తే. ప్రభువు లరిగిరి క్రమ్మఱఁ బాండ్యనగరి,
కమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ
దన చిరంతన తులసికాదామకరణ
దాస్యమును జేసికొంచుఁ దత్పరత నుండె.
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో )
మత్స్యద్వజుడు పంపిన మంత్రి, సామంతులు మొదలైనవారు రాత్రంతా విష్ణుచిత్తుని ఆతిథ్యం స్వీకరించి మరునాడు సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత విష్ణుచిత్తుడు యథావిధిగా భగవదారాధనలో మునిగిపోయాడు. మన్నారుస్వామికి ప్రీతికరమైన తులసీమాలల అలంకరణ సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడితో విష్ణుచిత్తుని జైత్రయాత్ర కథ ముగిసింది. విష్ణుచిత్తుడు తిరిగి తన భగవదర్చనలో తులసీమాలల కట్టుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. ఇది ఒక ఉదాత్తమైన ముగింపు.
ఇప్పుడొక కొత్త కథ మొదలవుతోంది. ఇది యామునాచార్యుని కథ. శ్రీవైష్ణవమతంలో ఆచార్యుల పరంపర ఉంది. అందులో యామునాచార్యుడు ఒక ప్రధానాచార్యుడు. ఇతను
రామానుజాచార్యుని కన్నా ముందువాడు, క్రీ.శ. 10వ శతాబ్దానికి చెందినవాడు. ఈ కథ చెప్పబోతున్నది విష్ణుమూర్తి. చెపుతున్నది లక్ష్మీదేవితో. ఒకనాడు మధ్యాహ్న వేళ విష్ణుచిత్తుడు స్వామికి పుష్పమాలికను సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతన్ని అదృశ్యంగా గమనిస్తున్న విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవితో యిలా అంటున్నాడు:
తే. 'యామునాచార్యుఁ డొక్కఁడు నీమహాత్ముఁ
డొక్కఁడును గాదె దర్శనం బుద్ధరించి
రస్మదీయకృపాతిశయమున' ననిన
నిందిరాదేవి తన భర్త కిట్టు లనియె.
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)
విష్ణుమూర్తి యిలా అనేసరికి అమ్మవారు ఆసక్తిగా, ఎవరా యామునాచార్యుడు, ఏమా కథా అని అడిగింది. విష్ణుమూర్తి తన భార్యకు యామునాచార్యుని కథ చెప్పడం మొదలుపెట్టాడు.
తే. అతఁడు చిఱుతనాఁడె యాచార్యకులమున
వేదశాస్త్రముఖ్య విద్య లభ్య
సించుచుండ, నపుడు చెలువ, యిప్పటి పాండ్య
నృపతి పూర్వవంశ్యుడే యొకండు.
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం మాయామాళవగౌళ )
ఈ యమునాచార్యుడు చిన్నవయసునుండే గురుకులంలో ఉండి వేదశాస్త్రాలను అభ్యసించాడు. ఆ కాలంలో ఇప్పటి పాండ్య రాజు పూర్వ వంశస్థుడైనవాడే రాజుగా ఉండేవాడు. ఇక్కడ తెలుస్తుంది, యామునాచార్యుడే విష్ణుమూర్తికి ఎందుకు గుర్తుకువచ్చాడో. యామునాచార్యుని కాలంలో, అతనుండే దేశాన్ని కూడా పాండ్య వంశానికి చెందిన రాజే పరిపాలన చేస్తూండేవాడు. అయితే ఈ రాజుకీ ఆ రాజుకీ తేడా ఉంది. యామునాచార్యుని కాలంలోని రాజు,
తే. వెఱ్ఱిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు
నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,
హరుఁడె పరతత్వ మను, మదీయాలయముల
నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్లె.
ఆ రాజు శైవమత పక్షపాతి. ఆ వెఱ్ఱి ముదరడం వల్ల ఆ రాజు విష్ణు కీర్తిని, స్తుతిని సహించలేకపోయేవాడు. అంతేగాక తన రాజ్యంలోని వారెవరూ విష్ణువిగ్రహారాధన కూడా చేయరాదని కట్టడి చేసాడు. వైష్ణవాలయాలలో జరిగే ఉత్సవాలు చూసి అసహ్యించుకుంటూ శివుడే పరబ్రహ్మమని అంటూ తన స్నేహితులతో అదే విధంగా ఉండేవాడు. ఇక్కడ "వెఱ్ఱిశైవంబు" అంటే రెండు రకాల అర్థాలు తీసుకోవచ్చు. అసలు శైవమే వెఱ్ఱిదని ఒక అర్థం. వెఱ్ఱిగా మారిన శైవమని మరొక అర్థం. శైవులలో కూడా వీరశైవులు వేరేగా ఉన్నారు. ఇక్కడ ఆ వీరశైవాన్నే వెఱ్ఱిశైవంగా పేర్కొన్నాడని మనం భావించాలి. ఎందుకంటే, మతం ఎప్పుడైనా పరమత సహనం కలిగినంత కాలం బాగానే ఉంటుంది. అది కోల్పోయినప్పుడే అది వెఱ్ఱిగా మారుతుంది. రాయలవారు ఎంతటి శ్రీవైష్ణవ మతావలంబి అయినా, శైవుల పట్లగాని, ఇతర మతాలవారి పట్లగాని అనాదరం చూపించలేదు, మనకు తెలిసినంతలో. శ్రీవైష్ణవులలోనే కొందరు వీరవైష్ణవులు ఆ పని చేసారు. వారిది కూడా వెఱ్ఱే అవుతుంది.
రాయలవారిక్కడ ఆ వెఱ్ఱి శైవం ఎలా ఉందో వర్ణిస్తారు. అది వేదాలను నమ్మదు. వేదపండితులను గౌరవించకుండా కేవలం జంగములనే పూజిస్తారు. ఇంటి ఇలవేల్పులను పట్టించుకోరు. కేవలం వీరభద్రుడినే కొలుస్తారు. ప్రాచీనాలయాలు శిథిలమైపోతున్నా, వాటి గురించి పట్టించుకోక కేవలం జంగములకు మఠాలను మాత్రమే స్థాపిస్తున్నాడు రాజు. మతం రాజకీయంలోకి, రాజ్యపాలనలోకి ప్రవేశిస్తే ఏర్పడే అవస్థ యిక్కడ వర్ణిస్తున్నాడు రాయలు. రాజు శైవమతావలంబి కావచ్చు. అంత మాత్రాన ఇతర దేవాలయాలను పట్టించుకోక పోవడం రాజుగా అతని బాధ్యతారాహిత్యమే అవుతుంది. పైగా ఈ వైపరీత్యం ఎంత దాకా వెళ్ళిందంటే:
క. శివలింగముఁ దాల్చిన జన
నివహం బేమైనఁ జేయనిది పాపము దా
నవుఁ గా దనఁ; డా సమయము
నవు నను విప్రులక యగ్రహారము లిచ్చున్.
( ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో )
ఈ రాజు శివలింగాన్ని ధరించినవారు ఎటువంటి దుష్కార్యాలు చేసినా వారిని మందలించక, శిక్షించకుండా కనీసం అది తప్పు, పాపం అని కూడా చెప్పేవాడు కాదు. శైవాచారమే గొప్ప అని రాజుకు తలూపే బ్రాహ్మణులకు అగ్రహారాలు మొదలైన ధనసంపద దానం చేసేవాడు.
అసలు శైవమతాన్ని అవలంబించని వారికి దేశబహిష్కరణ శిక్ష విధించేవాడట. దానితో, తమ పుట్టినూరు విడిచి వెళ్ళలేక బ్రాహ్మణులు కొందరు శైవ వేషం వేసుకొని తిరిగేవారు.
క. శీలముఁ బట్టియు గంజా
హాల లుపాంశున భుజించు నధముల బైటం
జాలఁడు వైవన్, విప్ర
స్ఖాలిత్యము బైలుసేసి కనుగిఱపు సభన్
1 comments:
మీ యొక్క ప్రయత్నం అద్భుతం....మన సంస్కృతిని కాపాడడానికి మీరు తీసుకున్న నిర్ణయం అభిననందనీయం ...
భల్లం లీల శ్రీ సీత రామాంజనేయ కృష్ణ వెంకటేశ్వర త్రినాధ వర్మ
Post a Comment