తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, January 22, 2012

తృతీయాశ్వాసం - సింహావలోకనం


ఆముక్తమాల్యద మూడాశ్వాసాలు పూర్తిచేసుకున్నాం. మొదటి రెండు ఆశ్వాసాలలో ఎక్కువ భాగం వర్ణనలు, ప్రధాన పాత్రల పరిచయాలు జరిగాయి. రెండవ ఆశ్వాసం చివరలో కథలోకి ప్రవేశించాం. ఒక పండితుని శ్లోకం విన్న పాండ్యరాజుకి వైరాగ్యభావం అంకురిస్తుంది. పండితులందరినీ సమావేశపరచి పరమాత్మ తత్త్వాన్ని గురించిన శాస్త్రచర్చ మొదలుపెడతాడు. ఎవరి వాదాలు వారు వినిపిస్తూ చర్చించుకుంటూ ఉంటారు. విష్ణుచిత్తునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, పాండ్యరాజు సభకి వెళ్ళి అక్కడ శ్రీవైష్ణవాన్ని స్థాపించమని పురమాయిస్తాడు. విష్ణుచిత్తుడు పాండ్యరాజ సభలో చేసిన వాదము, విశిష్టాద్వైత మతస్థాపనం తృతీయాశ్వాసం. అందులో భాగంగానే ఖాండిక్య కేశిధ్వజుల కథ వచ్చింది. ఇదీ, స్థూలంగా యిప్పటి వరకూ జరిగిన కథ.

ఈ మూడవ ఆశ్వాసం బాగా అర్థం కావాలంటే, భారతీయ తత్త్వచింతన గురించి కొద్దిపాటి పరిచయం అవసరం. భారతీయ తత్త్వచింతనకి మూలాలు వేదాలలోనే కనిపిస్తాయి. వేదాలు నాలుగన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, ఋగ్యజుస్సామాధర్వణ వేదాలు. వేదానికి నాలుగు విభాగాలున్నాయి - సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ప్రాచీన జీవనవిధానంలో నాలుగు ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాలు. వేదంలో ఒకో విభాగమూ ఒకో ఆశ్రమానికి ఉపయోగపడేదని భావించవచ్చు. సంహిత మంత్ర సముదాయం. బ్రహ్మచారులకు పఠన ప్రధానమైన కర్మ. కాబట్టి వారికి ప్రధానం సంహిత, అందులోని వేదమంత్రాల పఠనం. సంహితలోని మంత్రాలను వివరించేవి బ్రాహ్మణాలు. ఇవి మంత్రార్థాలను వివరిస్తూ యజ్ఞయాగాదులను ఎలా నిర్వహించాలో విశదపరుస్తాయి. వీటిని ఆసక్తికరంగా వివరించడానికి కథలు ఉపాఖ్యానాలు కూడా వీటిలో ఉంటాయి. యజ్ఞయాగాదులను చేసే అధికారం గృహస్థాశ్రమవాసులకే ఉంది. కాబట్టి బ్రాహ్మణాలు వారికి ఉపయోగపడేవి. ఆరణ్యకాలు వానప్రస్థ ఆశ్రమవాసులకి ఉపయోగపడేవి. ఆరణ్యకమంటే అరణ్య సంబంధమైనది. అంటే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవులలో నివసించేవారు ఆలోచించవలసిన విషయాలు ఆరణ్యకాలలో ఉంటాయి. యజ్ఞయాగాదుల గురించిన తాత్త్విక విశ్లేషణ వీటిలో కనిపిస్తుంది. బ్రాహ్మణాలలో కర్మ ప్రధానమయితే, ఆరణ్యకాలలో ఉపాసన ప్రధానం. చివరిదైన ఉపనిషత్తు జ్ఞాన ప్రధానం. వేదాలలోని తత్త్వ చింతనాసారం మనకి ఉపనిషత్తులలో కనిపిస్తుంది. సన్న్యాసాశ్రమవాసులకు జ్ఞానచింతన ఒక్కటే ప్రధానం కాబట్టి వారికి ఎక్కువగా ఉపయోగపడేవి ఉపనిషత్తులు. వేదాలని సరిగా చదవడానికీ, అందులో చెప్పిన యజ్ఞయాగాది కర్మలను సరిగ్గా ఆచరించడానికీ, వేదాలలోని తత్త్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోడానికీ వేదాంగాలు ఏర్పడ్డాయి. అవి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము.

తత్త్వచింతన మూలాలు వేదాలలో (ముఖ్యంగా ఉపనిషత్తులలో) కనిపించినా, అది విస్తృతి చెంది గొప్ప సైద్ధాంతిక రూపాన్ని పొందినది మాత్రం షడ్దర్శనాలలో. మూడు జంటలుగా ఉన్న ఆరు దర్శనాలు. ఇవి సాంఖ్యము-యోగము, న్యాయము-వైశేషికము, మీమాంస-వేదాంతము. ప్రతి దర్శనాన్ని గురించి వివరించడం యిక్కడ సాధ్యమయ్యే పని కాదు. దీని గురించి తెలుగులో సులువుగా అర్థమయ్యేట్టు నండూరి రామమోహనరావుగారు తన "విశ్వదర్శనం - భారతీయ చింతన" పుస్తకంలో వివరించారు. ఆసక్తి ఉన్నవారు వీటిని పరిచయం చేసుకోడానికి ఆ పుస్తకం చదవవచ్చు. అయితే యీ దర్శనాల గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు మాత్రం యిప్పుడు ప్రస్తావిస్తాను. మొదటగా, యీ దర్శనాలు ఆరూ కూడా వేదాలను ఆధారంగా చేసుకొని నిర్మించబడ్డవే! కాని వాటి సిద్ధాంతాల మధ్య మౌలికంగా ఎన్నెన్నో తేడాలు. ఇవి ముఖ్యంగా వాటి దృక్పథాల మధ్య భేదం వల్ల ఏర్పడ్డాయి. కొన్ని బ్రాహ్మణాలలోని కర్మకి ప్రాధాన్యమిస్తే, కొన్ని ఉపనిస్థత్తులలోని జ్ఞానాకి ప్రాధాన్యమిచ్చాయి. దర్శనాలనగానే యివేవో దేవుడు, ఆత్మ లాంటి అంతుబట్టని విషయాల గురించి మాత్రమే విచారిస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వీటి ముఖ్యోద్దేశం సత్యాన్వేషణ. ఆ అన్వేషణ, కనిపించే యీ సృష్టినుండే మొదలవుతుంది. ఒక శాస్త్రీయ పద్ధతిలో సాగుతుంది. దీనికి మనిషే కేంద్రం. పదార్థ తత్త్వం, వాటి గుణాలు, సంబంధాలు (దీనినే ఇంగ్లీషులో Ontology అంటారు) మొదలుకొని, అసలు జ్ఞానమంటే ఏమిటి, జ్ఞానాన్ని ఎలా సముపార్జిస్తాము, దానికవసరమయ్యే సాధనాలేమిటి (దీనినే ఇంగ్లీషులో Epistemology అంటారు), తర్కశాస్త్రం (Logic) మొదలైన ఎన్నో తత్త్వశాస్త్ర సంబంధమైన అంశాలకు పటిష్ఠమైన రూపకల్పన మనకీ దర్శనాలలో దర్శనమిస్తుంది. వీటి ఆధారంగానే జీవ తత్త్వాన్నీ, సృష్టి విధానాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఉదాహరణకి, హేతుబద్ధమైన తర్కవాదంలో ఉండే అవయవాలేమిటో న్యాయ దర్శనం చాలా స్పష్టంగా చెపుతుంది. అవి ప్రతిజ్ఞ (Statement), హేతువు (Reason), ఉదాహరణ (example), ఉపనయం (analogy), నిగమనం (conclusion). తర్కాన్ని గురించి ఎంత పకడ్బందీ ఆలోచనో చూసారా! ఇదే కాదు అసలు తర్కమంటే ఏమిటి, వాదం అంటే ఏమిటి, వాదాలలో ఎన్ని రకాలున్నాయి మొదలైనవాటిని చాలా స్పష్టంగా సూత్రీకరిస్తుంది న్యాయ దర్శనం. విష్ణుచిత్తుడు పాండ్యరాజు సభలో చేసిన వాదనాపద్ధతికి మూలం మనకీ న్యాయదర్శనంలోనే కనిపిస్తుంది. సందర్భం వచ్చింది కాబట్టి, చిన్న గమ్మత్తైన విషయం. మనం "చలోక్తి" అంటూ ఉంటాం కదా. చమత్కారమైన మాట అన్న ఉద్దేశంలో వాడుతాం. ఇదెలా వచ్చిందో తెలుసా? "ఛలము" అన్నది న్యాయదర్శనంలో చెప్పిన ఒక రకమైన వాదం. వాది ఒక అర్థంలో ఒక మాటని ఉపయోగిస్తే, ఆ మాటకి ఉన్న మరొక అర్థాన్ని తీసి వాదిని హేళన చేసి ఖండించడాన్ని "ఛలము" అంటారు!

షడ్దర్శనాలలో మీమాంస-వేదాంత ద్వయాన్నే పూర్వమీమాంస-ఉత్తరమీమాంస అనికూడా అంటారు. పూర్వమీమాంస మంత్ర-బ్రాహ్మణాలు ప్రధానంగా కర్మ గురించి ఎక్కువ విచారిస్తుంది. ఉత్తరమీమాంస లేదా వేదాంతదర్శనం ఉపనిషత్తుల ఆధారంగా జ్ఞానవిచారం చేస్తుంది. ప్రతి దర్శనమూ కొన్ని సూత్రాలలో నిబద్ధింపబడింది. వేదాంతదర్శనం "అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్న సూత్రంతో మొదలవుతుంది. అంటే - ఇప్పుడు బ్రహ్మమును గురించిన జిజ్ఞాస మొదలవుతుంది - అని. వేదాంతదర్శన సూత్రాలకే "బ్రహ్మసూత్రాలు" అని పేరు. వీటిలో ప్రధానంగా బ్రహ్మ, జీవుడు, జగత్తు మొదలైన విషయాల గురించి మీమాంస జరుగుతుంది. తమాషా ఏమిటంటే, సూత్రాలేవైనా, చెప్పే విషయాన్ని చాలా సూక్ష్మంగా చెపుతాయి. అందుచేత అవి అర్థం కావాలంటే వాటికి వివరణ అవసరమవుతుంది. సూత్రాలకు చెప్పే వివరణనే భాష్యమంటారు. సూత్రాలు చాలా సంక్షిప్తంగా ఉంటాయి కాబట్టి వాటికి రకరకాల అన్వయాలు, వివరణలు ఉండే ఆస్కారముంటుంది. దానివల్ల ఒకే సూత్రసమామ్నాయానికి అనేక భాష్యాలు ఏర్పడే అవకాశముంది. బ్రహ్మసూత్రాల విషయంలో సరిగ్గా అదే జరిగింది! ఆదిశంకరులు బ్రహ్మసూత్రాలకు మొట్టమొదట భాష్యం వ్రాసారు. తాను ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంత పరంగా ఉంటుందీ భాష్యం. దీని పేరు శారీరకభాష్యం. అలాగే ఆ తర్వాతి కాలంలో వచ్చిన రామానుజాచార్యులు తాము ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా శ్రీభాష్యం వ్రాసారు. ఇలా మధ్వ, నింబక, వల్లభ, భాస్కర మొదలైన ఎందరో ఆచార్యులు వారివారి సిద్ధాంతాలకు అనుగుణంగా బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసారు.

భారతీయ తత్త్వ చింతన గురించి చెప్పుకొనేటప్పుడు చార్వాక, బౌద్ధ, జైన దర్శనాల గురించి చెప్పుకోకపోతే అది సంపూర్ణం కాదు. వీటిని "నాస్తిక" దర్శనాలు అంటారు. ఇక్కడ "నాస్తిక" అనే పదానికి ఇప్పుడున్న "దేవుడు లేడనడం" అనే అర్థం కాదు. నాస్తికత్వం అంటే వేదాలను, వేద ప్రమాణాన్ని అంగీకరించకపోవడం. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే సాంఖ్యం మొదలైన కొన్ని దర్శనాలు కూడా సృష్టిస్థితిలయకారకుడైన "ఈశ్వరుడిని" అంగీకరించవు! ఈ తేడా గమనించడం ముఖ్యం. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలు కూడా ఎన్నో ప్రాచీనకాలంలో మనకుండేవి. అందులో బాగా ప్రసిద్ధి పొందినవి పైన చెప్పిన మూడు. ఈ సిద్ధాంతాలలో మళ్ళీ చాలా విభేదాలున్నాయి.

విష్ణుచిత్తుడు పాండ్యరాజు కొలువులో చేసిన వాదనకి ఆధారం రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలకు వ్రాసిన భాష్యం. దాని ఆధారంగానే విష్ణుచిత్తుడు సాంఖ్యము మొదలైన ఆస్తిక దర్శనాలను, చార్వాకము బౌద్ధము మొదలైన నాస్తిక దర్శనాలను, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తాడు.

ఇక యీ ఆశ్వాసంలో రెండో భాగానికి వస్తే, అది ఖాండిక్య-కేశిధ్వజుల కథ. రాయలువారీ కథని ఎందుకు చెప్పారు? విష్ణుస్వరూపం గురించిన జ్ఞానబోధ, విష్ణుచిత్తుడు పాండ్యరాజుకు నేరుగా చెయ్యకుండా కథ ద్వారా ఎందుకు చెప్పాడు? మొదలైన ప్రశ్నలు వేసుకోవాలి. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి, విష్ణుచిత్తుడు ఆచార్యుడు కాదు. కేవలం భక్తుడు. అటు పిమ్మట, విష్ణువు ఆజ్ఞచే ఆ సభలో వాదం చెయ్యడానికి వచ్చినవాడు. అంతే. అందువల్ల అతడు నేరుగా పాండ్యరాజుకి వైష్ణవమతాన్ని బోధించే స్థితిలో లేడు. కాబట్టి అలా కథ ద్వారా చెప్పడమే ఉచితం. ఇక రెండవ కారణం తెలుసుకోవాలంటే భారతీయ వాఙ్మయంలో మరొక కోణాన్ని చూడాలి. వేదాలు, దర్శనాలు, వాటి భాష్యాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ ఒక కోవకు చెందినవి. ఇవి ప్రధానంగా బౌద్ధికమైనవి. అంటే కాస్త గట్టిబుఱ్ఱ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలవి. సామాన్యులు వీటిని వంటపట్టించుకోవడం చాలా కష్టం. వారికోసం వెలసినవే పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు మొదలైనవి. భారతీయ తత్త్వ సారాన్ని యివి కథల రూపంలో మనకందిస్తాయి. అందుకే అవి సామాన్యజనులకు కూడా ఆసక్తికరంగా ఉండి సులువుగా వారి హృదయాలకు హత్తుకుంటాయి. ఇక్కడ విష్ణుచిత్తుడు ఉపయోగించిన ప్రణాళిక యిదే. పండితులతో అయితే శాస్త్రపద్ధతిలో బ్రహ్మసూత్రాల ఆధారంగా చర్చ జరిపి వారి వాదాలను ఖండించాడు. కాని రాజుగారు తనకి మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించమన్నప్పుడు, దానికోసం కథని ఆశ్రయించాడు. ఇది విష్ణుచిత్తునికి (రాయలవారికి) భారతీయ వాఙ్మయం గురించిన పరిపూర్ణ జ్ఞానానికి నిదర్శనం. కథల ద్వారా అనేక విషయాలను చెప్పవచ్చు. ఉదాహరణకి ఖాండిక్య-కేశిధ్వజుల కథలో మనకి తెలిసేది విష్ణుతత్త్వాన్ని గురించి మాత్రమే కాదు. రాజనీతి, ధర్మాధర్మాలు, కర్మ-జ్ఞాన మార్గాల మధ్యనున్న భేదము, యిలా అనేక విషయాలు మనకీ కథలో అంతర్లీనంగా గోచరిస్తాయి. వీటన్నిటినీ ఆసక్తికలిగే సంవిధానంతో పాఠకులముందు (శ్రోతలముందు) ఉంచినప్పుడు అవి వారి మనసుకి బాగా హత్తుకొనే అవకాశం కలుగుతుంది. కథవల్ల ఉపయోగమిది. ఆ ఒడుపు తెలిసినవాడు కాబట్టే రాయలు ఖాండిక్య-కేశిధ్వజుల వృత్తాంతాన్ని యీ ఆశ్వాసంలో నిబంధించాడు.

ఆముక్తమాల్యదలో ఒక ప్రధానఘట్ట మీ తృతీయాశ్వాసంతో ముగిసింది. అసలు కథలోకి ప్రవేశించే ముందు ఒక మెట్టెక్కామన్న మాట! చతుర్థాశ్వాసంలో మళ్ళీ యిలాంటి కథే యింకొకటి యింకొక కోణంలో చూడబోతున్నాం. ఆ మెట్టుకూడా ఎక్కితే అప్పుడు అసలు కథలోకి ప్రవేశిస్తాం. "అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ" అని ఊరికే అన్నారా మరి! :-)

2 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఎంతో సీరియస్ గా చదువుతున్నవాడిని చివరి కొచ్చేటప్పటికి ఫక్కున నవ్వేశాను..... అహా

Sanath Sripathi said...

చాలా సమగ్రంగా ఉంది మీ సమ్మరైజేషన్

Related Posts Plugin for WordPress, Blogger...