచీన రూపం ‘గోద’ అనేది దాని ఆధునిక రూపంగా పండితులు చెప్తారు.  కృష్ణదేవరాయలు  గోదాదేవి జీవిత చరిత్ర నే ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు.  పండుని కొరికి తియ్యగా ఉన్నదాన్నే శబరి రాముడికి సమర్పించినట్టు , నాంచారు కూడా తాను ధరించి బాగున్నదని సంతృప్తి చెందాకనే పూలమాలను స్వామికి సమర్పించేది. జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టువిష్ణుచిత్తుడికి తన పూలతోటలో, తులసి మొక్కల దగ్గర ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగారాముని భార్యగా సీత పూజనీయం ఐతే, విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగాభూదేవి అవతారంగా నాంచారు పూజలందుకుంది. అటువంటి శ్రీదేవి నాచ్చారును అద్భుతంగా వర్ణిస్తున్నారు రాయలవారు.
            
           కం.ఆయత భుజైక చక్రుం
డా యదుపతి దొమ్మి గెలువ నడరు మరుని కా
లాయస చక్రపరంపర
లోయన నుంగరపు గురులు యువతికి నమరున్! (5-9)

ఆమె ఉంగరపు కురుల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు రాయలవారు. ఆమె వలచిన నారాయణుని దీర్ఘ బాహువునందు చక్రాయుధము దాల్చియున్నవానిని పోరులో గెలువగోరి మదనుడు చక్రాయుధము ఒరుసలో యున్నట్టు ఒప్పరెనని చెప్తూ. ఉంగరపు కురులు ఆ నారాయణునికి మిక్కిలి మోహం కలిగించాయని చెప్పడం దీని భావం.

శా.సైరంధ్రుల్పయికెత్తి  కజ్జలము బక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుం గన్నుల మీదు చూచు తరి ఫాలాంచ చ్చతుధీన్ నిశా
స్ఫారేందుం గనె వక్త్ర మక్కనుట గా బర్వేందుడాత్మ ప్రభా
చోరుం డుండగ దన్ను దద్గతవిభా చోరంబనున్ లోకముల్.(5-11)

ఉత్ప్రేక్షాలంకారంలో అత్యంత సుందరమయిన రూపకాపహ్నుత్యనుప్రాణితోత్ప్రేక్ష అలంకారంలో ఆమె ముఖ సౌందర్యాన్ని వర్ణించడం ఈ పద్యంలో చూడవచ్చు. చెలికత్తెలు ఆమె ముఖాన్ని అలంకరించేటప్పుడు ఆమె మొహాన్ని పైకెత్తి కన్నులకు కాటుక దిద్దుచుండగా ఆమె ముఖము వారి ముఖమనెడి చవతి చంద్రుని చూడడం వలన ఆ దోషం వలన ఆమె ముఖమునకు దాని కాంతిని దొంగిలిచ్చినట్లయిందట అయినా ఆ చంద్రునికి ఏ నీలాపనిందలు రాక తానాతని కాంతిని దొంగిలించినదని లోకములో నింద కలిగినదట. ఎంత అనదమైన ఊహ.
 ఆమె కంఠాన్ని, కంఠ స్వరాన్ని ఈ క్రింది పద్యాలలో వివరిస్తున్నాడు రాయలవారు.

తే.గీ. శంఖ సామ్యంబు రా మున్ను జలజ భవుడు
సరసి రుహపత్త్ర నేత్ర కంధర యొనర్చె
జవ్వనము వచ్చి వెండి సాక్షాత్కరించు
శంఖమున చేసెనును గంధ సారచర్చ (5-17)
ఆమె కంఠం పుట్టుకతో శంఖంలాగా ఉండేది. యవ్వనపు చందనంపు నునుపూతచేత కంబువే అయినది. యౌవనము బ్రహ్మ శృష్టిని మించినదని అంతర్భావము. ఉపమాగమ్యోత్ప్రేక్ష ఇందులో విశేషము.

కం. కమలదళేక్షణ సంగీ
తమున నెగడు మంద్ర మధ్య తార త్రిస్థా
నములకు దీర్చిన రేఖల
క్రమమగు రెఖాత్రయమున గంఠంబమరున్ (5-18)

ఆమె కంఠము మంద్ర స్థాయి ఇంతవరకు, మధ్యమ స్థాయి ఇంతవరకు, తారా స్థాయి ఇంతవరకు అని తెలియజెప్పే విధంగా ఆమె కంఠంపై మూడు రేఖలున్నాయట.

చం. ఒదవెడు జవ్వనంబు వెలి కొత్తఁగఁ బయ్యెద సిగ్గుఁ గూడి చి,
ట్టదుమఁగ లేఁత లౌట దిగనీకను మీఱను లేక పక్షపుం,
జదువునఁ బ్రక్కల న్మెఱసి చప్పట లై మఱి లావుఁ గూడఁ బైఁ,
బొదలె ననంగ బిక్కటిలె బొల్తుక చన్నులు నాడు నాటికిన్ (5-21)

ఆమెకు యవ్వనము వచ్చి కూడింది. దానితోపాటు పుట్టుకొచ్చిన చన్నులను ఆ యవ్వనం పైకి, బయటకు  నెట్టేసింది. కానీ యవ్వనంతో పాటే వచ్చిన సిగ్గు పైటను తెచ్చిపెట్టింది. ఆ పైట చన్నులను అదిమిపెట్టింది,  బిగించి పట్టింది. దానితో పాపం ఆ వక్షోజములకు లోపలికి పోవడానికీ బయటకు రావడానికీ వీలుకాక,  ప్రక్కలకు వ్యాపించినట్లు ముద్దలుగా ప్రక్కలకు వ్యాపించి, నానాటికీ విశాలములు అయినాయి.

తే.గీ. ధృత రఘూత్తమ శాపమొక్కింత విడిచి
విడిచి కడకేగ నప్పుడప్పుడకవిసెడు
చక్రయుగ మన రొమ్మొయ్యనాక్రమించి
కొమిరెచన్నులు పృథుచూచుకముల నమరె (5-22)

శ్రీరాముడు సీతాదేవి వియోగాన్ని అనుభవిస్తున్నప్పుడు చక్రవాక పక్షులకు శాపం ఇచ్చాట్ట. నేను నా  ప్రియురాలి వియోగాన్ని అనుభవిస్తుంటే మీరు హాయిగా సంయోగానందాన్ని నా కన్నుల ఎదురాగానే  అనుభవిస్తూ, నన్ను ఉడికిస్తూ వెక్కిరిస్తూ బాధిస్తున్నారు, భడవల్లారా, మీకు రాత్రిపూట ఎడబాటు  కలుగుగాక, పగటిపూటే మీకు ఒకరినొకరు చూసుకోడం, కలుసుకోడం జరుగుగాక అని శాపం  ఇచ్చాట్ట. ఆ  శాప ప్రభావం వలన పగటిపూట కలుసుకున్న చక్రవాక పక్షులు ఆనందంగా కౌగలించుకుని ముక్కులు రాసుకున్నట్లు గోదాదేవి వక్షోజములు ప్రక్కలకు పెరిగి పెరిగి ఒకదానినొకటి ఒరుసుకుంటున్నాయి. ఆ  చక్రవాక పక్షుల ముక్కుల లాగా ఆమె చూచుకములు రాసుకుంటున్నాయి!

తా రె ట్లట్లుగ దమ్ముం 
జేరిన ముత్తెంపుసరుల జేడియచన్నుల్ 
లోరెంట లుడిపె ఘనమగు 
వారు నిజార్జవము జేరు వారికి నీరే (5-23)


      ఉత్తములైనవారు తమను ఆశ్రయించిన వారికి తమ ధైర్యాన్ని, సత్త్వాన్ని, లక్షణాలను అందించినట్లు, యజమానుల లక్షణాలు సేవకులకు వచ్చినట్లు గోదాదేవి వక్షోజాలను ఆశ్రయించిన ఆభరణాలకు ఆ వక్షోజాల  లక్షణాలు వచ్చాయి. విపరీతమైన వైశాల్యం వలన ఆ వక్షోజాలు ఒకదానికొకటి అంటుకుపోయాయి. ఆమె  ధరించిన ఆభరణాలకు ఆమె వక్షోజాల మధ్యలో ఇరుక్కుపోవడం వలన, పేటలన్నీ ఒక్కటిగా ముడిపడి,  ఇరుక్కుపోయాయి. రాయలవారి రసికత్వం ఇంకా చాలా ఉంది. వచ్చే పోస్టులో చూద్దాం.
Related Posts Plugin for WordPress, Blogger...