తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Sunday, June 9, 2013

తిరిగి యామునాచార్యుని కథలోకి...

గత రెండు టపాలలో రాయలవారి వర్షశరదృతు వర్ణనావైభవాన్ని కాస్తంత రుచిచూసాం. ఇహ యిప్పుడు మళ్ళీ అసలు కథలోకి ప్రవేశిద్దాం. ఈ వర్షర్తు వర్ణన అసలు ఏ సందర్భంలో వచ్చింది? యామునాచర్య కథలో వచ్చింది. ఆముక్తమాల్యదలో యామునాచార్యుని కథ ఎందుకు వచ్చింది? విష్ణుచిత్తుడు ఎలా అయితే పాండ్యరాజు కొలువుకి వెళ్ళి అక్కడ విశిష్టాద్వైతాన్ని స్థాపించాడో సరిగ్గా అలాగే యామునాచార్యుడు కూడా తన కాలంలో పాండ్యరాజు సభకి వెళ్ళి, అక్కడి పండితులని వాదంలో ఓడించి, విశిష్టాద్వైత మతాన్ని స్థాపిస్తాడు. ఈ కథ స్వయంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెపుతున్నాడు. యామునాచార్యుని గెలుపుకి పాండ్యరాజు పరమానందం చెంది, తన చెల్లిలినిచ్చి అతనికి పెళ్ళి చేస్తాడు. అర్ధరాజ్యాన్నిచ్చి రాజును కూడా చేస్తాడు. అలా ఆ ఆచార్యుడు పాలకుడవుతాడు! శత్రురాజులపై దండయాత్రలు చేసి, వారిని జయించి, రాజ్యాన్ని సురక్షితంగా ఉంచడం రాజధర్మం. అంచేత జైత్రయాత్రలకి బయలుదేరడానికి సిద్ధపడతాడు. కాని వచ్చేది వానాకాలం కాబట్టి, ఆ కాలం దండయాత్రలకి అనువైనది కాదు కాబట్టి, కొంత వేచి ఉండమని మంత్రులు సలహా యిస్తారు. అలా వచ్చిన వానాకాలాన్ని అద్భుతమైన పద్యాలలో వర్ణించారు రాయలవారు. ఆ తర్వాత వచ్చిన శరదృతు వర్ణన కూడా కిందటి టపాలో చూసాం కదా. శరత్తు జైత్రయాత్రలకి మంచి అనువైన కాలం. ఎందుకంటే, అటు తీవ్రమైన ఎండలు కాని, యిటు జడివానలు కాని యీ కాలంలో బాధించవు. చలికూడా అంత తీవ్రంగా ఉండదు. నదీనదాల ప్రవాహ ఉద్ధృతి తగ్గుతుంది. దీర్ఘ ప్రయాణాలు చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రకృతి. అంచేత జైత్రయాత్రలకి అది సరైన సమయం. రామాయణంలో కూడా శరదాగమంతోనే సీతాన్వేషణ మొదలుపెడతుంది వానరసేన. యామునాచార్యుడు కూడా శరత్కాలం ప్రవేశించడంతో దండయాత్ర చేసి శత్రురాజులని జయిస్తాడు.

జన్నములు చేసి, దానము
లన్నానాదేశ విప్రులం దనుపుచుం, సం
పన్నత ననిశము బహుభో
గోన్నతుడై యాదమఱచి యుండె నశంకన్

(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

శత్రుభయం తొలగడం వల్ల రాజ్యపాలన సుఖశాంతులతో సాగింది. యజ్ఞాలు చేస్తూ, దానాలతో దేశదేశాల విప్రులను సంతృప్తిపరుస్తూ, సకలసంపదలతో నిత్యమూ అనేక భోగాలను అనుభవిస్తూ నిశ్చింతగా (ఆదమఱచి) ఉన్నాడు యామునాచార్యుడు.

 
తత్పితామహుడైన నాథముని శిష్యు
డైన శ్రీపుండరీకాక్షు ననుగు శిష్యు
డైన శ్రీరామమిశ్రాఖ్యు డార్తి దనదు
పరమగురు పౌత్రునకు నిట్టి బంధమెట్లు?
( ఈ పద్యం రాఘవ స్వరంలో ... రాగం - అరభి)

యామునాచార్యుడలా చక్కగా రాజధర్మానుసారంగా పరిపాలనం చేస్తూ ఉన్నాడు. యామునాచార్యుని తాతగారు నాథముని. శ్రీవైష్ణవ ఆచార్య పరంపరలో మొట్టమొదటి ఆచార్యుడు నాథముని. వైష్ణవ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధాలను (వీటినే నాలాయిర ప్రబంధాలు అంటారు. నాలాయిరం అంటే తమిళంలో నాలుగువేలు అని అర్థం) సేకరించి ప్రచారం చేసిన ఆచార్యుడు నాథముని. ఆ నాథమునికి పుండరీకాక్షుడనే శిష్యుడున్నాడు. ఆ పుండరీకాక్షుని శిష్యుడు శ్రీరామమిశ్రుడు. ఈ శ్రీరామమిశ్రునికి యామునాచార్యుడు అలా రాజ్యపాలనలో మునిగిపోవడం బొత్తిగా నచ్చదు! నాథమునివంటి గొప్ప ఆచార్యునికి మనుమడైన యితను యోగసామ్రాజ్యాన్ని వదిలేసి లౌకిక సామ్రాజ్యానికి దాసుడైపోవడం సరికాదనిపిస్తుంది. 


తొడిబడి విషయాతురు నవి
విడు మనియెడు కంటె గలదె వేఱే పగ? నే
ర్పడర గథాదుల నొక వెం
బడి దోపం బలికి మైత్రి బాపుట యొప్పున్
 
(ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)

అయితే, ఇంద్రియవిషయాలపై మనసు లగ్నమైన వాని దగ్గరకి వెళ్ళి, అవి విడిచిపెట్టు అని తొందరపడి సూటిగా చెప్పేస్తే, అంతకన్నా అయిష్టమైన విషయం అతనికి మరొకటుండదు. నేర్పుగా కథల్లాంటివి చెప్పి, క్రమక్రమంగా తనంత తనకే తోచేట్టుగా స్నేహంగా చెప్పడమే మంచిది - అని అనుకుంటాడు శ్రీరామమిశ్రుడు. లోకంలో కొడుకుల దుర్వ్యసనాలను నివారించడం తండ్రికే సాధ్యపడదే. ఇక రాజ్యవ్యసనం మాన్పించటానికి ఎవడి తరం? - అని కుడా అనుకుంటాడు.



నల్లగ్రోల నిచ్చి మెల్లన చివ్వంగి
నోటి జింక దివియు నేరుపొదవు
వేటకాడు వోలె విషయాళి వలన ద
త్తృష్ణ దీరనిచ్చి త్రిప్పుటొప్పు
(ఈ పద్యం సనత్ శ్రీపతి స్వరంలో)

నల్ల అంటే నెత్తురు అనే అర్థం ఉంది. చివ్వంగి అంటే సివంగి, చిరుత. సివంగి జింకని వేటాడి పట్టుకుందనుకుందాం. దాని నోటినుండి ఆ జింకని బయటకి లాగాలంటే, ముందు దాన్ని ఆ జింక రక్తాన్ని త్రాగనివ్వాలి. అప్పుడు దానికి కాస్త ఆకలి తీరి కొంత ఆదమరుపు వస్తుంది. అలాంటి సమయం చూసి మెల్లిగా దాని నోటినుండి నేర్పుగా వేటగాడు జింకని బయటకి లాగ గలుగుతాడట! అంతే కాని తొందరపడి ముందే లాగుదామని చూస్తే అది అసలే ఆకలి మీద ఉంటుందేమో, ముందు వీడి మీదపడి వీడి పని కానిచ్చే ప్రమాదం ఉంది. అలాగే విషయలోలుడైన వాడికి కాస్త ఆ దాహాన్ని తీరనిచ్చి ఆపై అతని మనస్సు మళ్ళించే ప్రయత్నం చెయ్యాలి. ఇది రాయల మార్కు పోలిక! సివంగి నోటినుండి జింకని బయటకి ఎలా తీయాలో ప్రపంచ సాహిత్యంలో అసలు వేరే ఎక్కడైనా ఉందా అని నా అనుమానం! అలాంటి విషయాన్ని తీసుకువచ్చి, విషయలోలుడైన వాడి మనస్సుని మరలించే అంశానికి పోలిక చెప్పడం అనేది అనూహ్యం! నిజానికి శ్రీరామమిశ్రుడివంటి వానికి యిలాంటి పోలిక తట్టడం పాత్రపరంగా సరికాదు. ఇంతటి అనూహ్యమైన పోలిక తెచ్చిన రాయలవారి ఊహశక్తికి అబ్బురపాటుతో ఆ అనౌచిత్యాన్ని విస్మరించడమే ఉత్తమం. :)

శ్రీరామమిశ్రుడిలా ఆలోచించి ఆఖరికి యామునాచార్యుడిని యిక విడిచిపెట్టకూడదు, ఎలాగైనా ఉపాయంతో అతని మనసు మార్చాలన్న నిశ్చయానికి వస్తాడు. ఆహారంలో దోషమే వివేకం నశించడానికి అసలు కారణమని, ఆ దోషాన్ని పోగొట్టే మంచి ఆహారం కనక యామునాచార్యుని చేత తినిపిస్తే అతని మనసు మారే అవకాశం ఉందని, నిర్ణయిస్తాడు. అలర్కం అనే ఒక ఆకుకూరని (తెలుగులో దీన్ని ముళ్ళముస్తె అంటారట), ఒక వైష్ణవుడు కానుకగా యిచ్చాడని చెప్పి వంటబ్రాహ్మణుల చేత రాజుకి పంపిస్తాడు. యామునాచార్యుడా కూర వండించుకొని యిష్టంతో తింటాడు. కొన్నాళ్ళకి ఒక రోజు మళ్ళీ ఆ కూర తింటూ ఆలోచించి, దాన్ని పంపిన ఆ వైష్ణవభక్తుణ్ణి తీసుకురమ్మని భటులకి పురమాయిస్తాడు. అప్పుడు శ్రీరామమిశ్రుడు రాజుని కలుస్తాడు. తనకి కానుక పంపాడంటే తన దర్శనం కోరినట్టే కాబట్టి, ఎందుకు తనని కలవాలనుకున్నాడో చెప్పమని అడుగుతాడు యామునాచార్యుడు. అప్పుడు శ్రీరామమిశ్రుడిలా అంటాడు:


మీ పెద్దలు గూర్చిన ని
క్షేపమొకటి సహ్యజాత సింధుజలాంత
ర్ద్వీపమున నుండ నీకుం
జూపంగా వచ్చితిని వసుమతీనాథా!
( ఈ పద్యం లంకా గిరిధర్ స్వరంలో)  
"రాజా! మీ పూర్వులు కూడబెట్టిన నిధి ఒకటి సహ్యపర్వతంనుండి పుట్టిన నది (అంటే కావేరీ నది) మధ్యనున్న ద్వీపంలో ఉంది. దాన్ని నీకు చూపించడానికి వచ్చాను" అని చెపుతాడు. ఇంకా - "నిధినిక్షేపాలు నాకెందుకని అనకు. నిధులూ గనులూ వంటివి రాజుల సొత్తే. కాబట్టి అది నీకు చెందినదే. దాని గూర్చి వివరిస్తాను విను." అని చెప్పి, దాని గురించి యిలా వర్ణిస్తాడు:



స్ఫటల మణుల్ గ్రాల శాంతమై శ్వేతమై
నట్టి త్రాచొక్కటి చుట్టియుండు
రక్షోగృహీతమన్ ప్రథ తొల్లి గల దది
పొలయ దందేడాఱు నెలలు గాని
యేపాటి బలియైన జేపడు బ్రాణిహిం
సాది పూజనముల కాసపడదు
తన వెలుంగొగి నిరంజనదృష్టికినె లక్ష్య
మై యుండు నయ్యు నింతంత గాదు

రత్నమొక్కటి పై నపూర్వంబు మెఱయు
గలదు పద్మంబు శంఖంబు, పలుకు లేటి
కక్షయ మనంత మాద్య మేకాంతమందు
భూప! నీకొక్కనికె కాక చూపరాదు


 
( ఈ పద్యం రాఘవ స్వరంలో .. రాగం - షణ్ముఖప్రియ

తాను చెప్పిన నిధి ఎలాంటిదో వర్ణిస్తున్నాడు శ్రీరామమిశ్రుడు. స్ఫటలు అంటే పడగలు. పడగలపైన మణులు ప్రకాశించే ప్రసన్నమైన తెల్లత్రాచుపాము ఒకటి నిత్యం ఆ నిధిని చుట్టుకొని ఉంటుంది. అది రాక్షసునిచేత గ్రహించబడినదని అనుకుంటూ ఉంటారు కాని, మహా అయితే ఆ రాక్షసుడు ఏడాదికో ఆరునెల్లకో ఒకసారి వచ్చిపోతూ ఉంటాడు అంతే. ఎలాంటి చిన్న పూజకైనా అది వశమైపోతుంది. జంతుబలుల్లాంటి ప్రాణిహింసని ఆశించదు. నిరంజనమైన (అంటే కాటుకలేని ఒక అర్థం, నిర్దోషమైన అని మరో అర్థం) దృష్టికే ఆ నిధినుండి వెలువడే కాంతులు కనిపిస్తాయి. ఆ వెలుగు ఇంతంతని చెప్పలేనంత వెలుగు! పైన ఒక అపూర్వమైన రత్నం మెఱుస్తూ ఉంటుంది. పద్మశంఖాలు కూడా ఉన్నాయి (కుబేరుని నవనిధులలో పద్మశంఖాలు రెండు నిధులు). ఇన్ని మాటలెందుకు. అది అక్షయమైన అనంతమైన నిధి. సర్వశ్రేష్ఠమైనది. ఏకాంతంలో నీకు తప్ప ఇంకెవరికీ చూపించకూడదు.

శ్రీరామమిశ్రుడు వర్ణించిన ఆ నిధి, భక్తుల పెన్నిధి, శ్రీరంగాన కొలువైన రంగనాథుడు! కావేరీ నది రెండు పాయలుగా చీలిన మధ్య ప్రదేశంలో శ్రీరంగం ఉంది, అంచేత అది ద్వీపం. అందులో ఉన్న నిధి శ్రీరంగనాథుడు. పై పద్యంలో మామూలు నిధికి ఉండే లక్షణాలని శ్రీరంగనాథుడనే విశేషమైన నిధికి అన్వయించి చెప్పడం గమనించవచ్చు. సాధారణంగా నిధి నిక్షేపాలు పాడుబడిన భవనాల్లో ఉంటాయి. కాబట్టి వాటి చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామి శేషశాయి కదా. అంచేత, పడగలపై మణులు ప్రకాశించే తెల్లనిత్రాచు చుట్టి ఉంటుందన్నాడు. అలాగే, రాక్షసులో భూతప్రేత గణాలో నిధినిక్షేపాలని కాపలా కాస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. ఇక్కడ కూడా రాక్షసుడు ఉన్నాడు. కాని అతడు పరమ భాగవతుడైన విభీషణుడు. విభీషణుడు శ్రీరంగక్షేత్రాన్ని ఆరునెలలకి ఒకసారి వచ్చి దర్శించుకుంటాడని ఒక కథ ఉంది. దాన్ని యిక్కడ ప్రస్తావించాడు. మామూలుగా నిధులు దొరకడానికి జంతుబలులతో కూడిన పూజలు చేస్తూ ఉంటారు. కానీ యీ నిధి (శ్రీరంగనాథుడు) దొరకాలంటే నిండైన భక్తి కలిగిన కాస్తంత పూజ సరిపోతుంది. నిధినిక్షేపాలని కనుక్కోడానికి అంజనం వేసి చూడ్డం ఒక పద్ధతి. అంటే, మంత్రించిన కాటుక పెట్టుకుంటే నిధి ఎక్కడుందో కనిపిస్తుందని నమ్మకం. కానీ శ్రీరంగనాథుని వెలుగులు చూడ్డానికి అంజనం అవసరం లేదు సరికదా, పైగా నిరంజనదృష్టికే (అంటే స్వఛ్చమైన చూపు) అతను కనిపిస్తాడు! నిధులు రత్నాలతో నిండి ఉంటాయి కాబట్టి, ఇక్కడ కూడా ఒక దివ్యమైన రత్నం పైన మెరుస్తూ ఉంటుంది. అది కౌస్తుభమణి. శ్రీరంగంలో స్వామి శేషశాయి కాబట్టి, అతను పడుకొని ఉంటే, వక్షస్థలంపై కౌస్తుభం మెరుస్తూ ఉంటుందన్న చిత్రాన్ని ఇక్కడ "పైన" అన్న పదంతో రూపుగట్టారు రాయలవారు. సరే పద్మశంఖాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి స్వామివారికి. ఇక యీ నిధి అక్షయము అనంతము అనడంలో సందేహమేముంది!

శ్రీరామమిశ్రుని మాటలకి సంతోషించి ఉత్సాహంతో ఆ నిధిని చూడ్డానికి అతని వెంట బయలుదేరతాడు యామునాచార్యుడు. ఇంకా అతను చూపిస్తానన్న నిధేమిటో అప్పటికి యామునాచార్యునికి తెలియదు. రామమిశ్రుని వెంట శ్రీరంగం వెళ్ళి, పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తాడు. అప్పుడు రామమిశ్రుడు, మీ పెద్దలు కూడబెట్టిన నిధి యిదే స్వీకరించు, అని ఆ రంగపతి దివ్య శ్రీచరణారవిందాలను చూపిస్తాడు.

ఆ పాదపద్మాలను చూసిన యామునాచార్యుని హృదయంలో ఎలాంటి స్పందన కలుగుతుంది? రామమిశ్రుని పరిశ్రమ ఫలిస్తుందా లేదా? ఆపై కథ ఏం జరుగుతుంది? వచ్చే టపాలో తెలుసుకుందాం.
Related Posts Plugin for WordPress, Blogger...