తెలుగదేల యన్న దేశంబు తెలు గేను దెలుగు వల్లభుండ దెలుగొకండ యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స

Tuesday, December 21, 2010

చతుర్వర్ణాల వర్ణన

అష్టాదశ వర్ణనల సంప్రదాయాన్ని పాటిస్తూ రాయలు మధురాపురంలోని చతుర్వర్ణాలవారైన బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, కాపులను గురించి వర్ణించాడు. మనఃప్రవృత్తికి అనుగుణమైన వృత్తులకి చిహ్నంగా ఉండేవి వర్ణాలు. రాజ్య పరిపాలన వర్ణాశ్రమాచారాన్ని పరిరక్షించే విధంగా ఉండేది. ఇది సామాజిక భద్రతను చూచించే పరిపాలనా విషయంగా ఆ నాటి కవులు వర్ణించేవారు.


. చిరసముపార్జితాగ్ని తడిఁ జెంది నశించు నటంచునో, కృతా

ధ్వరతఁ దదగ్ని మై నునికి దాన నొకంగము తాఁచుచేతనో,

పుర ధరణీసురు ల్నిగమభూధరము ల్జపయజ్ఞ శీలు రా

హరి ధనదాదులైన వలహస్తము సాఁపరు దానధారకున్.-



( ఈ పద్యం సనత్ స్వరంలో )


మధురాపురంలోని బ్రాహ్మణులు పరమనిష్ఠా గరిష్టులు. వేద పర్వతాలు. నిత్యాగ్నిహోత్రులు. వారందరూ సోమయాజులగుటచే వారి దక్షిణ హస్తమునందు అగ్ని ఉంటుందని అంటారు. దానోదకముచే (దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు) తేమ తాకి ఆ అగ్ని చల్లారుతుందని దేవేంద్ర, కుబేరాదులు వచ్చి దానమిస్తానన్నా తమ దక్షిణ హస్తమును (కుడిచేతిని) చాపరు. ప్రతినిత్యమూ జపయజ్ఞములు చేసే ఈ బ్రాహ్మణోత్తములు ఎవరికీ చేయి చాపరు అని భావము.

అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఎంత ముఖ్యమో “నచికేతోపాఖ్యానం” లో దగ్గుపల్లి దుగ్గన ఇలా చెప్తాడు.

"వినుము బ్రాహ్మణునకు వేదంబు ముఖ్యంబు
వేదములును యాగ విధుల నొడవు
యజ్ఞములకు మూలమగ్నిహోత్రముగాన
నగ్ని హోత్ర సేవ యాత్మ సేవ."

అలాగే రాయలు కూడా మధురాపురంలోని బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా కొనియాడాడు. ఇతర కావ్యాలలో సాధారణంగా బ్రాహ్మణులని పండితులుగా వర్ణించడం కనిపిస్తుంది. కాని రాయలవారిక్కడ బ్రాహ్మణుల వైదిక కర్మ నిష్ఠని వర్ణించారు.


. ఉరవడిఁ బోరికై కవచ మొల్లరు మంత్రములందుఁ దక్క, సు

స్థిరభుజశక్తి నైదుపది సేయరు దత్తిన తక్క, మంటికై

పొరల రధీశుడీ కమలబుద్ధి ఖళూరికఁ దక్క, వజ్రదోః

పరఘవశీకృతాన్యనరపాలకు లప్పురి రాకుమారకుల్.-


(ఈ పద్యం రాఘవ స్వరంలో )

ఇక క్షత్రియకుమారులు మహావీరులు. వజ్ర సమానమైన బాహువులు అనే పరిఘలతో శత్రు రాజులను లొంగదీసుకోగలరు. వీరు ఎంత బలశాలులు, ధైర్యవంతులంటే యుద్ధమునందు కూడా కవచము ధరించరు. కాని వీళ్లు కవచం వాడేది ఒకే సందర్భంలో. అది మంత్రోచ్చారణ సమయంలో. రాకుమారులు నేర్చుకునే ప్రతి అస్త్రము ప్రయోగించడానికి ప్రత్యేకమైన మంత్రము ఉంటుంది. ప్రతి మంత్రానికి మంత్రకవచం ఉంటుంది. అందుకే ఆ అస్త్రప్రయోగ సమయంలోనే కవచం వాడతారు అని శ్లేషగా చెప్పాడు కవి. అంతే కాక గొప్ప భుజశక్తి గల ఈ రాకుమారులు రెండు చేతుల ఐదేసి వేళ్లు కలిపి పదిగా చేసి అంటే చేతులు జోడించి ఆశ్రయించరు. కాని అదే రెండు చేతులు కలిపి దోసిలితో దానం చేయడానికి మాత్రం వెనుకాడరు. సాధారణంగా రాజ్యం కోసం మహారాజు ముందు మట్టిలో పొర్లి దణ్ణాలు పెడతారు. ఈ రాజకుమారులు అలా చేయరు. కాని వీళ్లు కూడా మట్టిలో పొర్లుతారు. ఎక్కడంటే ఖళూరిక అనే సాము గరిడీ చేసే ప్రదేశంలో. దీనివల్ల మధురాపురంలోని రాజకుమారులు సాముగరిడీలో కూడా నిష్ణాతులే అని తెలుస్తుంది. "అయిదు పది చెయ్యడం" అన్నది చక్కని తెలుగు నుడికారం.


శా. దంభాపేతవితీర్ణితోయములు రథ్యం దొట్టి హట్టస్ధిత

స్తంభంబు ల్చిగిరించుచున్నవి యనన్ ధర్మైకనిత్యార్జనన్

సంభూతం బగుపైడికోటి కొకడై నానాఁటికిన్ హెచ్చు చ

య్యంభోదావళి గప్ప గేతువులు వైశ్యశ్రేణి పొల్చున్ బురిన్



( ఈ పద్యం భైరవభట్ల కామేశ్వరరావు స్వరంలో)


మధురపురంలోని కోమట్లు ధర్మము వీడక నిజాయితీగా వ్యాపారం చేసేవారు. పూర్వం కోటీశ్వరులు తమ సంపదకి గుర్తుగా ఒక్కొక్క కోటికి ఒకో జెండాని ఎగరేసేవారు (కోటికి పడగలెత్తడం అన్న నానుడి ఇలా వచ్చిందే). ఆ నగరంలోని వైశ్య వీథులు అలా ఎగరేసిన జెండాలతో ఎంతగా నిండిపోయిందంటే, అవి ఆ పైనున్న మబ్బులని కూడా కప్పేసాయిట! అంటే ఆ నగరంలోని వైశ్యులు అంత ధనవంతులన్న మాట. ధనవంతులవ్వడమే కాదు. ఎలాంటి గర్వం లేకుండా వారు నిరంతరం దానాలు చేసేవారు. ఆ దానధారలు ఏరులై పారి, ఆ నీటికి వీథులలోని స్తంభాలు కూడా చిగురించాయా అన్నట్టుగా ఉన్నాయట ఆ పతాకలు.

ప్రాచీన సమాజంలో వైశ్యులు వ్యాపారులు, ధన రక్షకులు. బ్రాహ్మణులు విద్యారక్షకులు, క్షత్రియులు రాజ్య రక్షకులు, శూద్రులు సస్య క్షేత్ర రక్షకులు. అందరూ కాపులే. నిరంతర దానం వైశ్యులకి విధి. బుద్ధునికి విరివిగా విహారాదులు కట్టించినది వైశ్యులే అని చరిత్ర చెబుతోంది. కనుక ఈ పద్యం ప్రాచీన సమాజంలో వైశ్యులంటే ఎలా ఉండేవారన్నది చక్కగా వర్ణిస్తోంది. ఇతర కావ్యాల్లో వైశ్యులు కుబేరులని మాత్రమే వర్ణించబడితే, ఇక్కడ దానధర్ములని చెప్పడం రాయలవారి సామాజిక పరిజ్ఞానాన్ని పట్టిచూపుతోంది. ఈ వైశ్యుల దానం దంభాపేతం. అంటే ఏదో మిషతో చెయ్యడం కాకుండా పవిత్ర దృష్టితో చేస్తున్న దానం అన్నమాట. పద్యం ఇక్కడ ప్రారంభం కావడం కూడా వారి స్వభావానికి గీటురాయి.


తే. నృపులపదహల రేఖల కెల్ల మా భు

జాగ్ర హలరేఖలే మూల మనుచుఁ గోటి

కొండలుగ ధాన్యరాసులు పండువీట

సుజనభజనైక విఖ్యాతి శూద్రజాతి



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో )


ఆపురంలోని చెప్పుకోదగిన మరో ముఖ్యమైన జాతి సస్య రక్షకులైన శూద్రజాతి. వారి భుజాలమీది మోసిన నాగలి గుర్తులే మహారాజుల పాదములలోని హలాకార రేఖలు అనుకుంటారు. తాము నాగలి పట్టి వ్యవసాయం చేసి కోట్ల కొండలుగా నానావిధ ధాన్యరాశులను పండిస్తున్నారు. అన్నదాతలై సత్పురుషులకు సేవచేస్తూ సుఖసంతోషాలు పొందుతున్నారు. సాముద్రిక శాస్త్రంలో పాదాలందు హలరేఖ పంచ మహాపురుష లక్షణాలలో ఒకటిగా చెప్పబడింది. హల రేఖలు మహా వైభవాన్ని సూచిస్తాయి. రాజులకి తద్వారా రాజ్యానికి ఆ వైభవాన్ని ఇస్తున్నది రైతులే అని తాత్పర్యం.

Friday, December 3, 2010

పుష్పలావికలు, గజ, అశ్వ వర్ణన...

అష్టాదశ వర్ణనలు కన్నడం నుంచి నన్నెచోడుడు గ్రహించాడని అంటారు కొంతమంది. ఏది ఎమైనా.. ఈ అష్టాదశ వర్ణనలు వివరంగా తెలుసుకొవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి ఏమిటంటే..

1. పుర వర్ణన.
2. గిరి వర్ణన.
3. వన వర్ణన.
4. నది వర్ణన.
5. సముద్ర వర్ణన.
6. ద్యూత వర్ణన.
7. వివాహ వర్ణన.
8. విరహ వర్ణన.
9. యుద్ధ వర్ణన.
10. షడృతువుల వర్ణన.
11. ప్రాత: సంధ్యాకాల వర్ణన.
12. సూర్యోదయ సూర్యాస్తమాన వర్ణన.
13. మధుపాన వర్ణన.
14. రాయబార వర్ణన.
15. స్త్రీ వర్ణన.
16. బ్రాహ్మణాది చాతుర్వర్ణముల వర్ణన.
17. చతురంగ సైన్య వర్ణన.
18. వేదాంత విచారణ.

ఇవి ఏ ప్రబంధంలో అయినా ఉండి తీరాలని ఆర్యోక్తి.

ఇదే విధంగా అష్టాదశవర్ణనలలో భాగంగా రాయలు పురవర్ణన, సౌధవర్ణన తర్వాత మధురాపురంలోని పుష్పలావికల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. పుష్పలావికలంటే పువ్వులమ్మే వాళ్ళు.

సీ. ఇంద మన్‌తఱి దంతకుందాభ గూడి ని
చ్చలపుఁజూపులు మున్న సంభ్రమింప,
వెల యొప్ప కవలఁ బో విఱుచు మోవియుఁ గోప
మొదవెడుచూపు మోమోటఁ ద్రిప్పఁ
దిరిగిన సస్మితోక్తియుఁ జూపుటొయ్యార
ములు నగుఁ గాదను పలుకు లుడుప,
నవి గాని కావొ నీకను పరసాపత్న్య
సంపాదనం బుబ్బు నింపుఁ బెనుపఁ

తే. జతురవచనవిలాసాంగసౌష్ఠవములఁ
బసిఁడిఁ దా నిచ్చినట్టి యప్పణఁతి మఱవఁ
బతికిఁ గైదువు లందిచ్చు రతి విధమున
విటుల కిత్తురు మఱి వారు విరులు పురిని



( ఈ పద్యం లంక గిరిధర్ స్వరంలో)







మధురాపురంలో పుష్పలావికలు చాలా చతురులు. ఇదిగో పువ్వులు అనేటప్పటికే వాళ్ళ మల్లెపూలవంటి దంతకాంతులు పువ్వులు కొనే విటులని ముగ్ధులని చేసేస్తాయి. చెప్పిన ధర కుదరక విటులు వేరే పూలమ్మి దగ్గరకి వెళ్ళబోతే వీళ్ళ పెదవివిఱుపు కళ్ళల్లో చూపించే చిరుకోపం మళ్ళీ ఆ విటులని వీళ్ళ దగ్గరకే తీసుకువస్తాయి. ఆపై ఒకింత గర్వముతో, ఒకింత సరసముతో ఆ పువ్వులే కాని మా పువ్వులు నీకు ఇష్టము కావా? అని అలక నటిస్తారు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు భర్తకు ఆయుధములు అందించు రతిదేవి వలే ఈ పుష్పలావికలు తమ ఒయ్యారపు విలాసాలతో, చాతుర్యపు మాటలతో ఆకర్షిస్తూ విటులకు పువ్వులు విక్రయిస్తున్నారు. మన్మథుడి ఆయుధాలు పువ్వులే కదా మరి! యుద్ధానికి వెళ్ళేప్పుడల్లా భర్తకి ఆయుధాలు అందించే ప్రత్యేకత బహుశా ఒక్క రతిదేవికే దక్కుతుంది. మధురాపురంలో పువ్వులమ్మే స్త్రీలు సాక్షాత్తు రతిదేవిలేనట! ఒక పద్యంలో మొత్తం ఒక సజీవ దృశ్యాన్ని సాక్షాత్కరింప చెయ్యడం రాయలవారి ప్రత్యేకత. అది ఈ పద్యంలోనూ కనిపిస్తుంది.

. దలమగు చంద్రఖండములు దారలు, సాంకవ మొప్పు పాణి పా
టలమగు దంతపుంగరవటంబు శశాంకుఁడు , గుంకుమైన చీ
రల జిగి కెంపుగా బయటి రధ్యల నొప్పుదు రిందుకాంతవే
దులపయి సంధ్యయే బహుతఁ దోఁచెననన్ బురి గట్టివాల్సతుల్



(ఈ పద్యం రవి స్వరంలో)
మధురానగరంలో మరొక దృశ్యాన్ని అద్భుతమైన ఉత్ప్రేక్షతో వర్ణిస్తున్నాడు రాయలు. ఆ నగరంలో సుగంధ పరిమళ ద్రవ్యములు అమ్ముతున్న స్త్రీలు వీధిలోని పాలరాతి తిన్నెలపై కూర్చుని వ్యాపారం సాగిస్తున్నారు. ఆ దృశ్యం ఎలా ఉందంటే - వాళ్ళమ్ముతున్న సుగంధద్రవ్యాల్లో మిలమిలా మెరుస్తున్న కర్పూరపు తునకలున్నాయి. అవి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో తెల్లగా మెరుస్తున్న దంతపు భరిణ ఉంది. దానికి నల్లని జవ్వాది అంటుకుని ఉంది. వాళ్ళ చేతుల లేత ఎఱుపు రంగు ఆ దంతపు భరిణలో ప్రతిఫలిస్తోంది. లేత ఎఱుపు రంగు, మధ్యలో మచ్చలా జవ్వాది కలిసి ఆ భరిణ అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబంలా ఉంది. కుంకుమ అంటిన చీరలకాంతి తెల్లని పాలరాతి తిన్నలపై ప్రతిఫలిస్తూ, అవి రాగరంజితమైన సంధ్యాకాశంలా ఉన్నాయి. అలా సంధ్యాకాలం అక్కడంతా అనేక రూపాల్లో దర్శనమిచ్చిందా అన్నట్టుగా ఉందట ఆ దృశ్యం. ఎంత మనోహరమైన వర్ణన!

. పై ననిశంబు సల్లుకొను పాంసువుపై ఖగతుండఖండితా
లానమహామహీరుహఫలచ్యుత బీజము లుత్క్షిపత్కరాం
భోనిబిడాఫ్లుతి న్మొలవఁ బొల్చు నగమ్యతఁ దూలుచు న్బురో
ద్యానముల న్మదేభములు ప్రాణముతోడినగంబులో యనన్.


( ఈ పద్యం రాఘవ స్వరంలో. రాగం. ఆభేరి.. )
ఇక ఆ పట్టణంలోని ఏనుగులు ప్రాణములున్న పర్వతములవలె ఉన్నాయి. అదెలాగంటే ఏనుగులు తమ స్వభావసిద్ధంగా నిత్యం శరీరంపై దుమ్ముధూళి చల్లుకుంటాయి. ఆ మట్టిలో పక్షులు తిని పడేసిన ఫలాల విత్తనాలు, యేనుగులు తొండముతో తమపై చల్లుకొను నీటివల్ల తడిసి మొక్కలు వచ్చి చెట్లుగా మారాయి. అందుకే పురవీధులలో ఊగుతూ తిరుగుతున్న మదపుటేనుగులు ప్రాణమున్న పర్వతాల్లాగా అగుపిస్తున్నాయి. అంత భారీగా ఉన్నాయని కవి భావం.

శా. మౌనిక్రోధ విధూత పత్త్రములమౌ మాతో సపత్త్రల్గదా
కానీ రండని కేకరాక్షిరుచి మొక్క ల్ప్రక్కల న్శార్ఙ్గతూ
ణానల్పాహిపకల్ప కాండతతులం దారం బురిం బొల్చు నా
జానేయంబులు ఫేనహాస మిడి కైజామోర లల్లార్చుచున్.


(ఈ పద్యం సనత్ స్వరంలో )
ఏనుగులే కాక మధురాపురంలోని అశ్వములు కూడా మేలుజాతికి చెందినవే. కళ్లెము పైకెత్తి బిగించికట్టుటవలన సదా పరుగుతీయడానికి సర్వసన్నద్ధమై ఉంటాయి. ఆ గుఱ్ఱాలు కళ్లెము బిగించబడిన ముఖము అల్లార్చుతూ, కడకంటితో అటునిటు వ్రేలాడకట్టబడ్డ ధనుర్బాణాలని చూస్తున్నాయి. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే - "మాకు మునిశాపము వలన ఎగిరిపోవడానికి ఱెక్కలు లేవు. సర్పరాజుల్లాంటి బాణాల్లారా! మీకేమో ఱెక్కలు ఉన్నాయి. ఐనా పర్లేదు పరిగెత్తే వేగంలో మాతో పోటీకి రండి చూద్దాం" అని ఆ బాణములతో సవాలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. వాటి నోటినుండి వస్తున్న నురగ వాటి పరిహాసంలా ఉంది. కడకంటి చూపు, నోటి నురుగు, కైజామోర ఇవన్నీ గుఱ్ఱాలకి సహజ లక్షణాలు. ఈ లక్షణాలని బాణాలతో పోటీ పడ్డట్టుగా చిత్రించడం ఉత్ప్రేక్ష. అంటే ఆ గుఱ్ఱాలు బాణం కన్నా వేగంగా పరిగెత్తగలవన్న మాట!

ఆజానేయం అన్నది ఆఫ్రికా ఖండంలో ఒక దేశమట. అక్కడనుంచి దిగుమతయిన గుఱ్ఱాలు ఆజానేయములు. గజ, తురగ, రథ, కాల్ బలాలు చతురంగబలాలు. రాయల కాలంలో గజ సైన్యం ఎక్కువగల రాజులు గజపతులు. అశ్వసైన్యం ఎక్కువ కలవారు మహమ్మదీయ రాజులు. విజయనగర రాజులు నరపతులు. అంటే కాల్బలం ఎక్కువ ఉన్నవాళ్ళు. మహమ్మదీయ రాజులని జయించడానికి రాయలు అశ్వసైన్యాన్ని బాగా అభివృద్ధి చేసాడని చరిత్ర చెపుతోంది.
Related Posts Plugin for WordPress, Blogger...