తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Monday, April 16, 2012

విష్ణుస్తుతి -దశావతార స్తోత్రం



విష్ణుచిత్తుడు తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువును చూసి ఆనందంతో పులకించిపోయాడు. ఆ స్వామిని స్తుతిస్తూ దశావతారాలను వర్ణించాడు. నిజానికి వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్ణుచిత్తుడు చేసినది దశావతారస్తుతి కాదు. భగవంతుని సౌందర్యాన్ని స్తుతిస్తూ, అతనికి దిష్టి తగలకుండుగాక అని, తమిళభాషలో "తిరుప్పల్లాండు" అనే స్తోత్ర సముదాయాన్ని రచించాడు. దానిని ఒక దివ్యప్రబంధంగా నేటికీ శ్రీవైష్ణవులు గానం చేస్తూ ఉంటారు. తిరుప్పల్లాండును అనువదించకుండా ఈ సందర్భంలో రాయలవారు దశావతార వర్ణన చెయ్యడం బహుశా దీనిలో కవితోహలకు ఎక్కువ అవకాశం ఉంటుందని భావించి కాబోలు!


జయ జయ దానవదారణకారణ శార్‌ఙ్గ రథాంగ గదాసిధరా!

జయ జయ చంద్రదినేంద్రశతాయుత సాంద్రశరీరమహఃప్రసరా!

జయ జయ తామరసోదరసోదర చారుపదోజ్ఝితగాంగఝురా!

జయ జయ కేశవ! కేశినిషూదన! శౌరి! శరజ్జలజాక్ష హరీ!


(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )


ఈ పద్యం ఆదిత్య 369 సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడింది..


దానవులను మట్టుపెట్టడానికై ధనుస్సును(శార్‌ఙ్గము), చక్రమును(రథాంగము) , గదను, నందకమనే ఖడ్గాన్ని(అసి) ధరించినవాడా!! పది లక్షల (అయుత అంటే పదివేలు. శతాయుత అంటే వంద పదివేలు, అంటే పది లక్షలు) సూర్యచంద్రులవలే ప్రకాశించే దివ్యమంగళరూపం కలవాడా!! తామరస (తామరపువ్వు), ఉదర (లోపలి భాగానికి) సోదర (తోబుట్టువులాంటి), చారు పద (అందమైన పాదాలనుండి) ఉజ్ఝిత (పైకి చిమ్మబడిన) గాంగఝరా (గంగా ప్రవాహం కలవాడా)!! కేశి అనే రాక్షసుని సంహరింఛిన వాడా!! శరత్కాలమందలి కమలములవంటి కన్నులు కలవాడా!! కేశవా! హరీ ! నీకు జయమగుగాక అని మంగళశాసనం చేసాడు. భగవంతుడికన్నా మానవుడు గొప్పవాడా మంగళశాసనం , ఆశీర్వచనం ఇవ్వడానికి అని అనుకునేరు! పూర్వం సీతాదేవి శ్రీరాములవారికి మంగళశాసనం పలికియున్నారు. అలాగే గోపికలు కూడా శ్రీకృష్ణుడికి మంగళశాసనం పలికారని తెలియవస్తుంధి..

ఈ పద్యం ఛందస్సు కవిరాజవిరాజితము అనే వృత్తం. నజజజజజజవ అనేవి గణాలు. 14వ అక్షరం యతి. చాలామంది కవులు మూడు యతులతో (8, 14, 20 అక్షరాలు) కూడా వ్రాసారు. నన్నయ్య తిక్కనలు ఒక యతినే వేసారు. ఇక్కడ రాయలువారు కూడా ఒక్క 14వ అక్షరానికే యతి నియమం పాటించారు. ఈ పద్యం మనుచరిత్రలోకూడా వస్తుంది, చివరన చిన్న తేడాతో. మనుచరిత్రలో పద్యం "శౌరి హరీ దురితాపహరా!" అని ముగుస్తుంది. రాయలవారికి మనుచరిత్రపై, అందులోని పద్యాలపై ఉన్న అమిత మక్కువతో కొన్నిటిని తన ఆముక్తమాల్యద కావ్యంలో వాడుకొన్నారు.

మ. దివిజద్వేషి నుదారవారిచరమూర్తిం ద్రుంచి చాతుర్య మొ

ప్ప వడిం జౌకపుఁదెల్ల కౌచుగమి దంభం బొంద మైఁదాల్చి, వే

దవిశుద్ధాక్షర పంక్తిఁ గ్రమ్మఱఁగ వేధం జేర్చెదో నాఁగఁ,

ద్భువనం బబ్ధిసితాంబుబిందు లలమం బ్రోద్యద్రుచిన్ దాటవే.


( పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)

శ్రీహరీ! పూర్వం వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రక్కసుని మత్స్యావతారమెత్తి సంహరించి, సముద్రంనుండి సత్యలోకానికి లంఘించావు.. ఆ ఎగరడం ఎలా ఉందంటే, ఆ వేద వర్ణాలను జాగ్రత్తగా, నేర్పుగా ఒంటిమీద ధవళకాంతిలో ఉన్న పొలుసులనే మిషతో ధరించి సముద్రంలోని జలబిందువులు చెదిరిపోతున్నట్టుగా పైకెగిరి తీసికెళ్లి బ్రహ్మదేవునికి ఇస్తున్నావన్నట్టుగా ఉంది.

"చౌకపు తెల్లకౌచుగమి" అన్నది ఒక ఆశ్చర్యకరమైన ప్రయోగం. కౌచు అంటే చేపల పొలుసులు. అవి తెల్లగా ఉన్నాయని ఊరుకోలేదు. "చౌకపు" అని పేర్కొన్నారు రాయలు. అంటే నలుచదరంగా ఉన్నాయని. బహూశా నాలుగు వేదాలను ఆ నలుచదరాకారంలో ధ్వనించడానికేమో! చేప ఎగిరే స్వభావం కలది కనక యిక్కడ సముద్రంనుండి సత్యలోకం దాకా ఎగిరినట్లు ఉత్ప్రేక్షించడం చక్కగా ఉంది. వేదమంత్ర సంపుటి బ్రహ్మ ఉచ్ఛ్వాస రూపంలో వెలువడినట్లు సంప్రదాయం. ఇక్కడ ఆ మంత్రాక్షరాలు శ్రీహరికి శరీరంగా చెప్పబడటం భగవంతుడు మంత్రతనువన్న సంప్రదాయాన్ని సూచిస్తోంది.

మ. జలపూరప్లవమానమృణ్మయ మహీసంరక్షకై గార యీ

బలె ముక్తామణిశుక్తిశంఖనికురుంబం బెల్లఁ జూర్ణంబుగా

బలభిద్వజ్రసదృజ్నిజోపరిపరిభ్రామ్యన్మహామందరా

చలసంఘృష్టిఘరట్ట మైన కమఠస్వామి న్నినుం గొల్చెదన్..


( ఈ పద్యం రాఘవ స్వరంలో . రాగం వసంత )

పాలసముద్రంలో దేవదానవులు అమృతమధనం చేస్తుండగా నీవు కూర్మావతారం దాల్చి మంధర పర్వతాన్నీ నీ వీపు మీద మోసావు. అది ఎలా ఉందంటే, సముద్ర జలాల మీద తేలుతున్న మంధరపర్వతపు మట్టి కరిగిపోకుండా గట్టిగా గార (సున్నపు గచ్చు) వేయడానికై, ఇంద్రుడి వజ్రాయిధంతో సమానమైన పటిష్ఠత కలిగిన నీ వీపు చిప్పని మంధరపర్వతానికి తిరగలి రాయిగామార్చి సముద్రంలోని ముత్యాలు, మణులు, ముత్యపుచిప్పలు, శంఖాలు మొదలైనవాటి నన్నింటిని మెత్తగా నూరుతున్నుట్టుగా కనిపిస్తోంది. అలాంటి నీ కూర్మావతారాన్ని కొలుస్తాను.

చ. ఒకమఱి బుడ్డగింప విలయోదకముల్ పయి కుబ్బి, చిప్ప వ్ర

చ్చుకొని, మహాభ్రవీథిఁ జన, సూకరత న్మెయి వెంచి, వెండి క్రిం

దికిఁ గయివ్రాలు తత్సలిల నిర్మలధార నధఃపరిస్ఫుర

త్ప్రకృతికి నీ యజాండమునె బంగరు ముంగఱఁగా నొనర్పవే!


( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం -సహన)

ఓ విష్ణుమూర్తీ!! వరాహావతారం దాల్చి మహా భీకరాకారుడవై శరీరాన్ని విపరీతంగా పెంచి నీ ముట్టెతో ప్రళయజలధిలోని నీటిని పెళ్లగించినప్పుడు అందులోని నీళ్లు ఈ బ్రహ్మాండమనే చిప్పను చీల్చుకుని వెళ్లేట్టుగా పైకి చిమ్మి వంపు తిరిగి మళ్లీ క్రిందపడుతూ ఉంది. ఆ దృశ్యం ఎలా ఉందంటే, నువ్వు మూలప్రకృతియనే స్త్రీకి, బ్రహ్మాండమనే బంగారు ముక్కెరను అలంకరించినట్టు కనిపిస్తుంది.. అది వట్టి బంగారు ముక్కెర కాదు. ముత్యాలగుత్తితో గూడిన ముక్కెర. వలయాకారంలో లేచి పడుతున్న ఆ నీటిధారే ముత్యాలగుత్తి.

మ. అసురేంద్రాశయకుండి కాచ్చరుధిరవ్యాప్త స్వకచ్చాయఁ గాం

చి, సముద్యత్ర్పతిసింహమత్సర మిళచ్చేష్టన్ దదుద్ధామ దీ

ర్ఘ సటాఝూటముఁ బెల్లగించుగతి నాంత్రశ్రేణిఁ గిన్కన్ వెరం

జు సితక్రూర భవన్నఖావళులు ప్రోచు న్మర్త్యపంచాననా!


(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

మర్త్యపంచాననా! - పంచాననం అంటే సింహం. మర్త్యపంచాననా అంటే నరసింహా అని. స్వామీ! నీవు ఉగ్రనరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని గుండెను (ఆశయకుండిక) చీల్చినప్పుడు ఆ రక్తంలో నీ ప్రతిబింబాన్ని చూసి మరో సింహం నీ మీదకు దూకుతుందని భ్రమించి మరింత కోపంతో తెల్లని నీ వాడిగోళ్లతో దాని జూలును పట్టుకుని పెళ్లగిస్తున్నట్టుగా, హిరణ్యకశిపుని కడుపులోని ప్రేగులను బయటకు లాగినావు. అంతటి కఠినమైన నీ తెల్లని గోళ్లు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించాలి..

మ. బలిదైతేయ భయాంధకారభరిత బ్రహ్మాండ గేహంబులో

పలఁ బై మండెడి తత్ప్రతాపమయ దీపజ్వాల డిందన్, గడుం

దలమై మింటికి గ్రక్కున న్నెగయు నుద్యత్తన్మహాచ్చాయ నాఁ

దలనీలాంగము శింశుమార మొరయంగాఁ బెంపవే వామనా!


( ఈ పద్యం సనత్ స్వరంలో)

ఓ వామనమూర్తీ! రాక్షస రాజైన బలి చక్రవర్తి వల్ల కలిగిన భయమనే అంధకారంతో నిండిన బ్రహ్మాండమనే భవనంలో, పైన ఎత్తుగా అతని ప్రతాపమనే జ్వాల పెద్ద ఎత్తున మండుతూ ఉంది. ఆ జ్వాల గుప్పుమని ఆరిపోతే దాని పెద్దనీడ ముల్లోకాలలో వ్యాపించినట్లు, స్నిగ్ధమైన నీ నల్లని దేహాన్ని, పైకి పైపైకి మొసలి ఆకారంలో ఉన్న శింశుమార చక్రం (నక్షత్ర సముదాయం) వరకు పెంచావు కదా స్వామీ

మ. శమితక్షత్త్రకళత్రనేత్రజలవర్షావేళ నీ కీర్తిహం

సము క్రౌంచస్ఫుటతావకాంబకసుషిం జాఁగంగ నీక్షించి,

ర్షము రా నంచలు నంద నేఁడుఁ జను నిచ్చ న్నాటి తచ్చేష్ట వా

యమిఁ; దిర్యక్తతి దా గతానుగతికం బౌఁగా కుఠారీ! హరీ!


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

కుఠారము అంటే గొడ్డలి. కుఠారీ అంటే గొడ్డలి ధరించినవాడా అని. హరి అంటే హరించువాడు అని. పరశురామావతారం రాజలోకాన్ని హరించడానికే కదా. ఓ పరశురామా! నీవు ఎందరో రాజులను చంపడంవల్ల వారి భార్యల కన్నీరు వాన కురిసినప్పుడు - గతంలో నీవు క్రౌంచపర్వతాన్ని నీ బాణంతో చేదించావు కదా - అప్పుడు ఏర్పడిన బిలంలోనుండి నీ కీర్తి అనే హంస అవతలికి వెళ్ళి దిగంతాల వ్యాపించింది అది చూసిన ఇతర హంసలు ఇప్పటికీ వర్షాకాలం మొదలుకాగానే ఆ పర్వత బిలం గుండా మానససరస్సులోకి వెళుతున్నాయి. పక్షులు ముందుపోయిన పక్షివెంట అలా వెడలిపోవడం సహజమే కదా!

శివుని దగ్గర పరశురాముడు సుబ్రహ్మణ్యస్వామీ విలువిద్య నేర్చుకున్నారనీ, విద్యా పరీక్షకై యిద్దరూ క్రౌంచ పర్వతాన్ని భేదించారనీ పురాణ కథ. ఆ కథ ఆధారంగా చేసిన కల్పన యిది. వర్షాకాలంలో హంసలు క్రౌంచ పర్వత బిలంలోంచి మానససరోవరానికి ఎగిరిపోతాయనీ, మళ్ళా శరత్తు ప్రవేశించడంతో తిరిగి అదే క్రౌంచ పర్వత బిలంలోంచి మళ్ళీ లోకమ్మీదకి వస్తాయన్నది కవిసమయం. దీనికి ఆద్యుడు బహుశా కాళిదాసు. ఈ క్రౌంచ పర్వతమన్నది ఎక్కడ ఉన్నదీ స్పష్టంగా తెలియదు. ఇది హిమాలయశ్రేణిలోనే ఒక పర్వతమని కొందరంటే, యిది దక్షిణదేశంలో ఉందని మరికొందరు భావిస్తారు.

సీ. స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ

జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు

క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన

స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు,

యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత

సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు

పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి

భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు

శ్రాంతరథ్య నిరంతర ఛాయదములు,

దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు,

కలుషము లడంచుగాత లంకాపురాంగ

ణాంబర చలత్కలంబ కదంబకములు


( పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)

రాయలవారి దారుణాఖండలశస్త్ర తుల్యమైన వాక్కు విశ్వరూపం దాల్చిన పద్యమిది! ఈ పద్యంలో వర్ణింపబడుతున్నవి శ్రీరామ బాణాలు, అవి చేస్తున్న రకరకాల శబ్దాలు. సందర్భం రామరావణ యుద్ధం. ఆ యుద్ధంలోని తీవ్రతనంతా శబ్దాలలోనే వ్యక్తీకరిస్తున్న పద్యమిది.

"స్యందనస్థితబిడౌజఃక్షత్తృజాడ్యకృ

జ్ఘంఝామరుద్గరుజ్ఝాత్కృతములు"

స్యందన స్థిత, బిడౌజ క్షత్తృ, జాడ్య కృత్, ఝంఝా మరుత్, గరుత్, ఝాత్ కృతములు.

బిడౌజుడు అంటే ఇంద్రుడు. క్షత్తృ అంటే రథసారధి. బిడౌజక్షత్తృ అంటే ఇంద్రుని రథసారధి, మాతలి. రామరావణ యుద్ధంలో రాముని రథానికి సారథ్యం వహించినది స్వయంగా ఇంద్రుని సారథి అయిన మాతలే. మాతలి రాముని రథాన్ని తోలుతున్నాడు. రాముడు రావణునిపై బాణవృష్టి కురిపిస్తున్నాడు. తమ గరుత్తులు (బాణాల చివరనుండే యీకలు) ఝాత్ ఝాత్ అనే శబ్దాలు చేస్తూండగా ఆ బాణాలు దూసుకుపోతున్నాయి. అవి ఎంతలా దూసుకుపోతున్నాయంటే, ముందుకు వెళ్ళే వాటి వేగానికి, గాలి, తుఫాను ఝంఝామారుతంలాగా వెనక్కి తన్నుకు వస్తోంది. అలా వస్తున్న గాలి, రథ వేగాన్ని అడ్డగిస్తూ దానికి జడత్వాన్ని కలిగిస్తోందిట!

మనం బస్సులోనో రైల్లోనో వెళ్ళేటప్పుడు, అది వెళ్ళే దిశకి వ్యతిరేక దిశలో వేగంగా గాలి మనని తాకడం మనకి తెలిసినదే. ఇక్కడ దాన్ని గుర్తుచేసుకోండి. మహాజవంతో వెళుతున్న రామబాణాల వలన గాలి వాటి వ్యతిరేక దిశలో తుఫానులా హోరెత్తుతోంది. అలా వచ్చే ఆ ఝంఝ రథ వేగాన్ని నిరోధిస్తోందిట! అంటే ఆ బాణ వేగాన్ని మనం ఊహించగలమా! అంతటి వేగాన్ని తట్టుకొని రథాన్ని ముందుకు నడపాలంటే ఆ సారథి ఎంత సమర్థుడై ఉండాలి, ఆ గుఱ్ఱాలకు ఎంతటి జవసత్త్వాలుండాలి!

"క్రవ్యాశిరాడ్గాత్రకనదసృగ్గాహన

స్ఫుటశల్యహవ్యభుక్చూత్కృతములు"

క్రవ్యాశి రాట్, కనత్, గాత్ర, అసృక్, గాహన, స్ఫుట, శల్య, హవ్యభుక్, ఛూత్కృతములు.

క్రవ్యమంటే మాంసము, అశి అంటే భుజించే అని అర్థం. క్రవ్యాశి అంటే రాక్షసులు. క్రవ్యాశి రాట్ - రాక్షసరాజైన రావణుడు. రావణశరీరంలో ప్రవహిస్తున్న నెత్తుటిలో (అసృక్ అంటే నెత్తురు) మునగడం వల్ల బాణపు ములుకులకున్న నిప్పు ఛూత్ అనే శబ్దాన్ని చేస్తున్నదిట! బాగా కాల్చిన చువ్వను నీటిలో ముంచితే "ఛూత్" అని శబ్దం చేస్తూ ఆరిపోతుంది కదా. రామబాణాల చివరలు రావణుని శరీరంలోని రక్తంలో ములిగి వాటి అగ్ని కూడా చల్లారి అలాంటి శబ్దం చేస్తోందట!

"యోధవర్మితహృత్పుటోత్క్రాంత నిజపాత

సాలాశ్మకృతముహుష్ఠాత్కృతములు"

యోధ, వర్మిత, హృత్ పుట, ఉత్క్రాంత, నిజ పాత, సాల, అశ్మ, కృత, ముహుః, ఠాత్ కృతములు

రామబాణాలు ఇంకేమేమి శబ్దాలు చేస్తున్నాయో చెపుతున్నాడు కవి. వర్మము అంటే కవచం. కవచాలు ధరించే వారు కాబట్టే రాజుల పేర్లలో వర్మ పదం ఉండేది. కవచాలు ధరించిన యోధుల హృదయ కోశాలనుండి బయటకు వెళ్ళి తనమీద పడే రామబాణాల వల్ల, గోడల రాళ్ళు (అశ్మములు) కూలిపోతూ కోట మళ్ళీమళ్ళీ ఠాత్ ఠాత్ అనే శబ్దాలు చేస్తోందిట! అంటే రామబాణాలు శత్రుయోధుల కవచాలని చీల్చి, వారి గుండెలను చీల్చుకొని, కోట గోడల రాళ్ళను కూడా బద్దలు కొడుతున్నాయని అర్థం. రామబాణాల తీవ్రత అది!

"పతితోగ్రరక్షఃకబంధభారభృశార్తి

భుగ్నభోగఫణీంధ్రపూత్కృతములు"

పతిత, ఉగ్ర రక్షః, కబంధ భార, భృశ, ఆర్తి, భుగ్న, భోగ, ఫణీంద్ర, ఫూత్ కృతములు

ఉగ్రులైన రాక్షసులు రామబాణాలు తగిలి పడిపోతూ ఉంటే, వారి మొండేల (కబంధాలు) బరువుకు, మిక్కిలి ఆర్తితో వంగిన పడగలు కల ఫణీంద్రుడు (ఆదిశేషువు) ఫూత్కారాలు చేస్తున్నాడట. బరువు మోయలేక అతని ఊర్పులు ఎక్కువయ్యాయి. పాము కదా, అంచేత అవి భుస్ భుస్సనే ఫూత్కారాలు. రాక్షసులే కాదు, సమస్త ప్రాణులూ ఉన్న భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు, ఆ సమయంలో వారి మొండేల బరువు మోయలేక ఎందుకంత ఆర్తి చెందుతున్నాడు అనే అనుమానం రావచ్చు. అది ఆలోచిస్తేనే ఇందులో ఉన్న ధ్వని మనకి తెలుస్తుంది. రాక్షసులు మామూలుగా ఉంటే వారి భారాన్ని మోయడం శేషువుకి అలవాటే. కానీ యిక్కడ రాక్షసులు రామబాణాలకి తల తెగి కిందపడుతున్నారు. ఆ పడే వేగం వల్ల భూమి మీద అపారమైన ఒత్తిడి కలుగుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం ఆదిశేషునికి భారమయ్యింది! అంటే రామబాణాలు తగిలి రాక్షసులు అంత వేగంగా కూలి పడుతున్నారన్న మాట!

అవీ రామబాణాలు చేసే రకరకాల ధ్వనులు! అంతే కాదు, ఆ బాణాలు పందిరిగా ఏర్పడి విశ్రాంతి తీసుకుంటున్న తమ రథాలకు నీడనిస్తున్నాయట. ఓ రామా! అలా నీ దివ్య ధనుస్సునుండి వెలువడి లంకా నగర ప్రాంగణమంతటా కదలాడుతున్న బాణాల (కలంబ) గుంపులు (కదంబకములు) సర్వ పాపాలను అణచుగాక అని విష్ణుచిత్తుని ద్వారా రాయలవారు ప్రార్థిస్తున్నారు.

ఇంతటి ప్రౌఢమైన, ఓజోగుణ భూయిష్టమైన పద్యానికి ముందు కాస్త సున్నితమైన పద్యం ఒకటి వస్తుంది, రామావతారాన్ని గురించినదే. అది:

పవిధారాపతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా

తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా, సప్త సా

ల విభేదం బొనరించి నిల్వక సలీలన్ జన్న యుష్మన్మరు

జ్జవనాస్త్రం బొసగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా!

ఇంత సుకుమారశైలి రాయలవారి కెక్కడిది! ఇది మనుచరిత్రలోని పద్యం. రాయలువారు ఇష్టపడి తిరిగి తన ఆముక్తమాల్యదలో వాడుకున్నది. ఈ పద్యమిక్కడ ప్రస్తావించడానికి కారణాం పద్యం చివరనున్న సంబోధనలు. అవి మనోహరమైన సంబోధనలు. రమావల్లభా అని సంబోధించడంలో ఒక విశేషం ఉంది. దశావతారాలలో రామావతారం వచ్చే వరకూ విష్ణువు రమావల్లభుడు కాడు! అంతకుముందు అవతారాలు సంపూర్ణావతారాలు కాదు. రామావతారమే మొట్ట మొదటి (ఒక రకంగా ఒకేఒక) సంపూర్ణావతారం. అంచేతనే ఆ అవతారంలో మాత్రమే విష్ణువు రమావల్లభుడయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి సీతగా అవతరించింది. ఆ విశేషాన్నంతా ధ్వనించే సంబోధన "రమావల్లభా" అన్నది.

చ. 'క్షితిహలకృష్టిఁ బుట్టి యడఁగెన్ క్షితియందునెసీత' యంచుఁ ద

త్సతి విరహార్తిఁబాండిమముఁ దాలిచి రామశరీర మెత్తి, యా

క్షితిఖననక్రియ న్మగుడఁ జెందగఁ గాక, కళిందజా తట

క్షితి దున నేటికి న్హలముచే మఱి నీ కవశాత్మకతన్ హలీ!


( పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

ఇక్కడ సంబోధన "హలీ!" అని. అంటే హలము ధరించినవాడు, బలరాముడు. స్వామీ! రామావతారంలో జనకుడు భూమిని దున్నిస్తూ ఉండగా సీతాదేవి ఉద్భవించింది. చివరకు ఆ భూమిలోకే అంతర్థానమయింది. అందుకే ఆ రాముడుగా అవతారం చాలించిన తర్వాత బలరాముడవై మరల జన్మించి, ఆ సీతాదేవి విరహము మూలంగా నల్లనివాడివి పాలిపోయి తెల్లనై. సీత భూమిలోనే ఉన్నదనే నమ్మికతో యమునా నది ఒడ్డున నేలను నీవు నాగలితో దున్నితివే గాని, నీకు అలా నేలని దున్నవలసిన అవసరం లేదు కదా! అని రాయలవారు చమత్కరించారు. కృష్ణుని కొడుకు సాంబుడు దుర్యోధనుని కూతురైన లక్షణను పెళ్ళిచేసుకోవడానికి సాహసించి ఆమెను ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తే, కౌరవులు అతన్ని బంధిస్తారు. సాంబుని విడిపించుకు రావడానికి బలరాముడు హస్తినాపురానికి వెళ్ళి, తమకున్న బంధుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సాంబుని వదిలివెయ్యమని అడుగుతాడు. కౌరవులు దానికి ఒప్పుకోక కయ్యానికి కాలు దువ్వుతారు. దానితో కోపించిన బలరాముడు హస్తినాపురాన్ని యమునలో ముంచడానికి తన నాగలితో నగరాన్ని యమున వైపుకి యీడ్చితే నగరం ఒక ప్రక్క క్రుంగిపోతుంది. అప్పుడు భీష్మాదులు వచ్చి బలరాముని ప్రార్థించి లక్షణా సహితంగా సాంబుని అతనికి అప్పగిస్తారు. ఈ పద్యం వెనకనున్న కథ యిది.

ఉ. ఆయతయుష్మదాకృతి కరాగ్ర నగాంచల వాంత వారిధా

రాయుత చంద్రకాంతఫలకావళిబింబిత యై చెలంగ, నా

రాయణమూర్తిమత్కవచరత్నముచేఁ బరిరక్షఁ గాంచె నా

నో యదువీర! వృష్టిఁ బసి యూఱడఁ బ్రోవవె సప్తరాత్రముల్..


( పద్యం రాఘవ స్వరంలో .. రాగం మోహన )

శ్రీకృష్ణా! ఒకసారి పంతంతో దేవేంద్రుడు ఏడు రాత్రులు నిరంతరాయంగా వర్షాన్ని కురిపించాడు. ఉన్నతమైన ఆకృతితో నీవు గోవర్ధనగిరిని ఎత్తి గోపకులాన్ని, గోసంపదను దానిక్రిందకు తెచ్చి రక్షించావు.. అప్పుడు గోవర్ధనగిరిని నీ చేతి కొనగోటితో ఎత్తి పట్టినప్పుడు ఆ గిరి అంచులనుండి వేల కొలది కురుస్తున్న చంద్రకాంతశిలల వంటి నీటిధారలలో నీ రూపమే ప్రతిబించింది. అప్పుడు చుట్టూ అంతా నారాయణాకృతే కనిపించసాగింది., నారాయణకవచమే శరీరాకృతి దాల్చి గోవులను, గోపాలురను రక్షించిందన్నట్టుగా ఏడు రాత్రులు వారందరినీ ఊరడించి కాపాడావు!

బలరామ కృష్ణులిద్దరినీ దశావతారాల్లో వర్ణించారేమిటి రాయలవారని సందేహం రావడం సహజం. బలరాముడిని దశావతారాల్లోకి చేరిస్తే, కృష్ణుని కాక బుద్ధుడిని మాత్రమే చేరుస్తారు. ఇక్కడ రాయలవారు బలరాముడినీ, కృష్ణుడినీ, బుద్ధుడినీ కూడా వర్ణించారు. అప్పుడు దశావతారాలు పదకొండైయిపోతాయే! లెక్క తప్పదా? రాయలెందుకిలా వర్ణించారు? దీనిలోని రహస్యం తెలుసుకోవాలంటే, ఈ కృష్ణ వర్ణన మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించాలి.

దశావతారాలలో ఎక్కడా వాడని "నారాయణ" శబ్దాన్ని యీ కృష్ణవర్ణన పద్యంలో వాడారు రాయలవారు. విశిష్టాద్వైతంలో నారాయణుడే పరబ్రహ్మ. శ్రీకృష్ణుడు అవతారమూర్తి కాదు. స్వయంగా నారాయణమూర్తే! దాన్ని ఆ శబ్దంతో యిక్కడ చక్కగా ధ్వనించారు రాయలు. కృష్ణావతార వర్ణనలా పైకి కనిపించినా కృష్ణుడు స్వయంగా నారాయణమూర్తే అని ధ్వనింప చేస్తుందీ పద్యం. అంటే కొందరు కృష్ణుని అవతారమూర్తిగా భావిస్తారు కాని అతను భగవత్స్వరూపుడే అని చెప్పడం రాయలవారి ఆంతర్యం కాబోలు. అంతే కాదు, శ్రీకృష్ణుని "విష్ణు" స్వరూపాన్ని, అంటే సర్వవ్యాపకతను కూడా ఈ పద్యంలో ధ్వనింప చేసారు. చుట్టూ లక్షలకొద్దీ ఉన్న నీటిబిందువులలో కృష్ణుని మూర్తి ప్రతిబింబించి లోకమంతా ఆయనే వ్యాపించినట్టుగా ఉందని చెప్పడంలో ఆ ధ్వని ఉంది. మరొక విశేషం ఏమిటంటే, "నారాయణ" శబ్దానికి "నీటిలో వసించువాడు" అనే అర్థం ఉంది. ఇక్కడ ఆయన కనిపిస్తున్నది కూడా నీటి ధారలలోనే కదా! అంచేత అతను నారాయణమూర్తిగా గోచరించడంలో ఎంతో ఔచిత్యం ఉంది.

Sunday, February 26, 2012

ఆముక్తమాల్యద - చతుర్దాశ్వాసం

ఆముక్తమాల్యద తృతీయాశ్వాసంలో విష్ణుచిత్తుడు పండితులందరిని ఓడించి పాండ్యరాజుకు అష్టాక్షరీ మంత్ర పూర్వకంగా ద్వయమంత్రాన్ని ఉపదేశించి అతన్ని భాగవతోత్తముని చేశాడు. ఇక చతుర్ధాశ్వాసంలోకి ప్రవేశిద్దాం.

శ్రీ మందిర భుజమధ్యమ,
గోమండలకర్షి వేణుగుంభన, దృప్య
ద్భౌమాహృతసురజనయి
త్రీమణితాటంక! వృషగిరిస్థ! ఖగాంకా.!


( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వర శర్మ స్వరంలో )

శ్రీమహాలక్ష్మికి నివాసమైన వక్షస్ధలం కలిగినవాడా! గోసమూహాన్ని ఆకర్షించే వేణువును పూరించేవాడా! దృప్యత్ అంటే అహంకరించిన. భౌముడంటే భూమి కుమారుడు నరకుడు. అహంకరించిన నరకుడినుండి దేవతామాత అయిన అదితి మణితాటంకాలను తిరిగి తీసుకొనివచ్చినవాడా! గరుడుని కేతనంగా ధరించిన వృషాద్రి నివాసా! అని చతుర్ధాశ్వాస ప్రారంభంలో మహావిష్ణువును ప్రార్ధిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.


. బలిమిం ద్రెంపఁగఁ బోలెఁ బాయవడుచుం బర్యాయభంగంబుగాఁ
గల నూలెల్లను నంటుమోవఁ దెగి రాగా, గొంతసే పుండి, తాఁ
బెలుచ న్గంటు పుటుక్కునం దునిసి వే పృధ్విం బడె న్జాలె, మి
న్నుల మ్రోసెన్ సురదుందుభుల్, గురిసె బెన్సోనై విరుల్బోరునన్.



( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )

విష్ణుచిత్తుడు పరతత్వ నిరూపణ చేయగానే అక్కడ రాజాస్థానంలో విద్యాశుల్కంగా వ్రేలాడగట్టిన వరహాలమూట ఎవరో బలవంతంగా త్రెంచినట్టుగా ఒక్కొక్క పాయ విడిపోయాయి. ఆ అంటుదారం అంచు వరకు కొద్దిసేపు ఊగిసలాడి అదే తెగిపోవడంతో దానికి కట్టిన వరహాలమూట జారి క్రిందపడింది. అది చూసిన దేవతలు సంతోషంగా దుందుభులు మ్రోగించి పుష్పవర్షం కురిపించారు. "బలిమిన్ ద్రెంపఁగఁ బోలె" అనడంలో ఏదో అదృశ్యశక్తి చేత అలా జరిగిందని ధ్వనిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే, ఈ వర్ణనలో, భవబంధాలు ఒకొటొకటీ తెగి జీవుడు మోక్షాన్ని పొందే విధానం స్ఫురిస్తుంది. విష్ణుభక్తే ఆ అదృశ్యశక్తి. విష్ణుచిత్తుని ఉపదేశాన్ని పొందిన పాండ్యరాజుకి అతను కోరుకున్న ముక్తి లభించిందనే ధ్వని ఇందులో ఉంది.


ఈ విధంగా విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులోని పండితులను జయించి వేదవేద్యమైన విష్ణుతత్త్వాన్ని రాజుకు తెలియజెప్పి భగవంతునికి శరణాగతిచేసి లోకానికి హితం కూర్చాడు.

శా. అద్ధా వాగ్విబుధం, బహోవచన కవ్యాహార, మాహావచ
స్సిద్ధం, బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం,
బిద్ధౌద్ధత్య మగాల్లయం హి కుధియా మిత్థంవద త్కిన్నరం,
బద్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యెన్ నభం బంతయున్

( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం హిందోళం )


ఆ ధీరాగ్రణి విష్ణుచిత్తుని గెల్పుటుత్సవము చూసి, ఆకాశంలో ఉన్న దేవతలు "అద్ధా!" అన్నారు. పితృదేవతలు "అహో" అని, సిద్ధులు "ఆహా" అని మెచ్చుకున్నారు. విద్యాధరులు "ఆహ్! కలియుగం కృతయుగం అయినట్టుగా ఉంది" అన్నారు. కుత్సితమైన బుద్ధి గలవారి గర్వమణిగిందని కిన్నెరులు మెచ్చుకుని సంతోషించారు.


ఈ పద్యంలో మొదటి మూడు పాదాలూ పూర్తిగా సంస్కృతం. ఇది రాయలు తన సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చేసిన రచన కాదు. ఇక్కడ విష్ణుచిత్తుని విజయాన్ని చూసి మెచ్చుకొన్నవారెవరు? దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, కిన్నరులు. వీరందరూ గీర్వాణులు. అందువల్ల, వారు పొందిన ఆశ్చర్యానుభూతిని వారి భాషలో ప్రకటించడమే చాలా ఉచితం. ఉచితజ్ఞుడైన కవి కాబట్టే రాయలవారు అలా వర్ణించారు.


పాండ్యరాజు విష్ణుచిత్తుని రత్నాలు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో సత్కరించి, అటుపిమ్మట ఊరేగించడానికి గజారూఢుని చేసాడు. రాకుమారులను పిలిచి ఈ మహాత్ముని ఊరేగించి విల్లిపుత్తూరు చేర్పించి రమ్మని పంపాడు.

. ఇంగిలికంబునం దడిపి యెత్తు కసీసపు రెంటెమో యనన్
నింగి గరుత్ప్రంపరల నిగ్గున లేఁదొగ రెక్కె; నంత వీ
చెం గలశాబ్ధిమీఁగడల జి డ్డెఱిఁగించెడు కమ్మగాడ్పు; నిం
డెం గడు మ్రోఁత; పెన్దిరువడిం గని రా ఖగరాజు మూఁపునన్.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

విష్ణుచిత్తుని గజారూఢుని చేసి మంగళవాద్యాలు, స్తోత్రాలు, రకరకాల వాద్యలతో ఘనంగా ఊరేగిస్తూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. ఎఱ్ఱని ఇంగిలీకంలో ముంచి తీస్తున్న నల్లని నేత వస్త్రమో అన్నట్టుగా నీలాకాశం గరుత్మంతుని రెక్కల కాంతితో ఎరుపెక్కింది. క్షీరసాగరపు పాలమీగడల జిడ్డు వాసనలతో కూడిన కమ్మని గాలులు వీచాయి. అంతలోనే గరుత్మంతుని రెక్కల సవ్వడి వినిపించింది. గరుత్మంతుడు కనిపించాడు. ఆతని వీపుమీద వేంచేసిన విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. ఇది ఒక ఉదాత్త రమణీయమైన వర్ణన. ముందుగా ఱెక్కల కాంతి, ఆపై పాలమీగడల వాసన, ఆ తర్వాత రెక్కల మ్రోత, చివరగా రూపం - యిలా చక్కని సహజ క్రమంలో మనోహరంగా సాగిన వర్ణన రాయల కవితాశక్తికి ఒక మచ్చు తునక. ద్రవిడ భాషలో "అడి" అంటే పాదమని అర్థం. తెలుగులో "అడుగు" అన్న మాటకి మూలం అదే. పెన్+తిరు+అడి = పెందిరువడి, అంటే పూజ్యపాదులలో పెద్దవాడు అని. గరుత్మంతుని పెందిరువడి అంటారు.

సీ. చివురుబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్య
హస్తోదరముల దివ్యాంఘ్ర లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్చాయ
లీలఁ దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక
రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి
డాసె నా మకరకుండలము లమర

శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు

( ఈ పద్యం రాఘవ స్వరంలో - రాగం పూర్వీ కళ్యాణి )

భక్తునికొరకు దివినుండి భువికి దిగివచ్చిన శ్రీహరి ముగ్ధమోహనమైన రూపంతో అలరించాడు. ఆ రూపాన్ని రాయలవారీ పద్యంలో వర్ణిస్తున్నారు.

గరుత్మంతుని రెక్కల మధ్య స్వామి దివ్యాంఘ్రులున్నాయి. అవి రెండు చిగురాకు పొట్లాలలో ఉన్న ఎర్రని తామరపువ్వుల్లాగా ఉన్నాయట! ఎంత మనోజ్ఞమైన ఉపమానం! స్వామివారి పాదాలు పద్మాలు. గరుడుని కెంజాయ ఱెక్కలు చిగురాకులు. తామరపూవులను చిగురాకులెంత మృదులంగా పొదువుకుంటాయో స్వామి పాదాలని గరుత్మంతుని గరుత్తులు అలా పొదువుకున్నాయి. స్వామి దేహం స్నిగ్ధ నీలవర్ణం, దాని చుట్టుకొని పీతాంబరమున్నది. అది ఎలా ఉందంటే, గరుత్మంతుని బంగారు శరీరచ్చాయ పైకి ప్రసరించినదేమో అన్నట్టుగా ఉందట! స్వామి మెడలో ముత్యాలహారాలు వ్రేలాడుతున్నాయి. నిరతము తనను ధ్యానించే యోగివర్యుల నిష్కళంకములైన అంతఃకరణములవలె (మనోబుద్ధి చిత్తాహంకారాలు ) ప్రకాశిస్తున్నాయట అవి! ఇదెంతటి ఔచితీమంతమైన పోలిక! యోగుల అంతఃకరణములు పరమ స్వచ్ఛములు. స్వచ్ఛత్వానికి ప్రతీక తెలుపు. అంతే కాదు, అవి పారదర్శకములు, ప్రకాశవంతములు. ముత్యాలు కూడా అంతే కదా! స్వచ్ఛమైన ఆ యోగుల అంతఃకరణములు స్వామివారి హృదయానికి అత్యంత సమీపములు. స్వామి చెవులకు మకరకుండలాలున్నాయి. అవి మహావిష్ణువు ధర్మపత్ని సిరికి పుట్టింటి చెలికత్తెలు కావడంతో చనువుకొద్ది ఆయనతో ఏదో మనవిచేసుకోడానికి దగ్గరకి వచ్చినట్టుగా ఉన్నాయట. కమలేక్షణుడైన స్వామి చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. ఆ చేతులలో శంఖ చక్రాలు అమరి ఉన్నాయి. ఆ చేతులు కల్పవృక్ష శాఖలు. ఒక కొమ్మమీద తెల్లని హంస వాలినట్టుగా ఒక చేతిలో శంఖమున్నది. పూల పుప్పొడి సుడిగాలికి లేచి వలయంగా ఏర్పడినట్టుగా మరొక చేతిలో చక్రం అలరారుతోంది. ఆ స్వామి భక్తుల పాలిట కల్పతరువు!


తే. సమ్మద దిదృక్షు ఖస్థ రక్షః పిశాచ
పుంజ మహిభుక్పతత్త్ర ప్రభంజనములు
సోఁకఁ వెఱఁ బాఱెఁ కళ్లాన శూర్పవాత
ఘట్టనలఁ బాఱు పెనుఁబొల్లకట్టు వోలె.


( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )

దేవతలతో పాటు రాక్షసులు, పిశాచగణాలు కూడా ఆకాశంలో నిలుచుని విష్ణుచిత్తుని ఊరేగింపును, వైభవాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు . ఎప్పుడైతే నాగాంతకుడైన గరుత్మంతుని రెక్కల తీవ్రవాయువులు వచ్చి తాకినవో వారు భయపడి పారిపోయారు. ఎలాగంటే కళ్లంలోని ధాన్యం మీద చేటలతో విసరగానే దానిపై పొట్టు ఎగిరిపోయినట్టుగా చెల్లాచెదరైపోయారు. దేవతలు మాత్రం నిలిచి స్వామికి వినయంగా నమస్కరించారు. శూర్పము అంటే చేట. ఇది కర్షకవృత్తినుండి గ్రహించబడ్డ సొగసైన పోలిక. రాయలవారికి దేశీయ జీవనమ్మీద ఉన్న మక్కువకి యిదొక తార్కాణం.


తే. అట్లు ప్రత్యక్షమైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.


( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

విష్ణుచిత్తుడు ఆకాశంలో తనకోసం ప్రత్యక్షమైన పద్మాక్షుడిని చూసి నిలువెల్లా పులకించిపోయాడు. కళ్ళనుండి ఆనందబాష్ఫాలు ఉబికిరాగా, తాను ఊరేగుతున్న ఏనుగుకు కట్టిన గంటల మ్రోతలే తాళధ్వనులుగా ఆ స్వామిని స్తుతించాడు. ఇప్పటికీ మధుర మీనాక్షి గుడి కెదురుగా దగ్గరలో విష్ణువు కోవెల ఉంది. అది ఎక్కడ స్వామి విష్ణుచిత్తునికి సాక్షాత్కరించాడో, ఆ చతుష్పథంలో గుర్తుగా రాజు నిర్మించాడట. విష్ణు సాక్షాత్కారమైన సందర్భంలో విష్ణుచిత్తుడు పరమానందంతో ఆ భగవంతుని సౌందర్యాన్ని తనివితీరా వర్ణిస్తూ, ఆయనకు దృష్టిదోషం తగలకుండుగాక అని "తిరుప్పల్లండు" అని తమిళ భాషలో స్త్రోత్రాగుచ్ఛాన్ని రచించాడు. అయితే ఈ కావ్యంలో రాయలవారు వాటిని అనువదించక, స్వతంత్రమైన దశావతార వర్ణన చేసారు. ఆ వర్ణన వచ్చే టపాలో చూద్దాం.

Sunday, January 22, 2012

తృతీయాశ్వాసం - సింహావలోకనం


ఆముక్తమాల్యద మూడాశ్వాసాలు పూర్తిచేసుకున్నాం. మొదటి రెండు ఆశ్వాసాలలో ఎక్కువ భాగం వర్ణనలు, ప్రధాన పాత్రల పరిచయాలు జరిగాయి. రెండవ ఆశ్వాసం చివరలో కథలోకి ప్రవేశించాం. ఒక పండితుని శ్లోకం విన్న పాండ్యరాజుకి వైరాగ్యభావం అంకురిస్తుంది. పండితులందరినీ సమావేశపరచి పరమాత్మ తత్త్వాన్ని గురించిన శాస్త్రచర్చ మొదలుపెడతాడు. ఎవరి వాదాలు వారు వినిపిస్తూ చర్చించుకుంటూ ఉంటారు. విష్ణుచిత్తునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, పాండ్యరాజు సభకి వెళ్ళి అక్కడ శ్రీవైష్ణవాన్ని స్థాపించమని పురమాయిస్తాడు. విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభలో చేసిన వాదము, విశిష్టాద్వైత మతస్థాపనం తృతీయాశ్వాసం. అందులో భాగంగానే ఖాండిక్య కేశిధ్వజుల కథ వచ్చింది. ఇదీ, స్థూలంగా యిప్పటి వరకూ జరిగిన కథ.

ఈ మూడవ ఆశ్వాసం బాగా అర్థం కావాలంటే, భారతీయ తత్త్వచింతన గురించి కొద్దిపాటి పరిచయం అవసరం. భారతీయ తత్త్వచింతనకి మూలాలు వేదాలలోనే కనిపిస్తాయి. వేదాలు నాలుగన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు. వేదానికి నాలుగు విభాగాలున్నాయి - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ప్రాచీన జీవనవిధానంలో నాలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాలు. వేదంలో ఒకో విభాగమూ ఒకో ఆశ్రమానికి ఉపయోగపడేదని భావించవచ్చు. సంహిత మంత్ర సముదాయం. బ్రహ్మచారులకు పఠన ప్రధానమైన కర్మ. కాబట్టి వారికి ప్రధానం సంహిత, అందులోని వేదమంత్రాల పఠనం. సంహితలోని మంత్రాలను వివరించేవి బ్రాహ్మణాలు. ఇవి మంత్రార్థాలను వివరిస్తూ యజ్ఞయాగాదులను ఎలా నిర్వహించాలో విశదపరుస్తాయి. వీటిని ఆసక్తికరంగా వివరించడానికి కథలు ఉపాఖ్యానాలు కూడా వీటిలో ఉంటాయి. యజ్ఞయాగాదులను చేసే అధికారం గృహస్థాశ్రమవాసులకే ఉంది. కాబట్టి బ్రాహ్మణాలు వారికి ఉపయోగపడేవి. ఆరణ్యకాలు వానప్రస్థ ఆశ్రమవాసులకి ఉపయోగపడేవి. ఆరణ్యకమంటే అరణ్య సంబంధమైనది. అంటే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవులలో నివసించేవారు ఆలోచించవలసిన విషయాలు ఆరణ్యకాలలో ఉంటాయి. యజ్ఞయాగాదుల గురించిన తాత్త్విక విశ్లేషణ వీటిలో కనిపిస్తుంది. బ్రాహ్మణాలలో కర్మ ప్రధానమయితే, ఆరణ్యకాలలో ఉపాసన ప్రధానం. చివరిదైన ఉపనిషత్తు జ్ఞాన ప్రధానం. వేదాలలోని తత్త్వ చింతనాసారం మనకి ఉపనిషత్తులలో కనిపిస్తుంది. సన్న్యాసాశ్రమవాసులకు జ్ఞానచింతన ఒక్కటే ప్రధానం కాబట్టి వారికి ఎక్కువగా ఉపయోగపడేవి ఉపనిషత్తులు. వేదాలని సరిగా చదవడానికీ, అందులో చెప్పిన యజ్ఞయాగాది కర్మలను సరిగ్గా ఆచరించడానికీ, వేదాలలోని తత్త్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోడానికీ వేదాంగాలు ఏర్పడ్డాయి. అవి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము.

తత్త్వచింతన మూలాలు వేదాలలో (ముఖ్యంగా ఉపనిషత్తులలో) కనిపించినా, అది విస్తృతి చెంది గొప్ప సైద్ధాంతిక రూపాన్ని పొందినది మాత్రం షడ్దర్శనాలలో. మూడు జంటలుగా ఉన్న ఆరు దర్శనాలు. ఇవి సాంఖ్యము-యోగము, న్యాయము-వైశేషికము, మీమాంస-వేదాంతము. ప్రతి దర్శనాన్ని గురించి వివరించడం యిక్కడ సాధ్యమయ్యే పని కాదు. దీని గురించి తెలుగులో సులువుగా అర్థమయ్యేట్టు నండూరి రామమోహనరావుగారు తన "విశ్వదర్శనం - భారతీయ చింతన" పుస్తకంలో వివరించారు. ఆసక్తి ఉన్నవారు వీటిని పరిచయం చేసుకోడానికి ఆ పుస్తకం చదవవచ్చు. అయితే యీ దర్శనాల గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు మాత్రం యిప్పుడు ప్రస్తావిస్తాను. మొదటగా, యీ దర్శనాలు ఆరూ కూడా వేదాలను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డవే! కాని వాటి సిద్ధాంతాల మధ్య మౌలికంగా ఎన్నెన్నో తేడాలు. ఇవి ముఖ్యంగా వాటి దృక్పథాల మధ్య భేదం వల్ల ఏర్పడ్డాయి. కొన్ని బ్రాహ్మణాలలోని కర్మకి ప్రాధాన్యమిస్తే, కొన్ని ఉపనిస్థత్తులలోని జ్ఞానాకి ప్రాధాన్యమిచ్చాయి. దర్శనాలనగానే యివేవో దేవుడు, ఆత్మ లాంటి అంతుబట్టని విషయాల గురించి మాత్రమే విచారిస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వీటి ముఖ్యోద్దేశం సత్యాన్వేషణ. ఆ అన్వేషణ, కనిపించే యీ సృష్టినుండే మొదలవుతుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. దీనికి మనిషే కేంద్రం. పదార్థ తత్త్వం, వాటి గుణాలు, సంబంధాలు (దీనినే ఇంగ్లీషులో Ontology అంటారు) మొదలుకొని, అసలు జ్ఞానమంటే ఏమిటి, జ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాము, దానికవసరమయ్యే సాధనాలేమిటి (దీనినే ఇంగ్లీషులో Epistemology అంటారు), తర్కశాస్త్రం (Logic) మొదలైన ఎన్నో తత్త్వశాస్త్ర సంబంధమైన అంశాలకు పటిష్ఠమైన రూపకల్పన మనకీ దర్శనాలలో దర్శనమిస్తుంది. వీటి ఆధారంగానే జీవ తత్త్వాన్నీ, సృష్టి విధానాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఉదాహరణకి, హేతుబద్ధమైన తర్కవాదంలో ఉండే అవయవాలేమిటో న్యాయ దర్శనం చాలా స్పష్టంగా చెపుతుంది. అవి ప్రతిజ్ఞ (Statement), హేతువు (Reason), ఉదాహరణ (example), ఉపనయం (analogy), నిగమనం (conclusion). తర్కాన్ని గురించి ఎంత పకడ్బందీ ఆలోచనో చూసారా! ఇదే కాదు అసలు తర్కమంటే ఏమిటి, వాదం అంటే ఏమిటి, వాదాలలో ఎన్ని రకాలున్నాయి మొదలైనవాటిని చాలా స్పష్టంగా సూత్రీకరిస్తుంది న్యాయ దర్శనం. విష్ణుచిత్తుడు పాండ్యరాజు సభలో చేసిన వాదనాపద్ధతికి మూలం మనకీ న్యాయదర్శనంలోనే కనిపిస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి, చిన్న గమ్మత్తైన విషయం. మనం "చలోక్తి" అంటూ ఉంటాం కదా. చమత్కారమైన మాట అన్న ఉద్దేశంలో వాడుతాం. ఇదెలా వచ్చిందో తెలుసా? "ఛలము" అన్నది న్యాయదర్శనంలో చెప్పిన ఒక రకమైన వాదం. వాది ఒక అర్థంలో ఒక మాటని ఉపయోగిస్తే, ఆ మాటకి ఉన్న మరొక అర్థాన్ని తీసి వాదిని హేళన చేసి ఖండించడాన్ని "ఛలము" అంటారు!

షడ్దర్శనాలలో మీమాంస-వేదాంత ద్వయాన్నే పూర్వమీమాంస-ఉత్తరమీమాంస అనికూడా అంటారు. పూర్వమీమాంస మంత్ర-బ్రాహ్మణాలు ప్రధానంగా కర్మ గురించి ఎక్కువ విచారిస్తుంది. ఉత్తరమీమాంస లేదా వేదాంతదర్శనం ఉపనిషత్తుల ఆధారంగా జ్ఞానవిచారం చేస్తుంది. ప్రతి దర్శనమూ కొన్ని సూత్రాలలో నిబద్ధింపబడింది. వేదాంతదర్శనం "అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్న సూత్రంతో మొదలవుతుంది. అంటే - ఇప్పుడు బ్రహ్మమును గురించిన జిజ్ఞాస మొదలవుతుంది - అని. వేదాంతదర్శన సూత్రాలకే "బ్రహ్మసూత్రాలు" అని పేరు. వీటిలో ప్రధానంగా బ్రహ్మ, జీవుడు, జగత్తు మొదలైన విషయాల గురించి మీమాంస జరుగుతుంది. తమాషా ఏమిటంటే, సూత్రాలేవైనా, చెప్పే విషయాన్ని చాలా సూక్ష్మంగా చెపుతాయి. అందుచేత అవి అర్థం కావాలంటే వాటికి వివరణ అవసరమవుతుంది. సూత్రాలకు చెప్పే వివరణనే భాష్యమంటారు. సూత్రాలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి వాటికి రకరకాల అన్వయాలు, వివరణలు ఉండే ఆస్కారముంటుంది. దానివల్ల ఒకే సూత్రసమామ్నాయానికి అనేక భాష్యాలు ఏర్పడే అవకాశముంది. బ్రహ్మసూత్రాల విషయంలో సరిగ్గా అదే జరిగింది! ఆదిశంకరులు బ్రహ్మసూత్రాలకు మొట్టమొదట భాష్యం వ్రాసారు. తాను ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంత పరంగా ఉంటుందీ భాష్యం. దీని పేరు శారీరకభాష్యం. అలాగే ఆ తర్వాతి కాలంలో వచ్చిన రామానుజాచార్యులు తాము ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా శ్రీభాష్యం వ్రాసారు. ఇలా మధ్వ, నింబక, వల్లభ, భాస్కర మొదలైన ఎందరో ఆచార్యులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసారు.

భారతీయ తత్త్వ చింతన గురించి చెప్పుకొనేటప్పుడు చార్వాక, బౌద్ధ, జైన దర్శనాల గురించి చెప్పుకోకపోతే అది సంపూర్ణం కాదు. వీటిని "నాస్తిక" దర్శనాలు అంటారు. ఇక్కడ "నాస్తిక" అనే పదానికి ఇప్పుడున్న "దేవుడు లేడనడం" అనే అర్థం కాదు. నాస్తికత్వం అంటే వేదాలను, వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే సాంఖ్యం మొదలైన కొన్ని దర్శనాలు కూడా సృష్టిస్థితిలయకారకుడైన "ఈశ్వరుడిని" అంగీకరించవు! ఈ తేడా గమనించడం ముఖ్యం. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలు కూడా ఎన్నో ప్రాచీనకాలంలో మనకుండేవి. అందులో బాగా ప్రసిద్ధి పొందినవి పైన చెప్పిన మూడు. ఈ సిద్ధాంతాలలో మళ్ళీ చాలా విభేదాలున్నాయి.

విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో చేసిన వాదనకి ఆధారం రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యం. దాని ఆధారంగానే విష్ణుచిత్తుడు సాంఖ్యము మొదలైన ఆస్తిక దర్శనాలను, చార్వాకము బౌద్ధము మొదలైన నాస్తిక దర్శనాలను, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తాడు.

ఇక యీ ఆశ్వాసంలో రెండో భాగానికి వస్తే, అది ఖాండిక్య-కేశిధ్వజుల కథ. రాయలువారీ కథని ఎందుకు చెప్పారు? విష్ణుస్వరూపం గురించిన జ్ఞానబోధ, విష్ణుచిత్తుడు పాండ్యరాజుకు నేరుగా చెయ్యకుండా కథ ద్వారా ఎందుకు చెప్పాడు? మొదలైన ప్రశ్నలు వేసుకోవాలి. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, విష్ణుచిత్తుడు ఆచార్యుడు కాదు. కేవలం భక్తుడు. అటు పిమ్మట, విష్ణువు ఆజ్ఞచే ఆ సభలో వాదం చెయ్యడానికి వచ్చినవాడు. అంతే. అందువల్ల అతడు నేరుగా పాండ్యరాజుకి వైష్ణవమతాన్ని బోధించే స్థితిలో లేడు. కాబట్టి అలా కథ ద్వారా చెప్పడమే ఉచితం. ఇక రెండవ కారణం తెలుసుకోవాలంటే భారతీయ వాఙ్మయంలో మరొక కోణాన్ని చూడాలి. వేదాలు, దర్శనాలు, వాటి భాష్యాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ ఒక కోవకు చెందినవి. ఇవి ప్రధానంగా బౌద్ధికమైనవి. అంటే కాస్త గట్టిబుఱ్ఱ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలవి. సామాన్యులు వీటిని వంటపట్టించుకోవడం చాలా కష్టం. వారికోసం వెలసినవే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనవి. భారతీయ తత్త్వ సారాన్ని యివి కథల రూపంలో మనకందిస్తాయి. అందుకే అవి సామాన్యజనులకు కూడా ఆసక్తికరంగా ఉండి సులువుగా వారి హృదయాలకు హత్తుకుంటాయి. ఇక్కడ విష్ణుచిత్తుడు ఉపయోగించిన ప్రణాళిక యిదే. పండితులతో అయితే శాస్త్రపద్ధతిలో బ్రహ్మసూత్రాల ఆధారంగా చర్చ జరిపి వారి వాదాలను ఖండించాడు. కాని రాజుగారు తనకి మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించమన్నప్పుడు, దానికోసం కథని ఆశ్రయించాడు. ఇది విష్ణుచిత్తునికి (రాయలవారికి) భారతీయ వాఙ్మయం గురించిన పరిపూర్ణ జ్ఞానానికి నిదర్శనం. కథల ద్వారా అనేక విషయాలను చెప్పవచ్చు. ఉదాహరణకి ఖాండిక్య-కేశిధ్వజుల కథలో మనకి తెలిసేది విష్ణుతత్త్వాన్ని గురించి మాత్రమే కాదు. రాజనీతి, ధర్మాధర్మాలు, కర్మ-జ్ఞాన మార్గాల మధ్యనున్న భేదము, యిలా అనేక విషయాలు మనకీ కథలో అంతర్లీనంగా గోచరిస్తాయి. వీటన్నిటినీ ఆసక్తికలిగే సంవిధానంతో పాఠకులముందు (శ్రోతలముందు) ఉంచినప్పుడు అవి వారి మనసుకి బాగా హత్తుకొనే అవకాశం కలుగుతుంది. కథవల్ల ఉపయోగమిది. ఆ ఒడుపు తెలిసినవాడు కాబట్టే రాయలు ఖాండిక్య-కేశిధ్వజుల వృత్తాంతాన్ని యీ ఆశ్వాసంలో నిబంధించాడు.

ఆముక్తమాల్యదలో ఒక ప్రధానఘట్ట మీ తృతీయాశ్వాసంతో ముగిసింది. అసలు కథలోకి ప్రవేశించే ముందు ఒక మెట్టెక్కామన్న మాట! చతుర్థాశ్వాసంలో మళ్ళీ యిలాంటి కథే యింకొకటి యింకొక కోణంలో చూడబోతున్నాం. ఆ మెట్టుకూడా ఎక్కితే అప్పుడు అసలు కథలోకి ప్రవేశిస్తాం. "అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని ఊరికే అన్నారా మరి! :-)
Related Posts Plugin for WordPress, Blogger...