తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, August 1, 2010

బాతులు, తోటలు, పళ్ళు

రాయలు విల్లిపుత్తూరులోని పశుపక్షాదులు, పళ్ళు పూల తోటలను కూడా అత్యంత రమణీయంగా వర్ణించాడు. కవియైనవాడికి తాను చూచినా ప్రతీ వస్తువు అందంగానే కనిపిస్తుంది. తన రచనతో ఆ అందాన్ని మరింతగా ఇనుమడింప చేస్తాడు.

మ. తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర

స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్


( ఈ పద్యం చదువరి స్వరంలో )

విల్లిపుత్తూరులో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలు ఉన్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణముచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అది చూసిన భటులు /కాపరులు ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ధోవతులను పిండి అక్కడే మరచిపోయినట్టున్నారు. వాటిని తీసికెళ్లి వారి ఇంటిలో అప్పగిద్దామని నీటిలోకి దిగారంట. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు ఎగిరిపోయాయి. ఆ పక్కనే పొలాలను కాపలా కాసే యువతులు అది చూసి పక్కున నవ్విరంట. తెల్లని బాతులను చూసి బ్రాహ్మణుల పంచెలని భ్రమపడి భంగపడ్డారు ఆ భటులు.. ఈ పద్యం రాయడానికి మరో కారణం కూడా ఉందని అంటారు. కృష్ణదేవరాయలుకు చిన్నాజి అనే సానిపిల్లతో పరిచయం కలిగి అది ప్రగాఢానురాగంగా మారింది. అప్పటికి రాయలు పాతికేళ్ల చిన్నవాడు. తాను రాజ్యాధిపతినైతే చిన్నాజిని తప్పకుండా వివాహమాడతానని వాగ్ధానం చేసాడు. తండ్రిచాటు బిడ్డ కావడంతో రాత్రుళ్లు రహస్యంగా ఆమెను కలుసుకుంటూ ఉండేవాడు. కాని ఈ సంగతి మంత్రి తిమ్మరుసుకు తెలుసు. విజయనగరంలో రాత్రిళ్లు గస్తీలు తిరిగే ఆరెకులు ( రక్షకభటులు) వెయ్యికళ్లతో కాపలా కాసేవారు. వారి కంటపడకుండా తప్పించుకుందామని కృష్ణదేవరాయలు వరిమళ్లలో కాలువపక్క నక్కి కూర్చుంటే ఆరెకులు చూసి ఉంటారు. ఆతని తలగుడ్డ తెల్లగా, బాతురెక్కలా ఉందేమో. అందుకే బాతులను చూసి అరెకులు వస్త్రమని అరెకులు భ్రమించారని రాయలు ఉత్తరోత్తరా ఈ పద్యం చెప్పాడు.




. సొరిదిం బేర్చిన తీఁగమల్లియలు ఖర్జూరంబులు న్బుష్పమం
జరులు న్మామిడిగుత్తులు న్గుసుమము ల్సంపెంగలు న్భచ్చగ
న్నెరులుం బాళలు గల్గి రాజనపుఁ గాంతిం దారు ము ల్సూపి చే
లరుదార న్నగుఁ బూవుఁ దోఁటల బలాకానీకదంభంబునన్

( ఈ పద్యం చదువరి స్వరంలో )


విల్లిపుత్తూరులో పంటపొలాల అందాలు ఎలా ఉన్నాయంటే తెల్లకొంగల బారులు ఎగురుతుంటే పంటపొలాల నవ్వుల్లాగా ఉన్నాయి. అంటే పూలతోటలకంటే తామే గొప్ప అని పంటపొలాలు భావిస్తున్నాయి. వరుసగా ఉన్న తీగమల్లి, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమాలు,, సంపెంగలు, పచ్చగన్నేరులు, పాళలు.. ఇవన్నీ పూలలోని రకాలు. కాని ఇదే పేరున్న రకాలు వరిధాన్యాలలో కూడా ఉన్నాయి. కాని అదనంగా రాజనాలు అనే రకం వరిధాన్యంలో ఉండి పంటపొలాలను పూలకంటే గొప్పవిగా చేస్తుంది. ఈ రాజనం ధాన్యం చివరలో ముల్లులా ఉండి త్రాసుముల్లులా పంటపొలాలవైపే మొగ్గు చూపుతుంది. ఈ ధీమాతోనే పంటపొలాలు, పూలతోటలను పరిహసిస్తున్నాయని రాయలు ఒక అద్భుత చిత్రాన్ని రచించాడు. ఇక్కడ మరొక విశేషం వరిపొలాలలో కంకులకి ముళ్ళుంటాయి కాబట్టి, త్రాసు ముల్లు వాటి వైపు మొగ్గిందనడానికి అదొక తార్కాణం! రకరకాలు పూలతోటలు, వాటి పక్కనే వరికంకులతో నిండి ఉన్న పంటపొలాలు. పైన ఎగురుతున్న బారులు తీర్చి ఎగురుతున్న కొంగలను చూస్తుంటే తామే గొప్ప అని పంటపొలాలు నవ్వుతున్నట్టుగా అందంగా కనిపిస్తున్నాయి.

. అడుగునఁ బండి వ్రీలి యసలై మధువుట్టఁగఁ, ద్రావఁ దేంట్లు మ
ల్లడి గొని చుట్టు రాఁ బనసల న్బొలుచు న్గలుగుండ్రతోడ నీ
డ్వుడు పెనుఁబండ్లు, భిన్నకట పాంసుల భూరి మదాంబు సేచనా
జడదృఢశృంఖలాయుత వసంతనృప ద్విరదాధిపాకృతిన్.



( ఈ పద్యం చదువరి స్వరంలో )

ఆ విల్లుపుత్తూరులో వేరు పనస పండ్లు చాలా పెద్దవి కావడం చేత భూమిని తాకుతూ, భూమిలోనే పండి పోయేవి. అంతే కాదు, పగిలి పోయేవి కూడ. అలా పగిలి పోయిన ఆ పండ్ల రసం బురద లాగా పైకి వచ్చింది. ఆ వాసనకు తుమ్మెదలు చుట్టు ముట్టాయి. ఈ దృశ్యం ఎలా ఉందంటే, ఆ పండ్లు మదపుటేనుగుల్లా ఉన్నాయి. ఆ ఫల రసం - మదించిన ఏనుగుల కుభస్థలం నుండి ధారాపాతంగా కారుతూ ఉండే మదజల ధారలాగా ఉంది. నల్లని తుమ్మెదల గుంపు ఆ మద గజాన్ని బంధించిన యినుప సంకెలవలె ఉంది. (ఇక్కడ చెపుతున్న ఏనుగులు వసంతుడనే రాజుయొక్క పట్టపుటేనుగులు. పండిన పనసపండ్లు వసంత రాజు పట్టపుటేనుగుల్లా ఉన్నాయి. పనసలు వసంతకాలంలోనే పండుతాయి కాబోలు!)


. చాల దళంబుగాఁ బృథుల చంపక కీలనఁ బొల్చు బొందుఁ దో
మాలె లనంగఁ బండి మహిమండలిఁ జీఱుచు వ్రాలి గంధ మూ
ర్చాలస యైన భృంగతతి నాఁ దుదక ప్పమర స్ఫలావళు
ల్వ్రీలి గెల ల్సుగంధికదళీ వన పంక్తుల నొప్పు నప్పురిన్

( ఈ పద్యం చదువరి స్వరంలో )

విలుఫుత్తూరు పట్టణంలో విరగ పండిన అరటి తోటలని కవి ఇలావర్ణిస్తున్నాడు. ఆ పట్టణంలో అరటి తోటలలో పండే పళ్ళకు సుగంధులు అని పేరు. అవి బాగా పండాయి. నేలకు జీరాడుతున్నాయి. వాటి కొనలు నల్లగా ఉన్నాయి. అందు వల్ల విరగపండిన ఆ అరటి పండ్ల గెలలు సంపెంగ పూల మాల లాగా ఉన్నాయి. ఆ పళ్ళు వికసించిన సంపెంగ పూల లాగా ఉన్నాయి. నల్లగా ఉన్న ఆ పండ్ల చివరలు సంపెంగ పూల మీ వ్రాలి, మత్తిలి మూర్ఛపోయిన తుమ్మెదలలాగా ఉన్నాయి. (తోమాలెలు - ఆకులు పువ్వులతో కలిపికట్టిన దండలు. ఇవి ముఖ్యంగా వైష్ణవులు స్వామికి వేసే దండలు. అంచేత ఆ అరటి తోటలు ఆ విలుబుత్తూరు స్వామికి వేసిన సంపెంగ మాలల్లాగా ఉన్నాయి అని అనుకోవచ్చు.)

1 comments:

keshav said...

జ్యోతి గారూ వండర్ఫుల్ అండీ... ఈబ్లాగు... రాయల పద్యాలు ఆడియో రూపంలో పెట్టినందుకు ధన్యవాదాలు.. మాలాంటి వారికి చాలా ఉపయోగం. -కేశవ్

Related Posts Plugin for WordPress, Blogger...