తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, June 25, 2019

వసంతకాల వర్ణన

ఉ.నైపుణి జందనాద్రి గహనద్రుమ సౌరభ వీచి దామ్రప
ర్ణీ పరిలబ్ధ మౌక్తిక మణి ప్రకరంబులు దోచి దక్షిణా
శాప వనుండు సల్లు వెద జల్ల జనించెన కాక వీనికే
లా పొడమంగ నప్పొలప మప్పుడు నావని దోచె గ్రొన్ననల్ (5-114)

ఆ వసంత ఋతువులో సువాసన గల పూమొగ్గలు అంతటా ఆహ్లాద పరుస్తున్నాయి. చందన పర్వతం నుండి తామ్రపర్ణీ నది పుట్టింది. దక్షిణ వాయువూ పుట్టింది. దక్షిణ వాయువు తామ్రపర్ణీ నదిలోని ముత్యాలను చందన వాసనల ప్రవాహంలో నానబెట్టి అంతటా వెదజల్లిందట. కనుకనే మొగ్గలకు సువాసన వచ్చిందట. ఈ పద్యంలో వెదను చెప్పాడు. వెద రెండు రకాలు. చల్లు వెద. గొర్తి వెద. రైతులు భూమిని దున్ని విత్తనాలను చేతితో పొలంలో చల్లుతారు. ఇది చల్లు వెద. వెదజల్లడం. అలా కాకుండా గొర్తి అనే సాధనంతో విత్తనాలను భూమిలో పడేటట్టు వేస్తారు. చాళ్లలో లెక్క మీద పడి, మొలకెత్తుతాయి. అది గొర్తివెద. ఈ రోజుల్లో విత్తనశుద్ధికి అనేక ద్రావణాలలో నానబెట్టడం చూస్తున్నాం. పూర్వం కూడా అవసరం మేరకు ద్రావణాల్లో నానబెట్టడం ఉందని దీనిని బట్టి తెలుస్తోంది.

చ. తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్ఛట లుల్లసిల్లఁ గో
ల్కొను ధరణీజ సంతతికిఁ గోరకదంతము లించుకంత ని
క్కినయది యాదిగాఁగఁ జెలగెన్ వనలక్ష్మి గడుం జెలంగఁగాఁ 
జనుఁ బ్రియుఁడైన మాధవుని సంగతి మీఁదటఁ జాలఁ గల్గుటన్ (5-116)

వనలక్ష్మికి సంతోషం కలిగింది ఎందుకంటే తన కడుపున పుట్టిన వృక్షములనే సంతానానికి ఎర్రనెర్రని కాంతులు విరజిమ్ముతూ ఎదుగుతుంటే, వాటికి అప్పుడప్పుడే మొగ్గలు అనే పాలపండ్లు వస్తుంటే అప్పటినుండీ సంతోషం పెరిగిపోతున్నది ఎందుకంటారా ఇక ఆమెకు తన నాధుడైన మాధవునితో సంపర్కం కలుగబోతున్నది.కనుక ఆమెకు సంతోషం కలగడం సమంజసమే కదా! ఋతుపరంగా వసంతరుతువులో చెట్లూ చేమలూ చిగిర్చి, దిన దినాభివృద్ది చెందుతూ మొగ్గలు తొడిగి, ఫలించి పుష్పించి వసంతం పులకించి పోతున్నట్లుగా ఉంటుంది ప్రకృతి. ఆ తరువాత మాధవునితో, అంటే వైశాఖ మాసంతో కలయిక జరుగుతుంది, చిత్రం తరువాత వైశాఖం వస్తుంది. వసంతఋతువు వసంతలక్ష్మి అనే స్త్రీ గా మారింది. ఆమె సంతానం అయినటువంటి లతలకు, వృక్షాలకు తొడిగిన చివుళ్ళు పిల్లలకు వచ్చే పాలపండ్లు అయినాయి. ఇక్కడ రాయలవారు ఒక విశేషం చెప్తున్నాడు. స్త్రీపరంగా చూసినట్లైతే, స్త్రీ ప్రసవించి, ఆ శిశువు దినదినాభివృద్ది చెందడం ఒక సంతోష కారణం ఇంకా ఆ తరువాత పాలపండ్లురావడం యింకా సంతోషదాయకం అంటున్నాడు రసిక రాయలు. ఎందుకో తెలుసా! నెలలు ముదిరినదగ్గరినుండీ శిశువుకు పాలపండ్లు వచ్చేంతవరకూ దంపతులు మైథునంలో పాల్గొనకూడదు అని భారతీయ స్మృతిశాస్త్ర నిర్దేశం. యిక ఆ హద్దు చెరిగిపోయింది కనుక, విరహము తీరిపోతుంది. ఇక తరువాయి తన నాధుడు ఐన 'మాధవుని'తో కలయికకు తరుణం వచ్చింది అని వసంత'లక్ష్మి' అనే తల్లి, తరుణి   సంతోషపడుతున్నది అని చమత్కారంగా రాశారు రాయలవారు.

సీ.మును ననల్దమిఁ బట్టి ముంగాళ్ళ ముక్కుజో
డనలఁ బీలిచి పసర్కొనిన విడిచి
పరువంపువిరిగొందు లరసి చాలై త్రోవఁ
బెట్టి యీరము లీఁగు పిండుఁ దగిలి
క్రొవ్విరిఁ దొలుత నొక్కఁడు కని యది వ్రాలు
తరి దాని నిలబడఁ దాఁచి క్రోలి
యాకురాలుపుగండ్ల నానెడు నాస నిం
తడుగూది బం కంటి యంగలార్చి

తే.గీ.యెట్టకేలకు నొకఁ డబ్బఁ బొట్టనిండఁ
గ్రోలి యది గాలిఁ గదలినఁ గూలు నగుచు
బ్రమదవనపాలికలు వేడ్కఁ బట్ట నగుచు
మధుదినాది క్షుధాభ్రమన్మధుపచయము (5-117)

రాయలవారు ఎంత చమత్కారియో గమనించండి . గత ప్రబంధాలలో ఎందరో కవులు వసంతకాలంలోని  తరువులను, లతలను, పుష్పములను, స్త్రీపురుషుల విలాసాన్ని, కోకిల పాటలను వర్ణించార్రు. అలాగే  తుమ్మెదల ఝంకారాలను, మత్తగజఘీంకారాలను, మదవతుల మదనక్రీడాలంకారాలను, ప్రకృతిని స్త్రీపురుషులను గెలిచిన వసంతునిసేనల అహంకారాలను వర్ణించినవారు ఉన్నారు. కానీ, పనిగట్టుకుని కేవలం తుమ్మెదల దినచర్యను వర్ణించిన కవులు ఎవరూ లేరు. అది మన రాయలవారే! పైన పద్యం చూడండి రాయలవారు ఎంత రసరమ్యంగా చెప్పారో తెలుస్తుంది.

తుమ్మెదలు మొదట మొగ్గలను మోహంతో పట్టుకుని, ముంగాళ్ళతో అదిమిపట్టి, నాసికా రంధ్రాలతో తేనెను పీల్చి, అవి మొగ్గలు కనుక, కొద్దిగా పసరు, వగరు తగిలి వదిలిపెడుతాయి. అక్కడినుండి పక్వములైన పూలు ఉన్న గొందులు, సందులు వెతుక్కుంటూ గుంపులుగట్టి జోరున పొదలలో దూరి వెళ్తాయి. అక్కడ అదివరకే మధుపానం చేస్తున్న ఒక తుమ్మెదను చూస్తాయి. మధుపానాసక్తతతో, అంతకుముందు కొద్దిగా చేసిన మధుపానోత్సాహంతో ఆ తుమ్మెదను నిలబడకుండా తన్నివేసి, నేలమీద పడేసి, అక్కడినుండి తరిమేస్తాయి. ఆ  కొత్తగా పూర్తిగా విరిసిన పుష్పపు మధువును తాము త్రాగిపారేస్తాయి. యింకా ఆశ చావదు. ఆకలి తీరదు. తీగనుండి ఆకులు రాలిన చోట, పూలు రాలినచోట పడిన గండ్లు కనిపించి, అక్కడి తేనెను త్రాగుదామని వ్రాలి, ఆ ఆకులు, పూలు రాలినప్పుడు కొద్దిగా స్రవించే బంకగా ఉన్న పదార్ధ వాటి కాళ్ళకు అంటుకుని కాళ్ళు లాక్కోలేక, పీక్కోలేక తంటాలు పడుతాయి. సరే! ఎలాగోలా వదిలించుకుని బయటపడి, చివరికి యింకొక పుష్పం కంటబడి పొట్టనిండా దాని తేనెను త్రాగుతాయి. యిక వాటి పరిస్థితి ఏమిటి? వాటి శరీరాలు అదుపులో  లేనంత మత్తు వచ్చేస్తుంది. గాలికి  పూవు,  తీగె కొంచెం అటూ ఇటూ కదిలినా సరే మత్తుగా నేలమీదకు పడిపోతాయి, ఆ తోటలకు కావలిగా ఉండే తరుణులకు అవి తేలిగ్గా దొరికిపోతాయి. తుమ్మెదలను సరదాగా, ఆటకు పట్టుకునే పడతులకు చిక్కిపోతాయి. ఈ రకంగా వసంతఋతువు తొలి దినాన, ఆ రోజు మొదలుకొని 'తాగుబోతులైన' తుమ్మెదలు తిరుగుతుంటాయి. అప్పటి ఆ తుమ్మెదలే కాదు, యిప్పటి తుమ్మెదలూ మధుపానం కోసం యిలాగే తిరుగుతుంటాయి, రాయలవారు ఎంత్గ గమ్మత్తుగా గమనించి వ్రాశాడా అనిపిస్తుంది ఈ పద్యం.

0 comments:

Related Posts Plugin for WordPress, Blogger...